breaking news
Raitu Bidda
-
మా ఆయుధం స్వార్థత్యాగం
రైతు ఔన్నత్యాన్ని ఎనిమిది దశాబ్దాల కిందటే ‘నిద్ర మేలుకోరా తమ్ముడా, గాఢ నిద్రమేలుకోరా తమ్ముడా / నిద్రమేల్కొని భద్రపడరా జమీందారీ రైతు తమ్ముడా / రాజ్యమునకు రైతు గుండెరా’ అంటూ తమ కలాలతో పొలాలు దున్నారు ‘రైతుబిడ్డ’ గీత రచయితలు, ప్రకృతిని ప్రేమించమన్నారు ‘రైతుబిడ్డ’ కథా రచయిత గూడవల్లి రామబ్రహ్మం. శంభుని శిరంబున గంగ అన్నట్లుగా రైతును శిరసుకి ఎత్తుకున్నారు మాటల రచయిత గోపీచంద్. ‘పంటబోయినా పన్నుల తెమ్మని బాధలుపెట్టెదరేలా’ అంటూ బైరాగి పాడారు. నాటి కథాంశం నేటికీ పరిష్కరించవలసిన సామాజికాంశం కావడమే విశేషం. జమీందారుల వల్ల కష్టపడుతున్న రైతులను దగ్గరగా చూశారు గూడవల్లి. తనలోని జీవుని వేదనను ‘రైతుబిడ్డ’గా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. నాగాపురం గ్రామంలో జరిగిన కథ ఇది. ఆ గ్రామంలో రెండు వర్గాలు ఉన్నాయి. జమీందార్లు, రైతులు. ఎన్నికల సమయంలో రామిరెడ్డి రైతుల పక్షాన, వెంకయ్య జమీందారు పక్షాన పోటీ చేస్తారు. ఆ సమయంలోనే జమీందారు వర్గం రైతులను హింసిస్తుంది. మొత్తమ్మీద రైతు నాయకుడు విజయం సాధిస్తాడు. స్థూలంగా ఇదీ కథ. 1939 ఆగస్టులో విడుదలై, నాటి బ్రిటిషు ప్రభుత్వ నిషేధానికి గురైన చిత్రం ‘రైతుబిడ్డ’. ఈ చిత్రంలోని దార్శనికతను జమీందారీ వర్గం వ్యతిరేకించింది. కొందరు జమీందారులు కొన్ని ఫిల్ములను తగులబెట్టేశారు. మనకు స్వాతంత్య్రం వచ్చాక 1948లో విడుదలై, ప్రజాభిమానం చూరగొంది. నాటి నుంచి నేటి వరకు ‘ఓటులిమ్మని కోటకు రమ్మని ఒత్తిడి చేయగనేలా’ అని ఆనాటి సామాజిక సత్యాన్ని రైతుబిడ్డలోని ఒక పాటలో చూపారు. ‘‘ఏనాడు జమీందారు భూదేవిని ఆక్రమించుకుని భుక్తం చేసుకోవడానికి ప్రయత్నించాడో... ఏనాడు మనం నిర్వీర్యులమై గుటకలు మింగడానికి ప్రారంభించామో, ఆనాడే రైతుజీవితం దుస్సహమైపోయింది’’ అనే డైలాగులు ఉన్నాయి. ‘‘రైతే భారతదేశానికి వెన్నెముక. రైతు నాగలి ఎత్తకపోతే ప్రపంచం మలమల మాడిపోతుంది. రైతు ముల్లుకర్ర పట్టకపోతే దేశం అల్లాడిపోతుంది’’ అనే మాటలు నేటికీ అక్షర సత్యమే. ఎనభై ఏళ్ల క్రితమే ఆంగ్లేయుల ప్రభావం మన మీద పడింది. దొరల్లా కుక్కలను పెంచుకోవడం, వాటితో ఇంగ్లీషులో మాట్లాడుకోవడం వంటి లక్షణాలు దిగుమతి చేసుకున్నాం. ‘‘కనకం, కనకమంటే మాటే గానండీ, కుండలే భాండాలండీ’’, ‘‘భాషన్నప్పుడు ఇంగ్లీషు భాషే భాషోయ్. గాడ్లోని జి ఓ డీని తిరగేస్తే, డి ఓ జీ డాగ్ అవుతుంది. కనకనే ఆరు సింహాసనమున ఉన్నారండీ...’’ అంటూ వ్యంగ్యాన్ని అనితర సాధ్యంగా సృష్టించారు మాటల రచయితలు. ఎన్నని ఎన్నగలం! ఎన్నికల్లో నిలబడితే ఖర్చు చేయడంలో పెద్ద తేడా లేదు. ఆ రోజుల్లోనే ‘ఎలక్షన్ల కోసం నాలుగు కార్లు, ఐదు వేల రూపాయలు’ ఖర్చు చేశారు. ‘మా రాజులుంగారి పార్టీ తరపున పని చేస్తావా లేదా’ అంటూ రాజుని రాజులుంగారు చేశారు త్రిపురనేని గోపీచంద్. రైతుబిడ్డ సంభాషణల రచయితల్లో ఆయన కూడా ఒకరు. అక్కర్లేని చోట ఆంగ్లంలోని ఇంగ్ పదాన్ని చేర్చి, జమీందారుగారిని మీటింగ్ చేశానండీ... అలాగ డేరింగ్ చేయాలండీ... ఈ విషయంలో మీరు ట్రయింగ్ చేయాలండీ... అంటూ గోపీచంద్ ప్రయోగం చేశారు. ‘వర్తమానో, భవిష్యత్తో, భూతకాలో..... త్రికాలో... రాజ్యభ్రష్టో, మత భ్రష్టో, కుల భ్రష్టో, పునఃపునః సర్వభ్రష్టో... అని సున్నితమైన హాస్యం ఉంది. ‘ఇన్నాళ్లూ నువ్వూరుకుంటే ఈ వడ్డీ ఊరుకుంటుందనుకుంటున్నావా’, ‘తప్పుడు లెక్కలు ఎగవెయ్యడం కాకపోతే దిగలాగడం’ ‘అవ్వ పేరు ముసలమ్మ’ ‘అంతా తగు మనుషులే’... ఎన్నని ఎన్నగలం ఈ పడికట్టు పదాలను... ఈ జీవన సత్యాలను. పాటలలో కూడా ప్రత్యేకత రావోయి వనమాలి బిరబిర తిప్పువారికి తిప్పలు బాపే పేదల పెన్నిధి రాట్నం, రైతు తల్లి రాట్న మాత, ‘తల్లి పొదుగులో మంగళ జ్యోతి, పాలు తాగే లేగదూడ, రైతు సంతతిని రాయిడి చేసి దయమాలిన ప్రభుతలు కాదే, ఆవు రాజ్యము రంకెలు వేసే, మేని చెమటలు కారిచివేసి ఊరునాడు పెంచు రైతు.. అంటూ ఒక పెద్ద పాటతో రైతు జీవనాన్ని మనసులోకి చొప్పించారు. రైతును జమీందారులు ఆ రోజుల్లో కట్టుబానిసల్లా చూశారు. ‘‘వ్యవసాయం రైతు పని. పరిపాలన రాజు పని. రాజుకి భూమిచ్చినా చెడుతుంది, రైతుకి పరిపాలన ఇచ్చినా చెడుతుంది’’ అంటూ మెట్టవేదాంతం పలుకుతాడు కరణం. ‘ఎంత పంట పండినా కడుపుకాలి చస్తున్నారు రైతులంతా’.. నేటికీ వర్తిస్తున్నదే. నూరేళ్ల పైమాటే! ఎనభయ్యేళ్ల నాటి ‘రైతుబిడ్డ’ తొలినాళ్ల తెలుగు సినిమా అయినప్పటికీ, తెలుగు చలన చిత్ర పరిశ్రమ చరిత్ర నూరేళ్ల పైమాటే! తెలుగులో తొలి టాకీ ‘భక్తప్రహ్లాద’ (1931) కాగా, తొలి మూకీ (నిశ్శబ్ద చిత్రం) ‘భీష్మ ప్రతిజ్ఞ’ (1921). తెలుగు సినిమా పితామహుడిగా ప్రఖ్యాతి చెందిన రఘుపతి వెంకయ్య 1909 నుంచే తెలుగు సినిమాల కోసం పాటు పడ్డారు. ‘భీష్మ ప్రతిజ్ఞ’ ఆయన నిర్మించిందే. వెరైటీగా టైటిల్స్: సారథి ఫిల్మ్స్ బ్యానర్ మీద విడుదలైన రైతు బిడ్డ చిత్రం ‘మా ఆయుధం స్వార్థత్యాగం’ అని పాంచజన్యం పూరించింది. ఈ చిత్ర కథ స్వాతంత్య్ర పూర్వపు కాలంలో జరిగింది. చిత్ర కథ, సినారియో గూడవల్లి రామబ్రహ్మం, సంభాషణలు త్రిపురనేని గోపీచంద్, సపోర్టెడ్ బై తాపీ ధర్మారావు నాయుడు, విశ్వనాథ, కవిరాజు. పాటలు తాపీ ధర్మారావు, కొసరాజు రాఘవయ్య చౌదరి, లే ట్ బసవరాజు అప్పారావు, నెల్లూరు వెంకటరామా నాయుడు, తుమ్మల సీతారామమూర్తి చౌదరి... ఇలా టైటిల్స్ వస్తాయి. చిత్రాన్ని రైతుబంధు బి. మునిస్వామి నాయుడు (మద్రాసు మాజీ ముఖ్యమంత్రి) కి అంకితమిచ్చారు. రైతు ఔన్నత్యం ‘పసుపు కుంకుమ పట్టుకుని గడపగడపకు వెళ్లి ఓట్లు సాధించాల్సిందే’ అని ఆడవారిలో చైతన్యం తీసుకువచ్చారు గూడవల్లి. ‘ఇంతవరకు మలినం కాకుండా ఉన్నది రైతు జాతి మాత్రమే’, ‘జమీందార్లు వస్తారు పోతారు. రైతు సంఘం మాత్రం ఈ దేశం ఉండేంతవరకు చావు లేనిది’, ‘రైతుకే ఓటివ్వవలెనన్నా నీ కష్టసుఖముల రైతు ప్రతినిధి తీర్చగలడన్నా’’ అని ఓటర్లను రైతు వైపుకి మళ్లించారు. ‘మనం రైతు బిడ్డలం, ఆడితప్పం. మన తిరుగులేని అహింసాత్మక అస్త్రాన్ని ప్రయోగిద్దాం’ ‘మా పోరాటం విషపూరితం కాదు, ప్రేమపూరితం’ ‘మేం ఒక ఆదర్శం కోసం, ప్రజల సుఖం కోసం పోరాడుతున్నాం’ అని రైతులలోని చైతన్యాన్ని స్వచ్ఛమైన వారి నిజాయితీని ప్రేక్షకుల కళ్ల ముందుంచారు. రైతుల డిమాండ్లకు కూడా శక్తిమంతంగా పలికించారు. లంచగొండితనాన్ని రూపుమాపాలి, వెట్టిచాకిరీ రద్దుపరచాలి, నిరక్షరాస్యతను నిర్మూలించాలి. బంజరు భూములు రైతులకే వదలాలి, ఉమ్మడి భూములు రైతులకే వదలాలి. అడవులను కూడా రైతులకే వదలాలి. నజరానాలకు స్వస్తి చెప్పాలి. బకాయి శిస్తులను రద్దుచేయాలి...’ అంటూ పదిహేను డిమాండ్లు అడిగించారు రైతుల నోటి ద్వారా. అక్కడితో సినిమా శుభం పలుకుతుంది – వైజయంతి పురాణపండ -
బతుకు చిత్రం
అందరి బతుకు కోరుకునే బతుకమ్మకు.. బతుకులో ఎదురయ్యే కష్టాల గురించి తెలుసు. ఆ బతుకమ్మ రైతుబిడ్డయితే.. పల్లెలోని ప్రతి గడప గోడు ఆమెకు ఇంకా బాగా తెలుసు. ఈ అంశాన్ని ఆధారంగా ‘బతుకమ్మ’ పేరుతో సినిమా తీసి అందరి మన్ననలు పొందిన డెరైక్టర్ తోట ప్రభాకర్. చిన్ననాటి నుంచి చూసిన కన్నఊరి కష్టాలనే కథాంశంగా.. తెలంగాణ పల్లె పొద్దు.. సద్దు.. బతుకు.. చావు అన్నీ కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆ చిత్రం గురించి ఆయన చెప్పిన విశేషాలు.. వరంగల్ దగ్గర చిట్యాల మా ఊరు. నాన్న లక్ష్మయ్య ఓ సాధారణ రైతు. నేను కూడా ఆయన వెంటే వ్యవసాయం చేసుకుంటూ బతికాను. కట్ చేస్తే.. దర్శకుడినయ్యా.. పల్లె బతుకులపై ఓ సినిమా తీయాలని చాలా కథలు తయారుచేసుకున్నాను. వాటిలో ‘బతుకమ్మ’ కథాంశం చక్కగా కుదిరింది. దీంతో 2008లో సినిమా తీశాను. దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ప్లే, సంగీతం అన్నీ నేనే అందించాను. పాటలు గోరెటి వెంకన్న, అంద్శై రాశారు. ఆరు నెలల్లో చిత్ర నిర్మాణం పూర్తయింది. సహజత్వానికి దగ్గరగా.. టైటిల్ రోల్కు తెలంగాణ అమ్మాయి అయితే బాగుండని చాలా వెతికాం. ఎవరూ సూట్ అవ్వలేదు. చాలామంది సింధూతులానీ పేరు చెప్పారు. ఆమె అమెరికాలో ఉండగా నేను ఫోన్ చేసి అడిగాను. వెంట నే ఓకే చెప్పింది. మొదటి రోజు షూటింగ్లో హీరోయిన్కు మేకప్ వేసి షూటింగ్ చేశాం. ఎక్కడో సహజత్వానికి దూరంగా ఉన్నట్టు అనిపించింది. తర్వాత మేకప్ లేకుండా తీశాం నేచురల్ గా వచ్చింది. ఆమె కట్టే చీరలు కూడా పాతవాటిని ఎంపిక చేశాం. కొన్ని సన్నివేశాల్లో కాస్ట్యూమ్స్కు మట్టి పూశాం. సినిమా మొత్తం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ప్రాంతంలో చిత్రీకరించాం. కొన్ని సన్నివేశాల్లో నటించడానికి లోకల్గా ఉన్నవాళ్లనే తీసుకున్నాం. నందినెక్కిన బతుకమ్మ.. సినిమా రిలీజ్ తర్వాత ఓపెనింగ్స్ భారీగా లేకపోవడంతో నేను టెన్షన్ పడ్డాను. ఫస్ట్ వీక్ పొగడ్తలు లేవు.. విమర్శలు లేవు.. అసలు ఏ టాక్ లేదు. తర్వాత సీన్ మారిపోయింది. అద్భుతమైన సినిమా అని మెచ్చుకోలు వినిపించింది. ఓ రోజు వరవరరావుగారు ఫోన్ చేసి ‘సినిమా చాలా బాగా తీశారు. మీ సినిమా చూసి నేను, మా మిత్రులు రెండు గంటలు చర్చించుకున్నాం’ అన్నారు. దర్శకుడిగా ‘బతుకమ్మ’ నాకు ఎనిమిదో సినిమా. సంగీత దర్శకుడిగా రెండోది. అన్నింటికన్నా గొప్ప విషయం.. నంది అవార్డు తెచ్చిపెట్టిన సినిమా. ఒక ప్రాంత ప్రజలు పడ్డ కష్టాలను, సంప్రదాయాలను చూపించే సినిమా అంటే.. నిర్మాణానికి ముందుకొచ్చే వారు అరుదు. అలాంటిది.. నా కథ విని సినిమాను నిర్మించిన పొనుగోటి రామ్మోహన్, మక్కపాటి చంద్రశేఖర్రావు, రాజేశ్వరరావులకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏటా ‘బతుకమ్మ’ పండుగ వచ్చినప్పుడల్లా నా సినిమా గుర్తుకువస్తుంది.. ఇంతకన్నా గుర్తింపు ఏముంటుంది చెప్పండి. - భువనేశ్వరి -
రైతుబిడ్డకు 75ఏళ్లు.. అభ్యుదయ శంఖారావం
వివరం: సమకాలీన రాజకీయాలపై వెండితెర వ్యాఖ్యానమైన తొలి చిత్రం... బ్లాక్ అండ్ వైట్ యుగంలోనే రంగుల్లో చిత్రీకరణ ప్రయత్నాలు చేసిన మొదటి తెలుగు ఫిల్మ్... తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన గాన కోకిల టంగుటూరి సూర్యకుమారికి తెలుగు తెరపై తొలి సినిమా... జానపద సినీ కవి సౌర్వభౌమ కొసరాజు నటన, గీత రచనలకు తొలి చిత్రం ప్రదర్శనలపై నిషేధం వేటు పడిన ప్రప్రథమ తెలుగు సినిమా... ఒకే సినిమాకు ఇన్ని విశేషాలుండడం కూడా అచ్చంగా అరుదైన విశేషమే. ఇవన్నీ అభ్యుదయ చలనచిత్ర రథసారథి గూడవల్లి రామబ్రహ్మం రూపొందించిన ‘రైతుబిడ్డ’ కీర్తిచంద్రికల్లోని కొన్ని కిరణాలు మాత్రమే. ఇవాళ సామాన్య ప్రేక్షకుడికి దూరంగా, పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్లో ప్రింట్ అందుబాటులో ఉన్న ఈ ఆణిముత్యం గురించి తెలుసుకోవాల్సినవి మరెన్నో! 1939లో విడుదలైన ‘రైతుబిడ్డ’కు ఆగస్టు 27తో 75 ఏళ్ళు పూర్తవుతున్న వేళ ఈ వెండితెర ‘ప్లాటినమ్’ వివరాలు... ఈ వారం ‘ఫన్డే’ ప్రత్యేకం... ‘రైతుబిడ్డ’లో టంగుటూరి సూర్యకుమారి, (టోపీతో) తాసీల్దార్గా నెల్లూరు నగరాజారావు, (కుర్చీలో) ఖాసా సుబ్బన్నగా భీమవరపు నరసింహారావు; భార్య లక్ష్మిగా కొమ్మూరి పద్మావతి, భర్త నర్సిరెడ్డిగా బళ్ళారి రాఘవ, కుమార్తె సీతగా టంగుటూరి సూర్యకుమారి - డాక్టర్ రెంటాల జయదేవ ఒక పెద్ద జమీ... దాన్ని పాలించే జమీందారు.... ఆయన తాబేదార్లుగా వ్యవహరించే మునసబు, కరణం... శిస్తు వసూలు లాంటి వ్యవహారాల్లో జమీలో జరుగుతున్న అన్యాయాలతో రైతులు విలవిలలాడడం... వయసులో, అనుభవంలో పెద్దవాడైన ఒక మధ్యతరగతి మంచి రైతు నర్సిరెడ్డి, అతని కుటుంబం అందరి పక్షాన గళం విప్పడం... ఊళ్ళో ఎన్నికల హంగామా... జమీందారు అభ్యర్థికీ, మరో యువ రైతు ఉద్యమనేత రామిరెడ్డికీ మధ్య ఎన్నికల పోటీ... ఎన్ని ప్రలోభాలు పెట్టినా, దౌర్జన్యాలు చేసినా ప్రజా ఉద్యమానిదే విజయం... ఆఖరుకు జమీందారు అహంకారం తగ్గి, రైతుల పక్షాన నిలవడం... ...దేశానికి స్వాతంత్య్రం రాక ముందు కాలానికి సంబంధించిన ‘రైతుబిడ్డ’ కథ ఇది. ఈ కథ వింటే, ఇలాంటి పోలికలతో నిన్న మొన్నటి దాకా వచ్చిన గ్రామీణ నేపథ్య చిత్రాలు ఎన్నో గుర్తొస్తాయి. ఇటీవలి వరకు బాక్సాఫీస్ ఫార్ములా అయిన పల్లెటూరి రాజకీయాలు, అనుబంధాల కథకు తెలుగుతెరపై తొలి రూపం - ‘రైతుబిడ్డ’. కథా నేపథ్యం పౌరాణిక, జానపద కథలు, పద్యనాటకాలను స్క్రిప్టులుగా మార్చుకొని తెరకెక్కిస్తున్న రోజుల్లో సినిమాను అద్భుతమైన ఆయుధంగా భావించిన దర్శక - నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం ప్రవేశం తెలుగు సినిమాకు బ్రహ్మాండమైన కుదుపు. ఆ రోజుల్లో ఇలాంటి ఈ కథను ఎంచుకోవడం సాహసమే. అప్పటి సామాజిక వాతావరణాన్ని గమనిస్తే, 1935 ఇండియా యాక్ట్ ప్రకారం భారతీయుల్లో అక్షరజ్ఞానం ఉన్నవారికీ, పన్ను కట్టేవారికీ ఓటు హక్కు వచ్చింది. అలా ‘విస్తృత ఓటింగ్’ సౌకర్యం వల్ల ’37 నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అలా మద్రాస్ ప్రెసిడెన్సీకి రాజాజీ ముఖ్యమంత్రి, ప్రకాశం పంతులు రెవెన్యూ మంత్రి అయ్యారు. అప్పటికే, తెలుగునాట ‘జమీన్ రైతు’ ఉద్యమం నడుస్తోంది. కరవు కాటకాలు, తుపాన్లు వచ్చినా సరే ముక్కుపిండి మరీ బోలెడంత శిస్తు వసూలు చేస్తున్న జమీందార్ల దౌర్జన్యాలపై రైతాంగం పిడికిళ్ళు బిగించింది. ఆ పరిస్థితుల్లో ‘జమీందారీల రద్దు బిల్లు’ను శాసనం చేయించడానికి నెల్లూరులో ‘జమీన్రైతు’ పత్రిక వ్యవస్థాపకుడు నెల్లూరు వెంకట్రామానాయుడు (1891- 1959) సహా ఎంతోమంది కృషి చేస్తున్నారు. బిల్లు శాసనసభ ముందుకొచ్చింది. తిరుపతి ఎస్టేట్ తిరుత్తణి తాలూకాలో బొల్లిని మునిస్వామి నాయుడు (1885- 1935)లాంటివారు జమీన్రైతు ఉద్యమంతో ప్రజా విజయం సాధించారు. ఆ పరిస్థితులను నేపథ్యంగా తీసుకొని రామబ్రహ్మం ఈ ‘రైతుబిడ్డ’ కథను అల్లారు. 1939 జనవరిలో సెట్స్ మీదకొచ్చారు. మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా చేసిన ‘‘రైతుజన బాంధవుడు’’ స్వర్గీయ మునిస్వామి నాయుడికే సినిమాను అంకితమిచ్చారు. కదం తొక్కిన కలం వీరులు ఆ తరం గొప్ప రచయితలు, గేయకర్తలతో రామబ్రహ్మానిది ఆత్మీయతానుబంధం. సారథీ వారి తొలి చిత్రం ‘మాలపిల్ల’లో లాగే ఈ చిత్రానికీ ఒకరి కన్నా ఎక్కువ రచయితలను ఆయన వినియోగించుకున్నారు. రచయిత గోపీచంద్ మాటలు రాసి, సహాయ దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు. అదనపు సంభాషణలేమో తాపీ ధర్మారావు, హాస్య సన్నివేశాలేమో మల్లాది విశ్వనాథ కవిరాజు రాసినవి. బసవరాజు అప్పారావు గీతాల హక్కులు కొని, ‘మాలపిల్ల’లో వాడినట్లే, ఈ ద్వితీయ చిత్రం ‘రైతుబిడ్డ’కు కూడా బసవరాజు గీతాలతో పాటు, ‘జమీన్రైతు’ వెంకట్రామానాయుడు గీతాలు, తుమ్మల సీతారామమూర్తి చౌదరి పద్యాలు తీసుకున్నారు. ఇక, అప్పటికే రైతు జన సంఘ ఉద్యమానికి ఆలంబనగా ‘కడగండ్లు’ పేరిట పాటలు రాసిన అనుభవం కొసరాజు రాఘవయ్య చౌదరికి ఉంది. జనసామాన్యంలోకి చొచ్చుకుపోయిన ఆ పుస్తకంలోని ‘నిద్ర మేలుకోర తమ్ముడా!’ పాటను రామబ్రహ్మం ఈ సినిమాలో వాడుకున్నారు. వ్యక్తిగతంగా సన్నిహితుడైన కొసరాజును పిలిపించి, మరికొన్ని పాటలు రాయించుకున్నారు. అలా ప్రారంభమైన కొసరాజు గీత రచనా జీవితం ఆ పైన జానపద గీతాలకు చిరునామా అయింది. జనజాగృతికి సినీ సారథి సినిమాను జనజాగృతికి వినియోగించిన తొలి తరం తెలుగు దర్శ కుడు గూడవల్లి రామబ్రహ్మం. స్వాతంత్య్రానికి పూర్వమే అస్పృశ్యత అంశాన్ని తీసుకొని ‘మాలపిల్ల’ చిత్రాన్ని (రిలీజ్ 1938 సెప్టెంబర్ 25) రూపొందించిన చైతన్యశీలి ఆయన. తెలుగులో తొలి పూర్తి టాకీ (‘భక్త ప్రహ్లాద’ - 1932 ఫిబ్రవరి 6) వచ్చిన ఆరేళ్ళకే ఇలాంటి విప్లవాత్మక ఇతివృత్తాలను తెరకెక్కించడం ఆయన చేసిన సాహసం. కృష్ణాజిల్లా నందమూరుకి చెందిన రామబ్రహ్మం 1930ల తొలినాళ్ళలో మద్రాసు వెళ్ళి, ‘సమదర్శిని’, తరువాత ‘ప్రజామిత్ర’ పత్రికలకు సారథ్యం వహించినా, కొత్తదైన సినీ రంగంలోకొచ్చినా ఆయన జాతీయతావాదం, ప్రయోగశీలత, సామాజిక ప్రయోజన దృష్టే కారణాలు. మొదట వేల్ పిక్చర్స్, ఆ పైన బెజవాడ ‘సరస్వతీ టాకీసు’ సంస్థల సినీ నిర్మాణాల్లో పాలుపంచుకొన్నారు. సమాజాన్ని ప్రతిఫలించే సాంఘిక కథల వైపే మొగ్గుచూపి, కె. సుబ్రహ్మణ్యం తీసిన సాంఘికం ‘బాలయోగిని’(’37)కి దర్శకత్వ శాఖలో పనిచేశారు. అభ్యుదయ భావాలకు తెర రూపమిచ్చేందుకు రామబ్రహ్మం ‘సారథీ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను స్థాపించారు. చల్లపల్లి రాజా శ్రీమంతు యార్లగడ్డ శివరామప్రసాద్ను డెరైక్టర్ల బోర్డు చైర్మన్గా పెట్టుకొన్నారు. 1937 సెప్టెంబర్లో మద్రాసులోని రాయపేటలో ‘సారథి’ సంస్థ ప్రారంభమైంది. (లాయిడ్స రోడ్ మొదట్లో ఆఫీసుండేది). ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ తదితర ఉత్తమ చిత్రాలు తీశారు. రామబ్రహ్మం కన్నుమూశాక కూడా చల్లపల్లి జమీందార్ల యాజమాన్యంలో ‘సారథీ’ సంస్థ ‘రోజులు మారాయి’ (55) లాంటి మంచి చిత్రాలందించింది. హైదరాబాద్ సారథీ స్టూడియోస్ సైతం 1956లో జమీందార్లు నెలకొల్పినదే! కెమేరా ముందుకు... గీత, సంగీత కర్తలు మరోపక్క రామబ్రహ్మం మిత్రుడూ, ‘మాలపిల్ల’ ద్వారా తెలుగు వరుసలు, లలిత సంగీత ఫక్కీ బాణీలను పాపులర్ చేసిన సంగీత దర్శకుడూ భీమవరపు నరసింహారావు ‘రైతుబిడ్డ’లో మరోసారి తన ప్రత్యేకత చూపారు. ఆయన అందించిన దేశవాళీ బాణీలు, ఆర్కెస్ట్రయిజేషన్తో పాటలు జనం నోట మారుమోగాయి. గీత రచయిత, సంగీత దర్శకుడు - ఇద్దరూ సినిమాలో కీలక పాత్రలు నటించిన ఘనత ‘రైతుబిడ్డ’కు దక్కింది. పాటల రచయితగా సినీరంగ ప్రవేశం చేసిన కొసరాజు ‘రైతుబిడ్డ’లో రైతు సంఘం నేత రామిరెడ్డిగా తెరంగేట్రమూ చేశారు. ఇక, భీమవరపు నరసింహారావేమో జమీందార్కు ఆంతరంగిక (ఉర్దూలో ఖాసా) సేవకుడైన ‘ఖాసా’సుబ్బన్న పాత్ర ధరించారు. తెరపై తారా సందోహం ఈ సినిమాలో రైతు పెద్ద నర్సిరెడ్డిగా రంగస్థల దిగ్గజం ‘బళ్ళారి’ రాఘవాచార్యులు, ఆయన భార్యగా కొమ్మూరి పద్మావతి (ఆమె కుమారుడే ప్రముఖ డిటెక్టివ్ కథా రచయిత కొమ్మూరి సాంబశివరావు) నటించారు. టంగుటూరి ప్రకాశం తమ్ముడైన శ్రీరాములు 3వ కుమార్తె - గాయని అయిన 14 ఏళ్ళ సూర్యకుమారి అప్పటికే తమిళ ‘విప్రనారాయణ’ (’38) ద్వారా తెరంగేట్రం చేశారు. కమ్మని గొంతు, కనువిందైన రూపమున్న ఆమెను ‘రైతుబిడ్డ’తో తెలుగుతెరపైకి తెచ్చారు రామబ్రహ్మం. ఆమె పాడిన ‘రావోయీ వనమాలీ బిరబిర..’ లాంటి పాటలు అంతా పాడుకున్నారు. భాషా పండితుడైన గిడుగు రామ్మూర్తి పంతులు కుమారుడైన డాక్టర్ జి.వి. సీతాపతిరావుతో జమీందారు పాత్ర వేయించారు. విజయా వారి ‘మాయాబజార్’లో సిద్ధాంతుల జంట శాస్త్రి - శర్మల్లో శాస్త్రిగా ఇవాళ్టికీ జనానికి గుర్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంగర వెంకట సుబ్బయ్య ఇందులో కరణం పాత్ర వేశారు. రంగస్థలంపైన, ‘మాలపిల్ల’ లాంటి చిత్రాల్లో నట, గానంతో ఆకట్టుకొన్న పి. సూరిబాబు ఇందులో ైబైరాగి రామజోగిగా ‘నిద్ర మేలుకోర..’ లాంటి హిట్ గీతాలాలపించారు. సహజత్వం... సాంకేతిక నైపుణ్యం... మద్రాసు మౌంట్రోడ్లో ‘మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ కంబైన్ లిమిటెడ్’ (ఎం.పి.పి.సి.) స్టూడియోలో (తరువాత జెమినీ స్టూడియోగా మారి, ఇప్పుడు జెమినీ-పార్సన్ కాంప్లెక్సైంది) 1939 సంక్రాంతికి ‘రైతుబిడ్డ’ షూటింగ్ ప్రారంభమైంది. ఏ సినిమా తీసినా సహజమైన తెలుగు వాతావరణాన్నీ, సంస్కృతినీ ప్రతిబింబించడం రామబ్రహ్మం శైలి. అందుకు తగ్గట్లే ఈ సినిమా కోసం ఆయన ఆంధ్రదేశంలోని అనేక ప్రాంతాలు తిరిగి ప్రకృతి దృశ్యాలను కెమేరాలో బంధింపజేశారు. శైలేన్ బోస్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు కాగా, నృత్యంలోనూ తెలుగుదనాన్ని ప్రతిబింబించడం కోసం ప్రత్యేకించి, కూచిపూడి అగ్రహారానికి చెందిన నాట్యకోవిదుడు వేదాంతం రాఘవయ్యను నృతదర్శకుడిగా పెట్టుకొన్నారు. జమీందారు ఆవరణలో రైతుల్ని బంధించే ఘట్టంలో కూచిపూడి భాగవతుల ‘దశావతార’ నృత్యాన్ని రాఘవయ్య అద్భుతంగా నర్తించారు. తరువాత కాలంలో రాఘవయ్య దర్శకుడై, ఏయన్నార్తో ‘దేవదాసు’ తీయడం మరో కథ. స్వతహాగా జర్నలిస్టయిన రామబ్రహ్మం 1938 తుపాను కృష్ణాజిల్లాలో కలిగించిన బీభత్సాన్ని ‘రైతుబిడ్డ’లో కథానుగుణంగా చూపారు. సినిమా చివరలో ‘ప్రజామిత్ర’ పత్రికలో జమీందార్ కుమారుడి అపహరణ వార్త చదువుతూ, రామబ్రహ్మం కూడా తెరపై క్షణకాలం కనిపిస్తారు. ఔట్డోర్లో సూర్యకుమారి దృశ్యాలు, పతాక సన్నివేశాలలో జమీందార్ హడావిడిగా విమానం వద్దకు రావడం, చక్కని రన్వేపై విమానం టేకాఫ్, ఆకాశంలో ప్రయాణం లాంటి దృశ్యాలను ఆ కాలానికి అద్భుతంగా తీశారని చెప్పాలి. అందుకే, సుప్రసిద్ధ సినీ, సంగీత, నృత్య విమర్శకుడు వి.ఏ.కె. రంగారావు ‘‘నేను బొబ్బిలి జమీందార్ల వంశీయుడినైనా, మా నాన్న గారి ‘చిక్కవరం’ జమీ కృష్ణాజిల్లాలో ఉండడంతో, ‘రైతుబిడ్డ’లో చూపిన జమీందారీ దురన్యాయాలపై నాకు అవగాహన లేదు. అదెలా ఉన్నా, సంగీతం, ఛాయాగ్రహణం, లైటింగ్, ఎడిటింగ్ - ఇలా అనేక విభాగాల్లో సినిమా అద్భుతంగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. ఇవాళ్టికీ అవే ఓటు రాజకీయాలు ‘రైతుబిడ్డ’లో వాడిన ఉద్వేగభరితమైన ‘రైతుకే ఓటివ్వవలెనన్నా...’ లాంటి ఎన్నికల పాటలు, ప్రచార గీతాలు తరువాతి రోజుల్లో ప్రచార గీతాలకు ట్రెండ్ సెట్టర్లయ్యాయి. అలాగే, సినిమా తీయడానికి కొన్నాళ్ళ ముందు జరిగిన ఉద్యమ నేత చిన్నప్పరెడ్డి ఘటనను కూడా ‘సై సై చిన్నపరెడ్డి...’ అనే పాటగా సినిమాలో పెట్టడం విశేషం. ‘‘నా భూమిని తాకట్టు పెట్టమన్నారా! నా తల్లిని తాకట్టు పెట్టమన్నారా!’’ (షావుకారుతో నర్సిరెడ్డి పాత్రధారి బళ్ళారి రాఘవ) లాంటి డైలాగ్స రోమాల్ని నిక్కబొడుచుకొనేలా చేస్తాయి. అలాగే, ఎన్నికలలో ఓట్ల కోసం ప్రలోభాలు, ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీల ప్రత్యేక నృత్య గానాలు- ఇవన్నీ ‘రైతు బిడ్డ’లో కనిపిస్తాయి. రూపం, పరిమాణం మారినా, ఈ ఓటింగ్ రాజకీయాలు, రైతు సమస్యలు ఇవాళ్టికీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నవే. ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ రాజకీయ పరిస్థితిని తెలుగు తెరపై చూపి, జన సామాన్యానికి రాజకీయ, సాంఘిక, ఆర్థిక చైతన్యాన్ని అందించిన తొలి తరం సినిమా... ‘రైతుబిడ్డ’. ఆర్థిక నష్టం! ఆర్కైవ్స్లో భద్రం! ఆ రోజుల్లోనే లక్ష రూపాయలకు పైగా వ్యయంతో నిర్మాణమైందీ సినిమా. 1939 జూలై 29న సెన్సారైన (నంబర్- ‘ఎం 2103’) ఈ 178 నిమిషాల చిత్రం ఆగస్టు 27న 11 కేంద్రాల్లో ఒకేసారి రిలీజైంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆదరణ ఉన్నా, పట్టణాల్లో అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. జమీందారు స్వతహాగా మంచివాడనీ, పక్కనున్నవారే దుష్టులన్నట్లు కథ నడిచిందనీ విమర్శలూ వచ్చాయి. విమర్శలెలా ఉన్నా, కొన్ని నెలల వరకు ‘రైతుబిడ్డ’ నిషేధానికి గురి కాలేదు. దాదాపు 90 కేంద్రాల్లో శాంతి భద్రతలకు భంగమేమీ లేకుండా సినిమా ప్రదర్శితమయ్యాక, అప్పుడు జమీందార్ల ఒత్తిడితో నిషేధం డిమాండ్ ఊపందుకోవడం విచిత్రం. (‘నిషేధపు వేటు’ బాక్స్ చూడండి). దేశానికి స్వాతంత్య్రం, జమీందారీ ‘ఎస్టేట్ల రద్దు చట్టం’ (1948) వచ్చి, జమీలన్నీ పోయాక, తరువాతెప్పటికో ఈ సినిమాపై నిషేధం నీడ తొలగింది. అప్పటికే నిర్మాతలను ఆర్థికంగా నష్టపరచిన ఈ చిత్రం క్రమంగా అందుబాటులో లేకుండా పోయింది. అయితే, ఈ సంచలనాత్మక చిత్రం, దీని కన్నా ముందు వివాదాస్పదమైన ‘మాలపిల్ల’ ప్రింట్లు పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్లో ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. విజయవాడలో చరిత్రకు విగ్రహ సాక్షి సినీ జర్నలిస్ట్ ఇంటూరి వెంకటేశ్వరరావు, డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి, సినీ పంపిణీ, ప్రచార యుగ ప్రముఖుడు ఈడ్పుగంటి లక్ష్మణరావు తదితరుల పూనికతో 1983 మార్చి 4న విజయవాడలో అలంకార్ థియేటర్ వద్ద నిలువెత్తు రామబ్రహ్మం విగ్రహం ప్రత్యేకంగా ప్రతిష్ఠితమైంది. అప్పటి కొత్త ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రత్యేకంగా వచ్చి, విగ్రహావిష్కరణ చేశారు. ‘రైతుబిడ్డ’ రిలీజై 50 ఏళ్ళయినప్పుడు విజయవాడ అప్సర థియేటర్లో ‘రైతుబిడ్డ’ను ప్రత్యేకంగా ప్రదర్శించడం, సినీ పెద్దలు రావడం... ఆ తరం వారికి ఇవాళ్టికీ ఓ తీపి గుర్తు. వెరసి, అటు రైతు ఉద్యమస్ఫూర్తి, ఇటు సామాజిక చైతన్య కళాదీప్తితో ఏడున్నర దశాబ్దాలుగా వెండితెరపై వెలుగులీనుతున్న ‘రైతుబిడ్డ’ తెలుగు సినీ ప్రస్థానంలో ఎప్పటికీ ప్రత్యేకమే! తెలుగు తెరపై తొలి నిషేధపు వేటు అభ్యంతరాలేమీ లేవని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చినా, ‘రైతుబిడ్డ’ రిలీజయ్యాక గొడవ మొదలైంది. ఈ చిత్రంపై వివాదం వెనుక రాజకీయ కారణాలు చాలానే ఉన్నట్లనిపిస్తుంది. అప్పట్లో చల్లపల్లి జమీందార్, మీర్జాపురం జమీందార్ల మధ్య వైరం ఉంది. మొదట్లో ఇద్దరూ ‘జస్టిస్ పార్టీ’లోనే ఉన్నా, వైరుద్ధ్యాలతో చల్లపల్లి రాజా బయటకొచ్చి, ‘ప్రజామిత్ర పక్షము’ అనే పార్టీ పెట్టుకున్నారు. ‘ప్రజామిత్ర’ పత్రికకూ అండ అయ్యారు. మీర్జాపురం జమీందారును దృష్టిలో ఉంచుకొనే ‘రైతుబిడ్డ’లోని జమీందారు పాత్రను అల్లుకున్నారంటారు. అప్పట్లో వెంకటగిరి, బొబ్బిలి, పిఠాపురం జమీందార్లు జరీ టోపీలు పెట్టుకొనేవారు. కుక్కల్ని పెంచుకుంటూ, ముద్దు చేసేవారు. సరిగ్గా, ఈ సినిమాలో జమీందారు పాత్ర అలాగే ఉంటుంది. నిషేధానికి ముందు ఘర్షణలు: సినిమా రిలీజ్ సందర్భంలో బొబ్బిలి, వెంకటగిరి జమీందార్లు వకీళ్ళతో ‘సారథీ’ వారికి నోటీసులిచ్చారు. దాంతో, ఆ వకీళ్ళకు సినిమా చూపెట్టారు. అభ్యంతరపెట్టదగినవేమీ లేవని వారు అభిప్రాయపడ్డారు. మద్రాస్ ప్రెసిడెన్సీలోని కాంగ్రెస్ సర్కార్ సినిమాపై జోక్యం చేసుకోలేదు. ఈలోగా 1939 సెప్టెంబర్లో 2వ ప్రపంచ యుద్ధమొచ్చింది. రాజాజీ నేతృత్వంలో కాంగ్రెస్ సర్కార్ రాజీనామా చేసింది. అదే అదనుగా జమీందార్లు మళ్ళీ రెచ్చిపోయారు. రిలీజైన కొన్ని నెలలకి ‘చక్కోసన్స టూరింగ్ టాకీస్’ వారు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ‘రైతుబిడ్డ’ను ప్రదర్శించబోయినప్పుడు జమీందార్ మనుషులు ఫిలిమ్ పెట్టెను ఎత్తుకుపోబోయారు. కుదరకపోయేసరికి లంచమిచ్చి, ప్రదర్శన మాన్పించాలని చూశారు. అదీ ఫలించక టూరింగ్ టాకీస్ డేరాకు నిప్పెట్టారు. ఎక్కడెక్కడ నిషేధం?: జమీందార్ల ఒత్తిడి పుణ్యమా అని నెల్లూరు జిల్లా మేజిస్ట్రేట్ వెంకటగిరి జమీందారీ ఏరియాలో ‘రైతుబిడ్డ’ ప్రదర్శనపై నిషేధం విధించారు. తరువాత బొబ్బిలి, మందసా, తర్ల జమీందారీలలో కూడా ‘చూపరాని చిత్రం’ అంటూ మద్రాసు ప్రెసిడెన్సీ సర్కార్ నిర్ణయించింది. వెరసి, విశాఖపట్నం జిల్లాలో, రామ్నాడ్ జిల్లాలోని సాతూర్ తాలూకా లోనూ 1940, ’41ల్లో నిషేధపుటుత్తర్వులు వచ్చాయి. సాక్షాత్తూ, ‘రైతు బిడ్డ’ను నిర్మించిన చల్లపల్లి రాజా వారి సొంత జిల్లా (కృష్ణాజిల్లా)లో సైతం నిషేధం వేటు పడింది. ప్రభుత్వం ఆనాటి మద్రాస్ ప్రావిన్స్ మొత్తంలో నిషేధించినట్లు చాలామంది పొరబడుతుంటారు. కానీ, నిషేధం పెట్టింది పై జిల్లాల్లో మాత్రమేనని ఈ రచయిత పరిశోధనలో తేలింది. స్వాతంత్య్రం రాక ముందు 1947లో మళ్ళీ ‘రైతుబిడ్డ’ వార్తల్లోకొ చ్చింది. చిత్రంపై నిషేధం ఎత్తివేయాలని సారథీ సంస్థ, సౌతిండియన్ ఫిల్మ్ ఛాంబర్లు అభ్యర్థన పంపాయి. అప్పటి నుంచి 1951 ప్రథమార్ధం వరకు ప్రభుత్వశాఖలు నిషేధం ఎత్తివేతపై పదే పదే చర్చిస్తూ వచ్చాయి. జమీందారీ వ్యవస్థ పూర్తిగా లిక్విడేట్ అయ్యేదాకా నిషేధం ఎత్తివేయరాదని మద్రాస్ ప్రభుత్వం నిర్ణయించినట్లు అన్వేషణలో తేలింది. తరువాత ఎప్పటికో నిషేధాన్ని స్వతంత్ర భారత సర్కార్ ఎత్తివేసింది. నిషేధంతో వచ్చిన నష్టం, ఎదుర్కొన్న పరిణామాలతో తరువాత రామబ్రహ్మం తన దూకుడు కొంత తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇతర దర్శక, నిర్మాతలు కూడా కొన్నేళ్ళు ఇలాంటి ఇతివృత్తాలను పక్కనబెట్టి, నాటకీయ కుటుంబ, ప్రేమకథలనే ఎంచుకోవాల్సొచ్చింది. ఏమైనా, నిషేధానికి గురైన తొలి తెలుగు సినిమాగా ‘రైతుబిడ్డ’ చరిత్రలో నిలిచింది. కలర్లో తొలి చిత్రీకరణ? నలుపు - తెలుపు సినిమాలే తప్ప, రంగుల చిత్రమన్న మాటే తెలియని ఆ రోజుల్లోనే కలర్లో కొన్ని దృశ్యాల చిత్రీకరణ, ప్రాసెసింగ్ ప్రయత్నం జరిగిన తొలి తెలుగు సినిమా కూడా ‘రైతుబిడ్డే’! సారథీ సంస్థ డెరైక్టర్లలో ఒకరూ, బొంబాయిలో ఫేమస్ సినీ లేబొరేటరీ యజమానీ అయిన సేట్ షిరాజ్ అలీ హకీమ్ దీనికి సలహా, సహాయాలందించారు. డాక్యుమెంటరీ చిత్రాల రూపకల్పనలో ఆ రోజుల్లో విఖ్యాతి గడించిన తెలుగుబిడ్డ పి.వి. పతిని అందుకు పంపించారు. బొంబాయి నుంచి వచ్చిన పి.వి. పతి ఆ ప్రకృతి దృశ్యాలనూ, సూర్యకుమారి పాల్గొన్న ఘట్టాలనూ రంగుల్లో చిత్రీకరించారు. ‘డూఫే కలర్’లో ఆ దృశ్యాలను తీశారు (గేవా, టెక్నీ, ఆర్వో కలర్ల లానే డూఫే కూడా ఒకటి). బొంబాయిలోని ‘డూఫే కలర్ లేబొరేటరీ’ లో ఆ దృశ్యాల ప్రాసెసింగ్ కూడా జరిగింది. నిశితంగా గమనిస్తే, చిత్రీకరణ జరుగుతున్నప్పటి వార్తలు, పత్రికా ప్రకటనలు ఆ సంగతి స్పష్టంగా పేర్కొన్నాయి. ఇప్పుడున్న ‘రైతుబిడ్డ’ ప్రింట్లలోనూ టైటిల్స్లో కూడా ఈ ‘డూఫే కలర్ ప్రాసెసింగ్’ వివరాలున్నాయి. అయితే ఎందుకనో కానీ, ఇప్పుడున్న ప్రింట్లలో కలర్ దృశ్యాలు కనిపించవు. తొలి రిలీజ్లో కూడా కలర్ దృశ్యాలు ప్రదర్శితమైనట్లు సమీక్షల్లో ఎక్కడా కనిపించలేదు. పోస్ట్ ప్రొడక్షనంతా పూర్తయ్యాక సిద్ధమయ్యే టైటిల్స్లో డూఫే కలర్ వివరమున్నా, తెర మీద దృశ్యాల్లో ఎందుకు కనిపించలేదనేది ఇప్పటికీ అంతుచిక్కని విషయమే. చిత్రీకరణ జరిగినా తొలి రిలీజ్కే ఏవైనా కారణాల వల్ల కలర్ దృశ్యాలు తీసేశారా, లేక బ్లాక్ అండ్ వైట్లోకి మార్చారా, లేక కలర్ సరిగ్గా రాక ముందుజాగ్రత్తగా కలర్తో పాటు తీసిన బ్లాక్ అండ్ వైట్ భాగాన్ని వాడారా అన్నది పరిశోధించాల్సి ఉంది.