breaking news
PDS beneficiaries
-
ఫస్ట్ టైం.. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా ప్రజలకే అందించే ఏర్పాటును కలిపించబోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తమదేనంటూ కేజ్రీవాల్ కేబినెట్ దానికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ప్రజల వద్దకే ప్రభుత్వ సదుపాయాలు వచ్చి చేరుతాయన్న మాట. ఉదాహారణకు రేషన్ కార్డు సబ్సిడీ సదుపాయాలు, సర్టిఫికెట్లలలో మార్పులు-చేర్పులు, డ్రైవింగ్ లైసెన్సులు, వివాహ సర్టిఫికెట్లు.. లాంటి సేవలను నేరుగా ఇంటికి వెళ్లి ప్రజలకు అందించటం అన్న మాట. తద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని, భారీ క్యూలలో నిలుచునే అవకాశం లేకుండా పోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులే ప్రతీ గడప దగ్గరికి వెళ్లి అవసరమైన ప్రక్రియను చూసుకుంటారు. ఒకవేళ దానికి అవసరమైన ఫీజు ఉంటేనే ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే లేదు అని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. వివిధ రకాల సర్టిఫికెట్లు జారీ చేయటం తదితరాల కింద మొత్తం 40 సేవలను మొదటి విడతగా ఈ పథకంలో చేర్చారు. ఢిల్లీ ప్రజలు తమ తమ పనుల్లోనే క్షణం తీరిగ్గా లేకుండా బిజీగా గడుపుతున్నారు. అలాంటి సమయంలో వారికి ఊరట ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని సిసోడియా అన్నారు. మరో నెలలో ఇంకో 40 సేవలను చేర్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే కాలుష్యాన్ని నివారించటంలో దారుణంగా విఫలమయ్యాడన్న విమర్శలు.. అది కాకుండా నానాటికీ తగ్గుతున్న ప్రజాదరణను నిలబెట్టుకునేందుకే ఇలా కంటితుడుపు నిర్ణయాలు తీసుకుంటున్నాడని విపక్షాలు చెబుతున్నాయి. -
కందిపప్పు సరఫరాకు టెండర్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ లబ్ధిదారులకు అందజేసే రాయితీ కందిపప్పు సరఫరా కోసం ప్రభుత్వం శుక్రవారం టెండర్లు పిలిచింది. వచ్చే నెల మార్చి వరకు పీడీఎస్ అవసరాలకు సరిపోయేలా 5వేల మెట్రిక్ టన్నులకు పౌర సరఫరాల శాఖ టెండర్లను ఆహ్వానించింది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు ధరలు దిగివచ్చిన నేపథ్యంలో చర్యలు తీసుకున్న ప్రభుత్వం, వారం రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి లబ్ధిదారులకు సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రతీ నెలా 5వేల మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం పడుతోంది. లబ్ధిదారునికి కిలో రూ.50 చొప్పున ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుత ధరలు మార్చి తర్వాత మరింత తగ్గే అవకాశాలున్న నేపథ్యంలో కేవలం ఒక నెల అవసరాల మేర మాత్రమే ప్రస్తుతం టెండర్లను ఆహ్వానించింది. మార్చి తర్వాత తిరిగి పాత విధానం మేరకు మూడు నెలల అవసరాల కోసం టెండర్లను ఆహ్వానించనుంది.