breaking news
mavullamma temple
-
Bhimavaram: మావుళ్ళమ్మ వార్షికోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
భీమవరం(పశ్చిమ గోదావరి జిల్లా): మావుళ్లమ్మ అమ్మవారి 59 వార్షిక మహోత్సవాలను ఈ నెల 13 తేదీ నుంచి వచ్చే నెల 10 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థాన సహకారంతో అమ్మవారి వార్షిక మహోత్సవాలు నిర్వహిస్తారు. ఇప్పటికే అమ్మవారి అలంకరణ పనులు పూర్తి చేశారు. 14 రోజుల పాటు అమ్మవారి మూల విరాట్ దర్శనం నిలుపుదల చేసి అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి ఆలయం వద్ద జాతర మహోత్సవాల ఏర్పాట్లలో భాగంగా ఆలయం వద్ద చలువ పందిళ్లు, భారీ సెట్టింగ్స్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సుమారు నెల రోజులపాటు ఉత్సవాలు మావుళ్లమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలు నెల రోజులపాటు నిర్వహిస్తారు. ఈనెల రోజుల్లో ప్రతీ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అమ్మవారి ఉత్సవాల చివరి 9 రోజులపాటు అలంకరణలు చేస్తారు. ప్రతీరోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకూ జానపద నృత్యాలు, భరత నాట్యాలు, హరికథ, బుర్రకథ, పలు కళా ప్రదర్శనలు, భక్తి కార్యక్రమాలు, సినీ సంగీత విభావరి ఏర్పాటు చేస్తారు. నెల రోజుల పాటు సాంఘిక, పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తారు. రూ.90 లక్షల వ్యయంతో నిర్వహణ నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతీ ఏడాది నిర్వహించే అమ్మవారి మహోత్సవాలకు సుమారు రూ.70 లక్షల నుంచి రూ.80 లక్షలు ఖర్చు చేస్తారు. గత రెండేళ్లు కరోనా కారణంగా అమ్మవారి ఉత్సవాలు సాధారణంగానే నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగుపడడంతో ఈ ఏడాది సుమారు రూ.90 లక్షలు ఖర్చు చేసి వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా తరలి రానున్న భక్తులు ఉత్సవాలను తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. నెల రోజులపాటు ఆలయం వద్ద సందడి నెలకొంటుంది. సంక్రాంతి పండుగకు వచ్చే జనంతో పాటు భీమవరం చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీగా జనం తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన కళాప్రదర్శనను, ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లైటింగ్, సెట్టింగ్స్, విద్యుత్ అలంకరణలను తిలకిస్తారు. అమ్మవారి ఉత్సవాలు నిర్వహించే నెలరోజుల పాటు రోజుకు సుమారు 7 నుంచి 8 వేల మంది భక్తులకు అన్నదానం చేస్తారు. ఇక అమ్మవారి ఉత్సవాల ముగింపు రోజున సుమారు లక్ష మందికి అమ్మవారి ప్రసాదాన్ని భోజన రూపంలో అందిస్తారు. 58 ఏళ్లుగా ఉత్సవాల నిర్వహణ గత 58 ఏళ్లుగా నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థాన సహకారంతో విజయవంతంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో నెల రోజులపాటు నిర్వహించే ఏకైక ఉత్సవాలుగా మావుళ్లమ్మవారి ఉత్సవాలు ప్రసిద్ది చెందాయి. ఉత్సవాల్లో సినీ నటులను ఘనంగా సువర్ణ కంఠాభరణం, హస్త కంకణంతో సత్కరిస్తారు. (క్లిక్ చేయండి: ఆమె ఇంటికి వెళ్లి స్వయంగా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే) -
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి..1880 నుంచి అమ్మవారికి పూజలు
భీమవరం: మావుళ్లమ్మ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేల్పు.. గ్రామ దేవతగా నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారు నిలువెత్తు స్వర్ణమయంతో.. చూసిన కనులదే భాగ్యం అన్నట్లుగా దర్శనమిస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు పూజిస్తారు. అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూసేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఎంతో మహిమ గల అమ్మవారిని దర్శించుకుంటే ఉద్యోగ, వృత్తి, వ్యాపారం రాణిస్తామనేది నమ్మకం. భీమవరం ప్రాంత ప్రజలకు తమ పనిలో రాణించాలంటే అమ్మవారి ఆ«శీస్సులు ఉండాలని ఎంతగానే విశ్వసిస్తారు. అనేక మంది తమ వ్యాపారాలకు అమ్మవారి పేరు పెట్టుకుని విజయవంతంగా సాగిపోతున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం నుంచి పెళ్లి శుభలేఖ అమ్మవారి పాదాల వద్ద పెట్టే వరకు అన్నింటికీ అమ్మవారి దయ ఉండాల్సిందే. దేశంలో మన తెలుగువారున్న ప్రాంతానికి ఎక్కడికి వెళ్లినా భీమవరం అంటే మావుళ్లమ్మ అమ్మవారు వెలిసిన పట్ణణమని గుర్తుచేసుకుంటారు. ఏటా 33 రోజుల పాటు వార్షికోత్సవాలు మావుళ్లమ్మకు ఏడాదంతా జాతర్లు, ఉత్సవాలు, పూజలు జరుగుతూనే ఉంటాయి. 10 రోజుల పాటు దసరా ఉత్సవాలు, ఉగాది, ఆషాడ మాస పూజలు, సారెలు, వార్షిక మహోత్సవాలు ఇలా ఏడాదంతా సందడే సందడి.. సంక్రాంతి సమయంలో వార్షికోత్సవాల్ని సుమారు 33 రోజలు పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అత్యంత వైభవంగా జ్యేష్ట మాసం జాతర నిర్వహిస్తారు. ఆషాడ మాసంలో పట్ణణంలోని ప్రతి చోట అమ్మవారి జాతరను ప్రజలు నిర్వహించుకుంటారు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారి దేవస్థానంలో చండీహోమం జరుపుతారు. ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీమావుళ్లమ్మ అమ్మవారి మా«లధారణ దీక్ష తీసుకుంటారు. దసరా, వార్షికోత్సవ ఉత్సవాల్లో అమ్మవారు వివిధ దేవతామూర్తుల అలంకరణలో దర్శనమిస్తారు. 50 కిలోల ఆభరణాలతో అలంకరణ మావుళ్లమ్మ నిలువెత్తు స్వర్ణమయానికి దాతలు, భక్తులు సంకల్పించారు. సుమారు 8 ఏళ్ల నుంచి అమ్మవారిని స్వర్ణమయం చేయడానికి బంగారం సేకరిస్తున్నారు. 100 కిలోల బంగారం సేకరణ లక్ష్యం కాగా ఇంతవరకు సుమారు 63 కిలోలు సేకరించారు. అందులో సుమారు 50 కిలోల బంగారంతో అమ్మవారికి బంగారు ఆభరణాలు తయారు చేయించి అలంకరించారు. మరో 13 కిలోల బంగారంతో అభరణాల తయారీకి సిద్ధంగా ఉన్నారు. భక్తులు, దాతలు తమ స్తోమతను బట్టి 2 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు బంగారాన్ని విరాళంగా అందిస్తున్నారు. ఇక అమ్మవారికి భక్తులు చీరలు, జాకెట్ ముక్కలు మొక్కుగా చెల్లించుకుంటారు. భక్తులు సమర్పించిన చీరలు, జాకెట్ ముక్కలను దేవస్థానం వేలం పాట నిర్వహిస్తుంది. మహిళలు వీటిని వేలంలో దక్కించుకుంటారు. ఈ వేలం ద్వారా దేవస్థానానికి లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది. దూరప్రాంత భక్తుల కోసం నిత్యాన్నదానం అమ్మవారి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం సుమారు 13 ఏళ్ల క్రితం అమ్మవారి సన్నిధిలో శాశ్వత నిత్యాన్నదానం ప్రారంభించారు. సాధారణ రోజుల్లో సుమారు 200 మందికి.. ఉత్సవాలు, ప్రత్యేక పూజలు, పండుగల రోజుల్లో సుమారు 300 మంది వరకు అన్నదానం చేస్తారు. దాతలు అన్నదానానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు లడ్డు, పులిహోర ప్రసాదంగా విక్రయిస్తారు. మావుళ్లమ్మ అమ్మవారికి సుమారు 9 ఎకరాల సాగు భూమి ఉంది. ఆలయం ఎదురుగా రూ.కోట్ల విలువ చేసే స్థలంతో పాటు ఉండి రోడ్డులో కమర్షియల్ కాంప్లెక్సు భవనం ఉంది. అమ్మవారి దేవస్థానం ట్రస్టీ బోర్డు 9 మంది ధర్మకర్తలతో నడుస్తోంది. ఒకరు చైర్మన్గా, 8 మంది ధర్మకర్తలుగా సుమారు రెండేళ్లు పాటు అమ్మవారి సేవలో ఉంటారు. 1880లో తొలిసారి పూజలు మావుళ్లమ్మ వెలిసిన ప్రాంతంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అమ్మవారు 1200 ఏళ్ల క్రితం ఇక్కడ వెలిసినట్లు చెబుతారు. 1880 సంవత్సరంలో ఇక్కడ పూరిపాక వేసి అమ్మవారికి పూజలు ప్రారంభించారు. పట్టణంలో ఉన్న మోటుపల్లి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవనం ప్రాంతంలో వేప, రావి చెట్టు కలిసి ఉన్న చోట మావుళ్లమ్మ వెలిశారని చరిత్ర చెబుతుంది. మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక మామిళ్ళు అమ్మగా.. అనంతరం మావుళ్లమ్మగా పేరు వచ్చిందని చెబుతారు. 1880 సంవత్సరం వైశాఖ మాసం రోజుల్లో భీమవరానికి చెందిన మారెళ్ళ మాచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతంలో ఆలయం నిర్మించాలని ఆదేశించారంటారు. అమ్మవారి విగ్రహానికి ఎండ తగలకుండా పూరిపాక వేసి పూజలు చేసేవారు. అనంతరం మాచిరాజు, అప్పన్నలు ప్రస్తుత ఆదివారం బజార్ ప్రాతంలో అమ్మవారికి ఆలయం నిర్మించారు. 1910 ప్రాంతంలో కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యలు అమ్మవారి విగ్రహాన్ని మలిచారు. అమ్మవారు ప్రళయ భీకర స్వరూపిణిగా కనిపించేవారు. దాంతో గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దారు. తొలి నుంచి మెంటే వెంకటస్వామి పూర్వీకులు, అల్లూరి భీమరాజు వంశస్తులు అమ్మవారి పుట్టింటి వారిగా, గ్రంధి అప్పన్న మొదలైన వారి పూర్వీకులు అత్తింటివారిగా జ్యేష్ట మాస జాతర ఉత్సవాలలో పాల్గొంటారు. అమ్మవారి దర్శనానికి ప్రముఖుల క్యూ మావుళ్లమ్మ అమ్మవారి దర్శనం కోసం పలువురు ప్రముఖులు తరలివస్తుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సినిమా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, క్రీడాకారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తరచూ అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సవాల సమయంలో పలువురు ప్రముఖులకు సన్మానాలు చేస్తుంటారు. -
మావుళ్లమ్మను దర్శించుకున్న రాంచరణ్
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మావుళ్లమ్మను సినీ హీరో రాంచరణ్ దంపతులు బుధవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సినిమా షూటింగ్ నిమిత్తం భీమవరం వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు రోజుల పాటు భీమవరం పరిసర ప్రాంతాలలో సినిమా షూటింగ్ జరగనుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ స్టోరీగా తెలుస్తోంది. ఇప్పటికే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. -
మావుళ్లమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ. 21.99 లక్షలు
భీమవరం (ప్రకాశం చౌక్) : భీమవరం మావుళ్లమ్మ ఆలయ హుండీలను మంగళవారం లెక్కించగా రూ. 21,99,561 ఆదాయం లభించింది. ఆలయ ఈవో నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో బంగారం 082.400 మీలీ గ్రాములు, వెండి 0.218 మిల్లీగ్రాములు వచ్చింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గత నెల 29న హుండీలను లెక్కించామని, అప్పటి నుంచి మంగళవారం వరకూ ఈ ఆదాయం లభించిందన్నారు. కలెక్టర్, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రతివారం అమ్మవారి హుండీలను తెరిచి ఆదాయం లెక్కించి బ్యాంకులో జమ చేస్తామన్నారు. పర్యవేక్షణ అధికారి కర్రి శ్రీనివాసరావు, ధర్మకర్తలు శీరిగినీడి చంద్రశేఖర్, అడ్డగర్ల ప్రభాకరగాంధీ తదితరులు పాల్గొన్నారు. -
భీమవరంలో మావూళ్లమ్మ ఉత్సవాలు