breaking news
peoples leader
-
సామాన్యుడు.. కోటంరెడ్డి.. నిత్యం జనంతో మమేకం
ఆయనో ప్రజాప్రతినిధి. సామాన్యుడిగా నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటారు. నమ్ముకున్న కార్యకర్తలు, నాయకులతో కష్టసుఖాలు తెలుసుకుంటూ భరోసాగా నిలుస్తారు. కార్యకర్తల ఇంట్లోనే భోజనం, నిద్ర చేస్తూ మమేకమవుతారు. ఆయనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. ఈ పేరు ప్రజల గుండె చప్పుడు. కష్టం వచ్చి శ్రీధరన్న.. పిలిస్తే ఆగమేఘాల మీద వెళ్లి ఆ కష్టాన్ని తీర్చి.. కన్నీళ్లు తుడిచి వస్తాడు. ఎమ్మెల్యే కాక ముందు నుంచి పాదయాత్ర చేసి ప్రతి ఇంటిని పలకరించారు. ప్రతి పక్ష ఎమ్మెల్యేగా పల్లె పల్లె తిరిగారు. తాజాగా సోమవారం నుంచి జగనన్న మాట గడప గడపకు కోటంరెడ్డి బాట పేరుతో ఇల్లిల్లూ తిరుగుతున్నారు. సాక్షి, నెల్లూరు: నెల్లూరు రూరల్ మండలం గొల్లకందూరులో చేవూరు శ్రీనివాసులురెడ్డి అనే కార్యకర్త ఇంటి నుంచి సోమవారం ఉదయం ‘జగనన్న మాట.. గడప గడపకూ కోటంరెడ్డి బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 9 నెలలు పాటు చేపట్టే ఈ కార్యక్రమం మూడు విడతలుగా చేపట్టనున్నారు. ఒక్కొక్క విడతలో నిరంతరాయంగా 33 రోజులు కొనసాగించనున్నారు. ఉదయం 7 నుంచి 12 గంటలకు ముగించనున్నారు. కార్యకర్త ఇంట్లోనే భోజనం చేయడం, అక్కడే 2 గంటలు రెస్ట్ తీసుకోవడం, మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటలకు వరకూ గడప గడప కార్యక్రమం ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా చేపట్టనున్నారు. చదవండి: (తండ్రి, తనయుడి కేబినెట్లలో ఆ నలుగురు..) జనంతో మమేకం.. ఆయన జీవితం ఆయన రాజకీయ జీవితమంతా.. జనంతో మమేకమై సాగుతోంది. ప్రతి రోజు కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, సమస్య ఉంటే ఎమ్మెల్యే ఆఫీసు వెళ్తే పరిష్కారం లభిస్తుందనే ధీమా వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కల్పించడంలో సఫలీకృతుడయ్యారు. తాను అందుబాటు లేకపోయినా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి అయినా అందుబాటులో ఉండేలా ప్రత్యేక ప్రణాళిక రచించుకున్నారు. క్రమం తప్పకుండా అందుకు తగ్గట్లుగా పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటారు. పదవుల కోసం పాకులాడకుండా.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గడప గడపకు కోటంరెడ్డి బాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. చిత్తశుద్ధితో నిర్వహణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి చిత్తశుద్ధితో కార్యక్రమాలు నిర్వహిస్తారనే పేరుంది. అందులో భాగంగా ఇల్లిల్లూ తిరుగుతూ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా? అర్హత ఉండి దక్కలేదా? ఇంకా ఏమి కావాలని కోరుకుంటున్నారనే విషయాలు తెలుసుకుంటూనే వారితో మమేకం అవుతున్నారు. గొల్లకందుకూరులో గంజి బుజ్జమ్మ అనే వృద్ధ మహిళతో కలిసి నేలపై కూర్చుండి ఆమె సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించారు. ప్రజల సమస్యలు తెలుసుకునే క్రమంలో స్వయంగా పుస్తకంలో నోట్ చేసుకుంటున్నారు. కార్యకర్తలు ఎంత మంది ఉన్నా సమస్యలను ఎమ్మెల్యేకు మాత్రమే చెప్పుకునేలా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. -
నిజమైన నాయకుడు పుట్టిన వేళ..
ఇప్పుడు పాశ్చాత్య ప్రపంచమంతా కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో వైపు చూస్తోంది. అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోవడంతో దిగజారిపోతున్న కెనడా ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దుతారన్నదే అందరి ఆసక్తి. చమురు ధరలు పడిపోవడానికి, దినుసుల ధరలు పెరగడానికి సంబంధం ఏమిటి? ధనికులు, పేదల మధ్య వ్యత్యాసం రోజురోజుకు ఎందుకు పెరుగుతోంది, వినియోగదారుల్లో ఎక్కువ శాతం ఉండే మధ్యతరగతి ప్రజలను గత ప్రభుత్వాలు ఎందుకు విస్మరిస్తూ వచ్చాయి? ఇవన్నీ ప్రధానమంత్రిగా పోటీ చేయడానికి ముందు జస్టిన్ను తొలచిన ప్రశ్నలు. వ్యవస్థలోనే ఏదో లోపం ఉందని గ్రహించడానికి ఆయనకు ఎంతో కాలం పట్టలేదు. మాజీ ప్రధానమంత్రి పియెర్రా ట్రూడో వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా, 2008లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికైనా రాజకీయాలను మరీ సీరియస్గా తీసుకోలేదు. రాజకీయాల కన్నా కుటుంబం ముఖ్యమనుకున్నారు. భార్య సోఫీతో పాటు ముగ్గురు పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెట్టారు. వారికి బంగారు భవిష్యత్తును కల్పించే సామాజిక పరిస్థితులు దేశంలో ఉన్నప్పుడే వారి భవిష్యత్తు కూడా బాగుంటుందని భావించారు. అలా జరగాలంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా దేశ వ్యవస్థ మారాలని అనుకున్నారు. అందుకు తానే శ్రీకారం చుట్టాలనుకున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనడం ద్వారా 2013లో లిబరల్ పార్టీ పగ్గాలు స్వీకరించారు. రాజకీయాల్లోకి రాక ముందు నుంచి క్యూబా నాయకుడు ఫిడెల్ కాస్ట్రో, అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ను అమితంగా అభిమానించే జస్టిన్ వివాదాస్పద నిర్ణయాలు, ప్రకటనల ద్వారా మీడియా దృష్టిని ఆకర్షించేవారు. గంజాయిని చట్టబద్ధం చేయాలని వాదించడమే కాకుండా 2010లో తాను స్వయంగా గంజాయితో నింపిన హుక్కాను తాగానని బహిరంగంగా ప్రకటించారు. దేశంలోని మహిళలకు అబార్షన్ హక్కు ఉండాలని డిమాండ్ చేయడమే కాకుండా, ఆడవాళ్లు కోరుకుంటే బురఖాలు ధరించే హక్కు కూడా వారికుందని వాదించారు. పైగా తాను మహిళా పక్షపాతినని చెప్పుకున్నారు. అబార్షన్ హక్కుకు ఓటేయని వారికి పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు కూడా లేదని వాదించారు. ఈ హక్కుతో విభేదించిన పార్టీ సభ్యులకు 2015 ఎన్నికల్లో టిక్కెట్లు కూడా నిరాకరించారు. ఎప్పడూ నీట్గా షేవ్ చేసుకొని నిండైన విగ్రహంలా కనిపించే జస్టిన్ స్ఫురద్రూపి. ఎడమ భుజంపై హైదా జాతి జనులున్న (కెనడా ప్రజల మూల జాతి) భూగోళం చిత్రాన్ని చెక్కిన టాటూ ఉంటుంది. రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించిన జస్టిన్కు నాటకాల్లో మంచి నటుడిగా, రచయితగా కూడా మంచి పేరుంది. 2015 ఎన్నికల్లో ఓడిపోతారన్న ఎన్నికల విశ్లేషకులు అంచనాలను ఊహించని విధంగా తారుమారు చేశారు. దానికి కారణంగా ఓ వీధిలోని కిరాణా షాపు నుంచి తాను ప్రారంభించిన ప్రచారయాత్రే కారణమని ప్రధాని బాధ్యతలు స్వీకరించాక తెలిపారు. దినసరి సరుకులు కొనేందుకు వచ్చే ప్రజలను, ముఖ్యంగా మధ్యతరగతి వారిని ప్రత్యక్షంగా కలుసుకొని వారి కష్టసుఖాలు విచారించేవాడినని, ఆ తర్వాత మెట్రో రైల్వేస్టేషన్ల వద్దకు వెళ్లి వచ్చిపోయే ప్రయాణికుల జీవితానుభవాలను విచారించేవాడినని చెప్పారు. వారి జీవితానుభవాలను ఆకళింపు చేసుకోవడం వల్లనే ఆర్థిక వ్యవస్థను ఎలా సరిదిద్దవచ్చో, ప్రజాస్వామ్యం బలపడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో తనకు అవగతమైందని అన్నారు. దేశ పురోగతిలో మధ్యతరగతి ప్రజలకు ప్రత్యక్ష భాగస్వామ్యం కల్పించాలని, ధనికులకు రాయతీలు వదిలేసి మధ్య తరగతికి రాయితీలు కల్పించడం మంచిదన్నది, స్థూలంగా అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక రంగంలో సమాన అవకాశాలు కల్పించడం తన లక్ష్యమని చెప్పారు. కెనడా ప్రజలు కలలు కంటారని, వారు సృజనశీలురని, బిల్డర్లని, అందరి కలలను నెరవేర్చేందుకే తాను ప్రధాన మంత్రినయ్యానని ఓ ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. -వి.నరేందర్ రెడ్డి