breaking news
Polavaram Authority
-
ఉమ్మడి సర్వే జరపాల్సిందే!.. పోలవరం అథారిటీ భేటీలో వాడీవేడి చర్చ
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టులో గరిష్ట నిల్వ సామర్థ్యం 150 అడుగుల మేరకు నీటిని నిల్వ చేస్తే రాష్ట్రంలో ఉండనున్న ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే నిర్వహించాల్సిందేనని తెలంగాణ పునరుద్ఘాటించింది. పోలవరం బ్యాక్వాటర్తో భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వరకు గోదావరికి ఇరువైపులా తెలంగాణ పరిధిలో 892 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్టుగా తమ ఇంజనీర్లు తేల్చారని స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఉమ్మడి సర్వేను.. కిన్నెరసాని, ముర్రెడువాగులకు పరిమితం చేయకుండా 892 ఎకరాల్లో చేపట్టాలని డిమాండ్ చేసింది. బుధవారం జరిగిన పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) భేటీలో పోలవరం ముంపు ప్రభావంపై ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట విభాగం సీఈ మోహన్కుమార్, ఏపీ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. వాగుల ప్రవాహానికి బ్యాక్వాటర్ అడ్డంకి పోలవరంతో తెలంగాణలో 300ఎకరాలు ముంపు బారిన పడే అవకాశం ఉందని, దీనిపై అధ్యయనం జరిపి నివా రణ చర్యలు తీసుకుంటామని 2020 జనవరిలో జరిగిన 11వ పీపీఏ భేటీలో ఏపీ కూడా ఒప్పుకుందని మురళీధర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి సర్వే కోసం ఇటీవల క్షేత్రస్థాయి పర్య టనకు వచ్చిన ఏపీ అధికారులు.. కిన్నెరసాని, ముర్రెడువాగులకు ఉండనున్న ప్రభావంపైనే అధ్యయనం చేస్తామ న్నారని తెలిపారు. 892 ఎకరాల ముంపుపై అధ్యయనం చేయాలని తాము కోరగా, ఏపీ ప్రభుత్వ అనుమతి తీసు కుని మళ్లీ వస్తామంటూ వెళ్లిపోయారని వివరించారు. తెలంగాణలోని 35 వాగుల ప్రవాహం గోదావరిలో కలవకుండా పోలవరం బ్యాక్వాటర్ అడ్డంకిగా మారడంతో పరిసర ప్రాంతాల్లో వరదలు పోటెత్తి తీవ్ర నష్టం జరిగిందన్నారు. గత జూలైలో వచ్చిన వరదలతో 103 గ్రామాలు ప్రభావితం కాగా, 40,446 ఎకరాలు ముంపునకు గుర య్యాయని చెప్పారు. పోలవరం వద్ద 36 లక్షల క్యూసెక్కుల వరద వస్తే మరో 46 గ్రామాల పరిధిలోని 9,389 ఎకరాలు ముంపునకు గురి అవుతాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల సంఘం అధ్యయనం చేయించాలని కోరారు. భద్రాచలం, పరిసర ప్రాంతాల్లోని వరద జలాలను గోదావరిలోకి పంపింగ్ చేసే బాధ్యతను ఏపీ ప్రభుత్వం చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదు తెలంగాణలో పోలవరం ముంపు ప్రభావంపై ఉమ్మడి సర్వే చేయాలని ఎవరూ చెప్పలేదని, దీనికి ఎవరూ అంగీకరించలేదని ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఎలాంటి మధ్యంతర, తుది ఉత్తర్వులు ఇవ్వలేదని, అన్ని రాష్ట్రాల తో చర్చించి ఏకాభిప్రాయానికి రావాలని మాత్రమే సూ చించిందని చెప్పారు. అయితే రెండు సమావేశాల్లో ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదని, ఇందుకోసం త్వరలోనే కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఏపీ, తెలంగాణ సీఎంలతో సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్రం పేర్కొందని తెలిపారు. తెలంగాణకు నచ్చినట్టుగా నివేదికలు వచ్చేవరకు అధ్యయనం చేయాలా? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: చీకోటి ప్రవీణ్ క్యాసినో వ్యవహారం.. తలసాని సోదరులపై ఈడీ ప్రశ్నల వర్షం -
పోలవరం పనులపై ప్రాజెక్ట్ అథారిటీ సంతృప్తి
సాక్షి, అమరావతి/పోలవరం: గోదావరి నదిలో వరద ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలోనూ పోలవరం ప్రాజెక్ట్ పనులు నిర్విఘ్నంగా.. శరవేగంగా కొనసాగుతుండటంపై పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) సంతృప్తి వ్యక్తం చేసింది. దిగువ కాఫర్ డ్యామ్ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించింది. నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించింది. పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్, సభ్య కార్యదర్శి ఎంకే శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం సోమవారం పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే, ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డాŠయ్మ్(ఈసీఆర్ఎఫ్), విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. వరద కాలంలోనూ ఎగువ కాఫర్ డ్యామ్ పనులను వేగంగా చేస్తుండటంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ.. దిగువ కాఫర్ డ్యామ్ పనులను నెలాఖరులోగా రక్షిత స్థాయికి పూర్తి చేయాలని సూచించింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య నీటిని పూర్తిగా తోడివేశాక.. ఈసీఆర్ఎఫ్ పునాది డయా ఫ్రమ్ వాల్ పటిష్టతను మరోసారి పరిశీలించాలని సూచించింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ), డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ) మార్గదర్శకాల మేరకు కాఫర్ డ్యామ్ల మధ్య నదీ గర్భంలో ఖాళీ ప్రదేశాన్ని వైబ్రో కాంపక్షన్ విధానంలో అభివృద్ధి చేసి.. ఈసీఆర్ఎఫ్ పనులను గడువులోగా పూర్తి చేయాలని సూచించింది. ప్రాజెక్ట్ సీఈ ఎం.సుధాకర్బాబు పనుల పురోగతిని పీపీఏకు వివరించారు. పోలవరం ఆర్ అండ్ ఆర్పై జాతీయ కమిటీ సమీక్ష రేపు ఢిల్లీలో సమావేశం సాక్షి, న్యూఢిల్లీ: ప్రాజెక్టులకు సంబంధించి పునరావాసం, పరిహారం (ఆర్ అండ్ ఆర్) అమలుపై కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని భూ వనరుల విభాగానికి చెందిన పునరావాసం, పరిహారంపై జాతీయ పర్యవేక్షణ కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్కు సంబంధించిన పునరావాసం, పరిహారం అమలుపైనా సమీక్షించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంత నిర్వాసితులకు పునరావాసం, పరిహారం కల్పించకుండా తరలిస్తున్నారంటూ పెంటపాటి పుల్లారావు చేసిన ఆరోపణలనూ చర్చనీయాంశంగా అజెండాలో చేర్చినట్టు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రథమ కార్యదర్శి జీకే ధకాటే పేర్కొన్నారు. -
జాతీయ హోదా దక్కినా.. దక్కని ‘చంద్ర’కటాక్షం
♦ పోల‘వరం’పై నిర్లక్ష్యం ♦ ప్రాజెక్టు గురించి పట్టించుకోని బాబు సర్కారు ♦ బాబు పగ్గాలు చేపట్టి 11 నెలలవుతున్నా.. 11 అంగుళాలూ ముందుకు జరగని ప్రాజెక్టు నిర్మాణం ♦ నిర్మాణ పురోగతిపై పోలవరం అథారిటీ తీవ్ర అసంతృప్తి ♦ అయినా.. పట్టించుకోని ప్రభుత్వం ♦ కాంట్రాక్టర్ను రక్షించేందుకు, పోల‘వరాన్ని’ జాప్యం చేసేందుకే మొగ్గు ♦ హడావుడిగా పట్టిసీమకు శంకుస్థాపన ♦ ఫలితం.. పోలవరానికి ‘చంద్ర’గ్రహణం ♦ ఈ ప్రాజెక్టుపై సర్కారు నిర్లక్ష్య వైఖరి ఖరీదు.. రాష్ట్ర అభివృద్ధి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వరప్రదాయిని పోలవరం ప్రాజెక్టు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో నిర్మాణం దాకా వచ్చిన పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వపు నిర్లక్ష్యపు ధోరణి అడుగడుగునా అడ్డుతగులుతోంది. జాతీయ హోదా దక్కినా.. చంద్రబాబు కటాక్షం దక్కక పోలవరం ప్రాజెక్టు పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా ఉన్నాయి. ప్రాజెక్టు ఖర్చంతా కేంద్రమే భరించడానికి సిద్ధంగా ఉన్నా, సహకారమందించి పనులు వేగవంతం చేయడానికి చంద్రబాబు సిద్ధంగా లేకపోవడం.. ‘అంగట్లో అన్నీ ఉన్నా..’ సామెతను గుర్తుకుతెస్తోంది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తాగు, సాగునీరు ఇచ్చి ప్రజలను కరువు నుంచి, దాహార్తి నుంచి బయటపడేయటానికి గుమ్మం ముందుకొచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని చంద్రబాబు ప్రభుత్వం కాలదన్నడం విడ్డూరమంటూ ఇటు ఇంజనీరింగ్ నిపుణులు, అటు ప్రజలు విమర్శిస్తున్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన పోలవరం అథారిటీకి అన్నివిధాలుగా సహకారం అందించాల్సింది పోయి, కాంట్రాక్టర్ను రక్షించడానికి, ఏదోవిధంగా పోల‘వరాన్ని’ ఆలస్యం చేయడానికే చంద్రబాబు మొగ్గుచూపడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. పనులు జరుగుతున్న తీరుపట్ల అథారిటీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసినా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద జరిగిన సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పినా.. రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదు. చంద్రబాబు అధికారం చేపట్టి 11 నెలలవుతున్నా.. 11 అంగుళాల పని కూడా జరగలేదు. ఫలితంగా కేంద్రం నుంచి భారీగా నిధులు రాలేదని అధికారులు చెబుతున్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తే వైఎస్సార్కు ఆ ఘనత దక్కుతుందని, అందుకే సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అందుకోసమే కేంద్రానికి కూడా సహకరించట్లేదని ఇంజనీర్లు సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పట్టిసీమ ఎత్తిపోతల పథకంతో పోలవరానికి ఉరేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారీ ఎత్తున ‘సొమ్ము’ చేసుకోవడంతోపాటు పోలవరాన్ని ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేందుకే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి హడావుడిగా శంకుస్థాపన చేసినట్టు నిపుణుల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండడం గమనార్హం. వైఎస్ ప్రారంభించిన పోలవరం కోస్తా జిల్లాల్లోని బీడువారిన భూములను సస్యశ్యామలం చేయడంతోపాటు విద్యుత్ కొరతను తీర్చగలిగే సామర్థ్యమున్న, అలాగే రాయలసీమకు తాగునీటి అవసరాలు తీర్చే బహుళార్థ సాధక ఇందిరా సాగర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2006లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాహసోపేతంగా ప్రారంభించారు. వైఎస్ హయాంలో కుడి, ఎడమ కాలువల పనులతోపాటు హెడ్వర్క్స్లో భాగంగా స్పిల్వే, ట్విన్ టన్నెల్స్, కుడి, ఎడమ కనెక్టివిటీస్ నిర్మాణ పనులూ మొదలయ్యాయి. అయితే నిర్మాణపనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ అనుకున్నంత వేగంగా పనులు చేయకపోవడంతో విడివిడిగా ఇచ్చిన స్పిల్వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్హౌస్ టెండర్లను వైఎస్ రద్దు చేశారు. ఈ మూడు ప్యాకేజీలను కలిపి ఒకే ప్యాకేజీగా టెండర్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఆయన మరణానంతరం అప్పటి రాష్ట్రప్రభుత్వం దాదాపు మూడేళ్లకుపైగా కాలయాపన చేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని నీరుగార్చింది. ఎట్టకేలకు ఏడాదిన్నరక్రితం కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం స్పిల్వే, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం, పవర్ హౌస్లను ఒకే ప్యాకేజీగా ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి అప్పగించింది. నత్తకే నడక నేర్పుతున్న కాంట్రాక్టర్ అయితే ప్రాజెక్టు పనులు ఆశించిన స్థాయిలో కాదు కదా.. కనీసమాత్రంగా కూడా జరగట్లేదు. రూ.4,054 కోట్లకు టెండర్ దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ సంస్థ 48 నెలల్లో పనులు పూర్తి చేయాలి. కాంట్రాక్టు దక్కించుకుని ఇప్పటికి 20 నెలలు దాటినా హెడ్వర్క్స్కు సంబంధించి కేవలం ఐదున్నర శాతం పనులే పూర్తయ్యాయంటే పనుల తీరు అర్థమవుతోంది. కనీసం నెలకు రూ.85 కోట్ల విలువైన పనులైతేనే.. నిర్ణీత కాంట్రాక్టు ఒప్పందంలోగా ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ ప్రస్తుతం కేవలం రూ.4 కోట్ల విలువైన పనులే జరుగుతున్నాయి. ఈ లెక్కన చూస్తే.. ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఇరవై ఏళ్లు పడుతుందని ఇంజనీరింగ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పునరావాస సమస్యలు.. పరిష్కారానికి చొరవ చూపని సర్కారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల పోలవరం మండలంలో 26 గ్రామాలు ముంపునకు గురవుతుండగా వీటిలో ఏడు గ్రామాలు హెడ్వర్క్స్ పనుల సమీపంలో ఉన్నాయి. ఈ గ్రామాలవారిని ముందుగా ఖాళీ చేయించేందుకు అధికారులు పునరావాస ప్యాకేజీ అమలు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఒక్క గ్రామానికి కూడా పూర్తి ప్యాకేజీ అమలు కాలేదు. పునరావాస ప్యాకేజీల అమలుకు ప్రభుత్వం చొరవ తీసుకోకపోవడంతో... నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని తరలిస్తేనే పనులు చేయడానికి అవకాశం ఉంటుందని కాంట్రాక్టర్ సాకుగా చెబుతున్నారు. పనుల్లో జాప్యమే ఇటు ప్రభుత్వానికి, అటు కాంట్రాక్టర్కు అవసరమని, అందుకే నాటకాలు ఆడుతున్నారని ఇంజనీర్లే అంటున్నారు. పోలవరం ప్రాజెక్టుపై సర్కారు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి రాష్ట్ర అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారుతుందని నిపుణులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. పనులు జరుగుతున్న తీరిదీ... ♦ వాస్తవానికి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల పనులు జరగాల్సి ఉంది. ప్రారంభించిన సమయంలో రోజుకు 60 నుంచి 65 వేల క్యూబిక్ మీటర్ల పనులు జరిగేవి. అవి క్రమేణా తగ్గుముఖం పట్టి ఇప్పుడు కేవలం 15 నుంచి 20వేల క్యూబిక్మీటర్ల పనులే ప్రతిరోజూ జరుగుతున్నాయి. ♦ వాస్తవానికి రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల ఎర్త్వర్క్ పనులు జరగాల్సి ఉంది. ♦ ఫౌండేషన్ వర్క్కు సంబంధించి మొత్తం పదికోట్ల క్యూబిక్ మీటర్ల పనులు జరగాల్సి ఉండగా.. ఇప్పటికి 50 లక్షల మీటర్ల పనులే పూర్తయ్యాయి. ♦ స్పిల్వే, స్పిల్ చానల్, పవర్హౌస్ ఫౌండేషన్ పనులు మాత్రమే జరుగుతున్నాయి. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ పనులు ఇంతవరకు మొదలే కాలేదు. ♦ మొత్తంగా ఇప్పటికి ఐదున్నర శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ♦ రూ. 4,054 కోట్ల పనులకుగాను రూ.200 కోట్లలోపు విలువైన పనులే పూర్తయ్యాయి. ♦ చంద్రబాబు అధికారంలోకి రాగానే కాంట్రాక్టర్కు రూ. 200 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది. ఒప్పందం ప్రకారం అవకాశం లేకున్నా, మిషనరీని తనఖా పెట్టుకొని నిధులు విడుదల చేయాలని స్వయంగా సీఎం ఆదేశించారు. తీరా.. మిషనరీ, వాహనాల డాక్యుమెంట్లు తనఖా పెట్టాలని అధికారులు అడిగితే.. బ్యాంకుల్లో రుణాలు తీసుకుని కొన్న మిషనరీ, వాహనాల డాక్యుమెంట్లు బ్యాంకులవద్దే ఉన్నాయని కాంట్రాక్టర్ చల్లగా చెప్పారు. చేసేదేమీ లేక.. అధికారులు మిన్నకుండిపోయారు.