breaking news
Potladurti Brothers
-
పోట్లదుర్తి బ్రదర్సా...మజాకా..
అక్రమ మైనింగ్ను అరికట్టాల్సిన సమయంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించారు. నాలుగేళ్లుగా కొండను ఇష్టారాజ్యంగా కొల్లగొడుతున్నా మౌనం దాల్చారు. ప్రభుత్వ ఆదాయానికి గణనీయంగా గండికొట్టి కోట్లాది రూపాయలు ఆర్జించిన తర్వాత నోటీసులిచ్చి సరిపెట్టారు. నిబంధనలు మేరకు అపరాధ రుసుం వసూలు చేయడానికి ఇప్పటికీ మీనమేషాలు లెక్కిస్తున్నారు. చిన్న తప్పునకే సామాన్యులపై విరుచుకుపడే అధికార యంత్రాంగం పోట్లదుర్తి బ్రదర్స్ పట్ల ఎప్పటిలా భక్తి చాటుకుంటూనే ఉన్నారు. సాక్షి, కడప : ముద్దనూరు మండలం చిన్నదుద్యాల గ్రామంలో పోట్లదుర్తి బ్రదర్స్ క్రషర్ ఏర్పాటు చేసి కొండను కొల్లగొట్టారు. నాలుగేళ్లుగా ఎలాంటి మైనింగ్ అనుమతులు లేకపోయినా ఇష్టారాజ్యంగా డైనమేట్లతో పేల్చి కంకర కొట్టారు. ఈ శబ్దాలకు చిన్నదుద్యాల గ్రామస్థుల ఇళ్లు నెర్రలుబారినా అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ప్రభుత్వం గణనీయంగా ఆదాయం కోల్పోతున్నా అధికారమత్తు నుంచి తేరుకోలేదు. పెద్దఎత్తున అక్రమ వ్యవహారం ఎప్పుడైనా మెడకు చుట్టుకుంటుందని భావించి ఎన్నికలు సమీపించడంతో నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. మైనింగ్ అనుమతులు లేకుండానే.... మైనింగ్ అనుమతులు లేకుండా పోట్లదుర్తి బ్రదర్స్ క్రషింగ్ యూనిట్ను ఏర్పాటు చేశారు. పోట్లదుర్తికి చెందిన జి చెన్నకేశవనాయుడు (సురేష్నాయుడు బినామీ)కు చిన్నదుద్యాల గ్రామం సర్వే నంబర్ 242లో 10.11హెక్టార్లులో మైనింగ్ లీజు దక్కింది. 2015లో లీజు లభించినా మైనింగ్ అనుమతులు పొందలేదు. కాలుష్య నియంత్రణ మండలి అనుమతితో నిమిత్తం లేకుండా అక్రమంగా మైనింగ్ కొనసాగించారు. గతేడాది నవంబర్ 30న కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నారంటూ యర్రగుంట్ల మైనింగ్ ఏడీ నోటీసు మాత్రమే జారీ చేశారు. అవేవీ లెక్కచేయని పోట్లదుర్తి బ్రదర్స్ తమ అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తూనే వచ్చారు. 5లక్షల క్యూబిక్ మీటర్లు మైనింగ్.... పోట్లదుర్తి బ్రదర్స్ నేతృత్వంలో చేపట్టిన క్రషింగ్ యూనిట్ ద్వారా 5.10లక్షల క్యూబిక్ మీటర్లు స్టోన్ క్రషర్ అక్రమంగా మైనింగ్ చేశారు. ఆమేరకు యర్రగుంట్ల మైనింగ్ ఏడీ వెంకటేశ్వర్లు నిర్ధారించారు. ఇందుకు రూ.21.67కోట్లు అపరాధ రుసుం చెల్లించాల్సిందిగా ఫిబ్రవరి 27న డిమాండ్ నోటీసు జారీ చేశారు. నోటీసుకు 90రోజుల లోపు జవాబు ఇవ్వాలి. కానీ 120 రోజులు గడుస్తున్నా పోట్లదుర్తి బ్రదర్స్ బినామీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆర్ఆర్ యాక్టు ప్రయోగించి జప్తు చేయాల్సిన యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. అటువైపు కన్నెత్తి చూసే సాహాసం చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. నాటి స్వామిభక్తిని నేటికీ అధికార యంత్రాంగం కొనసాగిస్తుండడమే అందుకు కారణంగా పలువురు చెప్పుకొస్తున్నారు. ఇప్పటికైనా నోటీసు మేరకు ఆర్ఆర్ యాక్టు ప్రయోగించాల్సిన ఆవసరముంది కలెక్టర్ హరికిరణ్ జోక్యం చేసుకుంటే తప్పా పోట్లదుర్తి నాయుడు నుంచి ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం దక్కే అవకాశం లేదని జిల్లా వాసులు విశ్వసిస్తున్నారు. -
అన్నదమ్ములు.. అవినీతి అనకొండలు..
గ్రామానికి ఎక్కువ...మండలానికి తక్కువ స్థాయి కలిగిన రమేష్కు సీఎం చంద్రబాబు రాజ్యసభ సభ్యుడి పదవి కట్టబెడితే అడ్డంగా దోపిడీ చేస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెల్లడించారు. పోట్లదుర్తి బ్రదర్స్ అక్రమాలకు అంతే లేకుండా పోయిందని ఆరోపించారు. అందుకు నిదర్శనంగా జలయజ్ఞం పెండింగ్ పనులు నిలుస్తున్నాయి.వందల కోట్లల్లోనిలిచిపోయిన పనులు వేలకోట్లకు దక్కించుకున్నారు. నీరు– చెట్టు పథకంతో నిధులు కొల్లగొట్టారు. ఆర్టీపీపీలో ఉద్యోగాలు, కాంట్రాక్టు పనులు అడ్డంగా దోచేశారు. తుదకు ఐరన్ స్క్రాప్ను కూడా వదల్లేదు. పెన్నానది కేంద్రంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడి కోట్లు ఆర్జించారు. అధికారం అండతో ఏటిపో రంబోకు భూమిని ఆక్రమించి సాగుచేస్తు న్నారు. రాజ్యసభ సభ్యుడు రమేష్ అవినీతి జిల్లా దాటి రాష్ట్రవ్యాప్తంగా విస్త రించిన నేపథ్యంలో సాక్షి ప్రత్యేక కథనం. ‘గ్రామానికి ఎక్కువ.. మండలానికి తక్కువ’ స్థాయి కల్గిన వారే అయినప్పటికీ ప్రభుత్వ అధినేత వద్ద పరపతి మెండుగాఉంది... ఆపై నడుచుకుంటూ వచ్చి హోదా వరించింది... అధికారం గుప్పిట్లో ఉండటంతో ప్రభుత్వ పథకాలతో కోట్లాది రూపాయాలు అప్పనంగా దండుకున్నారు... మరోవైపు పెన్నానదికి గర్భశోకం కల్గించి అక్రమార్జనకు తెరలేపారు... ఇంకోవైపు స్వగ్రామం చెంతనే ఆర్టీపీపీ ఉండటం అందివచ్చిన వరంగా మారింది... నిధుల దోపిడీకి పాల్పడుతూనాసిరకం పనులకుశ్రీకారం చుట్టారు...పెండింగ్లో ఉన్న జలయజ్ఞం పనుల అంచనాలను ఉన్నత స్థాయి పరపతితో అమాంతం పెంచుకొని వేలాది కోట్లు స్వాహా చేశారు... వెరసి వారు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’గా మారింది. వారు ఎవరో కాదు ‘పోట్లదుర్తి బ్రదర్స్’. సీఎం రమేష్, సీఎం సురేష్గా పిలువబడే వారి అవినీతి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది. సాక్షి టాస్క్ఫోర్స్ : ప్రభుత్వ అండదండలతో పోట్లదుర్తి సోదరులు సీఎం రమేష్ నాయుడు, సీఎం సురేష్ నాయుడు అక్రమార్జనకు అడ్డే లేకుండా పోయింది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోత్సాహంతో వీరు అంచెలంచెలుగా ఎదిగారు. జలయజ్ఞం పెండింగ్ పనులకు అమాంతంగా రేట్లు పెంచేసి, నామినేషన్పైన అప్పగించడం వరంగా మారింది. మునుపు పనులు చేసిన కాంట్రాక్టర్తో నిమిత్తం లేకుండా.. పెండింగ్లో ఉన్న పనులకు 200 శాతం అధికంగా రేట్లు పెంచి అప్పనంగా అప్పగించారు. జిల్లాలోని జీఎన్ఎస్ఎస్ పథకంలో భాగంగా ఫ్లడ్ఫ్లో కెనాల్ నుంచి ఇలాంటి తంతు ఆరంభమైంది. ఈ కెనాల్లో 29వ ప్యాకేజీలో రూ.52 కోట్ల పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో పెండింగ్లో పడ్డాయి. నిలిచిపోయిన ఆ పనులకు టీడీపీ సర్కారు అంచనాలు పెంచి రూ.175.63 కోట్లకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కాంట్రాక్టు సంస్థ అయిన రిత్విక్కు అప్పగించింది. ఇలా జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ తదితర పథకాలల్లో నిలిచిపోయిన రూ.800 కోట్ల పెండింగ్ పనుల అంచనాలు దాదాపు రూ.3 వేల కోట్లకు పెంచి రమేష్నాయుడు సంస్థకు అప్పగించారు. ‘సీఎం’తో చొరవ.. హోదా కారణంగా.. ముఖ్యమంత్రి అంతరంగికులుగా గుర్తింపు పడ్డ రమేష్నాయుడు సోదరులు జిల్లాలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఏ స్థాయి అధికారి అయినా వీరి ఎదుట చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. ఎక్కువ, తక్కువ మాట్లాడితే దాడి చేయడానికి కూడా వెనకాడని స్థితికి చేరారు. ఈ కారణంగా వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో పెన్నానది ఏటి పొరంబోకు భూములను ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఆక్రమించి స్మృతి వనాలు నిర్మించారు. సర్వే నంబర్ 906లో 736 ఎకరాల ఏటి పొరంబోకు భూమి ఉంది. ఇందులో 470 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ప్రత్యేకించి వీరి కుటుంబ సభ్యుల నేతృత్వంలో 20 ఎకరాలు ఆక్రమించారని.. రెవెన్యూ అధికారులు స్మృతి వనానికి, ఏటి పోరంబోకు భూమికి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ స్థలాల్లో ఏకంగా గదులు నిర్మించి, ఇటుకల తయారీ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే హనుమనగుత్తి వద్ద వంక, ఏటి పొరంబోకు భూమినంతా ఆక్రమించడంతో వంక పూడిపోయింది. క్యూకట్టిన జలయజ్ఞం పెండింగ్ పనులు జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ జలయజ్ఞం పనులు కొన్ని పెండింగ్లో పడ్డాయి. ఈ పనులన్నీ తాజా అంచనాలంటూ అమాంతం పెంచి ఎంపీ రమేష్నాయుడు కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. అలా అప్పగించిన వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. కుందూ– పెన్నా వరద కాలువ పనుల్లో 29వ ప్యాకేజీలో రూ.52 కోట్ల పనులు నిలిచిపోయాయి. అవే పనులను 240 శాతం అధికంగా రేట్లు పెంచి రూ.175.63 కోట్లకు అప్పగించారు. అలాగే 27వ ప్యాకేజీలో నిలిచిపోయిన పనులు రూ.126 కోట్లకు అప్పగించారు. సీబీఆర్ కుడి కాలువ పనులు రూ.27.15 కోట్లు, ముచ్చుమర్రి కెనాల్ విస్తరణ పనులు రూ.29 కోట్లు, గొడ్డుమర్రి ఆనకట్ట పనులు రూ.24.5 కోట్లు, హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్–2లో 2, 3 ప్యాకేజీలు రూ.192 కోట్లు, 6, 10 ప్యాకేజీలు రూ.71 కోట్లు, 9, 13, 17 ప్యాకేజీలు రూ.124.6 కోట్లకు అప్పగించారు. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులు రూ.29 కోట్ల విలువైనవి మిగిలిపోగా.. వాటిని రూ.151 కోట్లకు సీఎం రమేష్ కంపెనీకి అప్పగించారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ రూ.432 కోట్లు కాగా.. అదనంగా రూ.143 కోట్ల అంచనాలు పెంచి అప్పగించారు. ఇలా రాయలసీమ వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న వందలాది కోట్ల పనులు వేల కోట్లుకు రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సోదరుని పరపతి.. జిల్లాలో సాగిలపడే యంత్రాంగం.. వెరసి పెన్నానది ఆధారంగా సురేష్నాయుడు ఇసుక వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రూ.కోట్లు కొల్లగొట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామ సమీపాన పెన్నానదిలో క్వారీ పేరుతో దోపిడీ చేశారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇసుక క్వారీ మంజూరు చేయకపోవడం, ఆర్టీపీపీలో వేలాది కోట్ల నిర్మాణ పనులు కొనసాగుతుండడంతో ఇసుక ద్వారా అక్రమార్జనకు పాల్పడ్డారు. హనుమనగుత్తి క్వారీలోకి సురేష్నాయుడు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు కాకుండా మరే ట్రాక్టర్లకు అనుమతులు ఉండేవి కావు. అటు ప్రొద్దుటూరు, ఇటు ఎర్రగుంట్ల, ఆర్టీపీపీ పరిసర ప్రాంతాల్లో ఇసుక కావాలంటే ట్రాక్టర్కు రూ.2,500 చెల్లించి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా అనధికారికంగా రుసుం వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన దాని కంటే ఎక్కువగా వంద రెట్లు అధికంగా ఇసుక తోడేసినా అడిగే అధికారే లేకపోయారు. ఇక్కడి ఇసుకను ఆర్టీపీపీలో డంప్ చేసి, అక్కడి నిర్మాణ పనులకు విక్రయించారు. ఈ వ్యవహారంపై అప్పట్లో ఆర్టీపీపీలో పెద్ద దుమారమే రేగింది. దౌర్జన్యాలు పోట్లదుర్తి గ్రామంలో సీఎం రమేష్ కుటుంబ సభ్యుల దౌర్జన్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గట్టిగా ఎవరైనా ప్రతిఘటిస్తే అధికారుల ద్వారా అలాంటి వారి మెడలు వంచుతున్నారు. శివాలయం నడిగడ్డ వద్ద 100 ఎకరాలకు పైగా భూమలు ఉన్నాయి. వాటిపై సురేష్నాయుడు కన్ను పడింది. ఆ భూములు తమకే ఇచ్చేయాలంటూ ఒత్తిడి పెంచారు. ఇష్టమున్న లేకున్నా అప్పగించాలని బలవంతం చేశారు. పట్టా హక్కుదారుకు ఎకరాకు రూ.7 లక్షలు చెల్లించి స్వాధీనం చేసుకున్నారు. డీకేటీ పట్టాలున్న రైతులకు శఠగోపం పెట్టారు. భూములు నమ్ముకొని జీవించే వారిని జీవనోపాధి కోల్పోయేలా చేశారు. తమ వైరిపక్ష సామాజిక వర్గంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. అలాంటి వారిపై మైనింగ్ అధికారులను ప్రయోగించి గనులు మూయించేశారు. అలాగే గనుల యజమానులు ఎవ్వరైనా సరే.. ఇతర పార్టీల వారితో వెళ్లకూడదంటూ హుకుం జారీ చేస్తున్నారు. ఇవన్నీ ఇప్పటికీ చోటు చేసుకుంటుండటం గమనార్హం. కల్లు వ్యాపారం నుంచి అంచెలంచెలుగా ఎదిగి.. చింతకుంట సుబ్బనాయుడుది జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మండలంలో పోట్లదుర్తి గ్రామం. సాధారణ రైతు కుటుంబానికి చెందిన ఆయన తన కుమారులు చిన్న, చిన్న వ్యాపారాల వైపు వెళ్లేలా ప్రోత్సహించారు. ఈ క్రమంలో కమలాపురం, ప్రొద్దుటూరు ప్రాంతంలో కల్లు వ్యాపారం ఆరంభించారు. తదుపరి తన పెద్ద కుమారుడు మునిస్వామినాయుడు తన వ్యాపార వారసత్వంగా సారాయి అంగళ్ల వేలం పాటలలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సారాయి వ్యాపారం క్రమక్రమంగా విస్తరించింది. జిల్లాలో పలు ప్రాంతాలతోపాటు ఇతర జిల్లాల్లో సారాయి వ్యాపార భాగస్వామిగా మునిస్వామినాయుడు వ్యాపారాన్ని విస్తరించారు. అందులో భాగంగా చిత్తూరు జిల్లాలో మద్యం వ్యాపారుల సిండికేట్ నిర్వాహకుల చెంతకు మునిస్వామినాయుడు తన తనయుడు చింతకుంట మునెయ్యగారి రమేష్నాయుడు (సీఎం రమేష్ నాయుడు)ను చేర్చారు. అక్కడ మద్యం వ్యాపారంలో దూసుకుపోయిన సీఎం రమేష్కు చంద్రగిరి ఎమ్మెల్యే రామ్మూర్తినాయుడితో సాన్నిహిత్యం ఏర్పడింది. 1995లో అనూహ్యంగా ముఖ్యమంత్రి పీఠాన్ని చంద్రబాబునాయుడు వరించడం సీఎం రమేష్కు లాభించింది. చిత్తూరు జిల్లాలో ఉన్న సంబంధాల రీత్యా రమేష్నాయుడు తక్కువ కాలంలోనే చంద్రబాబు అనుచరుడిగా చేరిపోయారు. ఆ తర్వాత 1999లో కాంట్రాక్టు సంస్థ ఏర్పాటు చేసి అనతి కాలంలోనే భారీ టర్నోవర్ దిశగా చేరింది. కాంట్రాక్టర్గా, వ్యాపారవేత్తగా సీఎం రమేష్ నిలదొక్కుకున్న తర్వాత తన సోదరుడు సురేష్నాయుడు పోట్లదుర్తి సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే మునిస్వామి నాయుడు కుటుంబంలో మొదటి రాజకీయ పదవి. అంతకు మునుపు మునిస్వామి తమ్ముడు గోవర్ధన్నాయుడు సతీమణి భాగ్యమ్మ ఎర్రగుంట్ల మండలాధ్యక్ష పదవికి ఎంపికయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అనూహ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012లో సీఎం రమేష్ తొలిసారి రాజ్యసభకు ఎంపికయ్యారు. తర్వాత 2018 ఏప్రెల్ 3న రెండో పర్యాయం రాజ్యసభ సభ్యుడిగా మరోమారు ఎంపికయ్యారు. పోట్లదుర్తి మినహా ఎర్రగుంట్ల మండల వ్యాప్తంగా కూడా ప్రజాబలం లేని రమేష్నాయుడికి రాజ్యసభ సీటు రెండుసార్లు వరించడం గమనార్హం. అన్న ప్రాబల్యంతో సురేష్నాయుడు ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. బెల్టు చోరీలో ప్రధాన పాత్ర ఆర్టీపీపీలోని కోల్ ప్లాంట్ బెల్టు చోరీలో సురేష్నాయుడు అనుచరుల పాత్ర ప్రధానంగా ఉంది. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. జెన్కో ఎండీ స్థాయిలో పరిచయాలు ఉండటంతో సీఈ స్థాయి అధికారి నోరుమెదపలేని పరిస్థితి. ఎట్టకేలకు కల్లమల్ల పోలీసుస్టేషన్లో ఎస్పీఎఫ్, కోల్ప్లాంట్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని అధికారులను బతిమలాడి సగం బెల్టును ఆర్పీపీపీకి తీసుకు వచ్చారు. దీనిపై ఏపీ జెన్కో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి, చోరీ వాస్తవమేనని ఏపీ జెన్కో ఉన్నతాధికారులకు నివేదికలు కూడా ఇచ్చారు. లక్షలు విలువ చేసే బెల్ట్ అర్ధాంతరంగా కనుమరుగు కావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి నిగ్గు తేల్చారు. ఆర్టీపీపీలోని కోల్ ప్లాంట్ బెల్టు చోరీలో సురేష్నాయుడు అనుచరుల పాత్ర ప్రధానంగా ఉంది. ఈ విషయం అధికారులకు తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. జెన్కో ఎండీ స్థాయిలో పరిచయాలు ఉండటంతో సీఈ స్థాయి అధికారి నోరుమెదపలేని పరిస్థితి. ఎట్టకేలకు కల్లమల్ల పోలీసుస్టేషన్లో ఎస్పీఎఫ్, కోల్ప్లాంట్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందోనని అధికారులను బతిమలాడి సగం బెల్టును ఆర్పీపీపీకి తీసుకు వచ్చారు. దీనిపై ఏపీ జెన్కో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి, చోరీ వాస్తవమేనని ఏపీ జెన్కో ఉన్నతాధికారులకు నివేదికలు కూడా ఇచ్చారు. లక్షలు విలువ చేసే బెల్ట్ అర్ధాంతరంగా కనుమరుగు కావడంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టి నిగ్గు తేల్చారు. ఆర్టీపీపీ.. అక్షయపాత్ర పోట్లదుర్తి బ్రదర్స్ బినామీ కాంట్రాక్టర్ సంస్థలైన శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, ద్వారకా కన్స్ట్రక్షన్స్ పనులు దక్కించుకోగా.. సురేష్నాయుడు కనుసన్నల్లో సాగాయి. ఆర్టీపీపీ సీఎస్ఆర్ ఫండ్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్షబులిటీ) పనుల్లో దోపిడీ చేశారు. ఎర్రగుంట్ల మండలంలో రూ.41 కోట్లతో వివిధ రోడ్ల పనులు చేశారు. చిలంకూరు నుంచి పోట్లదుర్తి వరకు రూ.16 కోట్లు, పి.గోపులాపురం నుంచి సిరిగేపల్లె వరకు రూ.1.20 కోట్లు, పోట్లదుర్తి గనుల రక్షణ గోడ పేరుతో రూ.1.30 కోట్లు, మాలపాడు నుంచి నిడిజువ్వి వరకు పొలాల మీదుగా రూ.4 కోట్లతో పనులు, ఎర్రగుంట్ల నుంచి వీ.ఎన్ పల్లె వరకు రూ.15 కోట్లు, పోట్లదుర్తి నుంచి ఎర్రగుంట్ల వరకు ప్యాచ్ వర్కులకు రూ.4 కోట్లు.. ఈ పనులన్నీ సురేష్నాయుడు నేతృత్వంలో సాగాయి. సీఎస్ఆర్ ఫండ్ కింద మంజూరైన పనులన్నీ నాసిరకంగా చేపట్టారు. ఎక్కడికక్కడ సీసీ రోడ్లు బీటలు వారాయి. తక్కువ సమయంలోనే సిమెంటు రోడ్లు నెర్రెలు బారి దర్శనమిస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా చూస్తుండిపోయారు. మితిమీరిన దోపిడీ పోట్లదుర్తి బ్రదర్స్ దోపిడీ మితి మీరింది. అధికారం అండతో హనుమనగుత్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఇసుకను కొల్లగొట్టి రూ.కోట్లు ఆర్జించారు. ఇదే గ్రామ సమీపంలో పునరావాస కేంద్రం ఏర్పాటుకు నిధుల అంచనాలు పెంచి దోచుకున్నారు. వీరు ఏమి చేసినా ప్రశ్నించే అధికారులు లేరు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పునరావాస కేంద్రంలో నివాసాలు లేకపోయినా వందలాది దొంగ (నకిలీ) ఓట్లు ఎక్కించారు. – సత్యనారాయణరెడ్డి, ఎంపీటీసీ, హనుమనగుత్తి నీరు– చెట్టు పేరుతో దోచేశారు నీరు– చెట్టు పథకం పేరుతో పోట్లదుర్తి బ్రదర్స్ దోచేశారు. తూతూ మంత్రంగా పనులు చేసి బిల్లులు చేసుకున్నారు. అధికార పార్టీ నాయకులు కావడంతో అడిగేవారే లేరు. పోట్లదుర్తి నుంచి చిలంకూరు వరకు నీరు–చెట్టు పనుల్లో భాగంగా వేల మొక్కలు నాటినట్లు రికార్డుల్లో ఉన్నా.. ఒక్క మొక్క కూడా పెరగలేదు. రోడ్డుకు ఇళ్లు పోగోట్టుకున్న వారికి నష్ట పరిహారం చెల్లించకుండా ..నూతనంగా నిర్మించిన గృహాల్లో చేరాల్సిందిగా బలవంతంగా తరలించారు. తక్కువ డబ్బు ఇచ్చి, రైతులను బెదిరించి, మభ్యపెట్టి వందల ఎకరాలు కొనుగోలు చేశారు. – సుధాకర్రెడ్డి, పోట్లదుర్తి అవినీతిలో ఆరితేరారు రాష్ట్రంలో అతిపెద్ద అవినీతి తిమింగళం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్నాయుడు. ప్రజల్లో పట్టు లేకపోయినా ప్రభుత్వ అధినేత వద్ద పరపతి ఉండటంతో ఇష్టారాజ్యంగా దోపిడీ పర్వం కొనసాగింది. ఆయన కుటుంబం నియంతృత్వం కారణంగా భూములు వదిలి వెళ్లాల్సిన దుస్థితి పోట్లదుర్తిలో ఉంది. వీరి కుటుంబం ప్రొద్దుటూరు కేంద్రంగా దందాలు చేస్తోంది. – హనుమంతరెడ్డి, జమ్మలమడుగు -
దారి దోపిడీ!
- ఆర్టీపీపీ కేంద్రంగా హవా నడుపుతున్న పోట్లదుర్తి బ్రదర్స్ - రూ.2.5కోట్ల రోడ్డు కాంట్రాక్టు పనులు అధికరేట్లకు అప్పగింత - 16 శాతం తక్కువ ధరకు టెండర్ కోట్ చేసిన కంపెనీకి మొండిచేయి - నిబంధనలకు తిలోదకాలిస్తున్న యంత్రాంగం సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆ ఇరువురు బ్రదర్స్ ఆర్టీపీపీని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితులమంటూ బెదిరింపులే పెట్టుబడిగా క్రమం తప్పకుండా లబ్ధిపొందుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నా, వారు సూచించిందే శాసనంగా అక్కడి యంత్రాంగం వ్యవహరిస్తోంది. మొన్న గ్రీనరీ ఏర్పాటుకు అధిక రేట్లతో టెండర్లు అప్పగించగా, ప్రస్తుతం రూ.2.5కోట్ల రోడ్డు కాంట్రాక్టు పనిని అధిక రేట్లకు కట్టబెట్టారు. తక్కువ ధరలకు టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టు సంస్థను తప్పించడంలో అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. వెర సి పోట్లదుర్తి బదర్స్కు అండగా నిలుస్తున్నారు. రామేశ్వరం నుంచి ఆర్టీపీపీ వరకు 2.5 కిలో మీటర్ల పరిధిలో సిమెంటు రోడ్డు నిర్మాణానికి ఆర్టీపీపీ శ్రీకారం చుట్టింది. తాజాగా ఆ పనిని 3.99 శాతం అధిక రేట్లకు పోట్లదుర్తి బ్రదర్స్కు అప్పగించినట్లు సమాచారం. అదేపనికి 16 శాతం తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థను అధికారులు తిరస్కరించారు. టెండరుదారులను తప్పించి ఏక టెండర్కు అధిక రేట్లకు అప్పగించి స్వామిభక్తి ప్రదర్శించారు. మొన్న గ్రీనరీ....నేడు సిమెంటు రోడ్డు... ఆర్టీపీపీలో కార్మికుల నియామకం మొదలుకుని కాంట్రాక్టుపనుల వరకూ తమ ఆధిపత్యమే చెల్లాలని పోట్లదుర్తి బ్రదర్స్ తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచారు. ఇటీవల 6వ యూనిట్ పరిధిలో గ్రీనరీ ఏర్పాటుకు రూ. 52 లక్షలతో టెండర్లు పిలిచారు. హైదరాబాద్లో డెరైక్టర్ల పరిధిలో నిర్వహించిన ఈ టెండర్లలో అధికార పార్టీ అనే పరపతి ఉపయోగించి అధిక రేట్లకు దక్కించుకున్నారు. అధిక రేట్లకు ఏకైక టెండరు దాఖలైతే రద్దుచేసి తిరిగి టెండర్లు పిలవాలని నిబంధనలు చెబుతున్నాయి. అయినా 4శాతం ఎక్కువ ధరలకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థకు టెండర్ అప్పగించారు. ప్రస్తుతం సిమెంటు రోడ్డు నిర్మాణానికి టెండర్లు నిర్వహించగా 16శాతం తక్కువ ధరలకు సరస్వతి కన్స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్ దాఖలు చేసింది. మరో రెండు సంస్థలు తర్వాత తక్కువ ధరలకు కోట్ చేశాయి. అయితే ఈ మూడింటిని అధికారులు తిరస్కరించారు. కాంట్రాక్టు చేపట్టేందుకు కావాల్సిన అర్హతలపై సాకు చూపి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. కాగా 3.99 శాతం అధిక రేట్లతో రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు అప్పగించినట్లు సమాచారం. రూ.50 లక్షలు ప్రజాధనం పరులపాలు.. రామేశ్వరం నుంచి ఆర్టీపీపీ వరకు సిమెంటు రోడ్డు పనుల్లో రూ.50లక్షల ప్రజాధనం పరులుపాలు కానుంది. రూ.2.5 కోట్లతో చేపట్టే ఆ రోడ్డు పనిని 16శాతం తక్కువ ధరలకు చేపట్టేందుకు సరస్వతి కన్స్ట్రక్షన్స్ ముందుకు వచ్చింది. ఆ సంస్థకు అప్పగించి ఉంటే రూ.40లక్షలు ప్రజాధనం మిగిలేది. అంటే రూ.2.1కోట్లకే ఆ రోడ్డు మనుగడలోకి వచ్చేది. అదే రోడ్డుకు ఆర్టీపీపీ అదనంగా మరో రూ.10లక్షలు కేటాయించింది. అంటే రూ.40 లక్షలు మిగలాల్సింది పోయి, రూ.10లక్షలు అదనంగా అప్పగిస్తోంది. వెరసి రూ.50లక్షలు ధనాన్ని వృథా చేస్తోందని పలువురు వాపోతున్నారు. ఆర్టీపీపీ ఎస్ఈ శేషారెడ్డి ఏమన్నారంటే.... ‘టెండర్లు హైదరాబాద్లో సీఈ పరిధిలో నిర్వహించారు. అక్కడే ఫైనల్ చేశారు. ఎవరు పాల్గొన్నారనే విషయం మాకు తెలియదు. రిత్విక్ కన్స్ట్రక్షన్స్కు కాంట్రాక్టును అప్పగించారు. వారితో పనులు మొదలు పెట్టిస్తున్నాం. ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు మేము వ్యవహరిస్తాం’ అని ఎస్ఈ శేషారెడ్డి వివరించారు.