-
Fathers Day: తండ్రీ..నిన్ను తలంచి!
‘మా నాన్న ఎలా బతకాలో నాకు చెప్పలేదు. తానెలా బతికాడో నన్ను చూడనిచ్చాడు’ అన్నాడు అమెరికన్ రచయిత క్లారెన్స్ బడింగ్టన్ కెలాండ్. పెద్దలు చెబితే పిల్లలు వినరు. వాళ్లు పెద్దలను గమనిస్తారు, అనుకరిస్తారు. పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే, తండ్రులు ఊరకే నీతిపాఠాలు చెబితే చాలదు. నిజాయితీగా బతికి చూపించాలి. అప్పుడు మాత్రమే పిల్లలు సరైన దారిని ఎంచుకోగలుగుతారు. తండ్రులకు గర్వకారణంగా మనగలుగుతారు. ఇంటి బరువు బాధ్యతలను మోసే తండ్రి పిల్లలకు తొలి హీరో! ఉన్నత వ్యక్తిత్వాన్ని, విలువలను పిల్లలు తండ్రి నుంచే నేర్చుకుంటారు. ఒక కుటుంబంలో తండ్రి దారి తప్పితే, పిల్లలు సరైన దారిని ఎంచుకోలేరు. రేపటి పౌరులు దారి తప్పితే, రేపటి సమాజం విలువలు కోల్పోయిన జనారణ్యంగా మిగులుతుంది. కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ సమానమే అయినా, ప్రపంచ సాహిత్యంలో తల్లులకు దక్కిన ప్రశస్తి తండ్రులకు దక్కలేదు. అరుదుగానైనా తండ్రుల గురించి అద్భుతమైన కవిత్వం వెలువడింది. తండ్రిని త్యాగానికి ప్రతీకగా, మార్గదర్శిగా కొనియాడిన కవులు లేకపోలేదు. తన సంతానం ఉన్నతిని సమాజం పొగిడినప్పుడు పొంగిపోయే తొలి వ్యక్తి తండ్రి! ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’ అని శతకకారుడు అందుకే అన్నాడు. తండ్రులకు పుత్రోత్సాహం పుత్రుల వల్లనే కాదు, పుత్రికల వల్ల కూడా కలుగుతుంది. చరిత్రలోను, వర్తమానంలోను అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సుప్రసిద్ధులైన తండ్రులు, వారికి పుత్రోత్సాహం కలిగించిన వారి పిల్లల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అంతకంటే ముందు తండ్రుల దినోత్సవం జరుపుకోవడం వెనుకనున్న కథా కమామిషును కూడా తెలుసుకుందాం. తండ్రుల దినోత్సవం వెనుకనున్న మహిళ అంతర్జాతీయంగా మాతృ దినోత్సవం జరుపుకోవడం 1872 నుంచి మొదలైంది. తల్లుల కోసం ప్రత్యేకంగా ఒక రోజును జరుపుకొంటున్నపుడు బాధ్యతకు మారుపేరైన తండ్రుల కోసం కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని అమెరికన్ మహిళ సొనోరా స్మార్ట్ డాడ్ తండ్రుల దినోత్సవం కోసం ప్రచారం ప్రారంభించింది. ఆమె ప్రచారం ఫలితంగా 1910లో తొలిసారిగా అమెరికాలో తండ్రుల దినోత్సవం జరిగింది. దీంతో ఆమె ‘మదర్ ఆఫ్ ఫాదర్స్ డే’గా గుర్తింపు పొందింది. క్రమంగా దీనికి ఆదరణ పెరగడంతో అంతర్జాతీయ స్థాయికి విస్తరించి, 1972 నుంచి ఏటా జూన్ నెల మూడోవారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం జరుపుకోవడం మొదలైంది. జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ జవహర్లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ ఒక తండ్రి, ఆయన సంతానం దేశాధినేతలుగా కొనసాగిన సందర్భాలు అరుదు. స్వాతంత్య్ర భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన కూతురు ఇందిరను తనంతటి నేతగా తీర్చిదిద్దారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలులో పెట్టినప్పుడు ఆయన జైలు నుంచి తన కూతురికి స్ఫూర్తిమంతమైన ఉత్తరాలు రాసేవారు. తన తండ్రి తనకు రాసిన ఉత్తరాలు తనను ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు, మనుషులపై ఆపేక్షను, ప్రకృతిపై ప్రేమను పెంచుకునేందుకు దోహదపడ్డాయని ఇందిరా గాంధీ ఒక సందర్భంలో చెప్పారు. బ్రిటిష్ పాలన నుంచి మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ 1964 మే 27న కన్నుమూసే వరకు ప్రధానిగా కొనసాగారు. స్వాతంత్య్ర భారత దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన అహరహం పాటుపడ్డారు. దేశ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇందిర తోటి కాంగ్రెస్ నాయకుడైన ఫిరోజ్ గాంధీని ప్రేమించి పెళ్లాడారు. తండ్రి ప్రధాని పదవిలో ఉండగానే, 1959లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నెహ్రూ మరణానంతరం లాల్బహదూర్ శాస్త్రి ప్రధాని పదవి చేపట్టగా, ఆయన మంత్రివర్గంలో ఇందిరా గాంధీ తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. లాల్బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణానంతరం ప్రధాని పదవి చేపట్టిన ఇందిరా గాంధీ 1975 ఎమర్జెన్సీని అమలులోకి తెచ్చి, ఆ తర్వాత 1977లో వచ్చిన ఎన్నికల్లో జనతా పార్టీ చేతిలో ఓటమి చవిచూశారు. జనతా పార్టీ పూర్తికాలం అధికారంలో కొనసాగలేక కుప్పకూలిపోవడంతో 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చారు. బ్యాంకుల జాతీయీకరణ వంటి సాహసోపేతమైన చర్యలతో ఇందిరా గాంధీ దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసి, తండ్రికి తగ్గ కూతురిగా పేరుపొందారు. పండిట్ రవిశంకర్ అనౌష్కా శంకర్ భారతీయ సంగీత దిగ్గజాల్లో పండిట్ రవిశంకర్ ప్రముఖుడు. సితార్ వాద్యానికి పర్యాయపదంగా మారిన రవిశంకర్ సంగీతరంగంలో ఎన్నో అద్భుతాలు చేశారు. తొలినాళ్లలో తన సోదరుడు ఉదయ్శంకర్తో కలసి నృత్యం చేసుకుని, దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నా, అనతి కాలంలోనే నృత్యాన్ని విడిచిపెట్టి, సంగీతాన్ని తన రంగంగా ఎంచుకున్నారు. నాటి ప్రఖ్యాత విద్వాంసుడు అల్లాఉద్దీన్ ఖాన్ వద్ద సితార్ నేర్చుకున్నారు. ప్రస్తుత సంగీతరంగంలో ప్రాచుర్యం పుంజుకున్న ఫ్యూజన్ ప్రయోగాలను రవిశంకర్ దశాబ్దాల కిందటే చేశారు. ఎందరో పాశ్చాత్యులకు హిందుస్తానీ సంగీతం నేర్పించారు. సంగీతంపై అభిరుచి కనబరచిన తన కూతురు అనౌష్కా శంకర్ను అద్భుతమైన విద్వాంసురాలిగా తీర్చిదిద్దారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లో మాదిరిగా సంగీత రంగంలో వారసత్వం పెద్దగా పనిచేయదు. పిల్లలకు స్వతహాగా అభిరుచి, ఆసక్తి ఉంటే తప్ప తండ్రుల అడుగుజాడల్లో ఈ రంగంలో రాణించలేరు. పండిట్ రవిశంకర్ కూతురు అనౌష్కా శంకర్ తండ్రి అడుగుజాడల్లోనే సితార్ విద్వాంసురాలిగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం ఒక అరుదైన విశేషం. అనౌష్కా తొమ్మిదేళ్ల వయసులోనే తన తండ్రి రవిశంకర్ శిక్షణలో సితార్పై సరిగమలు పలికించడం నేర్చుకున్నారు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక, కాలేజీలో చేరకుండా పూర్తిగా సంగీతానికే అంకితం కావాలని నిర్ణయించుకుని, తండ్రి ఆధ్వర్యంలో రోజుకు ఎనిమిది గంటలు సాధన చేస్తూ విద్వాంసురాలిగా ఎదిగారు. ఎన్ని శైలీభేదాలు ఉన్నా, సంగీతం విశ్వజనీనమైనదని తన తండ్రి నమ్మేవారని, ఆయన నుంచే విభిన్న శైలులకు చెందిన సంగీతాన్ని సమ్మేళనం చేయడం నేర్చుకున్నానని, సంగీతంలో తనకు గురువు, దైవం, మార్గదర్శి, స్ఫూర్తిప్రదాత తన తండ్రేనని అనౌష్కా శంకర్ చెబుతారు. ధీరూభాయ్ అంబానీ ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ భారతీయ పారిశ్రామిక రంగంలో టాటా, బిర్లాల ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా చరిత్ర సృష్టించారు. సామాన్య గ్రామీణ ఉపాధ్యాయుడి కొడుకుగా పుట్టిన ధీరూభాయ్ ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. ఉపాధి వేటలో భాగంగా యెమెన్ వెళ్లి, అక్కడ కొంతకాలం ఒక పెట్రోల్ పంపులో పనిచేశారు. యెమెన్ నుంచి భారత్కు తిరిగి వచ్చేశాక తన సమీప బంధువు చంపక్లాల్ దమానీతో కలసి ‘మజిన్’ పేరుతో ఎగుమతులు దిగుమతుల వ్యాపారం ప్రారంభించారు. కొంతకాలానికి చంపక్లాల్తో భాగస్వామ్యాన్ని వదులుకుని ధీరూభాయ్ సొంతగా వ్యాపారంలోకి దిగారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ను ప్రారంభించి, తొలుత పాలియెస్టర్ వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తర్వాత అంచెలంచెలుగా దాన్ని వివిధ రంగాలకు విస్తరించారు. ధీరూభాయ్ తన కొడుకులు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు వ్యాపార నిర్వహణలోని మెలకువలను నేర్పించారు. ధీరూభాయ్ 2002లో మరణించే నాటికి రిలయన్స్ గ్రూప్ భారతీయ పారిశ్రామిక రంగంలోనే అగ్రస్థానంలో ఉండేది. తండ్రి మరణం తర్వాత అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు ముదరడంతో 2004లో రిలయన్స్ గ్రూప్ రెండుగా విడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముకేశ్ అంబానీ చేతికి, రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ అనిల్ అంబానీ చేతికి వచ్చాయి. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని గ్రూప్ కొంత వెనుకబడినా, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్రగామిగా కొనసాగుతోంది. (చదవండి: మెడ పట్టేసినప్పుడు.. త్వరగా నార్మల్ కావాలంటే?) -
Father's Day: తండ్రీకొడుకుల బంధానికి కొత్త అర్థం చెప్పే చిత్రాలు..
బాధ్యతకు మారు పేరు నాన్న. మనం వేసే తప్పటడుగులను హెచ్చరిస్తూ వాటిని సరిదిద్దుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించే వ్యక్తి నాన్న. మనల్ని 9 నెలలు కడుపులో మోసేది తల్లయితే, ఈ భూమి మీదకు వచ్చిన మరుక్షణం నుంచి జీవితాంతం గుండెల మీద పెట్టుకుని చూసేది నాన్న. వేలు పట్టి నడిపించేది, భుజంపై ఎక్కించుకుని ప్రపంచాన్ని మనకు చూపిస్తూ మన కళ్లతో ప్రపంచాన్ని చూసి మురిసిపోయే వ్యక్తి నాన్న. అందుకే ప్రతి ఒక్కరికి ఫస్ట్ హీరో, రీయల్ హీరో ఆయనే. మన జీవితంలో తండ్రి కీలక పాత్ర పోషిస్తాడు. అయనతో ఉండే అనుబంధం, ఆయన పంచే ప్రేమ చాలా గొప్పది, దానిని మాటల్లో చెప్పలేం. కానీ తెరపై మాత్రం ఈ బంధాలను అద్భుతంగా చూపించిన సినిమాలున్నాయి. తండ్రి-కొడుకుల ఎమోషనల్ బాండింగ్తో మనల్ని కట్టిపడేసిన టాప్ చిత్రాలేంటో చూసేద్దాం రండి.. బొమ్మరిల్లు ఈ సినిమాలో తండ్రి ప్రేమ, కేరింగ్ తట్టుకోలేక హీరో సతమతమవుతాడు. కానీ ఆయన మాత్రం కొడుకు, కూతుళ్లకు ఏం చేసినా, ఏం ఇచ్చినా ది బెస్ట్ ఇవ్వాలని చూస్తాడు. ఎక్కడ కూడా వారికి ఇబ్బంది కలగకుండా ముందే వారికి అన్నీ అమర్చి పెడతాడు. కొడుక్కి ఎన్ని చేసినా ఇంకా ఏదో చేయాలని పరితపించే తండ్రిగా ప్రకాశ్ రాజ్, అతడి ప్రేమ, కేరింగ్తో తన సెల్ఫ్ ఐడెంటిటీని పొగొట్టుకుంటున్నానని బాధపడే కొడుకుగా హీరో సిద్దార్థ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నారు. అయితే తండ్రి ఏం చేసినా మన సౌకర్యం, సంతోషం కోసమేనని చెప్పడానికి బొమ్మరిల్లు మూవీ ఉదాహరణ. సన్నాఫ్ సత్యమూర్తి తండ్రి చనిపోయినా కూడా ఆయన పాటించిన విలువలను బతికించాలని ఉన్న ఆస్తిని వదులుకుంటాడు కొడుకు. అంతేగాక ఆయనను నమ్మిన వారు నష్టపోకూడదని ఎలాంటి రిస్క్ అయినా చేస్తాడు. తన తండ్రి గొప్పవాడని, ఆయన పాటించే విలువలు తప్పు కాదని, దీన్ని వందకు వంద మంది నమ్మాలని కోరుకుంటాడు కొడుకు. అలా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయిన తండ్రి మీద ఒక్క మచ్చ రాకుండా ఉండాలని ఆరాటపడుతాడు. అంటే తండ్రి విలువలను కాపాడటం కొడుకు బాధ్యత అని చెప్పేదే సన్నాఫ్ సత్యమూర్తి. నాన్నకు ప్రేమతో.. తల్లి లేకపోయినా చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచిన తండ్రి కృతజ్ఞత తీర్చుకోవడానికి ఆయన పగను పంచుకుంటాడు కొడుకు. బిజినెస్లో మోసం చేసిన వ్యక్తి గురించి డైరీలో రాసుకుని పగ తీర్చుకోవాలని ఆరాటపడతాడు తండ్రి. ఈ విషయం తెలుసుకుని ఆ పగను తన పగగా తీసుకుని బిజినెస్మ్యాన్కు గుణపాఠం చెబుతాడు. అంటే తండ్రి ఆస్తే కాదు ఆయన ఆశయం కూడా మనదే అని చెప్పడానికి నాన్నకు ప్రేమతో మూవీ ఒక ఉదాహరణ. కిక్ ఈ మూవీలో తండ్రీకొడుకులు ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారు. కొడుకు ఏం చేసినా వాడు కరెక్ట్ అంటూ మురిసిపోతాడు తండ్రి. అలా తండ్రి, కొడుకు మధ్య స్నేహ బంధం కూడా ఉందని చెప్పడానికి ఈ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. ఈ మూవీలో కొడుకు ఉద్యోగం లేకుండా జులాయిగా తీరుగుతున్నాడని తండ్రి ఎప్పుడూ తిట్టిపోస్తుంటాడు. నీకు తిండి దండగ అంటూ విమర్శిస్తుంటాడు. కానీ ఒక్కసారిగా కొడుకు ఉద్యోగం తెచ్చుకోగానే తన గుండె బరువు దిగినంతగా రిలాక్స్ అవుతాడు. కొడుకు మొదటి జీతంతో కొనిచ్చిన పట్టు వస్త్రాలను ధరించి నలుగురికి గొప్పగా చెప్పుకుంటాడు. అంటే కొడుకు బాధ్యతగా ఉండి ఓ స్థాయికి చేరుకుంటే ఆ తండ్రి ఎంతలా పొంగిపోతాడో చెప్పడానికి ఈ మూవీ నిదర్శనం. అంటే ఏ తండ్రీ తన కొడుకుని పనికి మాలిన వాడిగా చూడలేక వాళ్లు మంచి ప్రయోజకులవ్వాలనే అలా కోప్పడుతుంటారని కుర్రాళ్లు అర్థం చేసుకోవాలి. నువ్వు నాకు నచ్చావ్.. కొడుకు ఊర్లో జులాయిగా తిరుగుతూ ఉంటాడు. అతడికి త్వరగా పెళ్లి చేయాలనుకుంటాడు తండ్రి. కానీ సంబంధాలు రావు. మరోవైపు కొడుకు పాస్ అవ్వాలని ఎగ్జామ్ హాల్లో చిట్టీలు కూడా అందిస్తాడు తండ్రి. అంటే కొడుకు బాగుపడటానికి ఆ తండ్రి ఏం చేయడానికైనా వెనుకాడడని చెప్పాడానికి ఈ మూవీ చాలు. అలాగే తండ్రి స్నేహం పాడవకూడదని తను ప్రేమించిన అమ్మాయినే త్యాగం చేయడానికి సిద్ధపడటం కొసమెరుపు. చదవండి: అప్పట్లో షారుక్ ఇచ్చింది ఇంకా నా పర్సులోనే ఉంది: ప్రియమణి -
నేను నటినయ్యింది ఇప్పుడే
తాను నటినయ్యింది ఇప్పుడే అంటోంది రకుల్ప్రీత్ సింగ్. ఏమిటీ ఆశ్చర్యపోతున్నారా? అలాంటి మాటల గారడీలతో ఆసక్తిని రేకెత్తించడం తారామణులకు అలవాటే. ఇందుకు నటి రకుల్ప్రీత్ మినహాయింపేమీ కాదు. తమిళంలో ఎన్నమో ఏదో,తడైయారతాక్క తదితర చిత్రాలలో నటించిన ఈ ఉత్తరాది బ్యూటీని కోలీవుడ్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్కు మకాం మార్చింది. అయితే అక్కడ అమ్మడికి అదృష్టం అనూహ్యంగా తలుపుతట్టింది. యువ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ ఇప్పుడు రకుల్నే తమకు జంటగా కోరుకుంటున్నారు. రామ్చరణ్, అల్లుఅర్జున్, జూనియర్ ఎన్టీఆర్లతో నటించే స్థాయికి రకుల్ప్రీత్ ఎదిగింది. అంతే కాదు తన కొంగొత్త అందాలతో కాజల్ అగర్వాల్, తమన్న, సమంత వంటి ప్రముఖ నటీమణులకు పోటీగా తయారైంది. విషయం ఏమిటంటే తాను ఇప్పుడే నటినయ్యానని రకుల్ పేర్కొని షాక్ ఇచ్చింది. అయితే దాని గురించి తను వివరిస్తూ తానిప్పటి వరకూ గ్లామరస్ పాత్రల్లో దర్శకుల సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ నటించానని చెప్పింది. అలా ఇప్పటి వరకూ ఒక సరాసరి కథానాయకిగా నటించిన తాను తెలుగు చిత్రం నాన్నకు ప్రేమతో చిత్రంతోనే నటినయ్యానని పేర్కొంది. ఆ చిత్రంలో నటించమని దర్శకుడు సుకుమార్ తన వద్దకు వచ్చినప్పుడు ఇదీ మీ పాత్ర, మీరు ఎంత సహజంగా నటిస్తారో అదే నాకు కావాలి అని అన్నారని తెలిపింది. నటన అనే భావనను మరచి ఆ చిత్రంలోని నాయకి పాత్రను తనకు అన్వయించుకుని పోషించానని చెప్పుకొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా బుధవారం తెరపైకి రానుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
Advertisement