breaking news
new trians
-
భ్రాంతిగా మారిన తెలంగాణ సంపర్క్ క్రాంతి
సాక్షి, హైదరాబాద్: ఏడేళ్లు దాటినా కొత్త రైళ్లు పట్టాలెక్కడంలేదు. హైదరాబాద్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి ఇప్పటికీ ఒకే ఒక్క రైలు అందుబాటులో ఉంది, అన్ని రాష్ట్రాల రాజధానుల నుంచి న్యూఢిల్లీకి సంపర్క్ క్రాంతి రైళ్లు నడుస్తున్నాయి. తెలంగాణ నుంచి మాత్రం తెలంగాణ ఎక్స్ప్రెస్ ఒక్కటే అంబాటులో ఉంది. దీంతో ప్రయాణికులు ఈ ఒక్క రైల్లో బెర్తు కోసం నెలల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. ప్రతి సంవత్సరం చర్విత చర్వణంగా బడ్జెట్లు వస్తూనే ఉన్నాయి. కొత్త రైళ్లు మాత్రం రావడం లేదు. తాజాగా కేంద్రం మరో మరో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఈసారైనా చారిత్రక హైదరాబాద్ నుంచి తెలంగాణ సంపర్క్ క్రాంతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఏదీ సంపర్క్ క్రాంతి... ► ఏపీ, తమిళనాడు, కర్ణాకటక, కేరళ తదితర అన్ని రాష్ట్రాల నుంచి సంపర్క్ క్రాంతి రైళ్లు నడుస్తున్నాయి. ఏపీ సంపర్క్క్రాంతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (12708/12707) తిరుపతి నుంచి నిజాముద్దీన్ స్టేషన్కు రాకపోకలు సాగిస్తోంది. ఇది కాచిగూడ మీదుగా అందుబాటులో ఉన్నప్పటికీ బెర్తులు లభించడం కష్టమే. ► మరోవైపు అన్ని రాష్ట్రాలకు చెందిన రాజధానులు లేదా పుణ్యక్షేత్రాల నుంచి సంపర్క్క్రాంతి రైళ్లు నడిపినప్పుడు తెలంగాణ నుంచి కూడా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ► ప్రస్తుతం తెలంగాణ ఎక్స్ప్రెస్ నాంపల్లి నుంచి కాజీపేట్, బల్లార్ష మీదుగా నడుస్తోంది. తెలంగాణ సంపర్క్క్రాంతి ఎక్స్ప్రెస్ను సికింద్రాబాద్ నుంచి నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, బల్లార్షల మీదుగా డెహ్రాడూన్ మార్గంలో నడిపితే ఇప్పటి వరకు న్యూఢిల్లీకి నేరుగా రైలు సదుపాయం లేని కొత్త ప్రాంతాలకు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. (క్లిక్: తెలంగాణలో పెరుగుతున్న భూముల ధరలు.. ఖజానాకు ‘భూమ్’) కొత్త రైళ్లేవీ? ► మరోవైపు హైదరాబాద్ నుంచి వందేభారత్ రైలును ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. దేశవ్యాప్తంగా వంద వందేభారత్ కోసం ప్రతిపాదనలు రూపొందించారు. ప్రస్తుతం న్యూఢిల్లీ– వారణాసి, న్యూఢిల్లీ నుంచి శ్రీమాతా వైష్ణోదేవి ఆలయానికి మాత్రమే ఈ రైళ్లు గతేడాది నుంచి నడుస్తున్నాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో నడిచే వందేభారత్ను సికింద్రాబాద్ నుంచి న్యూఢిలీకి నడపాలనే ప్రతిపాదన ఇప్పటికీ అమలుకు నోచుకోవడంలేదు. ► మరోవైపు హైదరాబాద్ నుంచి వికారాబాద్ మీదుగా మరో వందేభారత్ రైలును ముంబై వరకు నడిపాలనే ప్రతిపాదన సైతం ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ► మొత్తం 18 బోగీలు ఉండే ఈ ట్రైన్లో జీపీఎస్ అధునాతన సదుపాయాలు ఉంటాయి. ► సికింద్రాబాద్ నుంచి పుణేకు నడిచే శతాబ్ది ఎక్స్ప్రెస్ను రెండేళ్ల క్రితం నిలిపివేశారు. ఎంతో డిమాండ్ ఉన్న ఈ ట్రైన్ నిలిపివేయడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పుణే– సికింద్రాబాద్ మార్గంలో లైన్ల సామర్థ్యాన్ని పెంచి సత్వరమే శతాబ్ది రైలును పునరుద్ధరించాల్సి అవసరం ఉంది. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఈ ఏడేళ్లలో కొత్త రైళ్లు అందుబాటులోకి రాలేదు. పైగా ఉన్నవాటిని రద్దు చేస్తున్నారు. ఇది న్యాయం కాదు. చాలా వరకు రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి. – ఫణి, సాఫ్ట్వేర్ వందేభారత్ నడపాలి దక్షిణాదిలో ఇప్పటి వరకు వందే భారత్ రైలును ప్రవేశపెట్టలేదు. హైదరాబాద్ నుంచి ముంబైకి లేదా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు నగరాలకు వందేభారత్ను నడపాలి. దీనివల్ల ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. – సునీల్, వికారాబాద్ -
రైలు చార్జీలు పెంచుతారా?
న్యూఢిల్లీ: దశాబ్ద కాలంలో తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతీయ రైల్వే వ్యవస్థ అదనపు ఆర్థిక వనరుల సమీకరణకు ప్రయాణికులు, సరకు రవాణా చార్జీలు పెంచుతుందా ? అన్న అంశంపై ప్రయాణికుల ఆసక్తి పెరిగింది. గతేడాది ప్రయాణికుల చార్జీలను వదిలేసి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు సరకు రవాణా చార్జీలను పెంచారు. అనంతరం ఏడాది మధ్యలో ప్రయాణికుల ఫస్ట్క్లాస్, ఏసీ కోచ్ల చార్జీలను సెస్ రూపంలో పెంచారు. ఇప్పుడు కూడా అలాంటి వైఖరినే అవలంబిస్తారా ? గత ఏడాది బడ్జెట్లో సురేశ్ ప్రభు ఎలాంటి కొత్త రైళ్లను ప్రవేశపెట్టక పోయినప్పటికీ ఆశించిన టార్గెట్లు నెరవేరలేదు. ప్రయాణికులు, సరకు రవాణా చార్జీల వల్ల 1,41,416 కోట్ల రూపాయల రెవెన్యూ సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, 1,36, 079 కోట్ల రూపాయల రెవెన్యూ మాత్రమే వచ్చింది. రెవెన్యూలో 3.77 శాతం తగ్గుదల కనిపించింది. ప్రతి వంద రూపాయల రెవెన్యూకు ఖర్చును 85.5 తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నా ఖర్చు మాత్రం 97.8 రూపాయలకు పెరిగింది. ప్రయాణికులు, సరకు రవాణా లక్ష్యాలు కూడా ఆమడ దూరంనే ఉండిపోయాయి. వచ్చే మార్చినెల నాటికి 8.50 కోట్ల టన్నుల సరకును రవాణా చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, గత డిసెంబర్ నెల నాటికి కేవలం 80 లక్షల టన్నుల సరకును మాత్రమే రవాణా చేసింది. మిగతా లక్ష్యాన్ని అందుకునే ఆస్కారమే లేదు. దిగజారిన ఆర్థిక పరిస్థితి కారణంగా జనరల్ బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సిందిగా రైల్వే శాఖ చేసిన విజ్ఞప్తిని ఆర్థిక శాఖ త్రోసిపుచ్చింది. పైగా గతంలోకన్నా 30 శాతం కోత విధిస్తున్నట్టు వెల్లడించింది. కనీసం గ్రాంట్ రూపంలో ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. కేంద్రానికి చెల్లించాల్సిన 8,000 కోట్ల రూపాయల డివిడెంట్ను మాఫీ చేయాల్సిందిగా కోరినా ససేమిరా అంది. స్వయంగా ఆర్థిక వనరులను సమకూర్చుకోవాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చింది. ఈ పరిస్థితికి తోడు ఏడవ వేతన సంఘం సిపార్సులను ఉద్యోగులకు అమలు చేయడం వల్ల రైల్వేలపై ఈ ఏడాది అదనంగా 32,000 కోట్ల రూపాయల భారం పడనుంది. ఉద్యోగుల రిటైర్మెంట్ కారణంగా పడే భారం దీనికి అదనం. ఇంతటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో కొత్త రైళ్లను ప్రకటించే అవకాశం లేదని రైల్వే వర్గాలు తెలియజేస్తున్నాయి. ఆధునిక హంగులుగల బోగీలను ప్రవేశపెడతామని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించినందున వాటిని ప్రవేశపెట్టి వాటిపై అదనపు చార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. సరకు రవాణా చార్జీలతో పాటు ప్రయాణికుల చార్జీలను పెంచేందుకు సురేశ్ ప్రభు మొగ్గు చూపుతున్నా రాజకీయ కారణాలు అందుకు సహకరించడం లేదు. రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల చార్జీలను ఇప్పుడు పెంచకపోవచ్చని, ఎన్నికలు అయిన వెంటనే కచ్చితంగా పెంచుతారని విశ్వసనీయ వర్గాల ద్వారా స్పష్టమవుతుంది. ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు బుల్లెట్ ట్రెయిన్ల సంగతి మాట పక్కన పెడితే ఈసారి కూడా ఎదుగు బొదుగులేని బడ్జెట్నే ఆవిష్కరిస్తారని అర్థమవుతుంది.