breaking news
Murrajati buffalo
-
ఇలా చేస్తే డైరీ ఫార్మ్ సక్సెస్ అయినట్టే
-
ముర్రా.. మేడిన్ ఆంధ్రా
సాక్షి, అమరావతి: అత్యధిక పాల దిగుబడినిచ్చే గేదెలు ఏవంటే.. హర్యానా ముర్రా గేదెలని పాడి రైతులు చెప్పేమాట. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఆ జాబితాలో ‘ఆంధ్రా ముర్రా’ గేదెలు కూడా చేరిపోయాయి. హర్యానా ముర్రా గేదెలు దక్షిణాది రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక ఆశించిన స్థాయిలో పాల దిగుబడి ఇచ్చేవి కాదు. దీనివల్ల వాటిని పెంచే రైతులకు తగిన ఫలితం దక్కేది కాదు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి వాతావరణాన్ని తట్టుకునేలా ముర్రా జాతి గేదెలను అభివృద్ధి చేయడంలో మన శాస్త్రవేత్తల కృషి ఫలించింది. ఇప్పుడు ‘ఆంధ్రా ముర్రా’ గేదెల కోసం పొరుగు రాష్ట్రాల రైతులు కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్న గూడెంలోని గేదెల పరిశోధనా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునే ముర్రా జాతి గేదెల పునరుత్పత్తికి బాటలు వేసింది. హర్యానాలోని కేంద్రీయ గేదెల పరిశోధనా కేంద్రం నుంచి వెయ్యి డోసుల ముర్రా జాతి గేదెల ఘనీకృత వీర్యాన్ని తీసుకొచ్చి ఇక్కడి రైతులకు సరఫరా చేయడం ద్వారా.. ముర్రా జాతిని మన ప్రాంత వాతావరణాన్ని తట్టుకునేలా తీర్చిదిద్దారు. మన రాష్ట్రంలోని నాటు గేదెలకు ముర్రా జాతి వీర్యంతో కృత్రిమ గర్భధారణ చేసి గ్రేడెడ్ ముర్రా గేదెల పేరిట ఆంధ్రా ముర్రా జాతిని అభివృద్ధి చేశారు. మారుమూల గ్రామాల్లోనూ.. పరిశోధన స్థానం అభివృద్ధి చేసిన ఆంధ్రా ముర్రా జాతి గేదెలను మారుమూల పల్లెలకూ విస్తరించేలా వెంకట్రామన్నగూడెం పరిశోధనా స్థానం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటి వరకు లక్ష డోసుల ఘనీకృత వీర్యాన్ని కృత్రిమ గర్భోత్పత్తి కోసం పాడి రైతులకు అందించారు. 350 దున్న దూడలను సైతం పంపిణీ చేసి కృత్రిమ గర్భోత్పత్తికి అవకాశం లేని గ్రామాల్లో గ్రేడెడ్ ముర్రా జాతిని మరింతగా విస్తరింపచేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో 62.19 లక్షల పాడి గేదెల సంతతి ఉంటే.. వాటిలో 30 లక్షలకు పైగా ముర్రా జాతి గేదెలున్నాయి. వాటిలో 25–30 శాతం గేదెలు వెంకట్రామన్నగూడెం పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన గ్రేడెడ్ ముర్రా జాతికి చెందినవే కావడం గమనార్హం. వీటికి ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. కావాల్సిన సమయానికి ఎదకు రప్పించేలా.. గ్రేడెడ్ ముర్రా జాతిని మరింత అభివృద్ధి చేసేలా చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలిస్తున్నాయి. ఇన్ బ్రీడింగ్కు అడ్డుకట్ట వేస్తూ.. ఓపెన్ న్యూక్లియస్ బ్రీడింగ్ సిస్టం ద్వారా మేలుజాతి గేదెలను అభివృద్ధి చేస్తున్నారు. గేదెలను కావాల్సిన సమయంలో ఎదకు రప్పించేలా ఈస్ట్రస్ సింక్రొనైజేషన్ పద్ధతితో పాటు గర్భవాతం నివారించేందుకు రోగ నిరోధక శక్తిని పెంచే పద్ధతులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈనిన 45–65 రోజుల్లోనే తిరిగి ఎదకు వచ్చేలా ఈ గేదెలను అభివృద్ధి చేశారు. చూడి శాతాన్ని 42 నుంచి 65 శాతానికి పెంచగలిగారు. గేదెల్లో గొడ్డుమోతు తనం నివారణకువివిధ హార్మోన్ చికిత్సా విధానాలను అందుబాటులోకి తెచ్చారు. మన వాతావరణ ప్రభావాన్ని తట్టుకునేలా తీర్చిదిద్దడంతో ఏడాది పొడవునా గేదెల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యాలను పెంచగలిగారు. అత్యధిక పోషక విలువలు కలిగిన 15 రకాల బహువార్షిక గడ్డి రకాలను అభివృద్ధి చేశారు. ఇక్కడ అభివృద్ధి చేసిన సూపర్ నేపియర్ పశు గ్రాసానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వీటిని తెలుగు రాష్ట్రాలతో పాటు అండమాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల రైతులు తీసుకెళ్లి సాగుచేస్తూ అధిక పాల దిగుబడులను సాధిస్తున్నారు. చదవండి: పారిశ్రామికవేత్తలుగా పొదుపు మహిళలు ‘దున్న యువరాజ్’ జాతి అభివృద్ధిపైనా దృష్టి దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన యువరాజ్ జాతికి చెందిన దున్నల పునరుత్పత్తిపై పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యేక దృష్టి సారించారు. యువరాజ్ దున్నలకు చెందిన ఘనీభవించిన వెయ్యి డోసుల వీర్యాన్ని తీసుకొచ్చి గోదావరి జిల్లాల పాడి రైతులకు అందించారు. అభ్యుదయ పాడి రైతుల వద్ద గల గేదెలకు యువరాజ్ దున్న వీర్యంతో కృత్రిమ గర్భోత్పత్తి చేస్తున్నారు. మరోవైపు దాణా ధరలు విపరీతంగా పెరగటంతో కొత్తగా అభివృద్ధి చేసిన షియా మీల్ (షియా కేక్)ను తవుడుకు ప్రత్యామ్నాయంగా అందుబాటులోకితెచ్చారు. దీన్ని దాణాలో 20% వరకూ కలుపుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రేడెడ్ దూడలతో జీవనోపాధి నేను దేశవాళీ గేదెల్ని పెంచేవాణ్ణి. వెంకట్రామన్నగూడెం పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన ముర్రా జాతి వీర్యాన్ని తీసుకొచ్చి మా గేదెలకు కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా చూలు కట్టించి గ్రేడెడ్ ముర్రాజాతి దూడలను అభివృద్ధి చేసి అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్నాను. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి బాగుంది. నా ఫారంలో ఉన్న గేదెలకు ఏ అనారోగ్య సమస్యలు ఎదురు కావడం లేదు. సకాలంలో ఎదకు వస్తున్నాయి. – నూనె శ్రీను, వెంకట్రామన్నగూడెం త్వరలో నానో టెక్నాలజీ ద్వారా పరిశోధనలు మేలు జాతి పాడి పశువుల సంతతి అభివృద్ధి కోసం చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాలిస్తున్నాయి. రాష్ట్రంలోని ముర్రా జాతి పశువుల్లో 25–30 శాతం మన కేంద్రం అభివృద్ధి చేసినవే. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ), నానో టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మేలు జాతి గేదెల ఉత్పత్తి, పునరుత్పత్తి సామర్థ్యం పెంపుపై త్వరలో పరిశోధనలు చేయబోతున్నాం. ఈ మేరకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాం. – ప్రొఫెసర్ కె.సర్జన్రెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్ -
లాభాల పాడి
లక్సెట్టిపేట : పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది. దేశ జనాభా సుమారు 125 కోట్లు ఉంటే ప్రస్తుత పాల సగటు తలసరి వినియోగం 235 గ్రాములు మాత్రమే కావడం గమనార్హం. న్యూట్రిషనిస్టుల సూచనల ప్రకారం సగటు తలసరి వినియోగం రోజుకు 250 గ్రాముల పైనే ఉండాలని మండల పశువైద్యాధికారి శ్రీనివాస్ వివరించారు. ప్రస్తుతం దేశంలో పాల దిగుబడి 110మిలియన్ టన్నులు.. ఐదు శాతం వృద్ధి రేటుతో 2020వ సంవత్సరానికి మిలియన్ టన్నుల పాల ఉత్పత్తి పెరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధిక పాల దిగుబడికి ఎక్కువ పాలసార కలిగిన శ్రేష్టమైన జాతి పశువులు అవసరం. మనకున్న పశువుల్లో ఎక్కువ శాతం తక్కువ పాలసార ఉన్న నాటి జాతి పశువులు. కావున వీటిలో అధిక దిగుబడి ఆశించడం అసాధ్యం. దేశవాలి పశువుల స్థానంలో శ్రేష్టమైన జాతుల్ని పెంపొందించుకుని పోషించాల్సిన అవసరం ఉంది. రైతులు ముర్రాజాతి గేదెలను పెంచుకుంటే అధిక పాల దిగుబడితోపాటు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ముర్రాజాతి గేదెలను పొందే విధానం ముర్రాజాతి గేదెలను గ్రామీణ ప్రాంతాల్లో గౌడిగేదెలు అని కూడా పిలుస్తారు. కృత్రిమ గర్భోత్పత్తి విధానం ద్వారా మన దేశవాళి గేదెల నుంచి గ్రేడీడ్ ముర్రాజతి దూడలను పొందవచ్చు. పిండమార్పిడి ప్రక్రియ ద్వారా కూడా పొందవచ్చు. పశుక్రాంతి పథకం ద్వారా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. ఈ మూడింటిలో ప్రస్తుతం కృత్రిమ గర్భోత్పత్తి, పశుక్రాంతి పథకం ద్వారా సులభంగా పొందవచ్చు. లాభాలు.. ముర్రా అంటే మెలివేయబడిన అని అర్థం. వీటి కొమ్ములు మెలివేయబడి పొట్టిగా ఉండి గట్టిగా లోపలి వైపునకు స్పైరల్ ఆకారంలో తిరిగి ఉంటాయి. అందుకే వీటిని ముర్రా అని పిలుస్తారు. దేశంలోని జీవ జాతుల్లో అత్యంత శ్రేష్టమైనది. పాడికి, వెన్న శాతానికి పేరెన్నిక కలిగినది. దీని పుట్టినిల్లు హర్యానా రాష్ట్రం. దేశవాలి గేదె జాతుల నుంచి అధిక పాల దిగుబడిని పొందడానికి వాటిని అప్గ్రేడ్ చేయడానికి ముర్రాజాతి వీర్యాన్ని దేశమంతటా విరివిగా వినియోగిస్తారు. దేశవాళి గేదెల కంటే ఎక్కువ పాలు ఇస్తాయి. రోజుకు సుమారు 10 నుంచి 12 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాల ఉత్పత్తి ఖర్చు తక్కువ, లాభాలు ఎక్కువ(వెన్న శాతం అధికంగా ఉండడం వల్ల, ఎక్కువ కాలం పాడితో ఉండడం వల్ల). వీటికి ఋతుక్రమం సరిగా ఉంటూ జీవిత కాలంలో ఎక్కువ ఈతలు ఈనడంతోపాటు దృఢమైన దూడలనిస్తాయి. దూడబరువు రోజువారీగా 400 నుంచి 500 గ్రాములు పెరుగుతూ త్వరగా ఎదకు వస్తాయి. పొందే విధానం.. ముర్రాజాతి గేదెకు ఒక్కో దానికి సుమారు రూ.50వేలు ఉంటుంది. రవాణా ఖర్చు సుమారు రూ.6,500 అవుతుంది. గేదె బీమాకు రూ.2వేలు చెల్లించాలి. గేదె ధరను బట్టి 4 నుంచి 5 శాతం వరకు బీమా లెక్కిస్తారు. బీమా చేయించడం వల్ల ప్రమాదవశాత్తు చనిపోతే యజమాని నష్టపోకుండా ఉంటారు. బీమా కంపెనీలు నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యునెటైడ్ ఇండియా ఇన్య్సూరెన్స్ కంపెనీ న్యూ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ బ్యాంకు రుణాలు.. యజమాని ఒక గేదెను కొనడానికి సుమారు రూ.60వేల వరకు పెట్టుబడి పెట్టాలి. కానీ అంత పెట్టుబడి పెట్టలేని వారి కోసం ప్రభుత్వం సాధారణ, మధ్య తరగతి రైతులకు ఇతర రాష్ట్రాల నుంచి ముర్రాజాతి గేదెలను దిగుమ తి చేసుకునే అవకాశాన్ని బ్యాంకు రుణాల ద్వారా కల్పిస్తోంది. గేదె ధరకు మార్జిన్ మనీ కింద 20శాతాన్ని చెల్లిం చాలి. మిగితా మొత్తం బ్యాంకు చెల్లించి గేదెను దిగుమతి చేస్తుంది. ఇందులో సుమారు 25 నుంచి 50శాతం వరకు సబ్సిడీ కూడా వర్తిస్తుంది. మధ్య తరగతి కుటుంబాలు ఒ కేసారి ఐదు నుంచి పది గేదెలతో మినీ డెయిరీ ఏర్పాటు చేసుకోవడానికి బ్యాంకు అధికారులను సంప్రదిస్తే వివరాలు తెలియజేస్తారు. గేదె చనిపోతే బీమా కంపెనీ పరి హారం అందజేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర విభజన దృష్ట్యా ఇంకా ఎటువంటి సబ్సిడీ, రుణాల సమాచారం రాలేదు.