breaking news
narsingh student
-
వైద్యశాఖకు డిప్యూటేషన్ల జబ్బు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఇష్టారాజ్యపు పాలన సాగుతోంది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు సరిపడా వైద్యులు, నర్సులను ప్రభుత్వమే మంజూరు చేయకపోగా, ఉన్నవారిని కోరుకున్న చోటుకు పంపించే బృహత్తర కార్యక్రమం ఇక్కడ యథేచ్ఛగా సాగుతోంది. ఇక్కడ వైద్యాధికారికి క్యాంప్ క్లర్క్గా పనిచేసే ఓ కాంట్రాక్టు ఉద్యోగి డాక్టర్లు, స్టాఫ్నర్సుల తలరాతలు రాసే పరిస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ డాక్టరు లేదా నర్సు, ఇతర స్టాఫ్లో ఎక్కడికి డిప్యూటేషన్ మీద వెళ్తారో తెలియని పరిస్థితి పెద్దపల్లి డీఎంహెచ్వో పరిధిలో నెలకొంది. ఇటీవలి కాలంలో డిప్యూటేషన్ల పేరిట స్టాఫ్నర్సులు, ఇతర స్టాఫ్ కోరుకున్న చోటుకు వెళ్లిపోతుండడంతో డాక్టర్లకు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డాక్టర్ల సంఘం ఏకంగా జిల్లా కలెక్టర్కే ఫిర్యాదు చేయడంతో తంతు వెలుగులోకి వచ్చింది. బేరాలు మాట్లాడుకొని స్టాఫ్నర్సులను కోరుకున్న చోటకు పంపేలా వైద్యాధికారి సీసీ కీలక పాత్ర పోషిస్తున్న తీరును వారు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సీనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్ వంటి మినిస్టీరియల్ స్టాఫ్ను మాత్రమే వైద్యాధికారికి సీసీగా కొనసాగాలనే నిబంధనలను కూడా పక్కనబెట్టి కొత్త జిల్లాలు ఏర్పాటైన నాటినుంచి కమాన్పూర్లో హెల్త్ అసిస్టెంట్గా పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగిని సీసీగా కొనసాగిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. కాగా వైద్యులు, ఉద్యోగుల ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ యోగితా రాణా పెద్దపల్లికి రానుండడం గమనార్హం. ఇదీ అడ్డగోలు డిప్యూటేషన్ల తీరు.. పెద్దపల్లి జిల్లాలో 15 పీహెచ్సీలు, 6 అర్బన్ హెల్త్ సెంటర్లతోపాటు సుల్తానాబాద్లోని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నేతృత్వంలో కొనసాగుతాయి. జిల్లాలోని వైద్య అవసరాలను బట్టి స్టాఫ్నర్సులను, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్ మీద మార్పులు, చేర్పులు చేసే అధికారం వైద్యాధికారికి ఉంటుంది. వైద్యాధికారి వద్ద పనిచేసే సీసీ సిఫారసులు పెరగడం, ఇతరత్రా కారణాలతో ఇటీవలి కాలంలో అవసరం ఉన్నా, లేకపోయినా ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్లు జరిగినట్లు వైద్యులు వాపోతున్నారు. సుల్తానాబాద్ సివిల్ ఆసుపత్రిలో పని చేస్తున్న నలుగురు స్టాఫ్నర్సులను బేగంపేట్–2, రాఘవపూర్–1, రాగినేడు–1, ఎలిగేడు–1 పీహెచ్సీలకు పంపించారు. జూలపల్లి–1 స్టాఫ్నర్సును ఏకంగా కరీంనగర్ నర్సింగ్ కళాశాలకు డిప్యూటేషన్ మీద పంపించడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని సమాచారం. జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు స్టాఫ్నర్సులను కరీంనగర్ నర్సింగ్ కళాశాలకు పంపించడం వెనుక భారీగా చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. అలాగే జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సూపర్వైజర్లను రామగుండం కార్పొరేషన్కు డిప్యూటేషన్కు లక్షల రూపాయల లావాదేవీలు నడిచినట్లు సమాచారం. వారి స్థానంలో వివిధ పీహెచ్సీల నుంచి సిబ్బందిని డిప్యూటేషన్పై జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. కూనారం, బేగంపేట కొత్త పీహెచ్సీలు కాగా, ఇక్కడ ఏఎన్ఎంలతో సేవలు అందిస్తే సరిపోతుంది. కానీ స్టాఫ్నర్సులను అక్కడికి పంపించడం వల్ల సుల్తానాబాద్ వంటి చోట ఇబ్బంది ఎదురవుతోంది. ఎలిగేడు, రాగినేడుకు స్టాఫ్నర్సుల మంజూరు లేకపోయినా, అక్కడికి పంపించారు. టీబీ హాస్పిటల్లో పనిచేసే ఓ నర్సును కూడా కరీంనగర్ నర్సింగ్ కాలేజీకి పంపడం వెనుక కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు. డాక్టర్లకు సైతం డిప్యూటేషనే స్టాఫ్నర్సులనే కాకుండా డాక్టర్లను సైతం డిప్యూటేషన్ మీద జిల్లాలో ఇష్టమున్న చోటికి పంపిస్తుండడం జరుగుతోంది. బసంత్నగర్లో పనిచేసే ఇద్దరు డాక్టర్లను పెద్దపల్లికి, గర్రెపల్లి పీహెచ్సీ నుంచి బసంత్నగర్కు, గర్రెపల్లి లేడీ డాక్టర్లు ఇద్దరిని డిప్యూటేషన్పై బేగంపేట్కు, బేగంపేట్లో పనిచేస్తున్న ఓ డాక్టర్ను గర్రెపల్లికి డిప్యూటేషన్ వేశారు. అంతతో ఆగకుండా 104 సిబ్బందిని జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి డిప్యూటేషన్ మీద రప్పించుకొని, అందులో పనిచేస్తున్న 4వ తరగతి సిబ్బందిని వివిధ పీహెచ్సీలు, యూపిహెచ్సి, వివిధ శాఖలకు పంపించినట్లు ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. నేడు పెద్దపల్లి జిల్లాకు కమిషనర్ రాక ఈ నెల 3న వైద్యారోగ్య శాఖ కమిషనర్ యోగితారాణా పెద్దపల్లి జిల్లాకు రానున్నారు. జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలకు సంబంధించి ఆమె ఫీల్డ్ విజిట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లాలో చోటు చేసుకున్న డిప్యూటేషన్లు, అవినీతి అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు తదితర అంశాలను ఉద్యోగులు ఆమె దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలిసింది. -
పరిమళించిన మానవత్వం
రైలులో వెళ్తుండగా ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడం.. అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్ స్పందించి ప్రయాణికుల సాయం కోరడం.. స్పందించిన ఓ నర్సింగ్ విద్యా ర్థిని కాన్పు చేయడం.. సదరు మహిళ పండంటి శిశువుకు జన్మనివ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ ఘటన గురువారం కర్నూలు వెళ్లే ప్యాసింజర్ రైలులో చోటుచేసుకుంది. వెల్దుర్తి /డోన్: రైలులో పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి సుఖప్రసవం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకున్నారు తోటి ప్రయాణికులు. ప్రయాణికుల సమాచారం మేరకు.. తుగ్గలి మండలం గిరిగెట్ల గ్రామ మాజీ సర్పంచ్ లింగయ్య కుమార్తె సుమలతను బళ్లారికి చెందిన శివకు ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. సుమలత తన మొదటి కాన్పు నిమిత్తం పుట్టింటిలో ఉంటోంది. నెలలు నిండడంతో కాన్పు కోసం గుంతకల్లు నుంచి కర్నూలుకు వెళ్లే ప్యాసింజర్ రైలును తుగ్గలి రైల్వే స్టేషన్లో ఎక్కింది. రైలు డోన్ స్టేషన్ దాటిన తర్వాత సుమలతకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అదే రైలులో ప్రయాణిస్తున్న డోన్ సబ్జైలు కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ వెంటనే అప్రమత్తమై రైలు బోగీల్లో ఉన్న ప్రయాణికులందరికీ విషయం చెబుతూ సాయం అర్థించాడు. దీంతో డోన్ మండలం యు. కొత్తపల్లెకు చెందిన, కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో నర్సింగ్ చేస్తున్న మునియల్ వెంటనే స్పందించి కాన్పు చేసేందుకు ముందుకు వచ్చింది. నర్సింగ్ విద్యార్థిని గర్భిణి, ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ సుఖప్రసవం చేసింది. చివరకు సుమలత పండంటి శిశువుకు జన్మనివ్వడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కానిస్టేబుల్, నర్సింగ్ విద్యార్థినికి కృతజ్ఞతలు తెలిపిన వారు కర్నూలు ప్రభుత్వాస్పత్రికి వెళ్లారు. -
మరో ‘నిర్భయ’ ఘోరం
బెంగళూరులో కదులుతున్న బస్సులో యువతిపై అత్యాచారం సాక్షి, బెంగళూరు: దేశ ఐటీ రాజధాని బెంగళూరులో మరో ‘నిర్భయ’ ఘటన జరిగింది. కదులుతున్న మినీ బస్సులో పట్టపగలే 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై బస్సు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గురువారం ఉదయం బెంగళూరు శివార్లలోని సూళిబెలెలో చోటుచేసుకున్న ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. శివమొగ్గకు చెందిన బాధితురాలు బెంగళూరు గ్రామీణ జిల్లా హొసకోటే శివారులోని హసిగళలో ఉంటూ ఓ ప్రైవేటు క్లినిక్లో నర్సింగ్ శిక్షణ పొందుతోంది. రోజు లాగానే గురువారం ఉదయం 7:30కు ఆమె ప్రైవేటు క్లినిక్కు వెళ్లడానికి హసిగళ గ్రామంవద్ద మినీ బస్సు ఎక్కింది. ఆ సమయంలో మరో ఇద్దరు ప్రయాణికులు అందులో ఉన్నారు. కొద్దిదూరం వెళ్లాక ఆమె తప్ప మిగిలిన వారు దిగిపోయారు. ఆమెపై కన్నువేసిన డ్రైవర్ రవి.. క్లీనర్ మంజునాథ్కు డ్రైవింగ్ అప్పజెప్పి నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లాలని చెప్పాడు. అనంతరం కిటికీలను మూసేసి కదులుతున్న వాహనంలోనే అత్యాచారానికి పాల్పడ్డాడు. గాయపడిన బాధితురాలిని లక్కొండహళ్లి బస్టాప్ వద్ద వదిలి వెళ్లిపోయారు. ఆమె స్థానికుల సాయంతో తాను పనిచేస్తున్న నర్సింగ్హోంకు చేరుకుని సహచరులకు విషయం తెలిపింది. వారి ఫిర్యాదుపై.. పోలీసులు రవి, మంజునాథ్లను అరెస్టు చేశారు. ఐపీసీ-376(డీ) ప్రకారం నిర్భయ కేసు పెట్టారు. ప్రధాన నిందితుడైన రవి బెంగళూరులోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఇటీవల మినీ బస్సును అద్దెకు తీసుకుని నడుపుతున్నాడు. బస్సు ఏపీలోని అనంతపురానికి చెందిన మస్తాన్ అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు తెలుస్తోంది.