breaking news
	
		
	
  pilots blamed
- 
      
                   
                                                     
                   
            దురదృష్టకరం.. బాధ్యతారాహిత్యం!
న్యూఢిల్లీ: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద నివేదికలోని కొన్ని అంశాలు ముందుగానే లీకవడం ‘దురదృష్టకరం, బాధ్యతారాహిత్యం’అంటూ సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఫలితంగా ఘోర ప్రమాదానికి పైలట్ల తప్పిదాలే కారణమంటూ జూన్ 12వ తేదీన మీడియా చిలువలుపలువలుగా కథనాలు వచ్చాయని తెలిపింది. ప్రమాదంపై స్వతంత్ర, నిష్పాక్షిక సత్వర విచారణ చేపట్టాలని, బాధితుల వ్యక్తిగత గోప్యత, మర్యాదలకు భంగం కల్గించరాదని పేర్కొంటూ సోమవారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వంతోపాటు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)కు నోటీసులు జారీ చేసింది. జూలై 12వ తేదీన ఎయిర్క్రాఫ్ట్ యాసిడెంట్ ఇన్వెసి ్టగేషన్ బ్యూరో(ఏఏఐబీ) ప్రాథమిక నివేదికలోని కొన్ని ఎంపిక చేసిన అంశాలను బహిర్గతం చేయడం దురదృష్టకరం, బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. దీనిని ప్రత్యర్థి వైమానిక సంస్థలు స్వార్థానికి వాడుకునే ప్రమాదముందని తెలిపింది. సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ అనే సంస్థ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలను వినిపించారు. ప్రాథమిక నివేదికలోని పైలట్ల తప్పిదముందని ఆరోపించే కేవలం ఒకే ఒక వాక్యం వల్లనే ప్రపంచవ్యాప్తంగా మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. మిగతా అంశాలన్నీ మరుగున పడిపోయాయన్నారు. విషాదం చోటుచేసుకుని 100 రోజులు దాటినా ఇప్పటికీ అసలు కారణాలు వెల్లడి కాలేదని చెప్పారు. పైపెచ్చు, విచారణ కమిటీలోని ఐదుగురిలో ముగ్గురు డీజీసీఏకు చెందిన వారే ఉండటంతో నివేదికపై అనుమానాలకు తావిచ్చే అవకాశముందని తెలిపారు. విమానం ఫ్లైట్ డేటా రికార్డర్ను వెల్లడిస్తే ఘటనకు దారితీసిన కారణాలపై స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు. స్పందించిన ధర్మాసనం... స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తునకు డిమాండ్ చేయడం సబబుగానే ఉన్నా, ఫ్లైట్ డేటా రికార్డర్ సమాచారాన్ని డిమాండ్ చేయడం మాత్రం ప్రశ్నార్థకమని వ్యాఖ్యానించింది. ఫ్లైట్ డేటా రికార్డర్ వెల్లడైతే పరస్పర విరుద్ధ కథనాలు వచ్చే ప్రమాదముందని పేర్కొంది. ‘ఇటువంటి సందర్భాల్లో దర్యాప్తు పూర్తి అయ్యే వరకు నివేదికలోని అన్ని అంశాలను పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచాల్సిన అవసరముంది. అప్పటి వరకు మేం ఎదురుచూస్తాం’అని ధర్మాసనం తెలిపింది. ప్రమాదంపై కేంద్రం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ నివేదికలోని కొన్ని అంశాలను లీకవడంతో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందంటూ వైమానిక రంగ నిపుణుడు కెప్టెన్ అమిత్ సింగ్ సారథ్యంలోని సేఫ్టీ మ్యాటర్స్ ఫౌండేషన్ సంస్థ ఈ పిటిషన్ వేసింది. ఫ్యూయల్ కటాఫ్ స్విఛ్లను ‘రన్’నుంచి ‘కటాఫ్’కు మార్చడం వల్లే ప్రమాదం జరిగిందని, ఇది పైలట్ తప్పిదమేనంటూ ఏఏఐబీ ప్రాథమిక నివేదికలోని కొన్ని అంశాలు జూలై 12వ తేదీన బయటకు రావడం తెల్సిందే. - 
      
                   
                               
                   
            రాహుల్ విమాన ఘటన పైలట్ల తప్పిదమే
ముంబై: కర్ణాటక ఎన్నికల ప్రచారం సందర్భంగా హుబ్లీలో రాహుల్ గాంధీ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పిన ఘటనకు పైలట్ల తప్పిదమే కారణమని డీజీసీఏ పేర్కొంది. ఇందులో కుట్రకోణమేదీ లేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 26న పదిసీట్ల సామర్థ్యమున్న విమానం ల్యాండింగ్కు ముందు ఒక్కసారిగా ఎడమవైపుకు వంగడంతో రాహుల్ సహా లోపలున్న వారు భయభ్రాంతులకు లోనయ్యారు. ‘చార్టెడ్ విమానం వీటీ–ఏవీహెచ్ ఆటోపైలట్ మోడ్లో ఉన్న సమయంలో విమానం ఎత్తు హఠాత్తుగా 125 అడుగుల.. తర్వాతి 9 సెకన్లలోనే మరో 610 అడుగులు కిందకొచ్చింది. దీంతో విమానం 65 డిగ్రీలు పక్కకు ఒరిగింది’ అని డీజీసీఏ పేర్కొంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో రాహుల్తోపాటు ఆయన మిత్రుడు కౌశల్ విద్యార్థి్థ, ఇద్దరు పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇంజనీర్ ఉన్నారు. ఈ ఘటన వెనుక కుట్రకోణం ఉందని అప్పుడు కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. మరోవైపు, రాహుల్ శుక్రవారం ఢిల్లీ నుంచి కైలాస్ మానససరోవర్ తీర్థ యాత్రకు బయలుదేరారు. ఈ సుదీర్ఘయాత్ర 12 నుంచి 15 రోజుల పాటు సాగనుంది. కైలాస పర్వతంపై ఉన్న శివుణ్ణి దర్శిస్తారు. - 
      
                   
                               
                   
            పొగమంచు కాదు.. పైలట్లదే తప్పు!

 గత కొన్ని రోజులుగా పొగమంచు దట్టంగా ఉందని, అందువల్ల పలు విమానాలు ఆలస్యం అవుతున్నాయని వింటున్నాం. కానీ, విమానాలు ఆలస్యం కావడానికి అసలు కారణం అది కాదట.. విమానయాన సంస్థలు, వాటిలో పనిచేసే పైలట్లే అందుకు కారణమని డీజీసీఏ చెబుతోంది. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3వ తేదీ వరకు పొగమంచు కారణంగా దాదాపు 900 విమానాలు ఆలస్యమయ్యాయి. కొన్నయితే ఢిల్లీకి బదులు సమీపంలో ఉన్న వేరే విమానాశ్రయాల్లో దిగాల్సి వచ్చింది. అయితే.. వాటిలో 811 విమానాలు విజబులిటీ తక్కువగా ఉన్నప్పుడు ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా లేకపోవడం వల్లే అలా అయ్యిందని ఎయిర్పోర్టు ఆపరేటర్ డీజీసీఏకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. మరో 97 విమానాలను మాత్రం 50 మీటర్ల స్థాయిలో కూడా విజిబులిటీ లేకపోవడంతో వేరేచోట్ల దించాల్సి వచ్చిందన్నారు. 
 
 సాధారణంగా పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు విమానాశ్రయాలతో పాటు విమానాలు కూడా అత్యాధునిక ల్యాండింగ్ వ్యవస్థలను ఉపయోగిస్తాయి. తక్కువ విజిబులిటీ ఉన్నప్పుడు కూడా విమానాలను దించడానికి పైలట్లకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. బాగా తక్కువ విజిబులిటీ ఉన్నప్పుడు కూడా విమానాలు దిగేందుకు పొడవైన రన్వేతో పాటు అదనపు పరికరాలు కూడా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్నాయి. కానీ విమానయాన సంస్థలు మాత్రం అలా దిగేందుకు వీలున్న విమానాలను, పైలట్లను ఢిల్లీకి ఉపయోగించడం లేదని డీజీసీఏ అధికారి ఒకరు తెలిపారు. ప్రధానంగా ఎయరిండియాను డీజీసీఏ ఎక్కువగా తప్పుబట్టింది. 125 మీటర్ల కంటే పైన కూడా విజిబులిటీ ఉంటేనే ఆ విమానాలు దించుతున్నారని లేకపోతే వేరేచోటుకు మళ్లిస్తున్నారని చెప్పింది. 


