breaking news
No heroine
-
హీరోయిన్ లేకుండానే సినిమా!
సాధారణంగా సినిమా అంటే.. హీరోయిన్లు వర్షంలో తడుస్తూ సాగే పాట ఒకటి, నాలుగైదు రొమాంటిక్ సన్నివేశాలు, ఇంకా వీలైతే లిప్లాక్లు. ఇవన్నీ ఉంటాయి. కానీ అసలు హీరోయినే లేకుండా సినిమా తీయడం సాధ్యమేనా అంటే.. తాము చేసి చూపిస్తామంటున్నారు బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్, నిర్మాత దినేష్ విజన్. వీళ్లిద్దరు కలిసి తీస్తున్న 'బద్లాపూర్-2' సినిమాలో అసలు హీరోయిన్ పాత్రే ఉండబోదట. ఈ విషయాన్ని నిర్మాత విజన్ స్పష్టం చేశారు. తమ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ ఒక సినిమా స్క్ర్రిప్టు రాయడానికి రెండేళ్ల సమయం తీసుకుంటారని, బద్లాపూర్ సినిమాకు కూడా అలాగే తీసుకున్నారని చెప్పారు. ఈమధ్యే బద్లాపూర్-2 సినిమా స్క్రిప్టు పని పూర్తయిందని తెలిపారు. తొలుత ఈ సినిమాలో దీపికా పడుకొనే హీరోయిన్గా చేస్తుందని రూమర్లు వచ్చినా, వాటిని ఆయన కొట్టిపారేశారు. రాబ్తా సినిమా విడుదల కాగానే తాము బద్లాపూర్-2లో నటీనటుల ఎంపికను పూర్తి చేస్తామన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదని మాత్రమే ప్రస్తుతానికి చెప్పగలమన్నారు. విజన్ నిర్మాతగా వ్యవహరించిన రాబ్తా సినిమా ప్రస్తుతం న్యాయపరమైన చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. తమ మగధీర సినిమానే కొద్దిగా మార్చి అక్కడ రాబ్తాగా తీస్తున్నారంటూ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కోర్టుకెక్కారు. అయితే పునర్జన్మ అనేది బాగా విజయవంతమైన కాన్సెప్ట్ అని, ఇంతకుముందు హిందీలో కరణ్ అర్జున్, మధుమతి, ఓం శాంతి ఓం ఈ కాన్సెప్టుతోనే వచ్చాయని విజన్ అన్నారు. తాను రాజమౌళికి, ఆయన సినిమాలకు పెద్ద ఫ్యాన్ అని, ఆయనను తానెప్పుడూ కాపీ చేయబోనని చెప్పారు. ఈ రెండు సినిమాల్లో కామన్ పాయింట్ కేవలం పునర్జన్మేనని, వాళ్లకు తన సినిమా చూపించి, మగధీరలో ఒక్క సీన్ కూడా కాపీ చేయలేదని నిరూపిస్తానన్నారు. రాబ్తా సినిమా జూన్ 9న విడుదల కావాల్సి ఉంది. -
సూపర్ స్టార్కు జోడీ లేదా?
తాజా చిత్రంలో సూపర్ స్టార్కు హీరోయిన్ లేరట. లింగా చిత్రం తరువాత సూపర్స్టార్ రజినీకాంత్ తదుపరి చిత్రానికి సిద్ధమయ్యారన్న విషం తెలిసిందే. లింగా చిత్ర సమస్యలు సూపర్స్టార్ చాలా డిస్ట్రబ్ చేశాయని చెప్పవచ్చు. చిత్రం హిట్ అయినా, ఫట్ అయినా తనకు సంబంధం లేదని నిర్ణయానికి వచ్చిన రజినీ ఈ సారి తన వయసుకు తగ్గ పాత్రలో నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం. అట్టకత్తి, మెడ్రస్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు రంజిత్ రజినీ కోసం మంచి కమర్షియల్ అంశాలతో కూడిన కథను వండారట. ఇందులో సూపర్ స్టార్ దాదా పాత్రను పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఆయనకు హీరోయిన్ ఉండరట. అయితే ఒక ముఖ్య పాత్రలో ప్రముఖ నటినొకరిని నటింప చేయడానికి ఆమెతో చర్చలు జరుగుతున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత, తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు కలైపులి ఎస్ ధాను నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ టాక్. చిత్రం వచ్చే నెలలో చెన్నైలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రం తరువాత రజినీ స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తారని సమాచారం. దీనికి నెంబర్ ఒన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. దీన్ని ఐన్గారన్ ఫిలింస్ కరుణామూర్తి నిర్మించనున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది మొదలవుతుందని కోలీవుడ్ టాక్.