breaking news
NMU general secretary
-
ఆర్టీసీకి చమురుదెబ్బ!
సాక్షి, రాజంపేట : పెరుగుతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ సంస్థ కుదేలవుతోంది. చమురుదెబ్బతో విలవిలాడుతోంది. దీంతో మరింత నష్టాల్లో కూరుకుపోతోంది. ఇంధన ధరల పెరుగుదలే నష్టాలకు కారణమని ఆర్టీసీ కార్మికవర్గాలు వాపోతున్నాయి. జిల్లాలో కడప, పులివెందుల, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, బద్వేలు డిపోలు ఉన్నాయి. రెండు నెలల్లో డిజిల్ లీటరుకు రూ.5 పెరిగింది. దీంతో రోజుకు రూ.10 లక్షల అదనపు భారం ఆర్టీసీపై పడింది. తరచూ ఇంధన ధరల పెరుగుదల ఆర్టీసీకి గుదిబండలా మారింది. డీజిల్ ధరలు పెరగడం వల్ల పరోక్షంగా ఆర్టీసీ చార్జీలు పెంచాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. రోజుకు 3.75 లక్షల కిలోమీటర్లు మేర బస్సులు నడుస్తున్నాయి. ప్రతిరోజు 3లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తోంది. గతంలో డీజిల్ ధరలు పెరిగితే చార్జీలను పెంచేవారు. ప్రస్తుతం చార్జీలు పెంచితే ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతోందనే భయంతో ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. డీజిల్ ధరల ప్రభావం ఇలా.. జిల్లాలోని డిపోల పరిధిలో 564 ఆర్టీసీ బస్సులను సొంతంగా నడుపుతోంది. 294 అద్దె బస్సులను వినియోగిస్తోంది. మొత్తం మీద 858 బస్సులకు రోజుకు 65వేల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. దీని కోసం రోజుకు రూ.4 లక్షలకుపైగా వెచ్చించాల్సి ఉంది. నెలకు రూ.8 కోట్లు డీజిల్కే ఖర్చు చేయాల్సి వస్తోం ది. నెల రోజులపాటు బస్సులను రోడ్డెక్కిస్తే రూ.27 కోట్లు ఆదాయం వస్తోంది. జిల్లాలోని కడప, మైదుకూరు, ప్రొద్దుటూ రు, జమ్మలమడుగు, రాయచోటì, రాజం పేట డిపోలకు చిత్తూరు నుంచి డీజిల్ సరఫరా చేస్తోంది. బద్వేలుకు ఒంగోలు, పులివెందులకు గుంతకల్లు నుంచి అందుతోంది. నెలకు రూ.3కోట్లు అదనపుభారం పడుతోంది. ఇంధన పొదుపు తప్పనసరి.. ఆర్టీసీకి వస్తున్న ఆదాయంలో మూడో వంతు డీజిల్, జీతభత్యాలు, విడిభాగాల కొనుగోలుకు ఖర్చు అవుతోంది. నష్టాల ఊబిలో కూరుకున్న సంస్థను గట్టెక్కించేందుకు అధికారులు యత్నాలు చేస్తున్నారు. మరోవైపు డీజిల్తోపాటు ఇతర ధరలు పెరుగుదల శాపంగా మారుతోంది. ఇంధనపొదుపుపై డ్రైవర్లకు అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. నష్టాలను తగ్గించేందుకు అంతర్గతంగా ప్రణాళికలను రూపొందించుకొని ముందుకెళుతున్నారు. ట్యాక్స్ ఎత్తివేయాలి ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్పై ట్యాక్స్ ఎత్తివేయాల్సిన ఆవశ్యకత ఉంది. కెఎంపీఎల్ సాధించే విషయంలో డ్రైవర్లపై విపరీతంగా మానసిక ఒత్తిడి కలుగుతోంది. మానసిక ప్రశాంతతో విధులు నిర్వర్తించాలంటే ప్రభుత్వం డీజిల్ సరఫరా విషయంలో సముచిత నిర్ణయం తీసుకోవాలి. –శివారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎన్ఎంయూ, కడప -
ఆర్టీసీలో ఉద్యోగాలిప్పిస్తామని కుచ్చుటోపీ
♦ 80 మంది నుంచి రూ.2.05 కోట్ల వసూలు ♦ ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ నల్లగొండ క్రైం: ఆర్టీసీలో ఉద్యోగాలిప్పిస్తామని మోసం చేసిన ఎనిమిది మందిని నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఎన్ఎంయూ ప్రధాన కార్యదర్శి సయ్యద్ మహమూద్ కూడా ఉన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఎస్పీ విక్రమ్ జీత్ దుగ్గల్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. సయ్యద్ మహమూద్, కోదాడ మండలం ఎర్రారం గ్రామానికి చెందిన నలజాల కొండల్రావు, పారెల్లి వెంకటేశ్వర్లు, కొండా శివయ్య, కాసగాని రమేష్, చెన్నురి శేఖర్రెడ్డి, ముడావత్ గోపాల్, దాస్యం నాగరాజు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఉద్యోగాలిప్పిస్తామని నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 80 మంది నిరుద్యోగుల నుంచి రూ. 2.05 కోట్లు వసూలు చేశారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కోదాడ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితులైన సయ్యద్ మహమూద్, కొండల్రావుల నుంచి రూ.16 లక్షల 50 వేలు, స్కార్పియో, స్కోడా కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ.3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు వసూలు చేసినట్లు వివరించారు.