breaking news
Non-Local
-
రెండేళ్లు బయట చదివితే స్థానికులు కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: విద్యార్థి కేవలం రెండేళ్లు వేరే రాష్ట్రంలో చదువుకోవడానికి వెళితే తప్పు ఏంటని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఉన్నత చదువుల కోసమో.. తల్లిదండ్రుల బదిలీ కారణంగానో రెండేళ్లపాటు రాష్ట్రం బయట చదివితే వారిని స్థానికత కోటా నుంచి తప్పించడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ అన్నారు. వచ్చే శుక్రవారంలోపు స్థానికత అంశంపై లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. మెడికల్ సీట్ల భర్తీలో స్థానికత అంశంపై రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 11న దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్లతో కూడిన ధర్మాసనం మంగళవారం వాదనలు ముగించి, తీర్పును రిజర్వ్ చేసింది. 2028లో ఎందుకు అమలు చేయకూడదు?తెలంగాణ విద్యార్థుల ప్రయోజనం కోసమే రాష్ట్ర ప్రభుత్వం జీఓ 33ను తీసుకొచ్చిందని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ తెలిపారు. ప్రస్తుత విధానం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డి) ప్రకారం ఉందని చెప్పారు. ఏపీ విభజన చట్టంలో ఏపీ విద్యార్థులకు కల్పించిన గడువు ముగిసిపోవటంతో ఈ జీఓ తెచ్చినట్లు వివరించారు. దీని ప్రకారం సివిల్ సర్వీసెస్ (ఐఏఎస్, ఐపీఎస్), ఇతర ఉద్యోగాల్లో తల్లిదండ్రులు డిప్యుటేషన్పై వెళితే, ఇతర రాష్ట్రాల్లో చదువుకొన్న వారి పిల్లలకు మినహాయింపు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాన్ని కొన్ని ప్రత్యేక కేసులతో ముడి పెట్డకుండా లక్షలాది మంది తెలంగాణ స్థానిక విద్యార్థుల దృష్టితో ఆలోచించాలని కోరారు. ఈ సమయంలో కలగజేసుకున్న సీజేఐ జస్టిస్ గవాయ్.. పదేళ్లు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, 2028లో జీఓ 33ను ఎందుకు అమలు చేయకూడదు అని ప్రశ్నించారు. పదేళ్ల గడువు ముగిసినంత మాత్రాన అందరికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 (డీ)లోని అంశాలు తెలియవని అభిప్రాయపడ్డారు. 2028లో కొత్త నిబంధనలు తీసుకువస్తే వచ్చే నాలుగేళ్లలో స్థానికంగా చదివే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కాళోజీ వర్సిటీ తరపు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపిస్తూ ఆంధ్రప్రదేశ్తోపాటు మహారాష్ట్ర, తమిళనాడులోనూ ఇలాంటి స్థానికత అమలులో ఉందని గుర్తుచేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఉన్న పదేళ్ల గడువు ముగిసినందున తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించిందని తెలిపారు. దీంతో జస్టిస్ చంద్రన్ స్పందిస్తూ.. ‘తెలంగాణలో వరుసగా నాలుగేళ్లు విద్యనభ్యసించి ఉండాలని రూల్ తెస్తున్న విషయం స్థానిక ప్రజలందరికీ తెలుసు అని భావించడం సరికాదు’ అని వ్యాఖ్యానించారు. ‘ప్రతి విద్యార్థి ఆర్టికల్ 371 (డి) గురించి తెలుసుకోవాలని అన్నట్లుగా మీ వాదన ఉంది. 8వ తరగతిలోనే రాజ్యాంగాన్ని చదువుకోవాలన్నట్లు మాట్లడటం సరికాదు. చదువురాని తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా’ అని ప్రశ్నించారు.పదేళ్లు చదివినానాన్ లోకల్ అవుతున్నాంప్రభుత్వం తరఫున సుదీర్ఘ వాదనల అనంతరం విద్యార్థుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. తెలంగాణలో పుట్టి 10వ తరగతి వరకు రాష్ట్రంలోనే చదివినా జీఓ 33 కారణంగా స్థానిక కోటా దక్కడం లేదని తెలిపారు. 11, 12వ తరగతులు చదవని కారణంగా నీట్లో స్థానిక కోటా దక్కక నష్టపోతున్నట్లు నివేదించారు. దాదాపు 2 గంటలపాటు సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం ఇంక ఏమైనా అభ్యంతరాలు ఉంటే రాతపూర్వకంగా సమర్పించాలని సూచిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. -
‘రంగారెడ్డి’లో నాన్లోకలే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: పదోన్నతులు.. ఉద్యోగ నియామకాల్లో కొన్నేళ్లుగా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందని ఆ జిల్లా ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భాగం కావడం వల్ల ఇతర జిల్లాల వారూ రంగారెడ్డి జిల్లాకే ప్రాధాన్యమిస్తున్నారు. ఉద్యోగరీత్యా దీర్ఘకాలం ఇక్కడే స్థిరపడడంతో వారి పిల్లలూ స్థానికులుగా గుర్తింపు పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ప్పుడు ఆంధ్ర, రాయలసీయ జిల్లాలకు చెందినవారు అప్పట్లో ఉద్యోగాలు పొంది ఇప్పటికీ ఇక్కడే కొనసాగుతున్నారు. తాతల కాలం నుంచి రంగారెడ్డి జిల్లాలో పుట్టి పెరిగిన స్థానికులకు నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని నిరుద్యోగులు వాపోతున్నారు. తెలంగాణలో హెచ్ఆర్ఏ ఎక్కువ ఇచ్చే జిల్లాల్లో రంగారెడ్డి కూడా ఉంది. ఈ కారణంగా స్థానికేతరులు కూడా సీనియారిటీ ప్రాతిపదికన ఈ జిల్లానే ఎంచుకుంటున్నారు. గత ఏడాది అమలు చేసిన 317 జీఓ తర్వాత స్థానికులకు సరైన అవకాశాలే లేకుండాపోయామని ఆ జిల్లావాసులు చెబుతున్నారు. ఉదాహరణకు స్కూల్అసిస్టెంట్ బయోసైన్స్లో రంగారెడ్డికి, మహబూబ్నగర్లోని 64 మండలాల నుంచి కేడర్కు మించి కేటాయించారు. ఇతర సబ్జెక్టుల్లో కూడా కేడర్కు మించి టీచర్ల కేటాయింపులు జరిగాయి. ఇదిలా ఉంటే స్పౌజ్ కోటాతో సమస్య మరింత జటిలమైంది. భర్త, లేదా భార్య ఈ జిల్లాలో పనిచేస్తున్నట్టు చూపించి దాదాపు 400మంది ఇదే జిల్లాకు వచ్చారు. దీర్ఘకాలం వీరు కొనసాగడం వల్ల ఖాళీలు లేకుండా పోయాయి. దీంతో టెట్, జాతీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు పాసైన స్థానికులకు ఉద్యోగాలు పొందే అవకాశమే లేకుండా పోయింది. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా నిరుద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
స్థానికేతరులకు ఓటు హక్కు ఇస్తే ఖబడ్దార్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఓటర్ల జాబితాలో స్థానికేతరుల పేర్లను చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే సహించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా హెచ్చరించారు. కోర్టుకు వెళ్లయినా సరే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. స్థానికేతరులకు ఓటు హక్కును ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించేందుకు ఆయన సోమవారం అఖిలపక్ష నాయకులతో సమావేశయ్యారు. ఈ భేటీకి 9 పార్టీల నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేకతను, గుర్తింపును దెబ్బతీసే చర్యలకు పాల్పడొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇక్కడ బయటి వ్యక్తులు ఓటు హక్కు ఇవ్వడం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీని స్థానికేతరుల చేతుల్లో పెట్టొద్దని డిమాండ్ చేశారు. -
స్థానికులదే నూజివీడు ‘కోట’
వైఎస్సార్సీపీ దూకుడు అసమ్మతితో టీడీపీ డీలా కాంగ్రెస్ పోటీ నామమాత్రమే నూజివీడు నియోజకవర్గంలో లోకల్, నాన్లోకల్ వార్ నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీల మధ్యే ప్రధానంగా పోరు నెలకొంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకా ప్రతాప్ అప్పారావు స్థానికులు కావడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా ముద్రపడ్డారు. దివంగత ముఖ్యంత్రి వైఎస్.రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతో 2004 ఎన్నికల్లో విజయం సాధించి నియోజకవర్గంలో అభివృద్ధి పరువళ్లు తొక్కించారు. టీడీపీ అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుపై వలస ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఈయన అభ్యర్థిత్వాన్ని ఆపార్టీలోని బలమైన ఓ సామాజిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పశ్చిమకృష్ణా(విజయవాడ), న్యూస్లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ప్రచారపర్వం దగ్గర నుంచి అన్నింటా ముందంజలో ఉన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఖరారైన నాటి నుంచి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. రోజుకు పది గంటలు ప్రచారంలో గడుపుతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రధాన పార్టీల తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ప్రతాప్ ఒక్కరే స్థానికులు కావడం, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తదితర అంశాలు లాభిస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్.రాజశేఖర్రెడ్డి ఆశీస్సులతో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిల్చిన ప్రతాప్ విజయఢంకా మ్రోగించారు. సుమారు 20 వేల ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కోటగిరి హనుమంతరావుపై గెలుపొందారు. కోస్తాంధ్రకే తలమానికమైన ట్రిపుల్ ఐటీని నూజివీడుకు తీసుకురావడంలో చొరవ చూపారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.65కోట్లతో కృష్ణాజలాల తరలింపు ప్రాజెక్ట్ను చేపట్టారు. ఐదువేల ఇందిరమ్మ గృహాలను నిర్మించారు. వైఎస్ హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి పరువళ్లు తొక్కించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన ప్రతాప్ ఐదు వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్పార్టీలోని ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావ్ వర్గం వెన్నుపోట్ల కారణంగానే ప్రతాప్ఓటమిని చవిచూడాల్సి వచ్చిందనే విమర్శలున్నాయి. వైఎస్ మరణం అనంతరం జననేత జగన్ వెంట ప్రతాప్ నడిచారు. స్థానికుడనే అంశం,గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారనే సానూభూతి పవనాలు ఈ దఫా ప్రతాప్కు కల్సివస్తున్నాయి. టీడీపీలో తీవ్ర అసమ్మతి.... అభ్యర్థిత్వంపై చివరి నిముషం వరకు నాన్చిన టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన ముద్దరబోయినకు టీడీపీ టికెట్ కట్టబెట్టారు. ఆపార్టీలోని బలమైన సామాజిక వర్గం ముద్దరబోయిన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గన్నవరంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో తమ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ముద్దరబోయిన వేధింపులకు గురిచేశారన్నది ఆ వర్గం వాదన. ఈ క్రమంలో ముద్దరబోయినకు జై కొట్టేందుకు ఆ వర్గం ససేమిరా అంటుంది. నూజివీడు, ముసునూరు మండలాల్లో టీడీపీకి బాగా పట్టున్న గ్రామాల్లో సైతం ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. పార్టీలోని అసంతృప్తులు, అలకల కారణంగా ముద్దరబోయిన ప్రచారంలో బాగా వెనుకబడ్డారు. ఎన్నికలకు ఇంకా 15 రోజులు మాత్రమే గడువు ఉండటంతో నియోజక వర్గంలో పూర్తిస్థాయి ప్రచారం సాధ్యం కాదని ఆపార్టీ శ్రేణులంటున్నాయి. స్థానికేతరుడు అనే అంశం ముద్దరబోయినపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాంగ్రెస్ పని ఖాళీ... ఏం చేసినా వెరైటీగా ఉండాలనుకొనే చిన్నం రామకోటయ్య ఒడ్డుకు చేరదని తెల్సి మరీ కాంగ్రెస్నావ ఎక్కారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్రలో ముఖ్య నాయకులు సైతం కాంగ్రెస్ను వీడితే, జిల్లాలో ఒక్క రామకోటయ్య మాత్రమే కాంగ్రెస్లో చేరారు. ఎలాంటి పోటీ లేకుండా ఆపార్టీ టికెట్ను పొందారు. భుజాన కాంగ్రెస్జెండా వేసుకొని నలుగురైదుగురు కార్యకర్తలతో మొక్కుబడిగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ టికెట్ ఆశించిన రామకోటయ్య విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశారు. చివరి నిమిషం ఆపార్టీ అధ్యక్షుడు చిరంజీవి ఝలక్ ఇవ్వడంతో టీడీపీకి జై కొట్టారు. రాజధానిలో లోకేష్తో చేసిన పైరవీలు ఫలిం చాయి. అనూహ్యంగా టీడీపీ టికెట్ దక్కించుకున్నారు. రెట్టించిన ఉత్సాహంలో ఓటుకు నోటు కోసం డబ్బులు కుమ్మరించారు. ఎమ్మెల్సీ పాలడుగు వర్గం చేయి అందించడంతో ఆ ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రామకోటయ్యకు టీడీపీలో వేధింపులు ఎక్కువైపోవడంతో గుడ్బై చెప్పా రు.కాంగ్రెస్ అభ్యర్థిగా తెరపై నిల్చారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ గల్లతైంది. జగన్ చరిష్మాతో నియోజక వర్గంలో కాంగ్రెస్ ఖాళీ అయింది. సర్పంచి ఎన్నికల నుంచి ఇటీవల జరిగిన మున్సిపల్, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల వరకు కాంగ్రెస్పార్టీ నుంచి పోటీకి దింపేందుకు అభ్యర్థుల్ని వెతుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సీనియర్ నేత ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావ్ సైత ం నియోజక వర్గ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ తరఫున చిన్నం రామకోటయ్య పోటీ నామమాత్రమే అవుతుదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.