breaking news
Mysore Paints and Varnish Limited
-
చెరిగిపోని సిరాచుక్క
చూపుడువేలిపై సిరా చుక్క. ఓటేశామని చెప్పేందుకు తిరుగులేని గుర్తు. పోలింగ్ బూత్ నుంచి బయటికి రాగానే చూపుడువేలిపై సిరా చుక్కను చూపిస్తూ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాం. ఆ ఇంకు కథ ఆసక్తికరం. ప్రపంచవ్యాప్తంగా.. మన దేశంలో 1962 లోక్సభ ఎన్నికల నుంచి సిరా చుక్క వాడకం మొదలైంది. నాటినుంచి నేటిదాకా కర్ణాటక ప్రభుత్వ సంస్థ మైసూర్ పెయింట్సే దీన్ని సరఫరా చేస్తోంది. 30 పై చిలుకు దేశాలకు ఈ ఇంకును ఎగుమతి చేస్తోంది కూడా. ఇదీ ప్రత్యేకత... ► ఓటేసినట్లు రుజువుగా ఓటరు ఎడమ చూపుడు వేలిపై సిరా గుర్తు పెడతారు. చూపుడు వేలు లేకుంటే ఎడమ చేతిలోని ఇతర వేలిపై వేస్తా రు. ఎడమ చేయే లేకుంటే కుడిచేతి వేళ్లలో దేనికైనా వేస్తారు. రెండు చేతులు లేకుంటే? ఎడమ లేదా కుడి చేయి చివరి భాగాలకు సిరా గుర్తు వేయాలని ఈసీ చెబుతోంది. ► సిరా చుక్కలో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. ఇది రుద్దిన 40 సెకన్లలోపే ఆరిపోతుంది. చర్మంతో చర్య జరిపి బలమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. దాంతో త్వరగా చెరగదు. ఇంకు గుర్తు సాధారణంగా చర్మంపై మూడు రోజుల దాకా ఉంటుంది. గోరుపై మాత్రం వారాల పాటు ఉంటుంది. ► 5.1 మిల్లీలీటర్ల సీసాలోని ఇంకుతో సుమారు 700 మందికి గుర్తు వేయవచ్చు. ఈ లోక్సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం 26 లక్షల ఇంకు బాటిళ్లు ఆర్డర్ చేసింది. ► మామూలుగా ఎన్నికల్లోనే వాడే ఈ ఇంకును ఇతరత్రా వాడేందుకు ఒకేసారి ఈసీ అనుమతించింది. అదెప్పుడంటే.. కరోనా వ్యాప్తి సమయంలో. కోవిడ్ బారిన పడి క్వారెంటైన్లో ఉన్నవారిని గుర్తించడానికి పలు రాష్ట్రాలు ఈ ఇంకును ఉపయోగించాయి. – సాక్షి, ఎలక్షన్ డెస్క్ -
దేశ ఎన్నికలపై మైసూరు సిరా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఎన్నికల్లో ఓటు వేయడానికి ముందు ఓటర్ల ఎడమ చేయి చూపుడు వేలుకు సిరా గుర్తు పెట్టడం ఆనవాయితీ. దొంగ ఓట్లను నివారించడానికి ఇదో ప్రయత్నం. అలాంటి ఈ సిరాకు గొప్ప చరిత్రే ఉంది. ఒకసారి ఈ సిరా గుర్తు పెడితే కనీసం 30 రోజులైనా దాని ఆనవాళ్లు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ విశిష్టమైన సిరాను మైసూరులో తయారు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (ఎంపీవీఎల్)కు ఈ అరుదైన ఘనత దక్కుతోంది. విదేశాలకు కూడా ఈ సిరా సరఫరా అవుతుంది. మన దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడం ప్రభుత్వానికే కాకుండా కమిషన్కు పెద్ద సవాలు. దీనిని విజయవంతంగా పూర్తి చేయడంలో భాగంగా బోగస్ ఓటింగ్ను నివారించడానికి ఈ సిరా వినియోగాన్ని చేపట్టారు. రసాయనాలు లేదా సబ్బులు, నూనెలతో ఈ గుర్తును చెరిపి వేయడం ఏ మాత్రం సాధ్యం కాదు. భారత ఎన్నికల సంఘం, నేషనల్ ఫిజికల్ లేబొరేటరీ, నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల సహకారంతో ఈ సిరా ఉత్పత్తి, సరఫరాలో ఎంపీవీఎల్ ప్రత్యేకతను సాధించింది. ఇలాంటి సిరా తయారీకి ప్రత్యేక లెసైన్స్ను కేవలం ఎంపీవీఎల్ 1962లో పొందింది. మైసూరు రాజుల కాలంలో... మైసూరు మహారాజు దివంగత నాల్వడి కృష్ణరాజ ఒడయార్ హయాంలో 1937లో మైసూరు లాక్ అండ్ పెయింట్ వర్క్స్ పేరిట ఈ కంపెనీ ఏర్పాటైంది. 1989లో ఎంపీవీఎల్గా పేరు మారింది. 1962లో ఎన్నికల కమిషన్ సిరా సరఫరా కోసం ఈ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. 1976 నుంచి మరో 28 దేశాలకు కూడా ఇక్కడి నుంచి సిరా సరఫరా అవుతోంది. విశేషాలు 2009 సార్వత్రిక ఎన్నికలకు పది మి.లీ. పరిమాణం కలిగిన సుమారు 20 లక్షల సీసాలను ఎంపీవీఎల్ సరఫరా చేసింది. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 2.88 లక్షల సీసాలు ఖర్చయ్యాయి. 2006 ఫిబ్రవరి ఒకటో తేది నుంచి ఓటరుకు ఎడమ చేతి చూపుడు వేలుపై గోరు పైభాగం నుంచి కింది వరకు గీత గీసే వారు. అంతకు ముందు గోరుపైన ఉండే చర్మం పై గుర్తు పెట్టే వారు. వేలిపై పెట్టే సిరాలో సిల్వర్ నైట్రేట్ ఉంటుంది. తద్వారా సూర్య కిరణాలు తగలగానే చర్మంపై స్పష్టమైన గుర్తు ఏర్పడుతుంది. దరిమిలా దీనిని చెరిపి వేయడం సాధ్యం కాదు. బయట చర్మం కణాలను మార్పు చేస్తే తప్ప దీనిని చెరిపి వేయలేం. సాధారణంగా ఈ సిరా ఊదా రంగులో ఉంటుంది. సురినాం దేశంలో 2005లో జరిగిన ఎన్నికల్లో నారింజ రంగులో వాడారు.