breaking news
one rupee clinic
-
మరొకరికి ప్రాణం పోసింది
సాక్షి, ముంబై : ఒక్క రూపాయి క్లినిక్... లోకల్, మెట్రో రైల్వే స్టేషన్లలో మహారాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన వైద్య సేవల సదుపాయం. ప్రారంభించిన కొద్ది రోజులకే అనూహ్యమైన స్పందన దీనికి వచ్చింది. రైలు స్టేషన్ వద్దకు చేరుకోగానే వైద్యులు రైల్లోకి వెళ్లి వైద్యం అందించటం.. తద్వారా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఇదిలా ఉంటే గత రాత్రి దాదర్ స్టేషన్ వద్ద ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. వన్ రూపీ క్లినిక్ వైద్యుల సాయంతో ఆమె ప్రసవించింది. కళ్యాణ్ నుంచి సీఎస్టీ రూట్లో వెళ్తున్న లోకల్ రైల్లో 26 ఏళ్ల సల్మా షేక్కి ఒక్కసారిగా నొప్పులు మొదలయ్యాయి. దీంతో రాత్రి 10గంటల 17 నిమిషాల సమయంలో దాదర్ స్టేషన్కు చేరుకోగానే డాక్టర్ ప్రజ్వలిత్, ఓ మహిళ రైల్వే పోలీసాధికారి, తోటి మహిళా ప్రయాణికుల సాయంతో ఆమెకు కాన్పు చేశారు. ఆ వెంటనే తల్లిబిడ్దలిద్దరినీ ఓ ఆంబులెన్స్ సాయంతో కేఈఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేయించారు. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. ఈ యేడాది మార్చిలో సుల్తానా ఖటున్ అనే మహిళకు కూడా దాదర్ స్టేషన్లోనే ఒక రూపాయి క్లినిక్ ద్వారా కాన్పు నిర్వహించటం విశేషం. ప్రస్తుతం ఈ వైద్య సేవలు దాదర్.. భైకళ, కుర్లా, ఘాట్కోపర్, విక్రోలి, భాండూప్, ములుండ్, థాణే, కల్వా, ఉల్లాస్నగర్, అంబర్నాథ్, బద్లాపూర్, వడాల రోడ్, పన్వేల్, సైన్, టిట్వాల, గోవండీ, చెంబూర్, మాన్ఖుర్ద్ రైల్వే స్టేషన్లలో లభిస్తుండగా.. త్వరలో ఆర్టీసీ బస్టాండ్లలో కూడా కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. -
బస్టాండ్లలో రూపాయికే వైద్యం
ముంబై: లోకల్, మెట్రో రైల్వే స్టేషన్ల మాదిరి బస్టాండ్లలో కూడా వన్ రూపీ క్లినిక్ పథకాన్ని ప్రారంభించాలని మహారాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం భావిస్తోంది. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో ఆర్టీసీ నిమగ్నమైంది. ముంబైలో లోకల్ రైల్వే స్టేషన్లలో లభిస్తున్న రూపాయికే వైద్యం పథకానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఇటీవల మెట్రో రైల్వే స్టేషన్లలో కూడా ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ యాజమాన్యం దీనిపై దృష్టి సారించింది. అందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బస్టాండ్లలో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తే మిగతా బస్టాండ్లలో కూడా చేపట్టే ప్రయత్నం చేయనుంది. ఈ వైద్య సేవలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువ శాతం ఉపయోగపడనున్నాయి. 24 గంటలు, రెండు షిప్టుల్లో ఇద్దరు డాక్టర్లు(ఒకరు ఎంబీబీఎస్, ఒకరు ఎండీ) బస్టాండ్లలోని క్లినిక్లో వైద్య సేవలందిస్తారు. అలాగే ఔట్ పేషంట్ డిపార్టుమెంట్ (ఓపీడీ), పూర్తి శరీర పరీక్షలు, రక్త పరీక్షలు, మార్గదర్శనం, జన జాగృతి వర్క్షాపు, గుండె, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ తదితరాలకు ప్రత్యేక విభాగాలు, అత్యవసర విభాగాలలో వైద్య సేవలందిస్తారని ‘వన్ రూపీ క్లినిక్’ చీఫ్ కార్యనిర్వాహక అధికారి డాక్టర్ రాహుల్ ఘులే పేర్కొన్నారు. ఈ పథకంపై ఇటీవల రవాణ శాఖ మంత్రి దివాకర్ రావుతో అధికారులు భేటీ అయ్యారు. అందుకు ఆయన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎక్కువ శాతం ఉపయోగపడే విధంగా ఈ పథకం ఉండాలని రాహుల్కు సూచించారు. లోకల్ రైల్వే స్టేషన్లలో ప్రారంభించిన ఈ పథకం ద్వారా కేవలం 45 రోజుల్లో 13 వేలకుపైగా ప్రయాణికులు లబ్ధి పొందారు. ప్రస్తుతం ఈ వైద్య సేవలు నగరంలోని భైకళ, దాదర్, కుర్లా, ఘాట్కోపర్, విక్రోలి, భాండూప్, ములుండ్, థాణే, కల్వా, ఉల్లాస్నగర్, అంబర్నాథ్, బద్లాపూర్, వడాల రోడ్, పన్వేల్, సైన్, టిట్వాల, గోవండీ, చెంబూర్, మాన్ఖుర్ద్ రైల్వే స్టేషన్లలో లభిస్తున్నాయి.