breaking news
Mass Rapid Transit System
-
ఏపీ మెట్రో ప్రాజెక్టులకు ముఖ్య సలహాదారుగా శ్రీధరన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి పట్టణాల్లో ప్రతిపాదిత మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఎంఆర్టీఎస్) ప్రాజెక్టుకు ముఖ్య సలహాదారుగా ఇ.శ్రీధరన్ను ప్రభుత్వం నియమించింది. ఈమేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి డి.సాంబశివరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఆర్టీఎస్ కింద విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో చేపట్టబోయే మెట్రో రైలు ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేసేందుకు శ్రీధరన్ సేవలను ప్రభుత్వం వినియోగించుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆయనకు సెప్టెంబర్ 1 నుంచే గౌరవ వేతనం కింద నెలకు రూ. 1.50 లక్షలు ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో శ్రీధరన్ ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ ప్రాజెక్టు బాధ్యతలు నిర్వర్తించిన విషయం విదితమే. -
ఠాణేలో మోనోరైలుకు నో
ముంబై: ఠాణే-భివండీ-కల్యాణ్ మార్గంలో మోనోరైలు ఏర్పాటుకు నిర్వహించిన సాధ్యాసాధ్యాల సర్వేలో వ్యతిరేక ఫలితాలు రావడంతో ఈ ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి బదులు ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో రవాణా వ్యవస్థను అభివృద్ధి పర్చడానికి మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఆర్టీఎస్) ప్రాజెక్టును చేపట్టాలని భావిస్తోంది. అయితే ఈ ప్రాంతంలోని ప్రయాణ అవసరాలు, రద్దీ, ఆర్థిక, సాంకేతిక విషయాలపై అధ్యయనం నిర్వహించేందుకు ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవెలప్మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) టెండర్లను కూడా ఆహ్వానించింది. ఠాణే-భివండీ-కల్యాణ్ ప్రాంతం కోసం ఎంఆర్టీఎస్ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ గత నెల సంకేతాలు ఇచ్చారు. ఇక మోనోరైలు ఏర్పాటు కోసం ఎమ్మెమ్మార్డీయే..రైట్స్ అనే సంస్థ సాయంతో 2011లోనే సాధ్యాసాధ్యాల అధ్యయనం నిర్వహించింది. ఈ మార్గంలో 25 కిలోమీటర్ల మేర మోనోరైలు ఏర్పాటు వల్ల నష్టాలు వచ్చే అవకాశం ఉందని, రాబడులకు ఎక్కువ అవకాశాలు లేవని సర్వే తేల్చింది. దీనికి బదులు రోడ్డు మార్గాల అభివృద్ధికి ప్రాజెక్టులు ప్రారంభించాలని సిఫార్సు చేసింది. ఈ ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక స్థితిగతులు మారడం, విరార్ నుంచి అలీబాగ్ ప్రత్యేక రవాణా మార్గం ఏర్పాటు ప్రతిపాదన నేపథ్యంలో ఎంఆర్టీఎస్ ఏర్పాటుకు తాజాగా సర్వే నిర్వహిస్తున్నామని ఎమ్మెమ్మార్డీయే వివరించింది. ఠాణే, భివండీ, కల్యాణ్లో ప్రయాణికుల రద్దీని అంచనా వేయడం ద్వారా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని తెలిపింది.