breaking news
pallonji Mistry
-
బిజినెస్ టైకూన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత
సాక్షి, ముంబై: బిజినెస్ టైకూన్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ (93) కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలో సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. నిద్రలోనే ఆయన కన్నుమూసినట్టు తెలుస్తోంది. 18.4 శాతం వాటాతో టాటా గ్రూప్లో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా ఉన్నారు పల్లోంజీ. 1929లో జన్మించిన మిస్త్రీ లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో ఉన్నత విద్యనభ్యసించారు. అంతకుముందు ముంబైలోని కేథడ్రల్ & జాన్ కానన్ స్కూల్లో చదువుకున్నారు. కేవలం18 సంవత్సరాల వయస్సులో కరియర్ను స్టార్ట్ చేసిన ఆయన క్రమంగా బడా పారిశ్రామికవేత్తగా రాణించారు. 28.90 బిలియన్ డాలర్లతో పల్లోంజీ మిస్త్రీ బిలియనీర్గా ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం భారతదేశంలో 5వ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్నారు. పార్సీ కుటుంబంలో జన్మించిన షాపూర్జీ 2003లో వివాహం ద్వారా ఐరిష్ పౌరసత్వాన్ని పొందారు. వాణిజ్య రంగంలో చేసిన విశేష సేవలకుగాను 2016లో అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి పద్మభూషణ్ అందుకున్నారు. 1865లో స్థాపితమై ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్లో వ్యాపారాలను నిర్వహిస్తోంది పల్లోంజీ గ్రూపు. ముంబైకి చెందిన 156 ఏళ్ల ఈ గ్రూప్ ఇప్పుడు ఆఫ్రికా, ఇండియా, మిడిల్ ఈస్ట్, దక్షిణాసియాలో నిర్మాణ వ్యాపారంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాగా పల్లోంజీ మిస్త్రీకి ఇద్దరు కుమారులు షాపూర్ మిస్త్రీ, సైరస్ మిస్త్రీ, ఇద్దరు కుమార్తెలు లైలా మిస్త్రీ, ఆలూ మిస్త్రీ ఉన్నారు. సైరస్ మిస్త్రీ 2012 నుండి 2016 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్గా పనిచేశారు. అయితే 2016 అక్టోబర్లో మిస్త్రీ చిన్న కుమారుడు సైరస్ను టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించడంతో టాటా, మిస్త్రీల మధ్య వివాదం రగిలిన సంగతి తెలిసిందే. -
అంబానీతో పాటు మరో నలుగురు..
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ మరోసారి బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్లో తన సత్తా చాటారు. బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ టాప్ 100 ఇండెక్స్లో అంబానీ 19వ స్థానంలో నిలిచారు. అంతేకాక ఆసియాలోనే మూడో అత్యంత ధనిక వ్యక్తిగా పేరొందారు. 38.3 బిలియన్ డాలర్లు(రూ.2,49,160 కోట్లకు పైగా) సంపదతో ముఖేష్ అంబానీ ఈ స్థానంలో నిలిచారని బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్ పేర్కొంది. అంబానీతో పాటు మరో నలుగురు భారతీయులు కూడా బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ ఇండెక్స్లో చోటు దక్కించుకున్నారు. వారిలో ఆర్సెలర్మిట్టల్ సీఈవో లక్ష్మి మిట్టల్, షాపూర్జీ పల్లోంజి గ్రూప్ చైర్మన్ పల్లోంజి మిస్త్రీ, విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్జీ, హెచ్సీఎల్ చైర్మన్ శివ్ నాడార్లు ఉన్నారు. బ్లూమ్బర్గ్ బిలీనియర్స్ టాప్ 500 ఇండెక్స్లో మొత్తంగా 24 మంది భారతీయులు ఉన్నట్టు తెలిసింది. గతేడాదితో పోలిస్తే అంబానీ సంపద 9.3 బిలియన్ డాలర్లు పెరిగింది. కాగ, ఈ ఇండెక్స్లో ప్రథమ స్థానంలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఉన్నారు. ఆయన తర్వాతి స్థానంలో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ ఉన్నట్టు తెలిసింది. అమెరికన్లను మినహాయిస్తే, కేవలం ఇద్దరు యూరోపియన్లు మాత్రమే ఈ ఇండెక్స్లో చోటు దక్కించుకున్నారు. వారిలో ఒకరు జరా వ్యవస్థాపకుడు అమెంషియో ఓర్టెగా, రెండో వ్యక్తి లగ్జరీ బ్రాండు ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ ఆర్నాల్ట్. ఆసియా నుంచి అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్ మా, టెన్సెంట్ కో-ఫౌండర్, సీఈవో పోనీ మా లు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. -
వాణిజ్య ‘పద్మాలు’ వీరే...
న్యూఢిల్లీ: దివంగత ధీరూభాయ్ అంబానీ సహా పలువు రు వ్యాపార దిగ్గజాలకు ‘పద్మ’ పురస్కారాలు దక్కాయి. అంబానీకి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ దక్కింది. మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ దక్కిన వారిలో నిర్మాణ రంగ దిగ్గజం పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ, మారుతీ చైర్మన్ ఆర్సీ భార్గవ, బెన్నెట్ అండ్ కోల్మన్ చైర్పర్సన్ ఇందుజైన్ ఉన్నారు. మాస్టర్కార్డ్ సీఈవో అజయ్పాల్ ఎస్ బంగా, సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ, సీఏ టెక్నాలజీస్ చైర్మన్ సౌరభ్ శ్రీవాస్తవ, ఘర్దా కెమికల్స్ వ్యవస్థాపకుడు కేకీ ఘర్దా పద్మశ్రీ దక్కించుకున్న వారిలో ఉన్నారు. వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో వీరికి ఈ పురస్కారాలను ప్రకటించింది కేంద్రం. ధీరూభాయ్కి పద్మ విభూషణ్ ప్రకటించడం.. భారతీయ ఔత్సాహిక వ్యాపారవేత్తల స్ఫూర్తిని, ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలవాలనే వారి ఆకాంక్షలు, కృషిని గౌరవించుకోవడమేనని ఆయన కుమారుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఇది తనకు, లక్ష పైగా ఉద్యోగులున్న రిలయన్స్ కుటుంబానికి గర్వకారణమైన రోజుగా ఆయన అభివర్ణించారు. భారత్ను ఆధునిక, స్వయం సమృద్ధి దేశంగా తీర్చిదిద్దడంలో ఈ స్ఫూర్తితో పునరంకితం అవుతామని చెప్పారు. పల్లోంజీ మిస్త్రీ (86).. అత్యంత సంపన్నుల్లో ఒకరైనప్పటికీ.. ప్రచారార్భాటాలకు దూరంగా ఉంటారు మిస్త్రీ. నిర్మాణ రంగానికి చెందిన ఆయన వ్యాపార సామ్రాజ్యం భారత్తో పాటు దక్షిణాసియా, ఆఫ్రికాల్లో కూడా విస్తరించింది. గతేడాది ఫోర్బ్స్ లెక్కల ప్రకారం 14.7 బిలియన్ డాలర్ల సంపదతో.. అత్యంత సంపన్న భారతీయుల్లో ఆయనకు 5వ స్థానం లభించింది. టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ.. పల్లోంజీ కుమారుడే. టాటా సన్స్లో ఆయనకు 18.4% వాటాలు ఉన్నాయి. మీడియాలో ఎక్కువగా కనిపించని పల్లోంజీని ‘ఫాంటమ్ ఎట్ బాంబే హౌస్’గా(ముంబైలోని టాటా గ్రూప్ ప్రధాన కార్యాలయం) అబ్బురంగా పిలుచుకుంటారు. ఆర్సీ భార్గవ (81).. ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా బోర్డు చైర్మన్గా ఉన్నారు ఆర్సీ భార్గవ. ఒకప్పుడు కేంద్ర ఇంధన శాఖ, కేబినెట్ సెక్రటేరియట్లో సంయుక్త కార్యదర్శిగా కీలక హోదాల్లో పనిచేసిన భార్గవ.. 1981లో మారుతీలో చేరారు. కంపెనీని దిగ్గజంగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. అజయ్ బంగా (55).. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలకు సారథ్యం వహిస్తున్న భారతీయుల్లో బంగా ఒకరు. మాస్టర్కార్డ్ సీఈవోగా 2010 జూలై 1 నుంచి ఆయన వ్యవహరిస్తున్నారు. అంతకుముందు 13 ఏళ్ల పాటు సిటీబ్యాంక్లో పనిచేశారు. దానికన్నా ముందు రెండేళ్ల పాటు పెప్సీకోలో ఉన్నారు. భారత్లో పెప్సీకో ఫాస్ట్ఫుడ్ ఫ్రాంచై జీలను ప్రారంభించడంలో కీలకపాత్ర పోషించారు. దిలీప్ శాంతిలాల్ సంఘ్వీ (59).. తొలితరం వ్యాపారవేత్త సంఘ్వీ. జనరిక్, బ్రాండెడ్ ఔషధాలు తయారు చేసే దేశీ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మాను 1982లో ప్రారంభించారాయన. ఎక్కువగా ప్రచారాల ఊసుకు వెళ్లని సంఘ్వీ.. దేశంలోనే అత్యంత లాభదాయక ఫార్మా కంపెనీల్లో ఒకటిగా సన్ ఫార్మాను తీర్చిదిద్దారు. అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో ముకేశ్ అంబానీ తర్వాత రెండో స్థానంలో ఉన్నారు సంఘ్వీ. సౌరభ్ శ్రీవాస్తవ (69).. దాదాపు 4.5 బిలియన్ డాలర్ల బహుళజాతి ఐటీ సంస్థ సీఏ టెక్నాలజీస్ భారత విభాగానికి సారథ్యం వహిస్తున్నారు శ్రీవాస్తవ. దేశంలోనే పేరొందిన ఐటీ దిగ్గజాలు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టుల్లో ఆయన కూడా ఒకరు. ఐఐఎస్ ఇన్ఫోటెక్ సంస్థను స్థాపించారాయన. ఇది కార్యకలాపాలు ప్రారంభించిన నాలుగేళ్లలోనే టాప్ 20 దేశీ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటిగా ఎదిగింది. శ్రీవాస్తవ 50పైగా స్టార్టప్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు. ధీరూభాయ్ అంబానీ .. వేల కోట్ల విలువ చేసే రిలయన్స్ ఇండస్ట్రీస్ మహా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ధీరజ్లాల్ హీరాచంద్ అంబానీ..(ధీరూభాయ్ అంబానీ) గుజరాత్లోని మారుమూల ప్రాంతంలోని స్కూలు మాస్టారు కుమారుడి స్థాయి నుంచి పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగారు. 1932 డిసెంబర్లో జన్మించారాయన. యెమెన్లోని ఎడెన్లో ఒక ఆయిల్ కంపెనీలో పెట్రోల్ బంకు అటెండెంట్గా కూడా పనిచేసిన ఆయన 1958లో భారత్ తిరిగొచ్చారు. పాలిస్టర్ దిగుమతులు, సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం రిలయన్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ను ప్రారంభించారు. ఇదే ఆ తర్వాత రిలయన్స్ టెక్స్టైల్స్ కార్పొరేషన్గాను.. చివరికి రిలయన్స్ ఇండస్ట్రీస్గాను మారింది. భారత్కి తిరిగొచ్చేనాటికి అంబానీకి 26 ఏళ్లు. ఆపై ఎనిమిదేళ్ల తర్వాత 1966లో తమ తొలి టెక్స్టైల్ మిల్లును అహ్మదాబాద్ దగ్గర్లోని నరోదాలో ప్రారంభించారు. 1978 జనవరిలో బాంబే, అహ్మదాబాద్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో రిలయన్స్ను లిస్టింగ్ చేశారు. అటుపైన 1980లలో పాలిస్టర్ ప్లాంటును ఏర్పాటు చేశారు. 1990లలో పెట్రోకెమికల్స్, ఆయిల్ రిఫైనింగ్, టెలికమ్యూనికేషన్స్, ఆర్థిక సేవలు తదితర రంగాల్లోకి రిలయన్స్ సామ్రాజ్యం విస్తరించింది. 1976-77లో రిలయన్స్ టర్నోవరు రూ. 70 కోట్లు. 2002 జులై 6న 70 ఏళ్ల వయస్సులో ధీరుభాయ్ కన్ను మూసేనాటికి కంపెనీ టర్నోవరు ఏకంగా రూ. 75,000 కోట్లకు ఎగిసింది.