breaking news
Office workers
-
కార్యాలయ ఉద్యోగులకు డిమాండ్
ముంబై: కార్యాలయ ఉద్యోగుల నియామకాలు జూలైలో మెరుగయ్యాయి. ఈ మార్కెట్ 7 శాతం వృద్ధిని చూసినట్టు నౌకరీ జాబ్స్పీక్ ఇండెక్స్ అధ్యయన నివేదిక ప్రకటించింది. ముఖ్యంగా నాన్ ఐటీ రంగాల్లో వైట్కాలర్ ఉద్యోగ నియామకాలు (శారీరక శ్రమ పెద్దగా అవసరం లేకుండా, సృజనాత్మకతతో చేసే పనులు) జరిగాయి. ఆతిథ్య రంగంలో 26 శాతం, బీమా రంగంలో 22 శాతం, విద్యా రంగంలో 16 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 13 శాతం చొప్పున నియామకాలు పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. గతేడాది జూలై నెలతో పోల్చితే ఐటీ రంగంలో నియామకాలు స్థిరంగా ఉన్నాయి. కృత్రిమ మేథ– మెషిన్ లెర్నింగ్ (ఏఐ–ఎంఎల్) నిపుణులకు ఎక్కువ డిమాండ్ కనిపించింది. ఈ విభాగంలో నియామకాలు 41 శాతం పెరిగాయి. ‘‘నాన్ ఐటీ రంగాల్లో బలమైన నియామకాల ధోరణి కనిపించింది. ముఖ్యంగా ఫ్రెషర్ల నియామకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆతిథ్యం, బీమా, విద్యా రంగాల నుంచి స్థిరమైన డిమాండ్ కొనసాగడం ప్రోత్సాహాన్నిస్తోంది’’ అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. నౌకరీ డాట్ కామ్ తన డేటా బేస్ ఆధారంగా ఉద్యోగ నియామకాల తీరుపై ప్రతి నెలా నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదికను విడుదల చేస్తుంటుంది. ఫ్రెషర్లకు చాన్స్.. → ఫ్రెషర్ల నియామకాలు జూలైలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే 8 శాతం పెరిగాయి. → 16 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సీజనల్ నిపు ణుల నియామకాలు 13% వృద్ధి చెందాయి. → యూనికార్న్ కంపెనీల్లో 23 శాతం, స్టార్టప్లలో 10 శాతం చొప్పున అధిక నియామకాలు నమోదయ్యాయి. → పశ్చిమాదిన నియామకాలు గణనీయంగా పెరిగాయి. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్ వ్యాప్తంగా వృద్ధి కనిపించింది. → రాజస్థాన్లోనూ ఉదయ్పూర్లో 12 శాతం, → జోద్పూర్లో 11 శాతం చొప్పున నియామకాలు పెరిగాయి. → మహారాష్ట్రాలోని కోల్హాపూర్లో 21 శాతం అధికంగా ఉద్యోగ నియామకాలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఔరంగాబాద్, → నాగ్పూర్లో 15 శాతం వృద్ధి కనిపించింది. → గ్లోబల్ కేపబులిటీ కేంద్రాల్లో (జీసీసీలు) నియామకాలు 5 శాతం పెరిగాయి. → మెట్రోల్లో అత్యధికంగా 18 శాతం నియామకాల వృద్ధితో ముంబై అగ్రస్థానంలో నిలిచింది. -
డీసీఎల్ కార్యాలయం దిగ్బంధం
విజయనగరం టౌన్ : పూసపాటిరేగ మండలం కందివలస వద్ద ఉన్న ఎస్ఎంఎస్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు సోమవారం డీసీఎల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మిక యూనియన్కు, యాజమాన్యానికి మధ్య నెలకొన్న తగాదా చినికి చినికి గాలివాన లా మారింది. ఉన్నతాధికారుల జోక్యం తో గతనెల 24న జిల్లా కార్మికశాఖ కార్యాలయంలో చర్చలు జరిగాయి. సమస్య పరిష్కారమై 18 రోజులు గడుస్తున్నా నేటికీ పరిశ్రమ యాజమాన్యం కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడంతో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ ఆధ్వర్యంలో కార్మికులు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. విధులకొచ్చిన ఉద్యోగులను బయటకు పంపించేశారు. తలుపులకు తాళాలు వేసి గేటు వద్ద అధిక సంఖ్యలో బైఠాయించి తమ సమస్యలు తీర్చేవరకూ పోరాటం చేస్తామని భీష్మించారు. దీంతో చేసేది లేక ఉద్యోగులు వెనుదిరిగారు. అనంతరం కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఉన్నతాధికారులు ముందు చర్చలు చేసి, ఆ చర్చల ప్రకారం కార్మికులను పనిలో పెట్టుకోకుండా తాత్సారం చేయడం వెనుక ఆంతర్యమేమిటని అనుమానం వెలిబుచ్చారు. అగ్రిమెంట్ ప్రకారం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాస్థాయి అధికారులు చెప్పినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కొంతమంది అధికారులు కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికుల పొట్ట కొట్టేందుకు చూస్తున్నార ని ఆరోపించారు. కంపెనీలో సీఐటీయూ యూనియన్ అనేది ఉండకుండా చేయాలనే ఉద్దేశంతోనే యాజమాన్యం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కార్మికులను విధుల్లోకి పంపించే విధంగా ఏర్పాట్లు చేయాలని, సమస్యను పరిష్కరించేవరకూ పోరాటం చేస్తామన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ యూనియన్ నాయకులు, కార్మికులు డీసీఎల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసినప్పటికీ అధికారులు స్పందించలేదు. పైగా భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం కూడా యథాతథంగా ధర్నా నిర్వహిస్తామని యూనియన్ ప్రతి నిధులు తెలిపారు.