రెండేళ్లలో రూ. 1,000 కోట్ల టర్నోవర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సస్య రక్షణ ఉత్పత్తుల తయారీలో ఉన్న నాగార్జున అగ్రికెమ్ పెద్ద ఎత్తున విదేశీ ఆర్డర్లను లక్ష్యంగా చేసుకుంది. ఇందుకు కొత్త మార్కెట్లలో ప్రవేశిస్తోంది. ఇప్పటి వరకు థర్డ్ పార్టీగా విదేశీ కంపెనీలకు యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ను సరఫరా చేసిన ఈ సంస్థ.. ఇక నేరుగా ఫార్ములేషన్స్ను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించాలని నిర్ణయించింది.
తద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాలబాట పట్టాలని కంపెనీ ధీమాగా ఉంది. అగ్ని ప్రమాదం జరిగిన శ్రీకాకుళం ప్లాంటు తిరిగిపూర్తి స్థాయి సామర్థ్యానికి సిద్ధంగా ఉండడం కూడా సంస్థకు కలిసి వచ్చే అంశం. రెండేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్ స్థాయికి ఎదగడమేగాక, మెరుగైన లాభం నమోదు చేయాలని ఆశిస్తోంది.
శ్రీకాకుళం ప్లాంట్ సిద్ధం..
కీటకసంహారి, శిలీంధ్రనాశిని, గుల్మనాశినితోపాటు పలు రసాయనాలను శ్రీకాకుళం ప్లాంటులో కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. ప్లాంటు పూర్తి సామర్థ్యం ఏటా సుమారు 8 వేల టన్నులు. 2012 జూన్ 30న ఈ ప్లాంటులోని బ్లాక్-5లో అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంటు సామర్థ్యంలో 45-50 శాతం ఈ బ్లాక్ నుంచే సమకూరుతోంది. ప్రమాదం కారణంగా గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ నష్టాలను చవిచూసింది.
2014 మార్చి నుంచే బ్లాక్లో తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 100 శాతం ఉత్పత్తికి రెడీ అయింది. విదేశీ ఆర్డర్లు ఆశిస్తున్నందున నాల్గవ త్రైమాసికంలో శ్రీకాకుళం ప్లాంటులో పూర్తి ఉత్పత్తి నమోదు అవుతుందని నాగార్జున అగ్రికెమ్ ఎండీ వి.విజయ్ శంకర్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. బీమా కంపెనీ నుంచి నష్ట పరిహారం రూ.60 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.
విదేశాల్లో సొంత బ్రాండ్తో..
అరిస్టా, డో, మిత్సుబిషి, నిస్సే, సింజెంటా వంటి కంపెనీలకు కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ కింద యాక్టివ్ ఇంగ్రీడియెంట్స్ను నాగార్జున అగ్రికెమ్ సరఫరా చేస్తోంది. 20కిపైగా దేశాల్లో ఇవి లభిస్తాయి. ఆగ్నేయాసియా, ఆఫ్రికా దేశాలకు నేరుగా సొంత బ్రాండ్తో ఫార్ములేషన్స్ను ఈ ఏడాది నుంచే విక్రయించనుంది. మయన్మార్ నుంచి ఆమోదం పొందింది.
ఆఫ్రికా నుంచి అనుమతుల రావాల్సి ఉంది. వరి, గోధుమ, పత్తి, సోయా, కూరగాయలు, పండ్లు పండించే దేశాలకు ఫార్ములేషన్స్ను దశల వారీగా కంపెనీ ఎగుమతి చేయనుంది. 2013-14లో ఎగుమతుల ఆదాయం సుమారు రూ.150 కోట్లు ఆర్జించింది. గతంలో రూ.280 కోట్ల దాకా నమోదైంది కూడా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతుల్లో మెరుగైన వృద్ధిని కంపెనీ ఆశిస్తోంది. 2013-14లో నాగార్జున అగ్రికెమ్కు రూ.740 కోట్ల ఆదాయంపై రూ.20 కోట్ల నష్టం వాటిల్లింది.
కంపెనీ వెంటే కస్టమర్లు..
పాత కస్టమర్లు తిరిగి కంపెనీతో చేతులు కలుపుతున్నారని విజయ్ శంకర్ తెలిపారు. కొత్త కస్టమర్లను సైతం చేజిక్కించుకునే పనిలో ఉన్నామన్నారు. ‘వివిధ కంపెనీల తనిఖీలు పూర్తి అయ్యాయి. ఉత్పత్తుల శాంపిళ్లు ఆమోదం పొందాయని పేర్కొన్నారు. దేశీయంగా 15 శాతం, అంతర్జాతీయ వ్యాపారంలో 2013-14 కంటే మెరుగైన వృద్ధి అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రాజమండ్రి ప్లాంటులో రూ.10 కోట్లతో కంపెనీ నూతన ఫెసిలిటీలను ఏర్పాటు చేస్తోంది.
రుతుపవ నాలు ఆలస్యమైనప్పటికీ సస్యరక్షణ ఉత్పత్తుల మార్కెట్ గాడిన పడిందని కంపెనీ తెలిపింది. ఏప్రిల్లో ఆవిష్కరించిన గుల్మనాశిని వాణిజ్య ఉత్పత్తిని కంపెనీ ప్రారంభించింది. మరో గుల్మనాశినిని రబీ సీజన్లో మార్కెట్లోకి తేనుంది.