breaking news
Rayachoti Govt Hospital
-
62 మంది విద్యార్థులకు అస్వస్థత
సాక్షి, రాయచోటి(కడప) : రాయచోటిలోని ఏపీ గిరిజన సంక్షేమశాఖ వసతి గృహంలో 62 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కడపకు తరలించారు. శనివారం ఉదయం హాస్టల్లో అల్పాహారంగా ఇడ్లీ ..చట్నీ.. మజ్జిగ ఇచ్చారు. చట్నీలో విపరీతమైన కారమున్నట్లు తింటున్నప్పుడే విద్యార్థులు గమనించారు. మజ్జిగలో బ్లీచింగ్ ఎక్కువ శాతం కలిపిన నీటిని వినియోగించారని తెలుస్తోంది. అల్పాహారం తిన్న విద్యార్థులకు వాంతులు, విరేచనాలు రావడంతో అధికారులు వెంటనే స్పందించారు. బాధిత విద్యార్థులను ఉదయం 10 గంటలకు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితుల్లో తేడా రావడంతో వైద్యులు, అక్కడి వైద్య సిబ్బంది వేగవంతంగా చికిత్స అందించారు. కొంతమంది వెంటనే కుదుటపడ్డారు. కొందరు కోలుకుంటున్నారు. ఒకరిని కడప తరలించినట్లు తెలిసింది. రక్త నమూనాలను సేకరించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు మహేశ్వరరాజు, భాస్కర్రెడ్డి, నిస్సార్అహ్మద్, ఖదీర్బాషా, రియాజ్ తెలిపారు. చిన్నారుల ఆరోగ్యంపై ప్రభుత్వ చీఫ్విప్ ఆరా వసతిగృహంలోని చిన్నారుల అస్వస్థతపై ప్రభుత్వ చీఫ్విప్ జి.శ్రీకాంత్రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆహారం కారణంగా చిన్నారులు అనారోగ్యం పాల్వవ్వడం తీవ్రంగా పరిగణించాలన్నారు. వైద్యులు, వసతి గృహం అధికారులకు ఫోన్ చేసి ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందివ్వాలని ఆసుపత్రి వైద్యులు మహేశ్వరరాజుకు సూచించారు. అవసరమైతే తిరుపతి తరలించి చికిత్స చేయించాలని ఆదేశించారు. వసతిగృహం పరిస్థితులపై జిల్లా గిరిజన సంక్షేమాధికారి చంద్రశేఖర్ను అడిగి తెలుసుకున్నారు. వారం రోజులుగా కనిపించని వార్డెన్... వసతి గృహంలో వార్డెన్ శ్రీనివాసులు వారం రోజులుగా రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. వచ్చినా ఏ మాత్రం పట్టించుకోరని, వంట మనుషులు ఇష్టమొచ్చిన రీతిలో తయారు చేసి వడ్డిస్తారని ఆరోపిస్తున్నారు. నీటిలో బ్లీచింగ్ ఎక్కువ కలవడంతోనే తాము అనారోగ్యం పాలు కావాల్సి వచ్చిందంటూ ఆవేదన చెందారు. వసతిగృహాన్ని పర్యవేక్షిస్తున్న ఆశవర్కర్లు అక్కడి పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. నీటి తొట్లలో బల్లులు పడ్డాయని పలుమార్లు ఫిర్యాదులు చేస్తే తప్ప స్పందించడలేదని తెలిసింది. విద్యార్థుల అస్వస్థత విషయం తెలిసిన వెంటనే రాయచోటి అర్బన్ సీఐ రాజు, ఎస్ఐ రఫిక్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులరెడ్డిలు ఆసుపత్రికి చేరుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. -
కారు, బైక్ ఢీకొని నలుగురికి గాయాలు
రామాపురం: కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిలోని రామాపురం మండలం బండపల్లె పంచాయతీ పరిధిలో ఓ పెట్రోలు బంకు సమీపాన ఆదివారం కారు – బైక్ ఢీకొని నలుగురు గాయాల పాలయ్యారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలం జమాల్పల్లెకు చెందిన ఆంజనేయులు, ఆయన భార్య సుజాత, పిల్లలు గౌతమ్, తేజ రాయచోటి కస్తూర్బా బాలికల పాఠశాలకు వెళ్లి తిరిగి జమాల్పల్లెకు బైక్పై వస్తుండగా.. రాయచోటి నుంచి కడప వైపునకు వెళ్తున్న టాటా ఏస్ కారు వెనుక వైపు నుంచి ఢీకొంది. సంఘటన స్థలానికి రామాపురం పోలీసులు చేరుకొని బాధితులను 108 వాహనం ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ సుబ్బరాయుడు తెలిపారు. సంఘటన స్థలానికి మండల టీడీపీ అధ్యక్షుడు యర్రబోలు శేఖర్, వైఎస్ఆర్సీపీ నాయకుడు సూరం వెంకటసుబ్బారెడ్డి, ప్రశాంతరెడ్డి, టీడీపీ నాయకుడు రాజశేఖర్ తదితరులు చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించడంలో సహకరించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
చిన్నమండెం(రాయచోటి రూరల్): చిన్నమండెం మండల పరిధిలోని దేవపట్ల రోడ్డు మార్గంలో పెట్రోలు బంక్ సమీపంలో ఉన్న మలుపు వద్ద ఆదివారం జరిగిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నమండెం రెడ్డివారిపల్లె నుంచి దేవపట్ల మార్గంలో వెళ్తున్న ఆటో, ఎదురుగా చిన్నమండెంకు వస్తున్న ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కుమ్మరపల్లెకు చెందిన ద్విచక్రవాహనంలో వస్తున్న నాగార్జునకు, ఆటోలో వెళ్తున్న రెడ్డివారిపల్లె వాసి రెడ్డిపీరాతోపాటు మరో మహిళ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను చిన్నమండెం పోలీసులు 108 సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగార్జునను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. చిన్నమండెం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.