సీబీఐ మాజీ డైరెక్టర్ కు చుక్కెదురు!
చెన్నై: సీబీఐ మాజీ డైరెక్టర్ ఆర్కే రాఘవన్ బీసీసీఐపై దాఖలు చేసిన పిల్ (వ్యాజ్యం) ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఐపీఎల్ నిర్వహణ విషయంలో బీసీసీఐకి వచ్చే ఆదాయంలో భారీగా కోతపడుతుందని, చైర్మన్ శశాంక్ మనోహర్ నిర్ణయాల వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని తన వ్యాజ్యంలో పేర్కొన్నాడు. ఐపీఎల్ నిర్వహణ వల్ల ఐసీసీ నుంచి బీసీసీఐ బోర్డుకు రావలసిన ఆదాయంలో శశాంక్ మనోహర్ తీరు వల్ల ఆర్థికంగా లోటు ఏర్పుడుతుందని విజయనారాయణ్, రాఘవన్ తమ వాదనలు వినిపించారు. సీబీఐ మాజీ డైరెక్టర్ దాఖలు చేసిన పిల్ విచారణకు రాగా, చీఫ్ జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేష్ లతో కూడిన ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని కొట్టిపారేసింది.
2015-23 మధ్యకాలంలో ప్రసార హక్కుల రూపంలో వచ్చే ఆదాయంలో ఐసీసీ నుంచి బీసీసీఐకి 21 శాతం వాటానే వస్తుందని, అయికతే కనీసం 1000 కోట్ల రూపాయలు బోర్డు ఖజానాకు గండిపడుతుందని ధర్మాసనానికి తెలిపారు. కేవలం మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా పిల్ దాఖలు చేశారని ఈ విషయాన్ని నిరూపించేందుకు తగిన ఆధారాలు పిటిషనర్ వద్ద కూడా లేదని బీసీసీఐ సభ్యులు వివరణ ఇచ్చుకున్నారు. శశాంక్ నిర్ణయాల వల్ల ఆరు శాతం వాటాలో తగ్గింపులు జరిగాయని రాఘవన్ ఆరోపించారు. ఐపీఎల్ ఒప్పందం అనేది ప్రైవేట్ ఒప్పందాల కిందకి వస్తుందని, పిల్ వెనక్కి తీసుకోవాలని సూచించింది.