breaking news
Professor died
-
ఐదుగురు ఉగ్రవాదుల ఎన్కౌంటర్
శ్రీనగర్: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఆదివారం మట్టుబెట్టాయి. వారిలో ఓ హిజ్బుల్ అగ్రనేతతోపాటు ఇటీవలే ఆ సంస్థలో చేరిన విశ్వవిద్యాలయ అధ్యాపకుడు కూడా ఉన్నారు. ఎన్కౌంటర్ సమయంలో భద్రతా దళాలపైకి రాళ్లు విసిరేందుకు వచ్చిన ఆందోళనకారులు ఐదుగురు మరణించారు. శ్రీనగర్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన 24 గంటల్లోపే ఈ ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. జమ్మూ కశ్మీర్లోని షోపియాన్ జిల్లా బదిగాం గ్రామం సమీపంలో తాజా ఎన్కౌంటర్ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు పోలీసు సిబ్బంది, ఓ ఆర్మీ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. బదిగాం గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారాన్ని అందుకున్న భద్రతా దళాలు.. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు జరుపుతుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారనీ, ఎదురుకాల్పుల్లో ఐదుగురు మరణించారని పోలీసులు తెలిపారు. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సద్దాం పద్దేర్, కశ్మీర్ విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్ అధ్యాపకుడిగా పనిచేసే మహ్మద్ రఫీ భట్తోపాటు తౌసీఫ్ షేక్, ఆదిల్ మలిక్, బిలాల్ అలియాస్ మోల్విలు ఎన్కౌంటర్లో చనిపోయారు. భద్రతా దళాలకు, రాళ్లు విసిరేందుకు వచ్చిన ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు చెలరేగడంతో పలువురు నిరసనకారులకు గాయాలయ్యాయనీ, ఆ తర్వాత వైద్యశాలలో చికిత్స పొందుతూ వారిలో ఐదుగురు మరణించారని ఓ అధికారి చెప్పారు. శుక్రవారం చేరి ఆదివారమే మృత్యు ఒడికి కశ్మీర్ విశ్వవిద్యాలయంలోని సోషియాలజీ విభాగంలో సహాయ అధ్యాపకుడిగా పనిచేసే రఫీ భట్ శుక్రవారమే ఇల్లు వదిలిపెట్టి వెళ్లి హిజ్బుల్ ముజాహిదీన్లో చేరాడు. పోలీసులకు లొంగిపోవాల్సిందిగా అతణ్ని పదేపదే కోరామనీ, అతని కుటుంబ సభ్యుల ద్వారానైనా ఒప్పించాలని వారిని ఎన్కౌంటర్ స్థలానికి తీసుకొచ్చామని కశ్మీర్ ఐజీ ఎస్పీ పనీ చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే భట్ భద్రతాదళాల కాల్పుల్లో మరణించాడు. ఆదివారం ఉదయమే భట్ తన తండ్రికి ఫోన్ చేసి, ‘మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను అల్లా వద్దకు వెళ్తున్నందున ఇదే నా చివరి ఫోన్ కాల్’ అని చెప్పాడు. -
అనుమానాస్పదస్థితిలో అధ్యాపకుడి మృతి
కావలిఅర్బన్: అనుమానాస్పదస్థితిలో అధ్యాపకుడు మృతిచెందిన సంఘటన బుడమగుంట గేటు సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. తుఫాన్నగర్కు చెందిన బోగిశెట్టి శ్రీనివాసులు (25) రైలు పట్టాలపై మృతి చెంది కన్పించారు. రైల్వే పోలీసులు, బంధువుల కథనం మేరకు వివరాలు.. స్టీలు సామాను వ్యాపారం చేసుకునే కృష్ణయ్య, భాస్కరమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు శ్రీనివాసులు నెల్లూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. వెంగళరావునగర్లో గురువారం రాత్రి జరిగిన తన సోదరి శ్రీలేఖ వివాహానికి శ్రీనివాసులు కావలి వచ్చారు. పెళ్లిలో చాలా ఉత్సాహంగా గడిపారు. తెల్లవారుజామున నిద్రించేందుకు తన రూముకు వెళ్లారు. 4.30 సమయంలో బంధువులు ఫోన్చేస్తే రూములో ఉన్నానని చెప్పారు. శుక్రవారం ఉదయం బుడమగుంట గేటు సమీపాన దిగువ లైను రైలుపట్టాల వద్ద పడి ఉన్న శ్రీనివాసులు మృతదేహాన్ని కీ మ్యాన్ రమేష్ గుర్తించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న కటుంబసభ్యులు, బంధువులు క న్నీరుమున్నీరయ్యారు. శ్రీనివాసులు మృతి అనుమానాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పందిటి కామరాజు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.