పార్థుడికే పట్టం
ముచ్చటగా మూడోసారి జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు
ఆశావహులను నిరుత్సాహ పరిచిన అధినేత చంద్రబాబు
అనంతపురం అర్బన్ : తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా తిరిగి పార్థుడికే పట్టం కట్టారు. జిల్లా అధ్యక్ష పదవి చేపట్టడానికి ఉత్సాహం చూపిన వారికి నిరుత్సాహమే ఎదురైంది. పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బీకే పార్థసారధిని మూడోసారి జిల్లా అధ్యక్షునిగా ఎంపిక చేసి అధినేత చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గురువారం రాత్రి సుదీర్ఘ చర్చలు అనంతరం బీకే పార్థసారథిని జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేస్తున్నట్లు అధినేత నిర్ణయం తీసుకున్నారు. అయితే శుక్రవారం జిల్లా అధ్యక్షుడిగా బికేనే ఎంపిక చేస్తూ.. అధికారికంగా ప్రకటించారు.
ముచ్చటగా మూడోసారి టీడీపీ జిల్లా అధ్యక్షునిగా పగ్గాలు చేపట్టి బీకే హ్యట్రిక్ కొట్టారు. జిల్లా అధ్యక్ష ఎంపికపై ఈ నెల16వ తేదీ జిల్లా విసృ్తత స్థాయి సమావేశం జరిగింది. అయితే ఆ సమావేశంలో జిల్లా అధ్యక్షుడి ఎంపికపై అప్పడు తాత్కాలికంగా వాయిదా వేశారు. సమావేశం అనంతరం రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జిల్లా అధ్యక్ష ఎంపిక ప్రకటనను అధినేత ప్రకటిస్తారన్నారు. ఐదు రోజుల నుంచి అధ్యక్ష నియామకంపై ఉత్కంఠంగా ఎదురుచూసిన టీడీపీ నాయకులకు అధినేత ప్రకటన వెలువడగానే ఆశావాదులు నిరుత్సాహ పడినట్లు సమాచారం.
బీకే పార్థసారధి జిల్లా అధ్యక్షుడిగా పదవీకాలం ముగుస్తున్న తరుణంలో.. జిల్లా అధ్యక్షులుగా బీకే ఆయిష్టంగా ఉన్నట్లు అప్పటిలో ఆయన అనుచరులు చర్చించుకున్నారు. దీంతో జిల్లా అధ్యక్షునిపై మరో ముగ్గురు కీలకప్రజాప్రతినిధులు కన్నేసి తమవంతు పావులు కదిపారు. ఎలాగైన జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకోవాలనుకున్న ఆశావాదులను అధినేత నిరుత్సాహ పరిచారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను బేరీజు వేసిన అధినేత పార్థుడికే పగ్గాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారమే జిల్లా అధ్యక్ష పదవి మూడోసారి పార్థసారధిని వరించింది. జిల్లా కమిటీలో మిగిలిన పదవులతో పాటు, పార్టీ అనుబంధ సంఘాల పదవుల్లో పాతే వారే కొనసాగుతారా..? కొత్తవారికి అవకాశం ఇస్తారా.? అనే ప్రశ్నలు తాజాగా తమ్ముళ్లను పట్టిపీడిస్తున్నాయి.