ఘాట్రోడ్డు పరిశీలించిన ప్రజాసంఘాల నేతలు
మావటూరు(పెనుకొండ): పెనుకొండ సమీపంలో షీప్ ఫారం సమీపంలోని పెనుకొండ -మడకశిర రహదారిలో ఇటీవల ఆర్టీసీ బస్ దుర్ఘటనకు గురైన ఘాట్ పరిసరాలను ప్రజాసంఘాల నాయకులు మంగళవారం పరిశీలించారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.శ్రీనివాసులు, ఓపీడీఆర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు రామకృష్ణ, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సుబ్బన్న, పౌరహక్కుల సంఘం జిల్లా జాయింట్ సెక్రటరీ శ్రీరామమూర్తి, కులనిర్మూలన పోరాట సమితి జిల్లా కార్యదర్శి నల్లప్ప, కోశాధికారి రాము ప్రమాద ఘాట్ను పరిశీలించారు.
ఆర్టీసీ బస్సు ప్రమాదానికి ఎలా గురైందీ, కాంట్రాక్టర్ది ఏ మేరకు బాధ్యుడు, అధికారులు తీసుకున్న చర్యలు, డ్రైవర్ చేసిన పొరబాటు ఏమిటనే విషయాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మావటూరు గ్రామానికి చేరుకుని ప్రమాదం బారిన పడి మరణించిన విద్యార్థులు నరసింహ్మమూర్తి, అశోక్కుమార్, నరేంద్ర, గంగాధర్ ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులను పరామర్శించారు. వారి కుటుంబ స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం కన్నీటి ధారలు ఆపడం ఎవరి తరం కాలేదు.
దళితవాడలో బస్సు ప్రమాదంలో మరణించిన నరేంద్ర పెద్దమ్మను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ఆమె రోదించిన తీరు చూసిన వారంతా కన్నీరు పెట్టారు. ఆమె గుండెలవిసేలా బాదుకోవడంతో విషాదం చూడలేక ప్రజాసంఘాల నేతలు అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం నాయకులు నాగలూరు, బండపల్లి గ్రామాల్లో సైతం మరణించిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు.