breaking news
Officers review
-
365 రోజులు వ్యాపార వాణిజ్య సంస్థలు
అధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వ్యాపార వాణిజ్య సంస్థలను 365 రోజులూ తెరిచి ఉంచి లావాదేవీలు నిర్వహించుకునే వెసులుబాటును మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఆదేశించారు. ఈ మేరకు కార్మిక శాఖ గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. షాపులు, ఇతర సంస్థలు ఆదివారాలు, ప్రకటిత సెలవు దినాల్లో మూసివేసే పద్ధతి ఉండేది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని షాపులు, ఇతర వ్యాపార వాణిజ్య సంస్థలను ఏడాది పొడవునా తెరిచి ఉంచే అవకాశం కల్పించారు. ప్రయోగాత్మకంగా ఏడాది పాటు ఈ విధానం అమలు చేశారు. బుధవారంతో ఈ గడువు ముగిసిన నేపథ్యంలో నిర్వహించిన సీఎం సమీక్షలో ఈ విధానం బాగుందని తేలడంతో మరో మూడేళ్లు కొనసాగించాలని నిర్ణయించారు. ఏడాది పొడవునా షాపులు తెరిచి ఉంచినా, కార్మికుల హక్కులకు భంగం కలగనీయొద్దన్న సీఎం సూచనలకు అనుగుణంగా కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరిచి ఉంచాలి. ప్రతీ కార్మికుడు, ఉద్యోగితో గరిష్ఠంగా రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలు మాత్రమే పని చేయిం చాలి. వారానికి కచ్చితంగా ఒక రోజు సెలవు ఇవ్వాలి. ఎక్కువ గంటలు పని చేస్తే దాన్ని వేతనాల రిజిస్టర్లో నమోదు చేయాలి. రాత్రి 8.30 గంటల తర్వాత మహిళా ఉద్యోగులు, సిబ్బందితో పని చేయించాల్సి వస్తే, సదరు మహిళలు రాత్రి వేళ ఇంటికి వెళ్లడానికి రవాణా సౌకర్యం కల్పించాలి. ఉద్యోగులకు జీతాలను వారి బ్యాంకు ఖాతాల్లో వేయాలి. ప్రతీ ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. అర్హులైన ఉద్యోగులకు ఈఫీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. -
ఏపీకి కేంద్రం సహకరించడం లేదు: చంద్రబాబు
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జమ్మూకశ్మీర్ కంటే అధ్వానంగా ఉందని అన్నారు. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు కోరినవన్నీ తీర్చామనీ తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేశామని చెప్పారు. చిత్తశుద్ధితో పనిచేసి ఏపీ రాష్ట్రానికి ఆదాయాన్ని పెంచేందుకు పని చేయాలని ఉన్నతాధికారులకు ఈ సందర్బంగా చంద్రబాబు సూచించారు.