North 24 Parganas
-
అందుకే నా పీఏను చంపారు.. బైక్ దొరికింది: సువేందు
కోల్కతా: ముందుగానే పథకం వేసి తన పీఏ చంద్రనాథ్ రాథ్ను హత్య చేశారని పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపించారు. రాథ్ మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి మధ్యమ్గ్రామ్లోని ఆయన ఇంటికి తీసుకొచ్చిన సమయంలో సువేందు అధికారి మీడియాతో మాట్లాడారు. “ఈ హత్యను ఎంతగా ఖండించినా సరిపోదు. ఆయన నా సహాయకుడు కావడం, నేను భవానీపూర్లో మమతా బెనర్జీని ఓడించడం వల్లే ఆయనను చంపారు. ఇదే హత్య వెనుక కారణం అయి ఉండొచ్చు” అని అన్నారు.హంతకులపై చర్యలు తీసుకోవాలని సువేందు డిమాండ్ చేశారు. “నేను ఆయన కుటుంబానికి అండగా ఉంటాను. ఈ హత్య చేసిన వారిని పట్టుకుని శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. పోస్టుమార్టంలో ఆయనపై 4 బుల్లెట్లు కాల్చినట్టు బయటపడింది. ఈ హత్య ముందుగానే పథకం వేసి చేశారు” అని చెప్పారు.ఇది చంద్రనాథ్ను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడి అని, హత్యను కచ్చితమైన ప్రణాళికతో అమలు చేశారని సువేందు ఆరోపించారు. “ఇది పూర్తిగా పథకం ప్రకారం చేసిన ఆపరేషన్. కొన్ని రోజుల పాటు రెక్కీ నిర్వహించారు. తర్వాత బాధితుడిని వెంబడించి దగ్గర నుంచి కాల్పులు జరిపారు” అని అన్నారు.చంద్రనాథ్కు దగ్గరలోనే నిలబడి దుండగులు అనేక బుల్లెట్లు కాల్చినట్టు పోస్టుమార్టంలో తేలిందని, వెంటనే మరణం సంభవించేలా దాడి చేశారని సువేందు చెప్పారు. ఈ హత్య యాదృచ్ఛికం కాదని సువేందు అధికారి స్పష్టం చేశారు. “ఇది సాధారణ నేరం కాదు. కిరాయి హంతకులతో చేయించిన హత్య” అని అన్నారు.రాథ్ను కేవలం తనతో పనిచేస్తున్న కారణంగానే లక్ష్యంగా చేసుకున్నారని సువేందు అధికారి ఆరోపించారు. “ఆయనకు నేర చరిత్ర లేదు. రాజకీయ శత్రుత్వం లేదు. ఆయనకు ఉన్న ఒక్క గుర్తింపు నాతో పనిచేయడమే” అని చెప్పారు. నిందితులను త్వరగా అరెస్టు చేసి, కఠిన శిక్షలు విధించాలని, దోషులకు ఉరిశిక్ష అమలు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారని సువేందు తెలిపారు.“ప్రస్తుతం తూర్పు మేదినీపూర్కు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా ఆయన ఇంటి వద్ద ఉన్నారు. ఆయన కుమార్తె, భార్యను చూసుకోవడం నా బాధ్యత. ముఖ్యంగా హంతకులను వీలైనంత త్వరగా అరెస్టు చేసి, చార్జ్షీట్ దాఖలు చేసి, వారికి ఉరిశిక్ష పడేలా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దీనిని పర్యవేక్షించడం నా బాధ్యత. నా సహచరులంతా నాకు సాయం చేస్తారు” అని చెప్పారు.ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఘటనలో ఉపయోగించినట్లు భావిస్తున్న బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, అనేక మంది అనుమానితులను గుర్తించారని సువేందు తెలిపారు. ఈ కేసును సీఐడీ దర్యాప్తు చేస్తోంది.“నా పార్టీకి చెందిన అనేక మంది నాయకులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ నాకు, రాథ్ కుటుంబానికి అండగా నిలిచారు. రాజ్యసభ సభ్యుడు సమీర్ ఒరావోన్, ఎంపీలు జ్యోతిర్మయ్ సింగ్ మహతో, ఖగేన్ ముర్ము కూడా మద్దతుగా నిలిచారు” అని సువేందు చెప్పారు.ఆధారాలను పరిశీలిస్తున్న ఫోరెన్సిక్ టీమ్స్ ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఘటనాస్థలం నుంచి సేకరించిన ఆధారాలను ఫోరెన్సిక్ బృందాలు పరిశీలిస్తున్నాయి. రాష్ట్ర సీఐడీ స్థానిక సమాచారం ఆధారంగా విచారణ కొనసాగిస్తోంది. ఇప్పటికే బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ సహా ఉన్నతాధికారులు మధ్యమ్గ్రామ్లోని ఘటనాస్థలాన్ని సందర్శించారు.ఇదే సమయంలో, ఈ ఘటనపై కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని తృణమూల్ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. పూర్తి స్థాయి, పక్షపాతం లేకుండా విచారణ జరగాలని కోరింది. భారత వైమానిక దళంలో మాజీ సిబ్బందిగా పనిచేసిన రాథ్.. కొన్నాళ్లుగా సువేందు అధికారికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నారు. బుధవారం మధ్యమ్గ్రామ్ సమీపంలో ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు. వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. -
సందేశ్ఖాలీలో నేడు మమతా బెనర్జీ పర్యటన
కోల్కతా:పశ్చిమబెంగాల్లో మహిళల ఉద్యమానికి కేంద్రంగా నిలిచిన సందేశ్ఖాలీలో సీఎం మమతాబెనర్జీ సోమవారం(డిసెంబర్30) పర్యటించనున్నారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతల భూకబ్జాలు,లైంగిక వేధింపులపై ఈ ఏడాది ఆరంభంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.ఈ ఆందోళనల తర్వాత ఈ ప్రాంతంలో సీఎం మమత పర్యటించడం ఇదే తొలిసారి. పౌరసరఫరాల శాఖ కార్యక్రమంలో మమత పాల్గొననున్నారు. మాజీ టీఎంసీ నేత షేక్షాజహాన్ తమ భూములు కబ్జా చేయడంతో పాటు లైంగికంగా వేధిస్తున్నారని సందేశ్ఖాలీలో మహిళలు ఉద్యమించారు.తర్వాత రేషన్ స్కామ్లో మనీ లాండరింగ్ ఆరోపణలపై షేక్షాజహాన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) షేక్ షాజహాన్ను అరెస్టు చేసింది. ఈ పరిణామాలతో అప్పట్లో అతడిని టీఎంసీ సస్పెండ్ చేసింది.ఇదీ చదవండి: బీహార్లో ఉద్రిక్తతలు..ప్రశాంత్కిశోర్పై కేసు -
టీఎంసీ యువనేతపై కాల్పులు.. బైక్పై వచ్చి క్షణాల్లో..
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణాలు జిల్లా భాట్పాడాలో మరోసారి హింస చెలరేగింది. టీఎంసీ యువనేత రాజ్ పాండేపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. అతను కాళీమాత పండల్లో పూజ ఏర్పాట్లు చేస్తుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి ఈ దాడి చేశారు. ఆరు రౌండ్ల కాల్పులు జరిపి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. రాజ్ పాండే చెతిలోకి ఓ బుల్లెట్ దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దుండగులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. దీపావళికి ముందు రోజు ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అనంతరం ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాట్పాడాలో ఇటీవల తరచూ హింస చోటుచేసుకుంటోంది. ఈ ఘటనకు రెండు రోజుల ముందే మరో టీఎంసీ నేతపై దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. అతని శరీరంలోకి కూడా బుల్లెట్ దూసుకెళ్లింది. చదవండి: ఓడలో భారీ అగ్నిప్రమాదం.. 14 మంది సజీవదహనం -
సర్కారు ఎవరిదో నిర్ణయించేది ఆ రెండు జిల్లాలే!
కోల్కతా: నార్త్ 24 పరగణ, సౌత్ 24 పరగణ.. పశ్చిమబెంగాల్లో ఈ రెండు జిల్లాలు తృణమూల్ కాంగ్రెస్కు కంచుకోటలు. ఈ కోటలను బద్దలు కొట్టి టీఎంసీ ఓటమికి బాటలు వేయాలనేది బీజేపీ ప్రణాళిక. ఈ రెండు జిల్లాల్లో మరోసారి అత్యధిక స్థానాలు గెలుపొందడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలన్నది టీఎంసీ ఆలోచన. మొత్తం 294 స్థానాల అసెంబ్లీలో ఈ రెండు జిల్లాలకు కలిపి 64 సీట్లు ఉన్నాయి. నార్త్ 24 పరగణలో 33, సౌత్ 24 పరగణలో 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సౌత్ 24 పరగణలో మైనారిటీల ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు జిల్లాలకు బంగ్లాదేశ్తో సరిహద్దులున్నాయి. శరణార్థుల జనాభా కూడా ఇక్కడ ఎక్కువ. 1980లో 24 పరగణ జిల్లాను అప్పటి లెఫ్ట్ ప్రభుత్వం రెండు జిల్లాలుగా విభజించింది. మొదట్లో ఈ ప్రాంతంలో వామపక్షాలకు గట్టి పట్టు ఉన్నప్పటికీ క్రమంగా టీఎంసీ పుంజుకుని, లెఫ్ట్ బలాన్ని తగ్గించేసింది. నందిగ్రామ్, సింగూర్ ఉద్యమాలు ఈ ప్రాంతంలో టీంఎసీని మరింత బలోపేతం చేశాయి. 2011, 2016 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2016లో నార్త్ పరగణలో 27, సౌత్ పరగణలో 29 స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో నార్త్ పరగణలో బీజేపీ కొంతవరకు ప్రభావం చూపగలిగింది. ‘బెదిరింపులతో, ప్రలోభాలతో 2019 ఎన్నికల్లో బీజేపీ కొంత ప్రభావం చూపింది. కానీ ఆ తరువాత మేం జాగ్రత్తపడ్డాం. పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకున్నాం’ అని నార్త్ 24 పరగణ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు జ్యోతిప్రియొ తెలిపారు. పార్టీలో పెరుగుతున్న అంతర్గత విబేధాలు, మత ఘర్షణల కారణంగా రెండు జిల్లాల్లోనూ టీఎంసీ బలం కొంత తగ్గింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రచారాస్త్రంగా చేపట్టి, శరణార్ధులను ఆకర్షించి 2019 లోక్సభ ఎన్నికల్లో నార్త్ 24 పరగణ జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లో రెండింటిని బీజేపీ గెల్చుకోగలిగింది. అలాగే, అక్కడ ప్రబలంగా ఉన్న మథువా వర్గంలో పట్టు సాధించింది. నార్త్ 24 పరగణలోని 14 అసెంబ్లీ స్థానాల్లో మథువాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఈ రెండు జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు సహా పెద్ద ఎత్తున పార్టీ నేతలు బీజేపీలో చేరడం టీఎంసీకి ఆందోళనకరంగా మారింది. కొత్తగా వచ్చిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎఫ్) సౌత్ 24 పరగణ జిల్లాలో టీఎంసీకి చెందిన మైనారిటీ ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐఎస్ఎఫ్ కాంగ్రెస్, లెఫ్ట్లతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల ప్రచారం సాయంతో నార్త్ 24 పరగణలో 60% సీట్లను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ధీమాగా ఉన్నారు. -
చెలరేగిన హింస, ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో బుధవారం ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలివేశారు. బదూరియా ప్రాంతంతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దులో మత ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. ఓ మతానికి చెందిన పుణ్యక్షేత్రాన్న్న అగౌరపరుస్తూ అభ్యంతరకరంగా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్తో రెండు రోజుల క్రితం గొడవలు మొదలయ్యాయి. శాంతి భద్రతల కోసం రాష్ట్ర పోలీసులకు తోడుగా 400మంది బీఎస్ఎఫ్ జవాన్లను ప్రభుత్వం మోహరించింది. మరోవైపు ఫేస్బుక్లో ఆ పోస్ట్ పెట్టిన ఓ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా బదూరియా ప్రాంతంలో ఘర్షణలు చెలరేగినట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. మత ఘర్షణలకు సంబంధించి పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి తనను బెదరించారనీ, అవమానపరిచారని ఆమె ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే మమత ఆరోపణలను గవర్నర్ ఖండించారు. తాను సీఎంను అవమానపరచలేదని, ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని కేసరీనాథ్ పేర్కొన్నారు.


