breaking news
neuroscience
-
'మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం'.. ఇది శాస్త్రీయ వాస్తవం!
“మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాం" అనేది కేవలం ఒక వేదాంత సూక్తి మాత్రమే కాదు, ఇప్పుడిది నిర్ధారణ అయిన ఒక శాస్త్రీయ వాస్తవం కూడా! మన మనస్సు, ఆలోచనలు మన శరీరంపై, ముఖ్యంగా వ్యాధి నిరోధక వ్యవస్థపై ఎంతటి బలమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసా? ఆశావాద ఆలోచనలు కేవలం మానసిక ప్రశాంతతకే కాదు, మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలకు మరోసారి తాజాగా నిరూపణ అయింది. మెదడును మనం మన ఆలోచనలతోనే 'రీ-వైరింగ్' చేస్తూ 'ఇమ్యూనిటీ'ని పెంచుకోవచ్చని ఇటీవలి ఒక విప్లవాత్మక పరిశోధన స్పష్టం చేసింది! అసలు ఆలోచనలకు, ఆరోగ్యానికి ఉన్న ఈ అద్భుతమైన లంకె ఏంటి?! చూద్దాం రండి.ఇంతవరకూ తెలుసుకున్నదిశరీరంపై ఆలోచనలు ప్రభావం చూపుతాయనే భావన ఎప్పటినుంచో ఉన్నప్పటికీ, దీని వెనుక ఉన్న నాడీ మండల నిర్మాణ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో కీలక పురోగతి సాధించింది గత కొన్నేళ్లలోనే అని డార్ట్మౌత్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ అమెరికన్ న్యూరోసైంటిస్ట్ టామ్ వేగర్ అంటారు. ఆశావాద ఆలోచనలు, మంచే జరుగుతుందన్న తలంపు, మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను (ఆనందాన్ని ఇచ్చే భాగం) క్రియాశీలం చేస్తాయి. మంచి ఆహారం తిన్నప్పుడు, ఒక ఆటలో గెలిచినప్పుడు లేదా ఎవరైనా ప్రశ్నించినప్పుడు మనకు కలిగే ఆనందానికి ఈ భాగమే కారణం. ఈ ప్రాంతంలో ఉండే నాడీ కణాలు ‘డోపమైన్’ అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా స్పందిస్తాయి– ఇదీ ఇంతవరకు పరిశోధకులు తెలుసుకున్నది.తాజా పరిశోధనతో నిర్థారణఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ మెడికల్ సెంటర్కు చెందిన తామర్ కొరెన్ అనే వైద్య పరిశోధకురాలు, ఎలుకలలో ఈ ‘రివార్డ్ కణాలను’ ఉత్తేజపరచడానికి జన్యు పద్ధతులను ప్రయోగించినప్పుడు ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు కనిపించాయి. ఎలుకలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లతో మరింత సమర్థంగా పోరాడగలిగాయి. గుండెపోటు నుండి త్వరగా కోలుకున్నాయి, అంతేకాకుండా వాటిలో కణుతుల పెరుగుదల కూడా నెమ్మదించింది. ఈ విధానం చాలా ఆశాజనకంగా కనిపించడంతో, ఇది మనుషులకు కూడా పనిచేస్తుందో లేదో తెలుసుకోవాలని తామర్ కొరెన్ బృందం భావించింది. అయితే ఎలుకలలో ఉపయోగించిన జన్యుపరమైన పద్ధతులను మనుషులపై ప్రయోగించటం సురక్షితం కాదు. అందుకే, వారు కొందరు వ్యక్తులకు ఒక శిక్షణ ఇచ్చారు. తమ సొంత ఆలోచనల ద్వారానే మెదడులోని ఆ రివార్డ్ భాగాన్ని ఎలా ఉత్తేజపరుచుకోవాలో ఆ వ్యక్తులకు నేర్పించారు. వారు ఈ ప్రయోగాన్ని ఎలా నిర్వహించారో ప్రఖ్యాత ‘నేచర్ మెడిసిన్’ పత్రిక ప్రచురించింది.తొలినాళ్ల ప్రయోగం కుక్కపైన!ఈ రకమైన పరిశోధనలు 1890ల చివర్లో ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త చేసిన ప్రయోగాల నుంచి మొదలయ్యాయి. మన శరీరం ఆహారం నుండి శక్తిని, పోషకాలను ఎలా తీసుకుంటుందో ఆయన అధ్యయనం చేశారు. ఆకలితో ఉన్న ఒక కుక్కకు ఆహారం ఇచ్చే ప్రతిసారీ ఆయన ఒక గంట మోగించేవారు. కొద్ది రోజులకే, ఆహారం ఇవ్వకపోయినా సరే... కేవలం ఆ గంట శబ్దం వినగానే కుక్క నోట్లోంచి లాలాజలం ఊరడం మొదలైంది. మనస్తత్త్వవేత్తలు దీన్ని ‘కండిషన్డ్ రెస్పాన్స్’ (అలవాటైన స్పందన) అని పిలుస్తారు. ఈ పరిశోధనలకు గాను పావ్లోవ్కు 1904లో నోబెల్ బహుమతి లభించింది.తర్వాత ఎలుకల మీదకొన్ని దశాబ్దాల తర్వాత, రాచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్ట్ అడెర్, నికోలస్ కోహెన్ ఎలుకలపై ఇలాంటి ప్రయోగమే చేశారు. వారు ఎలుకలకు ఒక తీపి పానీయాన్ని ఇచ్చాక, ఆ వెంటనే వాటి రోగనిరోధక శక్తిని తగ్గించే ఒక మందును ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేవారు. కొంతకాలం తర్వాత, ఆ ఇంజెక్షన్ ఇవ్వకుండా కేవలం తీపి పానీయం మాత్రమే ఇచ్చినా ఎలుకల రోగనిరోధక వ్యవస్థలో ఆ మార్పులు కనిపించాయి! ఈ ప్రభావాన్ని ‘సైకోసోమాటిక్’ అంటారు. అంటే ఏదైనా ఒక సంకేతం (గంట శబ్దం వినడం లేదా తీపి పానీయం తాగడం వంటివి) ద్వారా మెదడు శరీరంలో నిజమైన మార్పులను తీసుకురాగలదని దీని అర్థం. ఈ ‘సైకోసోమాటిక్’ అనే మాటకు సమాజంలో కాస్త ప్రతికూల ముద్ర ఉంది. మానసిక ఒత్తిడి లేదా మానసిక స్థితి వల్ల వచ్చే తలనొప్పి, నొప్పులు, వికారం లేదా చర్మ సమస్యల గురించి చెప్పటానికి తరచుగా ఈ పదాన్ని వాడతారు. చాలామంది వీటిని కేవలం ‘భ్రమ’ అని లేదా ఒక చిన్న విషయమని కొట్టిపారేస్తుంటారు.సైకోసోమాటిక్ గీ ప్లాసిబో ఎఫెక్ట్కొన్నిసార్లు సైకోసోమాటిక్కు వ్యతిరేకంగా కూడా జరుగుతుంది. ఉదాహరణకు ‘అసలు మందు’ కాకుండా, కేవలం మందు బిళ్లలా కనిపించే ‘పంచదార బిళ్ల’ వేసుకున్నా కొందరికి జబ్బు నయమవుతుంది. దీన్నే ‘ప్లాసిబో ఎఫెక్ట్’ అంటారు. ఇది కూడా నిజమైన వైద్యం కాదని కొందరు తీసిపడేస్తుంటారు. అయితే, కొందరు పరిశోధకులు మాత్రం ఈ ప్లాసిబో ప్రభావాన్ని ఒక గొప్ప ‘మంత్రం’గా చూస్తున్నారు.ప్లాసిబో ప్రభావం అనేది శరీరంలో జరిగే నిజమైన భౌతిక/జీవక్రియ మార్పులను నియంత్రిస్తుంది. ఆశావాద ఆలోచనలు, మంచి ఫలితం వస్తుందనే నమ్మకం లేదా నిరీక్షణ వల్ల ఇది జరగవచ్చు. కారణం ఏదైనప్పటికీ, ‘ఇది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి’ అని కొరెన్ అంటున్నారు. అది అర్థమైతే, రోగులకు ఇచ్చే చికిత్సలు ఇంకా బాగా పనిచేసేలా ఒక తోడ్పాటు అవుతుందని ఆమె చెబుతున్నారు.‘కొరెన్’ వినూత్న పరిశీలనతామర్ కొరెన్ బృందం ఇప్పుడు ఆ ‘ప్లాసిబో’ ఆలోచనను నిజంగానే పరీక్షించి చూసింది. టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలోని సైకాలజీ ల్యాబ్తో కలిసి పనిచేస్తున్న కొరెన్ బృందం, 85 మంది యువకులను ఈ ప్రయోగం కోసం ఎంచుకుంది. ఆ యువకులందరూ ఆ మెడికల్ సెంటర్లో వ్యాక్సిన్ తీసుకోవటానికి సమ్మతించి వచ్చిన వారు. (హెపటైటిస్–బి అనే వైరస్ సోకకుండా నిరోధించడానికి ఈ టీకా ఇస్తారు. ఈ టీకా.. మనుషుల శరీరం, రోగనిరోధక వ్యవస్థలపై ఎలా స్పందిస్తుందో చూడటం ద్వారా, వారి రోగనిరోధక శక్తిలో వచ్చే మార్పులను సులభంగా కొలవడానికి పరిశోధకులకు ఒక మార్గం లభిస్తుంది.)న్యూరోఫీడ్బ్యాక్ విధానంఈ ప్రయోగం మొదటి దశ కోసం, ఎంపిక చేసిన వారికి ఫంక్షనల్ ఎమ్ఆర్ఐ స్కాన్లు చేశారు. వారు మెదడును స్కాన్ చేసే యంత్రంలో పడుకున్నారు, ఈ యంత్రం మెదడులోని ఏ భాగాలు చురుకుగా పనిచేస్తున్నాయో చూపిస్తుంది. ప్రతి 40 సెకన్ల సెషన్లో, పాల్గొనేవారిని తమ మెదడుకు పని చెప్పమని (ఆలోచించమని) చెప్పారు. ప్రతి ఒక్కరికీ తాము ఎలా ఆలోచించాలో సొంతంగా ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ఉదాహరణకు: స్క్రీన్ మీద ఉన్న ఒక ఎర్రటి చుక్కను చూడటం, తాము వెళ్లిన ఒక ప్రయాణాన్ని / పర్యటనను గుర్తుచేసుకోవడం, భవిష్యత్తు గురించి ఆలోచించడం, లేదా ఒక గణిత లెక్కను పూర్తి చేయడం... ఇలా. లక్ష్యం ఏంటంటే మన ఆలోచనలు మెదడులోని ఏ రకమైన ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకోవటమే.మెదడుపై ఆలోచనల ప్రభావంప్రయోగం తర్వాత మెదడు స్కాన్ చేసిన భాగాలకు 0 నుండి 10 వరకు స్కోర్లు (రేటింగ్) ఇచ్చారు. ఈ స్కోర్లు మెదడు లోపల ఉన్న ‘రివార్డ్ మార్గం’లోని చురుకుదనాన్ని ఆధారంగా చేసుకుని ఇచ్చారు. ఇందులో ప్రధానమైన ఒక భాగాన్ని ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ అంటారు. ఎలుకలలో ఆరోగ్యకరమైన మార్పులు తేవడానికి కొరెన్ బృందం ఉత్తేజపరిచింది కూడా ఈ భాగాన్నే. ప్రయోగంలో పాల్గొన్నవారిలో కొందరిని యాదృచ్ఛికంగా (ర్యాండమ్గా) ‘కంట్రోల్ గ్రూప్’లో పెట్టారు. వారి స్కోర్లు ఈ భాగంతో సంబంధం లేని వేరే మెదడు ప్రాంతం నుండి తీసుకున్నారు. ఎవరికైనా తక్కువ స్కోరు వస్తే, తదుపరి సెషన్లో తమ ఆలోచనలను వేరే విషయంపై కేంద్రీకరించమని వారికి చెప్పారు. ఒకవేళ వారి స్కోరు పెరిగితే, అదే విధంగా ఆలోచించే పద్ధతిని కొనసాగించమని లేదా ఇంకా మెరుగుపరచుకోమని చెప్పారు. ఈ విధమైన ‘ప్రయత్నిస్తూ నేర్చుకునే’ పద్ధతిని కొన్ని వారాల పాటు 45 నుండి 60 సెషన్లలో నిర్వహించారు. ఈ ప్రక్రియ అంతటా పాల్గొనేవారికి ఉన్న ఒకే ఒక లక్ష్యం.. వీలైనంత ఎక్కువ స్కోరు సాధించడం. అయితే ‘‘మాకు స్కోరు ఎంత వచ్చిందనే దానికంటే, ఆలోచనల ద్వారా ఎంత మెరుగుదల కనిపిస్తోంది అనేది చాలా ముఖ్యమైన విషయం’’ అని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన నిట్జన్ లుబియానకర్ అంటారు.టీకా స్పందనలో మార్పులుచివరి ఎం.ఆర్.ఐ. సెషన్ పూర్తయిన వెంటనే, ప్రయోగంలో పాల్గొన్న వారందరికీ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ టీకా శరీరంలో ‘యాంటీబాడీలు’ (వ్యాధి నిరోధక ప్రొటీన్లు) తయారయ్యేలా చేస్తుంది. ఈ యాంటీబాడీలు హెపటైటిస్–బి వైరస్ను గుర్తించి, కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడతాయి. టీకా ఇవ్వడానికి ముందు, ఇచ్చిన రెండు వారాల తర్వాత వారి రక్త పరీక్షలు చేసి యాంటీబాడీలను కొలిచారు. ఎవరైతే తమ ఆలోచనల ద్వారా ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’లో మెదడు చురుకుదనాన్ని పెంచుకోగలిగారో, వారిలో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత హెపటైటిస్–బి యాంటీబాడీల సంఖ్య చాలా ఎక్కువగా పెరిగింది! ఇది వారిలో రోగనిరోధక శక్తి బలపడిందని స్పష్టంగా చూపించింది. ఈ యాంటీబాడీల పెంపు 7 నుండి 10 శాతం మాత్రమే అయినప్పటికీ, ఇది చాలా గొప్ప విషయమని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జోనాథన్ కిప్నిస్ అంటున్నారు. ఆయనకు ఈ పరిశోధనతో సంబంధం లేకపోయినా.. మెదడుకి, రోగనిరోధక వ్యవస్థకి ఉన్న సంబంధాలపై ఆయన ప్రత్యేక అధ్యయనాలు చేస్తున్నారు.మనస్సుకు, శరీరానికి ఉన్న ముడి‘‘ఈ పరిశోధనలో నిజంగానే ఒక స్పష్టమైన ఫలితం కనిపించటంతో మేమంతా చాలా ఆశ్చర్యపోయాం’’ అని కొరెన్ తన సిద్ధాంత పత్రంలో రాశారు. ల్యాబ్లోని ఎలుకలలో కనిపించిన ఫలితం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు వాటి నాడీ కణాలను నేరుగా ఉత్తేజపరిచారు. కానీ, మనుషులు కేవలం తమ సొంత ఆలోచనలతో మాత్రమే మెదడులోని ఆ భాగాన్ని యాక్టివేట్ చేసుకోవడం అనేది ఒక సైన్స్ ఫిక్షన్ (కల్పిత కథ) లాగా అనిపించిందని ఆమె అన్నారు.అంతేకాకుండా, ఈ విజయం అనేది ఒకరి వ్యక్తిత్వంపై ఆధారపడి లేదు. తాము చాలా ఆశావాదులమని లేదా నమ్మకంతో ఉంటామని సర్వేలో చెప్పిన అందరికీ ‘వెంట్రల్ టెగ్మెంటల్ ఏరియా’ స్కోర్లు ఏమీ ఎక్కువగా రాలేదు. అయితే, ఎక్కువ స్కోర్లు సాధించిన వారిలో ఒక ఉమ్మడి లక్షణం కనిపించింది. వారు ఆశావాద ఆలోచనలను (మంచి జరుగుతుందనే ఆశను) పెంచే మానసిక విధానాలను ఎంచుకున్నారు. కొందరు తమ స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించారు. మరికొందరు తమ జీవితంలో జరిగిన మంచి అనుభవాలపై ధ్యాస పెట్టారు.పాల్గొనేవారు దేని గురించి ఆలోచించాలో పరిశోధకులు స్పష్టంగా చెప్పలేదు కాబట్టి, ఆలోచనలోని చిన్న చిన్న వివరాలు పెద్దగా తేడాను చూపలేదు. బదులుగా, పాల్గొన్నవారు స్క్రీన్ కనిపించే స్కోర్లను బట్టి తమ ఆలోచనలను మార్చుకుంటూ వచ్చారు. ఇది చాలా ఆసక్తికరమైన విషయమని లుబియానకర్ తెలిపారు. ఈ ఫలితం ‘మన మానసిక స్థితి’ అనేది మన ఆరోగ్యంపై, రోజువారీ శరీర క్రియలపై ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టంగా చెబుతోంది... మనకు తెలియకుండానే అది పనిచేస్తుంది’’ అని కొరెన్ అంటున్నారు.ఆశావాదం ఆరోగ్యదాయకంఈ అంతర్జాతీయ పరిశోధన మనకొక స్పష్టమైన, బలమైన సందేశాన్ని ఇస్తోంది: ‘శారీరక ఆరోగ్యానికి ఉదయం చేసే వ్యాయామం, తినే మంచి ఆహారం ఎంత ముఖ్యమో... మన రోజువారీ ఆలోచనా విధానం కూడా అంతే ముఖ్యం!’ అని.మనం నిత్యం అనుభవించే ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల ఆలోచనలు మన వ్యాధినిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంటే... ఆశావాదం, ప్రేమ, మధుర జ్ఞాపకాలు, నమ్మకాలు మన శరీరంలో అదనపు రక్షణ కవచాన్ని నిర్మిస్తాయి. మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’ను మన సొంత ఆలోచనలతో క్రియాశీలం చేసుకోవడం ద్వారా ఏ వైద్యానికీ లభించని ‘సైకోసోమాటిక్ బూస్ట్’ మన శరీరానికి లభిస్తుంది.కాబట్టి, అనునిత్యం ఆశావాదంతో ఆలోచిద్దాం... మన మెదడును సానుకూలంగా రీ–వైర్ చేసుకుందాం... సహజమైన రోగనిరోధక శక్తితో సంపూర్ణ ఆరోగ్యం పొందుదాం. - సాక్షి స్పెషల్ డెస్క్- తామర్ కొరెన్, వైద్య శాస్త్రవేత్త, టెల్ అవీవ్ మెడికల్ సెంటర్ -
ప్రతిష్ఠాత్మక ఐబీఆర్వో అధ్యక్షురాలిగా శుభా టోలే రికార్డ్ : ఆసక్తికర సంగతులు
బ్రెయిన్ అనేది రహస్యాల గని. భావోద్వేగాల ఫ్యాక్టరీ.‘ సైన్స్ ఆఫ్ ది బ్రెయిన్’ గురించి ఎన్నో దశాబ్దాలుగా కృషి చేస్తోంది ‘ఐబీఆర్వో’ అలాంటి ప్రసిద్ధ అంతర్జాతీయ సంస్థకు తొలిసారిగా భారతీయ శాస్త్రవేత్త అధ్యక్షురాలిగా ఎంపికైంది. ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐబీఆర్వో) అధ్యక్షురాలిగా ప్రముఖ శాస్త్రవేత్త శుభ టోలే నియమితురాలైంది. అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అత్యున్నత స్థానానికి ఎంపికైన తొలి శాస్త్రవేత్తగా ప్రత్యేకత సాధించింది...ప్రపంచవ్యాప్తంగా 57 దేశాలకు చెందిన 69 సైంటిఫిక్ సొసైటీలు, ఫెడరేషన్లకు ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (ఐబీఆరోవో) ప్రాతినిధ్యం వహిస్తోంది. 1961లో ఏర్పాటైన ‘ఐబీఆర్వో’ నినాదం: ప్రొవైడింగ్ ఈక్వల్ యాక్సెస్ టు గ్లోబల్ న్యూరోసైన్స్ గతంలో ‘ఐబీఆర్వో’ అధ్యక్షులుగా యూరోపియన్, ఉత్తర అమెరికా దేశాల నుంచి ఎంపికయ్యారు. భౌగోళికంగా, జనాభాపరంగా ‘ఐబీఆర్వో’కు సంబంధించి అతిపెద్ద ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం శుభ టోలేకు వచ్చింది.‘అభివృద్ధి చెందుతున్న దేశాలలో పనిచేయడానికి ఎన్నో పరిమితులు ఉంటాయి. ప్రయోగాలు, నిధుల జాప్యం నుంచి కొన్ని దేశాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సులు, వీసా అపాయింట్మెంట్లకు హాజరు కావడం వరకు ఇబ్బందులు ఉన్నాయి. చర్చల ద్వారా వాటికి పరిష్కారం దొరుకుతుంది’ అంటుంది శుభ.శుభ ప్రస్తుతం ముంబైలోని ప్రముఖ సైంటిఫిక్ రీసెర్చ్ సంస్థ–టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో గ్రాడ్యుయేట్ స్టడీస్ డీన్గా పనిచేస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ‘ఉమెన్ ఇన్ సైన్స్’ కమిటీకి చైర్పర్సన్గా పనిచేసింది. విద్యావంతుల కుటుంబంలో ముంబైలో జన్మించింది శుభ. తల్లి అరుణ టోలే ఆక్యుపేషనల్ థెరపిస్ట్. తండ్రి ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ విభాగానికి చెందిన సంస్థకు డైరెక్టర్గా పనిచేశాడు. ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో లైఫ్ సైన్సెస్, బయోకెమిస్ట్రీ చదివిన శుభ అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్, డాక్టోరల్ డిగ్రీ చేసింది. చికాగో యూనివర్శిటీలో పోస్ట్–డాక్టోరల్ రీసెర్చి చేసింది.వెల్కమ్ ట్రస్ట్ సీనియర్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి స్వర్ణజయంతి ఫెలోషిప్ తీసుకొంది. భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం నుంచి జాతీయ మహిళా బయోసైంటిస్ట్ అవార్డ్, సొసైటీ ఫర్ న్యూరోసైన్స్, యూఎస్ నుంచి రీసెర్చ్ అవార్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ న్యూరోసైన్సెస్ అవార్డ్ అందుకుంది.కథక్ డ్యాన్సర్ కూడాశుభ టోలే శాస్త్రవేత్తే కాదు కథక్ శాస్త్రీయ నృత్యకారిణి కూడా. లాస్ ఏంజిల్స్లో పీహెచ్డీ చేస్తున్న కాలంలో గురు అంజనీ అంబేగావ్కర్ దగ్గర కథక్ నేర్చుకుంది. ‘కథక్ చేస్తుంటే ఒత్తిడి దూరం అవుతుంది. మనసు ఆహ్లాదంగా ఉంటుంది. నేను, నా పెద్ద కొడుకు కథక్ ప్రాక్టీస్ చేస్తుంటాం. నా భర్త, ఇద్దరు పిల్లలు తబలాప్రాక్టీస్ చేస్తుంటారు’ అంటుంది శుభ.శుభ భర్త సందీప్ కూడా శాస్త్రవేత్త. ఇద్దరూ శాస్త్రవేత్తలే కాబట్టి ఇంట్లో సైన్స్కు సంబంధించిన విషయాలే మాట్లాడుకుంటారనేది అపోహ మాత్రమే. పెయింటింగ్ నుంచి మ్యూజిక్ వరకు ఎన్నో కళల గురించి మాట్లాడుకుంటారు. ‘సైన్స్ అనేది ఒక సృజనాత్మక వృత్తి’ అంటుంది శుభ. -
ప్రతికూల ఆలోచనల వల్లే ఆందోళన, కుంగుబాటు
లండన్: వృద్ధుల్లో ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడికి ప్రతికూల భావోద్వేగాలు, ఆలోచనలే కారణమని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. మనసులో ప్రతికూల ఆలోచనలు మొదలైతే ఆందోళన పెరుగుతున్నట్లు తేల్చారు. భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఒత్తిడి నుంచి బయటపడవచ్చని సూచించారు. పెద్దల్లో మెదడుపై ప్రతికూల ఆలోచనల ప్రభావం, మానసిక ఆందోళనకు మధ్య గల సంబంధాన్ని స్విట్జర్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకు చెందిన న్యూరో సైంటిస్టులు కనుగొన్నారు. ఇతరుల మానసిక వ్య«థ పట్ల యువకులు, వృద్ధులు ఎలా స్పందిస్తారు? వారి మెదడు ఎలా ఉత్తేజితం చెందుతుంది? వారిలో ఎలాంటి భావోద్వేగాలు తలెత్తుతాయి? అనే దానిపై పరిశోధన చేశారు. మొదటి గ్రూప్లో 27 మందిని(65 ఏళ్లు దాటినవారు), రెండో గ్రూప్లో 29 మందిని(25 ఏళ్ల యువకులు), మూడో గ్రూప్లో 127 మంది వయో వృద్ధులను తీసుకున్నారు. విపత్తుల వంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా మానసికంగా బాధపడుతున్న వారి వీడియో క్లిప్పులను, తటస్థ మానసిక వైఖరి ఉన్నవారి వీడియో క్లిప్పులను చూపించారు. యువకులతో పోలిస్తే వయో వృద్ధుల మెదడు త్వరగా ఉత్తేజితం చెంది, ప్రతికూల భావోద్వేగాలకు గురవుతున్నట్లు ఫంక్షనల్ ఎంఆర్ఐ ద్వారా గమనించారు. వారి మనసులో సైతం ఆందోళన, కుంగుబాటు, ఒత్తిడి వంటి విపరీత భావాలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అలాంటి ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించుకుంటే ఆందోళన, ఒత్తిడి సైతం తగ్గుముఖం పడుతున్నట్లు కనిపెట్టారు. అధ్యయనం వివరాలను నేచర్ ఏజింగ్ పత్రికలో ప్రచురించారు. -
హైదరాబాదీకి బంపర్ ఆఫర్..సుమారు కోటిన్నర స్కాలర్షిప్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన వేదాంత్ ఆనంద్వాడే (18) బంపర్ ఆఫర్ కొట్టేశాడు. అమెరికాలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ విశ్వవిద్యాలయంనుంచి భారీ స్కాలర్షిప్ సాధించాడు. వేదాంత్ బ్యాచిలర్ డిగ్రీ చదివేందుకు దాదాపు కోటిన్నర స్కాలర్షిప్ అందించనుంది. 17 మంది నోబెల్ గ్రహీతలను అందించిన కేస్ వెస్ట్రన్ నుండి స్కాలర్షిప్ అందుకున్న ఈ హైదరాబాదీ సర్జన్ కావాలనుకుంటున్నాడట. వేదాంత్ ఆనంద్వాడే న్యూరోసైన్స్ సైకాలజీలో ప్రీ-మెడ్ గ్రాడ్యుయేషన్ కోసం కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ నుండి రూ.1.3 కోట్ల స్కాలర్షిప్ అందుకున్నాడు.ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్షిప్ లేఖను పంపింది. అంతేకాదు క్లైమేట్ కాంపిటీషన్ ఛాలెంజ్లో విజయం సాధించిన వేదాంత్, ఈ ఏడాది నవంబర్లో పారిస్కు కూడా వెళ్లబోతున్నాడు. యునెస్కోలోని జ్యూరీకి సలహాలివ్వబోతున్నాడు. 8వ తరగతి చదువుతున్నప్పటినుంచే విదేశాలకు వెళ్లి చదువుకోవాలనేది తన లక్ష్యం, 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత, కోవిడ్ కాలంలో అమ్మ ప్రపంచవ్యాప్త నైపుణ్యానికి పరిచయం చేసిందని వెల్లడించాడు. ఈ క్రమంలో కోరుకున్న కాలేజీలు, కోర్సుల నిమిత్తం ఇంటర్నెట్ను వెదికాను. 16 సంవత్సరాల వయస్సులో మూడు నెలల క్యారియర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శిక్షణే, కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ స్కాలర్షిప్ దాకా తీసుకెళ్లిందంటూ తన జర్నీని వెల్లడించాడు వేదాంత్. కాగా వేదాంత్ తండ్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డెంటిస్టుగా ఉన్నారు. అమ్మ ఫిజియోథెరపిస్ట్గా పని చేస్తున్నారు. -
ఆస్పత్రి బిల్డింగ్ ఎక్కి రోగి హల్చల్.. రెండు గంటలు శ్రమించినా చివరకు
కోల్కతా: కోల్కతా న్యూరోసైన్స్ హాస్పిటల్లో ఓ రోగి హల్చల్ చేశాడు. రెండు గంటల పాటు అందర్నీ పరుగులు పెట్టించి, చివరికి బిల్డింగ్ పైనుంచి దూకి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కోల్కతాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోసైన్స్ హాస్పిటల్లో సుజిత్ అనే పేషెంట్ తన బెడ్ నుంచి తప్పించుకుని ఆస్పత్రి భవనం ఏడవ అంతస్తులోని ఓ గోడ అంచున కూర్చుని దూకేస్తానంటూ రెండు గంటలు పాటు హంగామా చేశాడు. ఆ పేషంట్ చికిత్స తాను పొందుతున్న వార్డులోని గ్లాస్ కిటికీలోని గ్యాప్ ద్వారా తప్పించుకుని ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. ఆసుపత్రి ఉద్యోగులు, అగ్నిమాపక దళం సిబ్బంది పేషంట్ని వార్డుకు తిరిగి రావాలని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. పేషంట్ని కాపాడేందుకు హైడ్రాలిక్ నిచ్చెన సాయంతో సిబ్బంది కిందకు దించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చివరికి ఆస్పత్రి సిబ్బంది, అగ్ని మాపక సిబ్బంది అతన్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బిల్డింగ్పై నుంచి దూకేశాడు. దీంతో అతని పుర్రె, పక్కటెముక, ఎడమ చేయి తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆసుపత్రి అధికారి తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని పేషంట్ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. చదవండి: భార్యను కాటేసిన పాము.. బాటిల్లో బంధించి మరీ ఆస్పత్రికి.. సమాధానం విని ఘొల్లుమని నవ్వులు -
ఇక బ్రెయిన్ స్ట్రోక్లకు భయం లేదు
లండన్: వైద్య విజ్ఞానరంగంలో విప్లవాత్మక మార్పులు వేగంగా వస్తున్నాయి. ఆంజియోగ్రామీ ద్వారా గుండెనాళాల్లోని రక్తపు గడ్డలను శుద్ధి చేసినట్లుగా మెదడు నరాల్లోని బ్లడ్ క్లాట్లను ఇక సులభంగానే తొలగించవచ్చు. కొత్తగా కనుగొన్న ఈ విధానాన్ని వైద్య పరిభాషలో 'మెకానికల్ త్రోంబెక్టమీస్' అని వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇంగ్లండ్లో అనుభవజ్ఞులైన కొంత మంది న్యూరాలజిస్టులు మాత్రమే ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో రక్తం గడ్డగట్టిన మెదడు రక్తనాళంలోకి కాథెరిన్ (మెత్తటి గొట్టం లాంటి పరికరం) పంపిస్తారు. అనంతరం అందులోకి స్టెంట్ లేదా వైర్ మెష్ను పంపిస్తారు. అది రక్తం గడ్డకట్టిన ప్రాంతానికి వెళ్లిన తర్వాత మెష్ విస్తరించిన గడ్డ కట్టిన రక్తాన్ని శుభ్రం చేస్తుంది. అనంతరం కాథెరిన్ నుంచి స్టెంట్ లేదా వైర్ మెష్ను తొలగిస్తారు. సాధారణంగా అనస్థిషియా బదులు సెడిషన్ (మత్తించే మందులు) డ్రగ్స్ ఇచ్చి ఈ వైద్య ప్రక్రియను చేపడుతున్నారు. రక్తాన్ని పలుచపరిచే మందుల వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన రోగులు 30 శాతం కోలుకుంటుంటే ఈ 'మెకానికల్ త్రోంబెక్టమీస్' వల్ల 80, 90 శాతం కోలుకునే అవకాశం ఉందని లండన్ వైద్యులు చెబుతున్నారు. రంగ్బీ మ్యాచ్లో గాయపడి బ్రెయిన్ స్ట్రోక్కు గురైన కార్నర్ లైన్స్ అనే 14 ఏళ్ల బాలుడికి మాట, కాళ్లు, చేతులు పడిపోవడంతో ఆ బాలుడికి 2015, మార్చి నెలలోనే ఈ కొత్త విధానం ద్వారా బ్లడ్ కాట్స్ను తొలగించారు. అనతికాలంలోనే కోలుకున్న ఆ బాలుడికి మాటతో సహా అన్ని అవయవాలు యథావిధిగా పనిచేస్తున్నాయి. ఈ విధానం ప్రస్తుతానికి లండన్లోని సెంట్ జార్జి ఆస్పత్రి సహా 24 న్యూరోసైన్స్ సెంటర్లకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఈ విధానాన్ని ప్రోత్సహించడం కోసం నేషనల్ హెల్త్ స్కీమ్ ముందుకు ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రతిపాదనలను త్వరలోనే ఆమోదిస్తామని, వీటి వల్ల వచ్చే ఏడాది నుంచి కనీసం వెయ్యి మంది రోగులకు ఇలాంటి చికిత్స అందించవచ్చని భావిస్తున్నామని సీఈవో సైమన్ స్టీవెన్స్ తెలిపారు. ఇంగ్లండ్ను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్స్ ఒకటి. చనిపోతున్న వారిలో నాలుగొంతుల మంది చావుకు బ్రెయిన్ స్ట్రోక్ కారణమవుతోంది. ఈ కారణంగా ఏడాదికి ఎన్హెచ్ఎస్పై 300 కోట్ల పౌండ్ల భారం పడుతోంది. మెకానికల్ త్రోంబెక్టమీస్ తరహాలోనే ఇప్పుడిప్పుడే గుండె రక్తనాళాల్లో పేరుకుపోయిన బ్లడ్ క్లాట్స్ను తొలగిస్తున్నారు. -
పరిశోధనల్లో కెరీర్కు పట్టంకట్టే జెస్ట్!
జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ (జెస్ట్).. దేశంలోని 20కిపైగా ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో పరిశోధన కోర్సులను అభ్యసించడానికి మార్గం సుగమం చేసే పరీక్ష. జెస్ట్-2015 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో పరీక్ష వివరాలు.. జెస్ట్ పరీక్ష ద్వారా ఫిజిక్స్, థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరో సైన్స్ విభాగాల్లో పీహెచ్డీ/ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులోని స్కోర్ ఆధారంగా వివిధ ఇన్స్టిట్యూట్లు తాము నిర్దేశించిన అర్హతలున్న విద్యార్థులను తుది ఎంపిక కోసం పిలుస్తాయి. ఈ క్రమంలో జెస్ట్ స్కోర్ ఏడాదిపాటు చెల్లుబాటు అవుతుంది. రాత పరీక్ష: గ్రాడ్యుయేషన్, పోస్ట్గ్రాడ్యుయేషన్ స్థాయి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి. ఫిజిక్స్: రాత పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో 25 ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు. రెండో విభాగంలో 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ఇందులో 40 శాతం ప్రశ్నలు బీఎస్సీ సిలబస్ నుంచి, 60 శాతం ఎంఎస్సీ సిలబస్ నుంచి వస్తాయి. సిలబస్: మ్యాథమెటికల్ మెథడ్స్, క్లాసికల్ మెకానిక్స్, ఎలక్ట్రోమాగ్నటిక్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ స్టాటిస్టికల్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్, అటామిక్ అండ్ ఆప్టికల్ ఫిజిక్స్, ప్రాబబిలిటీ థియరీ. థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్: ఇందులో రెండు రకాలు ప్రశ్నలు ఉంటాయి. కొన్నిటికి స్వల్ప సమాధానాలు సరిపోతే, మరికొన్నిటికి దీర్ఘ సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అంశాలపై ప్రాథమిక భావనలను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఇస్తారు. అంతేకాకుండా కొన్ని ప్రశ్నలను సాధించడానికి మ్యాథమెటికల్ నైపుణ్యం కూడా అవసరం. సిలబస్: అనలిటికల్ రీజనింగ్ అండ్ డిడక్షన్, కాంబినోట్రిక్స్, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్, డిస్రిక్ట్ మ్యాథమెటిక్స్, గ్రూప్ థియరీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్/న్యూరో సైన్స్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సెన్సైస్-చెన్నై: పీహెచ్డీ ఇన్థియోరిటికల్ కంప్యూటర్ సైన్స్ కోర్సును అందిస్తుంది. అర్హత: ఎంఎస్సీ/ఎంటెక్/ఎంఈ (కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత విభాగం)/ఎంసీఏ. నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్బీఆర్సీ)- గుర్గావ్ పీహెచ్డీ ఇన్ న్యూరోసైన్స్ కోర్సును అందిస్తుంది. అర్హత: ఎంఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్) లేదా బీఈ/బీటెక్/ఎంసీఏ. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ/ఎంటెక్ పీహెచ్డీ: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్/స్టాటిస్టిక్స్/మ్యాథమెటిక్స్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ (ఫిజిక్స్/మ్యాథమెటిక్స్) లేదా బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్/ఇంజనీరింగ్ ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్). ఇంటిగ్రేటెడ్ ఎంటెక్-పీహెచ్డీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్): ఎంఎస్సీ (ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా పోస్ట్ బీఎస్సీ (ఆనర్స్ ఇన్ ఆప్టిక్స్ అండ్ ఆప్టోఎలక్ట్రానిక్స్/ రేడియో ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/బీటెక్ (సంబంధిత సబ్జెక్ట్లతో). ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ- ఫిజిక్స్ (ఐఐఎస్ఈఆర్)-తిరువనంతపురం: బ్యాచిలర్ డిగ్రీ ఇన్ (ఫిజిక్స్/ టెక్నాలజీ/ ఇంజనీరింగ్). ప్రతి ఇన్స్టిట్యూట్ అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి దరఖాస్తుకు ముందు సంబంధిత వివరాలను ముందుగా తెలుసుకోవడం మంచిది. పీహెచ్డీ-ఫిజిక్స్కు అర్హత ఎంఎస్సీ (ఫిజిక్స్) లేదా ఎంఎస్సీ/ఎంటెక్ (సంబంధిత విభాగాల్లో) లేదా ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్/అప్లయిడ్ మ్యాథమెటిక్స్/ఆప్టిక్స్ అండ్ ఫోటోనిక్స్/ఇన్స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/బీటెక్ లేదా ఎంఎస్సీ (ఇంజనీరింగ్ ఫిజిక్స్/అప్లయిడ్ ఫిజిక్స్) లేదా బీటెక్ (ఇంజనీరింగ్ ఫిజిక్స్). ప్రతిభావంతులైన బీఎస్సీ మొదటి సంవత్సరం లేదా ఎంఎస్సీ (ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్/ఆస్ట్రానమీ/అప్లయిడ్ మ్యాథమెటిక్స్) విద్యార్థులు ఐయూసీఏఏలో రీసెర్చ్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం దరఖాస్తు: ఆన్లైన్లో. దరఖాస్తు రుసుం: రూ. 300(ఎస్సీ/ఎస్టీలకు రూ.150) దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 8, 2014. రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి 15, 2015. వెబ్సైట్: www.jest.org.in


