Mandal Parishad President Election
-
పీఠమెక్కిన ఎంపీపీలు
- అతివలకే అగ్రతాంబూలం - టీడీపీ నేతల దౌర్జన్యంతో దేవరపల్లి ఎంపీపీ ఎన్నిక వాయిదా ఏలూరు : జిల్లాలో మండల ప్రజా పరిషత్ పాలకవర్గాల కొలువయ్యూరుు. 45 మండలాల్లో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు శుక్రవా రం పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో 46 మండలాలు ఉండగా, 45 మండలాల్లో మాత్రమే ఎంపీపీ, ఉపాధ్యక్ష ఎన్నికలు జరిగారు. దేవరపల్లిలో టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉండగా, టీడీపీ నాయకులు దాడులకు తెగబడ్డారు. దీంతో ఎన్నికను వారుదా వేశారు. నిడదవోలు, వీరవాసరం, పోడూరు మండల పరిషత్ పీఠాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా, మిగిలిన 42 స్థానాల్లో టీడీపీ పాగా వేసింది. పెంటపాడు మండలంలో ఉపాధ్యక్ష పదవిని ఐదేళ్లలో నలుగురికి పంచే క్రమంలో టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. అతివలకే అగ్రస్థానం జిల్లాలో 45 మండల ప్రజా పరిషత్లకు ఎన్నిక నిర్వహించగా, 27 మండలాల్లో అధ్యక్ష పదవులను మహిళలే అధిష్టించారు. 18 మండలాల్లో అధ్యక్ష పదవులను పురుషులు అందుకున్నారు. కాగా ఉపాధ్యక్ష పదవుల్లో ఆరు మహిళలకు దక్కగా, పురుషులు 39 పీఠాలను దక్కించుకున్నారు. మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు వీరే -
అడ్డదారి.. విలువలకు పచ్చ గోరీ
సాక్షి, కాకినాడ : జిల్లాలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. మండలాధ్యక్ష ఎన్నికల్లో ప్రలోభాలు, బెదిరింపులు, బరితెగింపులకు పాల్పడింది. మెజార్టీ మండలాలు దక్కినా అధికారదాహం తీరక మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు ఎన్నికలను కనుసన్నల్లో నడిపించారు. ఫలితంగా పలుచోట్ల తెలుగుతమ్ముళ్లు పేట్రేగిపోయారు. అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. జిల్లాలో 57 మండలాల్లో 44 టీడీపీ, 11 వైఎస్సార్ సీపీ దక్కించుకున్నాయి. కోరం లేక ఒకచోట, తెలుగుతమ్ముళ్ల దాడులతో మరో చోట ఎన్నిక వాయిదా పడింది. జిల్లాలోని 1063 ఎంపీటీసీలకు608 స్థానాల్లో టీడీపీ, 391 స్థానాల్లో వైఎస్సార్ సీపీ, రెండుచోట్ల కాంగ్రెస్, 62 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. 40 మండలాల్లో టీడీపీకి, 12 మండలాల్లో వైఎస్సార్ సీపీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. చెరిసగం సీట్లు దక్కిన నాలుగు మండలాల్లో మూడు చోట్ల టీడీపీ ప్రలోభాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు చేసినా అధికారులు అధికార పార్టీకే అనుకూలంగా వ్యవహరించారు. రౌతులపూడిలో టీడీపీ వర్గీయుల వీరంగం రౌతులపూడి మండలంలో టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెరో ఏడుస్థానాలు గెలవగా, ఇద్దరు స్వతంత్రులు చెరో పార్టీకి మద్దతు పలికారు. దీంతో పోటీ ఆసక్తికరంగా మారింది. కో ఆప్షన్ సభ్యత్వం లాటరీ వైఎస్సార్ సీపీకి దక్కడంతో ఎంపీపీ ఆ పార్టీ పరమవుతుందన్న దుగ్ధతో టీడీపీ ఎంపీటీసీలు, నాయకులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయాలంటూ టీడీపీ ఎంపీపీ అభ్యర్థి ఇటంశెట్టి భాస్కరబాబు నాయకత్వంలో ఎంపీటీసీ సభ్యులు, 30 మంది నాయకులు, కార్యకర్తలు ఎంపీపీ కార్యాలయంలోకి చొరబడి ఫర్నీచర్, ఫైళ్లు, కిటికీల అద్దాలు ధ్వంసం చేశారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుతో పాటు ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యులను, అధికారులను దుర్భాషలాడారు. ఈ దశలో ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ ఎంపీటీసీలను ఒక గదిలో ఉంచి భద్రత కల్పించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. మరొక పక్క వందలాది మంది ఎంపీపీ కార్యాలయం వెలుపల గుమిగూడి ‘ఎన్నికలు నిర్వహిస్తే అంతుచూస్తాం..’ అంటూ వీరంగమాడారు. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని, తమ ఎంపీటీసీలను లోబర్చుకునే లక్ష్యంతోనే ఎన్నిక వాయిదా వేయాలని భయభ్రాంతులకు గురి చేశారని ఎమ్మెల్యే వరుపుల ధ్వజమెత్తారు. తమ ఎంపీటీసీలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. చివరికి ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఏలేశ్వరంలో కోరం లేక వాయిదా ఏలేశ్వరం మండల పరిషత్లో టీడీపీకి మెజారిటీ స్థానాలు దక్కినా ఎస్టీలకు రిజర్వైన చైర్మన్ స్థానం కైవసంచేసుకునేందుకు ఆ కేటగిరీ విజేత కరువయ్యారు. ఇదే పరిస్థితి ఏలేశ్వరం నగర పంచాయతీలో కూడా ఏర్పడినా వైఎస్సార్ సీపీ తరఫున గెలిచిన ఎస్సీ కౌన్సిలర్ను ప్రలోభపెట్టి చైర్మన్ పీఠాన్ని ఖాతాలో వేసుకుంది. మండల పరిషత్ ఎన్నికల్లో కూడా అదేరీతిలో చక్రం తిప్పాలని విఫలమైంది. వైఎస్సార్ సీపీ తరపున గెలుపొందిన ఆరుగురు ఎంపీటీసీలు సమావేశానికి హాజరు కావడంతో, తాము కూడా హాజరైతే విధిలేని పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీకి మద్దతు పలకాల్సి వస్తుందనే భావనతో తమ పార్టీ ఎంపీటీసీలను టీడీపీ గైర్హాజరయ్యేలా చేసింది. దీంతో కోరం లేక ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు. టీడీపీ, వైఎస్సార్ సీపీలకు చెరిసగం ఎంపీటీసీ స్థానాలు దక్కిన కాజులూరు, యు.కొత్తపల్లి, కోటనందూరు, రౌతులపూడి మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు ఉత్కంఠను రేపాయి. అయితే టీడీపీ వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికైన ఎంపీటీసీలను బెదిరించీ, ప్రలోభపెట్టి కోటనందూరులో ఇద్దరినీ, యు.కొత్తపల్లిలో ఇద్దరినీ, కాజులూరులో ఒకరినీ తన వైపు తిప్పుకొని మండల పీఠాలను చేజిక్కించుకుంది. వైఎస్సార్ సీపీ ఆందోళన..పట్టించుకోని అధికారులు కోటనందూరులో తమ ఎంపీటీసీలను టీడీపీ లోబర్చుకున్నందున ఎన్నిక వాయిదా వేయాలని వైఎస్సార్ సీపీ ఆందోళనకు దిగినా పట్టించుకోలేదు. ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని బైఠాయించగా పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఎంపీటీసీలపై కేసులు పెడతామని హెచ్చరించారు. విధిలేని పరిస్థితుల్లో ఆందోళన విరమించి ఎన్నికల్లో పాల్గొని ఎంపీపీ, వైస్ ఎంపీపీ అభ్యర్థులను నిలబెట్టినా ప్రలోభాలకు గురైన వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలు టీడీపీ వైపే ఉండడంతో ఫలితం లేకపోయింది. యు.కొత్తపల్లి మండలంలో ఇరు పార్టీలకు చెరో 12 మంది ఎంపీటీసీలుండగా, లాటరీ పద్ధతిలో ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే టీడీపీ వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు ఎంపీటీసీలను గైర్హాజరయ్యేల చేసి అధ్యక్షపీఠాన్ని ఎగరేసుకుపోయింది. కాజులూరులలో కూడా తమ పార్టీ ఎంపీటీసీలను టీడీపీ ప్రలోభాలకు గురిచేయడంపై వైఎస్సార్ సీపీ ఆందోళనలు చేసినా అధికారులు అధికార పార్టీకే కొమ్ముకాస్తూ ఎన్నిక కానిచ్చేశారు. కాగా మిగిలిన రెండు స్థానాలకు శనివారం ఎన్నికలు నిర్వహించనున్నారు. -
ఆగని టీఆర్ఎస్ జోరు
* అత్యధిక ఎంపీటీసీలు సాధించినా కాంగ్రెస్కు నిరాశే * 24 మండలాల్లో వివిధ కారణాలతో శనివారానికి వాయిదా పడ్డ ఎన్నిక * మున్సిపల్ మాదిరిగానే చతికిలపడ్డ టీడీపీ సాక్షి, హైదరాబాద్: మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి జోరు అప్రతిహతంగాసాగింది. ఆ పార్టీ స్థానిక సంస్థల్లో సాధించిన స్థానాలు కాంగ్రెస్ కంటే తక్కువే అయినప్పటికీ..ఇతర పార్టీల్లోని సభ్యుల మద్దతుతో అధిక ఎంపీపీ అధ్యక్ష స్థానాలను గెలుచుకుంది. టీఆర్ఎస్ దాదాపు రెండువందల ఎంపీపీ పీఠాలను కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 117 స్థానాలతో రెండో స్థానానికే పరిమితమైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్కు ఎదురే లేకుండా పోయింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో టీఆర్ఎస్ సొంత బలం కంటే ఎక్కువ స్థానాలను దక్కించుకుంది. తెలంగాణలో మొత్తం 443 మండలాలకుగాను 47 మండలాల్లో వివిధ కారణాలవల్ల ఎంపీటీసీల ఎన్నికలే జరగలేదు. 396 మండలాల అధ్యక్ష పదవులకు శుక్రవారం ఎన్నికలు నిర్వహించగా, కోరం లేని కారణంగా 24 మండలాల ఎన్నికలు శనివారానికి వాయిదా పడ్డాయి. టీఆర్ఎస్కు మొత్తం 1860 ఎంపీటీసీ స్థానాలు లభించగా, కాంగ్రెస్కు 2351 ఎంపీటీసీ స్థానాలు దక్కాయి. వరంగల్ జిల్లా మినహా కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో టీఆర్ఎస్ హవా ఏకపక్షంగా కొనసాగింది. మున్సిపల్ మాదిరిగానే మండలాధ్యక్ష ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ చతికిలపడింది. మొత్తం స్థానాల్లో పదిశాతం గెలుచుకుని మూడో స్థానానికి పరిమితమైంది. గతంతో పోలిస్తే బీజేపీ పరిస్థితి ఈసారి ఆశాజనకంగా ఉంది. కాగా, మండల పరిషత్ ఎన్నికలను మంత్రులు కొందరు జిల్లాలకు వెళ్లి పర్యవేక్షిస్తే.. మరికొందరు రాజధాని నుంచే పరిస్థితులను చక్కదిద్దారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉంటుందని పలువురు ప్రత్యర్థులు టీఆర్ఎస్కు మద్దతునిచ్చారు. మరికొన్నిచోట్ల బెదిరింపులు, ప్రలోభాలతోనూ ఎంపీటీసీలను టీఆర్ఎస్ తమవైపునకు తిప్పుకుంది. వీటికి ఎన్నికలు జరగలేదు ఖమ్మం జిల్లాలో రెండు మండలాలకు అసలు ఎన్నికలు జరుగకపోగా.. 44 మండలాలకు హైకోర్టు ఉత్తర్వుల మేరకు చైర్పర్సన్ ఎన్నికలు జరుగలేదు. వరంగల్ జిల్లాలోని మంగపేట మండలానికి కూడా ఎన్నికలు నిర్వహించలేదు. -
అధికార జులుం
* ఎంపీపీ ఎన్నికల్లోనూ టీడీపీ అరాచకాలు * వైఎస్సార్సీపీ, స్వతంత్ర సభ్యులకు ప్రలోభాలు * లొంగనిచోట దౌర్జన్యాలు, సభ్యుల కిడ్నాప్లు * అండదండలందించిన అధికార యంత్రాంగం * శ్రీకాకుళం జిల్లాలో గర్భిణిపై దౌర్జన్యం * తూర్పుగోదావరిలో ఎన్నికల అధికారిపై దాడి * పలుజిల్లాల్లో అధికారులపై మంత్రుల ఒత్తిళ్లు * 624 స్థానాల్లో అధ్యక్ష ఎన్నికలు పూర్తి, 29 చోట్ల వాయిదా * 200 వైఎస్సార్ కాంగ్రెస్, 416 టీడీపీ కైవసం * ఖాతా తెరవని కాంగ్రెస్, జేఎస్పీకి చిత్తూరులో 2 ఎంపీపీలు సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో శుక్రవారం నిర్వహించిన మండల పరిషత్తు అధ్యక్ష ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ అరాచకాలకు అంతులేకుండా పోయింది. దౌర్జన్యాలు, అపహరణలు, బలవంతంగా ఓట్లువేయించుకోవడం ద్వారా ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. తాము గెలిచే అవకాశాలు ఏ కోశానా లేవన్న స్థానాల్లో అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికలను వాయిదా వేయించింది. అన్ని జిల్లాల్లోనూ ఆ పార్టీ నేతల వైఖరి ఇదేవిధంగా సాగింది. గురువారం నాటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ నేతలు పలు ప్రాంతాల్లో దౌర్జన్యాలకు తెగబడి అధ్యక్ష స్థానాలను కైవసం చేసుకొనే ప్రయత్నం చేయడం తెలిసిందే. మండల పరిషత్తు ఎన్నికల్లోనూ టీడీపీ నేతలు అదే దౌర్జన్యాన్ని కొనసాగించారు. అటు స్వతంత్ర సభ్యులనే కాకుండా ఇటు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను ప్రలోభాలకు గురిచేశారు. తమ ఎత్తులకు తలొగ్గని వారిని దౌర్జన్యాలతో లొంగదీసుకున్నారు. అనేకమందిని క్యాంపులకు తరలించి నేరుగా ఎన్నికల కేంద్రాలకు తీసుకువచ్చి బలవంతాన వారితో ఓట్లు వేయించుకున్నారు. అధికారపార్టీ అక్రమాలకు అధికారయంత్రాంగం కూడా ఎక్కడికక్కడ అండదండలందించి నిబంధనలకు నీళ్లొదిలారు. శ్రీకాకుళం జిల్లా బూర్జలో గర్భిణిపై దాడికి పాల్పడినా అధికారులు పట్టించుకోలేదు. తనకు మద్దతుగా చేతులెత్తాలని నిండుగర్భిణిగా ఉన్న వైఎస్సార్సీపీకి చెందిన మామిడివలస ఎంపీటీసీ సభ్యురాలు కొబగాన సంతోషిపై టీడీపీ అభ్యర్థి పెంట నాగమణి దౌర్జన్యం చేశారు. విశాఖపట్నం డుంబ్రిగుడ మండలంలో టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కో-ఆప్టెడ్ సభ్యుడిని టీడీపీ నేతలు కిడ్నాప్ చేయడంతో ఎన్నిక వాయిదా పడింది. తూర్పుగోదావరిజిల్లా రౌతులపూడి ఎన్నిక వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు తమ్ముళ్లు ఎంపీపీ కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్, ఫైళ్లు, కిటికీల అద్దాలు ధ్వంసం చేసి భయోత్పాతం సృష్టించారు. దీంతో ఎన్నికను శనివారానికి వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పశ్చిమ గోదావరిజిల్లా దేవరపల్లిలోనూ టీడీపీ నేతలు సమావేశ మందిరంలోని కుర్చీలు, బల్లలను విరగొట్టి బీభత్సం సృష్టించారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలపై దాడికి దిగారు. టీడీపీ మహిళా ఎంపీటీసీలు ఎన్నికల అధికారి కాలర్ పట్టుకుని దాడికి దిగారు. రాజమండ్రి ఎంపీ మాగంటి మురళీ మోహన్, స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరావు ఒత్తిడితో ఎన్నికల అధికారి వాయిదా వేసినట్టు ప్రకటించారు. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి ఎంపీపీ పదవి వైఎస్సార్సీపీ వశమవుతుందనే అక్కసుతో టీడీపీ నాయకులు కిడ్నాప్ డ్రామాకు తెరలేపారు. ఆగిరిపల్లి-1 సెగ్మెంట్ నుంచి గెలుపొందిన ముల్లంగి విజితను వైఎస్సార్సీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆగిరిపల్లి సెంటర్లో ధర్నా నిర్వహించారు. దీనికి జిల్లాకు చెందిన మంత్రుల ఒత్తిళ్లు కూడా తోడవడంతో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రిసైడింగ్ అధికారి ఎన్నికను శనివారం నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థులు వస్తున్న వాహనాన్ని అడ్డగించి వారిని ఎత్తుకెళ్ళేందుకు ప్రయత్నించారు. చిలకలూరిపేటలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్పై దౌర్జన్యానికి దిగారు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ళ మండలంలో అభ్యర్థి చేతిలోని ధ్రువీకరణ పత్రాన్ని టీడీపీ ఎంపీటీసీలు చించివేయడాన్ని సాకుగా చూపి అధికారులు ఎన్నికలు వాయిదా వేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ నేతలు శుక్రవారం బరితెగించి పోలీసుల సంరక్షణలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీపీ అభ్యర్థి కాసుల గురవయ్యను నడిరోడ్డుపై కొట్టారు. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై కూడా దాడికి దిగడంతో పోలీసులు లాఠీచార్జి ప్రయోగించారు. ఒంగోలు పట్టణంలో ఓ హోటల్లో భోజనం చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యుల్లో ఒకరిని కిడ్నాప్ చేసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించారు. అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ నేతలపై దాడికి దిగి వారి కారుఅద్దాలను ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలంలో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులను కిడ్నాప్ చేశారు. కాంగ్రెస్కు జీరో రాష్ట్రంలో మొత్తం 653 మండల పరిషత్తుల అధ్యక్ష స్థానాలకు శుక్రవారం ఎన్నిక లు నిర్వహించారు. 624 స్థానాల్లో అధ్యక్ష ఎన్నికలు పూర్తి కాగా 29 చోట్ల వాయిదా పడ్డాయి (ప్రకాశం జిల్లా మార్టూరు అధ్యక్ష స్థానానికి ఎన్నిక ముందే నిలిచిపోగా తాజాగా 28 వాయిదా పడ్డాయి). ఈ ఎన్నికల్లో అధికార తెలుగుదేశంపార్టీ 416 మండల పరిషత్తులను కైవసం చేసుకోగా, 199 మండలాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేకపోయింది. శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్నీ గెల్చుకోలేకపోగా కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ (జేఎస్పీ) ఆయన సొంత జిల్లా చిత్తూరులో రెండు మండలాలను గెల్చుకోగలిగింది. రాయలసీమ పరిరక్షణ సమితి కర్నూలు జిల్లాలో ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్లు ఆరు చోట్ల గెలిచారు. సీపీఐ, సీపీఎం, బీజేపీ, బీఎస్సీ వంటి పార్టీలకు ఎంపీపీల్లో స్థానం లేకుండాపోయింది. నెల్లూరు, కడప జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రె స్ పార్టీకి మెజార్టీ మండలాలు దక్కగా ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో అధికార పార్టీకి దీటుగా స్థానాలను దక్కించుకోగలిగింది. తక్కిన జిల్లాల్లో టీడీపీ మెజారిటీ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోగలిగింది. వైఎస్సార్జిల్లాలో 7, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 4, చిత్తూరు, తూర్పుగోదావరిలలో 3 చొప్పున, నెల్లూరులో 2, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలుజిల్లాల్లో ఒకొక్కటి చొప్పున మండలపరిషత్తుల అధ్యక్ష స్థానాల ఎన్నికలు వాయిదా పడ్డాయి. వీటిలో అత్యధికం టీడీపీ కుట్రలు, కుయుక్తుల కారణంగానే వాయిదాపడ్డాయని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. అనేకచోట్ల తాము గెలవలేమని సభ్యులను హాజరుకాకుండా చేసిన ఆ పార్టీ నేతలు కోరం లేదన్న సాకుతో అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమస్యలపై దృష్టి సారించండి: చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో జరిగిన నగరపాలక, పురపాలక ఎన్నికల్లో మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లుగా గెలుపొందిన టీడీపీ నేతలు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని ఆపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సూచించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పారదర్శక పాలనతో పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు.