breaking news
Protection of human rights
-
ఈ మరణంతోనైనా వ్యవస్థలు మేల్కొనాలి
‘‘చాలాకాలంగా ఆదివాసీల జీవన హక్కుల కోసం పోరాడుతున్న 84 ఏళ్ల వృద్ధుడు ఫాదరీ స్టాన్ స్వామిపై కేంద్ర ప్రభుత్వం అభియోగాలు మోపి విచారణ లేకుండా జైళ్లలో నిర్భంధించి, బెయిల్ నిరాకరించడమే కాక కోర్టు కస్టడీలో ఉండగానే అనారోగ్య పరిస్థితులలో సహితం వైద్య సదుపాయం నిరాకరించిన ఫలితంగా మరణించడానికి బాధ్యురాలు ప్రభుత్వమే. స్వామి మరణం... దేశీయ పాలనావ్యవస్థలు ఒక క్రమ పద్ధతిలో అమలు జరుపుతున్న నిరంకుశ చర్యల ఫలితం. దేశ పౌరుల, మేధావుల, అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తి చాటే విద్యార్థులపైన, భిన్నాభిప్రాయ వ్యక్తీకరణలపైన స్పందించడంలో న్యాయవ్యవస్థల తాత్సారానికి అనేక ఉదాహరణలున్నాయి. ఇంతకన్నా పెద్ద వక్రోక్తి స్టాన్ స్వామి ఆరోగ్యం కోర్టు కస్టడీలో జైల్లోనే క్షీణిస్తున్నప్పటికీ ఆయనకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని ఆరోపించబోవడం. కోర్టు కస్టడీలో ఉండగానే స్వామి విషాద మరణంతోనైనా నేర న్యాయ వ్యవస్థతో, న్యాయవ్యవస్థలో, పాలకుల్లో చట్టాలను చదవడంలో అన్వయించడంలో ఒక కుదుపు రాగలదని ఆశిద్దాం. - సుప్రసిద్ధ జాతీయ దినపత్రికల సంపాదకీయాలు (7-7-21) ‘‘నాకు ఊపిరాడటం లేదు (ఐ కాంట్ బ్రీత్) అది 2014లో తెల్లవాడైన న్యూయార్క్సిటీ పోలీస్ ఆఫీసర్ ఒకడు నల్లవాడైన ఎరిక్ గార్నర్ పీకమీద కాలుపెట్టి తొక్కిన సందర్భంగా గార్నర్ అరుస్తూ అన్నమాట అది! ఆ దుర్ఘటన మొదలు, అమెరికాలోని దళిత నల్ల ప్రజలందరినోట ఎరిక్ గార్నర్ మాటే దేశమంతటా ఒక పాపులర్ నినా దంగా మారింది. తిరిగి ఇదే అనుభవం (నాకు ఊపిరాడటంలేదు) 2020 మే 25న జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి పౌరుడి పీకమీద తెల్ల జాతి పోలీస్ ఆఫీసరు డెరిక్ ఛావిన్ కాలుపెట్టి తొమ్మిది నిమిషాల సేపు తొక్కేస్తున్నప్పుడు, అదీ మరో ముగ్గురు పోలీసు ఆఫీసర్లు చూస్తుండగానే, గిలగిలా కొట్టుకుంటున్నపుడు ఫ్లాయిడ్ నోట విన వచ్చింది! క్రమంగా యావత్తు అమెరికాలోనూ పోలీసు వ్యవస్థ నిరం కుశ ప్రవర్తలనకు నిరసనగా ‘నాకు ఊపిరాడ్డంలేదు’ అన్న నినాదం ఒక జాతీయ నిరసన ప్రకటనగా ప్రజల చేతుల్లో ఒక ఆయుధంగా మారింది. అంటే నిరంకుశ వైఖరులకు, ప్రవర్తనలకు వ్యతిరేకంగా అదొక అస్త్రంగా మారింది. అదే నినాదం ఇప్పుడు ఖండాంతరాలు దాటి నేడు ఆదివాసీల నిరసన గళం స్టాన్ స్వామి గొంతులోనూ పలకవలసి వచ్చింది. కోర్టు కస్టడీలో ఉండి జైలు నిర్భంధంలో పార్కిన్సన్ వ్యాధి మూలంగా నోరు తొస్సు పోయి కేవలం హావభావాలతోనే ప్రకటించడం తప్ప, ఆడని చేతులు గ్లాసుపుచ్చుకోలేని దురవస్థలో ఉన్న స్టాన్ స్వామి మంచి నీళ్లు తాగడానికి కనీసం ఒక ‘స్ట్రా’ (పీల్చుకునే గొట్టం) అయినా ఇస్తే గొంతు ఆర్చుకుంటానని అధికారుల్ని ప్రాధేయపడా ల్సిన స్థితి వచ్చిందంటే, ఇంతకూ మనకున్న ప్రభుత్వాలు విచారణ సంస్థలు న్యాయ వ్యవస్థలూ ఎవరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాయో ప్రశ్నించుకోవలసిన ప్రశ్న మరోసారి ఉదయిస్తోంది. నాకు ఊపిరి పోతోంది. గాలి ఆడడం లేదని అక్కడ... నాకు దప్పికవుతోంది స్ట్రా ఇచ్చి ఆదుకోమని ఇక్కడ! దళిత వర్గాలపై అక్కడా, ఇక్కడా ఖండాలు, ఖండాంతరాల మధ్య తేడా లేకుండా ఎక్కుపెట్టిన అమా నుష చట్టాలు ఒక్క సత్యాన్ని మరోసారి బోధిస్తున్నాయి. ఎన్నికలలో గెలుపు గుర్రాలకోసం ధనస్వామ్య ప్రతినిధులకు దళితుల ఓట్లు కావాలి కాని వాళ్ల నోళ్లు మూసేయాలి– ఇదీ అసలు వ్యూహరచన. ఫాదర్ స్టాన్ స్వామి జైలులో కోర్టు కస్టడీలో ఉండగానే వైద్యం లేక అనేక ఈతిబాధలతో ఆకస్మికంగా చనిపోయిన తరువాత అంతకుముందు ఆయనకు చివరి క్షణంలో కూడా బెయిల్ నిరాక రించిన కోర్టు హడావుడిగా సమావేశమై ‘స్టాన్ స్వామి’ ఆకస్మిక మృతి పట్ల కోర్టు వినమ్రతతో నివాళులర్పిస్తోంది. మా విషాదాన్ని ప్రకటిం చడానికి మాకు మాటలు చాలవు’’ అని ప్రకటించుకుంది! భీమా కోరెగాం దళిత సభల పేరిట జరిగిన పలువురి అరెస్టులలో భాగంగా నిర్బంధంలోకి తీసుకున్న 15 మంది నిందితులు శాంతియుత ప్రజాందోళనకారులు ‘ఉగ్రవాదుల’తో సంబంధాలున్నవారూ కారు. కనుకనే అరెస్టుచేసిన ఆ 15 మందినీ వెంటనే విడుదల చేయాలని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల పరిరక్షణా సంస్థ అధిపతి మిఖా యెల్ బాచ్లెట్ కోరారు. ఏ ఒక్కరి అభిప్రాయ స్వేచ్ఛను, సమావేశ స్వేచ్ఛను అడ్డుకోరాదని ఇవి పౌరుల ప్రాథమిక హక్కులనీ అందుకు వారి డిటెక్షన్లు మార్గం కాదనీ ఆమె స్పష్టం చేశారు. అందుకుగాను సమాచార సాంకేతిక చట్టంలోని ‘66-ఎ’ క్లాజును రద్దు చేసిన 2015 నాటి తన తీర్పును ఇంతకాలం అమలు చేయ కుండా ఉన్నందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం విస్మయం ప్రక టిస్తూ కేంద్రానికి నోటీసు ఇవ్వడం మరో కొసమెరుపు! ఎందుకంటే కోర్టు తీర్పు వచ్చి ఆరేళ్లు గడిచిపోయినా ఆ ‘66-ఎ’ క్లాజు సెక్షన్ కిందనే మగ్గుతున్న 745 కేసులు ఇంకా అలా ఉండిపోయాయి. (శ్రేయసింఘాల్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్ బెంచ్ తీర్పు)! సుప్రసిద్ధ చరిత్రకారుడు రామ చంద్ర గుహ స్టాన్స్వామి మృతి న్యాయవ్యవస్థ జరిపిన హత్య, ఇందుకు కోర్టులు ఉమ్మడిగా బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు! బహుశా అందుకనే ఆదివాసీ ప్రజలకు నీళ్లు, అటవీ సంపద, ఆదివాసీ భూముల రక్షణ కోసం 51 సంవత్సరాలుగా నిరంతరం పోరాడుతూ వచ్చిన ఫాదర్ స్టాన్స్వామిలో మూర్తీభవించి ఉన్న గొప్ప మానవతా లక్షణాలకు ‘హిందూ’ సంపాదకుడు ఎన్. రామ్, సుప్రీం మాజీ న్యాయమూర్తి మదన్లోకూర్ జోహారులర్పించారు! కోర్టుల ప్రాసిక్యూషన్ వైఖరి ‘అమానుషం’ అని వర్ణించారు! అందరి కన్నా మిన్నగా ఫాదర్ స్టాన్ స్వామి చనిపోయే గడియలలో చేసిన ప్రకటన మరింత ఆత్మ విశ్వాసానికి ప్రతీక. ఇప్పటికీ మనం కలిసి కట్టుగానే బృందగానం చేద్దాం- పంజరంలో ఉన్న పక్షి చివరి క్షణం దాకా అలా గొంతెత్తి పాడుతూనే ఉంటుందని మరచిపోరాదు! ఈ సందేశాన్నే మరొకలా ఇక్కడ నల్ల మరియమ్మ మాటల్లో వినిపిస్తున్నాడు ఓ కవి. ‘‘రెండు కాసుల కానుకిచ్చిన వృద్ధురాలు కన్నా ఈ దళిత మరియమ్మ బహు ‘ధనికురాలు’. తాను తీయని సొమ్ముకు బలవంతంగా తన ప్రాణం అర్పించింది! ఈమెకు పరలోకపు మార్గం దయ చేయండి అయిననూ మా చిత్తము కాదు తండ్రీ ఈ లోకపు పోలీస్ చిత్తమే సిద్ధించుగాక..! ప్రభువా! ఈ పరలోకపు సమూహంలో మరియమ్మ భూమ్మీద చిత్రపటంతో ఆమె కుమారుడు కన్నీళ్లతో ఆమె కుమార్తె రోదిస్తూ ఎవరికి ఎవరి జాడా లేకుండా ఉన్నపుడు... ప్రభుత్వం చేతిలో మాయాజాలపు టోపీలోంచి ఒక ఉద్యోగం మెరుపులా బయటకు వచ్చి కొన్ని కన్నీళ్లు తుడుస్తుంది. ఎలా.. పదిహేను లక్షల నగదు చెక్కు మీద సంతకం ఎర్రటి నెత్తుటి జీరతో మెరుస్తూ ఉంటుంది. మళ్లీ ఓట్ల వర్షం కురుస్తుంది. ఈ సారి పథకం మారి మరో పోలీస్ స్టేషన్లో ఇంకో సువార్తమ్మ చనిపోయేదాకా మరియమ్మ పరిహారాన్నే వల్లెవేస్తాం! కాకపోతే నిందితుల పేర్లు మారుతూ ఉంటాయి. హతుల పేర్లతో జీవగ్రంథం నిండిపోతుంది!!’’ కనుకనే ఆశయాలు సంఘర్షిస్తున్న వేళ ఆయుధం అలీనం కాదన్న నానుడి పుట్టుకొచ్చి ఉంటోంది!! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నయా గ్యాంగ్..
మానవహక్కుల పరిరక్షణ ముసుగులో అరాచకాలు సెటిల్ మెంట్లు.. బెదిరింపులు.. భూ దందాలు పోలీసులకు సైతం బ్లాక్ మెయిల్ కళ్లు చెదిరే భవంతులు అధునాతన సౌకర్యాలు పోలీసుల అదుపులో సాదత్ అహ్మద్ ఉలిక్కిపడ్డ పాండు బస్తీ నగరంలో నయా గ్యాంగ్ పుట్టుకొచ్చింది.. సిటీలో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ను తలదన్నే రీతిలో దందాలు చేస్తోంది. మానవహక్కుల సంఘం ముగుసులో అరాచకాలకు పాల్పడుతోంది. లక్షల్లో సెటిల్ మెంట్లు.. కోట్లలో సంపాదన.. సామాన్యులే కాదు పోలీసుల్ని సైతం బ్లాక్మెయిల్ చేస్తోంది. భూ దందాలు.. సెటిల్ మెంట్లు.. హత్యలకు సైతం తెగబడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గ్యాంగ్ స్థావరాలపై మంగళవారం రాత్రి భారీ సంఖ్యలో జీడిమెట్ల పోలీసులు దాడులు చేశారు. విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఇంటి ముందేమో హ్యుమన్ రైట్స్ బోర్డులు.. లోపల అధునాతన సౌకర్యాలు. ఇంటి ముఖ ద్వారం నుంచి కార్యాలయం వరకు 12 సీసీ కెమెరాలు.. బాంబ్ డిటెక్టర్, కార్పొరేట్ సంస్థ కార్యాలయాలను తలదన్నేలా సంస్థ కార్యాలయం.. జిమ్.. పలు వాహనాలు, విలువైన డాక్యుమెంట్లు.. దుబాయ్కు పంపే పాస్పోర్టులు.. ఇవి పోలీసుల తనిఖీల్లో వెలుగుచూశాయి. జీడిమెట్ల పారిశ్రామిక వాడను సాయిబాబానగర్ పాండు బస్తీలో ఉంటున్న సాదత్ అహ్మద్ ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ‘ఎస్ఏ’ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. సమాజసేవ చేస్తున్నట్టుగా ఫోజులిస్తూ చీకటి కార్యకలాపాలకు తెరలేపాడు. ఓ ముఠాను నడుపుతూ దందాలకు పాల్పడుతున్నాడు. సాదత్ సంగారెడ్డిలో ఉండగా పలు హత్యా నేరాలు, దోపిడీలు, లూఠీల్లో తలదూర్చి అక్కడ నుంచి కుత్బుల్లాపూర్కు మకాం మార్చాడని పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. ఇక్కడ నుంచే ఓ గ్యాంగ్ను నిర్వహిస్తూ పలు సెటిల్మెంట్లకు తెరలేపాడు. అటు పోలీసులను.. ఇటు సామాన్య, మధ్యతరగతి ప్రజలను.. మరో వైపు పారిశ్రామికవేత్తలను హ్యుమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ముసుగులో బ్లాక్మెయిల్ చేసేవాడు. ఈ ముఠాపై పలు ఆరోపణలు, ఫిర్యాదులు అందాయి. శ్రుతి మించిన ఆగడాలు.. పోలీసులపైనే పెత్తనం.. గత కొన్నేళ్లుగా పోలీసులపైనే తిరగబడేంత స్థాయికి ఎదిగాడు సాదత్. జీడిమెట్ల పీఎస్లో పని చేసిన ఓ ఎస్ఐ నే అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించి బెదిరింపులకు దిగాడు. రూ.5 లక్షలిస్తే కేసు సెటిల్ చేయిస్తానని చెప్పి అందుకు సస్పెండైన ఓ క్రైం ఎస్ఐతో బేరసారాలు నడిపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అన్యాయంగా ఎస్ఐని బలి పశువు చేశారని అప్పటినుంచి సాదత్పై కన్నేశారు. రోజు రోజుకు మితిమీరుతున్న ఆగడాలతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. తాజాగా ఓ కానిస్టేబుల్.. అన్న భార్య విషయంలో గొడవ పడితే 498 కేసు కింద ఇరికిస్తానంటూ సదరు కానిస్టేబుల్ను బెదిరించాడు. అతని వద్ద నుంచి రూ.1.70 లక్షలు గుంజినట్టు పోలీసులు గుర్తించారు. ఇలా పోలీసులను బెదిరింపులకు గురిచేస్తూ.. ఉన్నతాధికారులే తన జేబులో ఉన్నారని చెప్పేవాడు. శివారు ప్రాంతాల్లోని పలు పోలీస్స్టేషన్లకు నాలుగైదు కార్లలో వెళ్లి దర్జాగా వెళ్లి సీఐ స్థాయి అధికారులపై సైతం బ్లాక్ మెయిల్కు దిగేవాడని తెలిసింది. అంతేకాకుండా సామాన్య ప్రజలను సైతం ముప్పు తిప్పలు పెడుతూ వచ్చాడు. భార్యాభర్తల పంచాయితీలను సెటిల్మెంట్ చేస్తానని చెప్పి పలువురిని లొంగ దీసుకుని బెదిరింపులకు గురిచేశారని బాలానగర్ డీసీపీ ఏ.ఆర్.శ్రీనివాస్కు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇలా ఇతని ఆగడాలు శృతి మించడంతో పోలీసులు పకడ్బందీగా ఏడు కేసుల్లో ప్రధాన నిందితుడిగా చేర్చి అదుపులోకి తీసుకుని రహస్య విచారణ చేపట్టారు. గతంలో ఇతని ఆగడాలపై ‘సాక్షి’లో ‘ఇక్కడా ఉన్నాయి స్నేక్ గ్యాంగ్’ అన్న కథనం ప్రచురితం కాగా అప్పట్లో చర్చానీయాంశంగా మారింది. ఈ విషయంలో కూడా పోలీసులు మరింత లోతుగా దృష్టి సారించి వేట ముమ్మరం చేశారు. ఎట్టకేలకు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తున్నారు. భారీ బలగాలతో దాడులు.. జీడిమెట్ల, టాస్క్ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఈ ముఠాపై దాడి చేశారు. 21 మందిని అదుపులోకి తీసుకున్నారు. రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. వారి ఇళ్లపైనా దాడి చేసి విలువైన డాక్యుమెంట్లను సీజ్ చేసి 7 కేసుల్లో నిందితులుగా నమోదు చేశారు. బాలానగర్ ఏసీపీ నంద్యాల నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు చంద్రశేఖర్, వెంకటేశ్వర్లు, మోహన్రెడ్డి, పది మంది ఎస్ఐలు సుధాకర్, భూపాల్గౌడ్, వీరప్రసాద్, శ్రీని వాస్, 20 మంది కానిస్టేబుళ్లు దాడులు కొనసాగిం చారు. బుధవారం జీడిమెట్ల పోలీస్స్టేషన్లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ నర్సిం హారెడ్డి దాడుల అనంతరం విలేకరులకు తెలిపారు.