breaking news
Red Notices
-
రోజుకు రూ.10 కోట్లు
* ఇదీ జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను లక్ష్యం * ఇక వసూళ్ల పర్వం * రెడ్ నోటీసులు జారీ సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడి నుంచి అధికారులు బయటకు వచ్చారు. ఆస్తిపన్ను వసూళ్లపై దృష్టి సారించారు. ఎన్నికల నేపథ్యంలో చూసీ చూడనట్లు వ్యవహరించిన అధికారులు ఇప్పుడు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. రెడ్ నోటీసుల జారీకి వెనుకాడటం లేదు. మేయర్ బొంతు రామ్మోహన్ అధికారులతో నిర్వహించిన తొలి సమావేశంలోనే మొండి బకాయిల వసూళ్లకు తాము సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో అధికారులు రెట్టించిన ఉత్సాహంతో ఆస్తిపన్ను వసూళ్లకు సిద్ధమయ్యారు. ఏళ్ల తరబడి చెల్లించని వారి నుంచి నయానో, భయానో వసూలు చేయాలని భావిస్తున్నారు. తాజా అంచనాల మేరకు ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రూ.450 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. ఉన్న గడువు దాదాపు 45 రోజులు. రోజుకు కనీసం రూ.10 కోట్లు వసూలు చేయాలని కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి అధికారులకు నిర్దేశించారు. అభివృద్ధి పనులకు... మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. జీహెచ్ఎంసీ ప్రకటించిన కార్యక్రమాలు.. ప్రభుత్వం హామీలిచ్చిన పథకాలు ఈలోగా పూర్తి చేయాల్సి ఉంది. నగరంలో చేపట్టే పనులన్నిటికీ జీహెచ్ఎంసీ నిధులనే వినియోగిస్తున్నారు. ఆర్టీసీ వంటి సంస్థకూ దీని నిధులనే బదిలీ చేస్తున్నారు. ఖజానాలో సింహభాగమైన ఆస్తిపన్ను వసూలు చేయకపోతే పనులన్నీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి భారీగానిధులు అవసరం. ఈ నేపథ్యంలో సర్కిల్కు ఒకరు చొప్పున 24 మంది ప్రత్యేక అధికారులను వసూళ్లకు నియమించారు. వీరు సంబంధిత జోనల్, డిప్యూటీ కమిషనర్లు, సిబ్బందితో కలసి లక్ష్యసాధనకు కృషి చేస్తారు. భారీ బకాయిలు ఉన్న వారిని వ్యక్తిగతంగా కలవడం, ఫోన్లు, ఎస్సెమ్మెస్లు, ఈ మెయిళ్ల ద్వారా గుర్తు చేస్తారు. రెడ్ నోటీసులూ జారీ చేస్తారు. ఇప్పటిదాకా పన్ను పరిధిలోకి రాని భవనాలను గుర్తిస్తారు. ప్రభుత్వ భవనాల నుంచి పన్ను వసూలుకు ప్రత్యేక చర్యలకు సిద్ధమయ్యారు. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రసార సాధనాలను వాడుకోవాలని, హోర్డింగ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆస్తిపన్ను చెల్లించాల్సిన వారు : 14,11,609 మంది రావాల్సిన మొత్తం : రూ.1630 కోట్లు ఇప్పటి వరకు వసూలై నది : రూ. 545 కోట్లు ఇంకా రావాల్సింది : రూ. 1075 కోట్లు ప్రభుత్వ రాయితీకి అర్హులు : 5,09,187 మంది రాయితీ ద్వారా తగ్గే మొత్తం : రూ. 87 కోట్లు * పై అంశాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 8 లక్షల మంది నుంచి రావాల్సిన ఆస్తిపన్ను: రూ.988 కోట్లు. * ఇది ఒక దశలోని అంచనా. ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని మొత్తం వసూలు చేయాల్సింది రూ.1100 కోట్లుగా తాజాగా అంచనా వేశారు. ఇప్పటి వరకూవచ్చినది పోనూ ఇంకా రూ.455 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. 21న సమస్యల పరిష్కారం ఆస్తిపన్ను వివాదాల పరిష్కారానికి ఈనెల 21న ఆదివారం అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ‘ప్రాపర్టీ టాక్స్ పరిష్కారం’ పేరిట ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ డా.బి.జనార్దన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్లు, అన్ని స్థాయిల అధికారులు పాల్గొని ఆస్తిపన్ను చెల్లింపులో ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులు, వివాదాలు పరిష్కరిస్తారని తెలిపారు. -
అద్దె ఇల్లు దొరికితే ఖాళీ చేస్తా..
మంత్రుల క్వార్టర్ ఖాళీ చేయడంపై పొన్నాల హైదరాబాద్, న్యూస్లైన్: మంత్రి పదవి కోల్పోయి రెండు నెలలు గడుస్తున్నా.. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంత్రుల నివాస సముదాయంలో తన క్వార్టర్ను ఖాళీ చేయడం లేదు. క్వార్టర్ను ఖాళీ చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు ఇప్పటికి మూడుసార్లు నోటీసులు జారీ చేసినా పొన్నాల పట్టించుకోలేదు. గత నెల 31 నాటికి తప్పనిసరిగా క్వార్టర్ ఖాళీ చేయాలని అధికారులు చివరి అస్త్రంగా రెడ్ నోటీసులు జారీ చేశారు. ఇందుకు స్పందించిన పొన్నాల జూన్ నెలాఖరు వరకు గడువు కావాలని, తనకు అద్దె ఇల్లు దొరకడం లేదని సమాధానం ఇచ్చారు. బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలోని క్వార్టర్ నంబర్ 12లో పొన్నాల లక్ష్మయ్య ఉంటున్నారు. 2004 నుంచి వరుసగా రెండుసార్లు మంత్రి అయిన పొన్నాల ఇదే క్వార్టర్ను అట్టిపెట్టుకున్నారు. గత మార్చిలో మంత్రి పదవి పోవడం, రాష్ర్టపతి పాలన విధించడం తెలిసిందే. అదే సమయంలో మంత్రుల క్వార్టర్లను మాజీలందరూ ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయగా, కొంత మంది అప్పటికప్పుడు స్పందించారు. ఇటీవలే బొత్స సత్యనారాయణ కూడా క్వార్టర్ను ఖాళీ చేసి అప్పగించారు. పొన్నాల మాత్రం తనకు సౌకర్యవంతమైన అద్దె ఇల్లు దొరకడం లేదని.. అప్పటిదాకా ఇక్కడే ఉంటానంటూ భీష్మించుకూర్చున్నారు.