breaking news
Planet Mars
-
మార్స్పై ఏలియన్స్?
ఏలియన్స్, స్పీసిస్ తదితర సినిమాలు చూస్తే గ్రహాంతరవాసులు మనపై దాడికి వస్తారని భావించే ప్రజలున్నారంటే నమ్ముతారా? మనదగ్గర ఉండకపోవచ్చు కానీ, పాశ్చాత్య దేశాల్లో ఈ నమ్మకాన్ని ఒక మతంలాగా పాటించేవారు కోకొల్లలు. నిజంగా మనం కాకుండా విశ్వంలో జీవం ఉందనేది నిరూపణ కాని ఊహ మాత్రమే! మనిషి ఎంత విజ్ఞానం సాధించానని భావించినా అతని మనసులో ఒక వెలితి తీరట్లేదు. ఈ విశాల విశ్వంలో తాను ఒంటరినా? కనీసం సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలపై జీవం ఉందా? ఉంటే మన కన్నా ఎక్కువ తెలివైనవా? లేక అల్పజీవులా?.. ఈ ప్రశ్నలకు సంపూర్ణ సమాధానాలు ఇంకా దొరకలేదు. దీంతో తనకు చేతనైన రీతిలో గ్రహాంతర జీవుల కోసం ‘విశ్వ’ప్రయత్నాలు చేస్తున్నాడు. చంద్రుడితో మొదలెట్టి ఇతర గ్రహాలకు శాటిలైట్లు పంపి శోధిస్తున్నాడు. ఇంతవరకు ఎలాంటి స్పష్టమైన సమాధానాలు దొరక్కపోయినా, కొన్ని గ్రహాల్లో మాత్రం గతంలో జీవం ఉండేదనేందుకు స్వల్ప ఆధారాలు లభించాయి. అయితే ఈ ఆధారాలతో సమస్య తీరకపోగా కొత్తగా మరో ప్రశ్న మొదలైంది. ఒకవేళ ఇతర గ్రహాలపై జీవం ఉండేదనుకుంటే, ఇప్పుడేమైందనేది కొత్త ప్రశ్న! మంగళుడిపై మనుగడ తాజాగా కుజగ్రహంపై కనిపిస్తున్న నల్లటి చారికలు ఆ గ్రహంపై జీవం ఉందనేందుకు నిదర్శనమని తాజాగా సైంటిస్టులు విశ్లేషిస్తున్నారు. దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపితే సదరు జీవజాలం ఎలా మాయమైందన్న విషయం తెలియవచ్చని, తద్వారా భూమిపై ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడవచ్చని వీరి ఆలోచన. మార్స్(కుజుడు) పై కనిపించే నల్లటి చారికలు ద్రవరూప పదార్ధాలు ప్రవహిస్తే ఏర్పడే కయ్యల్లాగా ఉన్నాయి. ఇవి ఈ గ్రహంపై ఉండే కరిగే మంచుకు, కుజుడి ఉపరితలంపై ఉండే ఉప్పురాతి శిలలకు మధ్య జరిగే రసాయన చర్య వల్ల ఏర్పడ్డాయని సైంటిస్టుల ఆలోచన. కుజుడిపై దాదాపు మైనస్ 60 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు ఉంటుంది. అందువల్ల మంచు ఏర్పడేందుకు ఛాన్సులు ఎక్కువ. మరి మంచు ఉంటే జీవముండాలి కదా అని ప్రశ్నిస్తే ప్రస్తుతం ఆ మంచు జీవం మనుగడ సాధించలేనంత ఉప్పుతో కలిసి ఉన్నందున జీవం లేదని, కానీ 200– 300 కోట్ల సంవత్సరాల క్రితం మాత్రం మార్స్పై జీవం ఉండే ఉండొచ్చని కొత్త సిద్ధాంతం ప్రతిపాదిస్తున్నారు. అయితే అది ఎందుకు అంతర్ధానమైందో ఇంకా తెలియరాలేదని, మరిన్ని పరిశోధనలతో కానీ ఈ విషయం నిర్ధారించలేమని సైంటిస్టులు చెప్పారు. కాబటి.. మన పొరుగు గ్రహం నుంచి మనపైకి దాడికి వచ్చే ఏలియన్స్ అయితే ఇంకా ఏమీ లేవని భరోసాతో ఉండొచ్చు! -
అంగారకుడు, చంద్రుడిపైకి డ్రోన్లు!
చీకటి ప్రదేశాల గుట్టు తేల్చేందుకు నాసా కసరత్తు వాషింగ్టన్: అంగారక గ్రహం, చంద్రుడు, కొన్ని గ్రహశకలాల పైకి డ్రోన్లను పంపేందుకు నాసా కసరత్తు చేస్తోంది. వాటిపై ఇప్పటిదాకా మిస్టరీగా ఉన్న ప్రదేశాల గుట్టు తేల్చేందుకు ఈ కొత్త తరహా ఆలోచన చేస్తోంది. అంగారకుడిపై పెద్దపెద్ద బిలాల వద్ద చీకటి ప్రదేశాలు ఉన్నాయి. చంద్రుడు, గ్రహశకలాలపై కూడా ఇలాంటి చీకటి ప్రాంతాలున్నాయి. ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇప్పటిదాకా ప్రయోగించిన రోవర్లు ఇక్కడ దిగలేదు. ఇప్పుడు ప్రత్యేక డ్రోన్లను వాటిపైకి పంపేందుకు నాసా సిద్ధమవుతోంది. ‘‘అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సైతం పనిచేసేలా డ్రోన్లను తయారు చేస్తున్నాం. అంగారకుడు, గ్రహశకలాలపై ఉన్న నీడ ప్రాంతాల వద్ద శోధించడం వీటి ముఖ్య ఉద్దేశం. లోతైన లోయలు, పెద్దపెద్ద రంధ్రాల వద్ద భౌగోళిక ప్రతికూలత కారణంగా సాధారణ రోవర్లు దిగలేవు. అందుకే బ్యాటరీల సాయంతో ఎగిరే డ్రోన్లను రూపొందిస్తున్నాం. ఇవి అక్కడ మట్టిని తవ్వి నీరు, మంచు జాడలేమైనా ఉన్నాయో పరిశీలిస్తాయి’’ అని నాసాకు చెందిన కెనడీ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త రాబ్ ముల్లర్ తెలిపారు. ఒకేసారి ఎక్కువ డ్రోన్లు అక్కడ దిగుతాయి కాబట్టి ఒకటి విఫలమైనా, మిగతా డ్రోన్ల ద్వారా విలువైన సమాచారం అందుతుందని ఆయన పేర్కొన్నారు.