breaking news
mahadevpoor
-
మహదేవపూర్ ఆస్పత్రికి జ్వరమొచ్చింది
మూడు మండలాలకు పెద్దదిక్కు వేధిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత సీజనల్వ్యాధులతో ఆసుపత్రి కిటకిట పరికరాలు ఉన్న ఆచరణ శూన్యం పట్టించుకోని జిల్లా అధికారులు కాళేశ్వరం: మహదేవపూర్, కాటారం, మహాముత్తారం మండలాలకు పెద్ద దిక్కైన మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి జ్వరమొచ్చింది. వైద్యులు, సిబ్బంది కొరతతో సుస్తీ చేసింది. వాతావరణంలో వచ్చిన మార్పులతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామానికి పదుల సంఖ్యలో మంచానికే పరిమితమయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రికని వస్తే సరైన వైద్యం అందడంలేదని రోగులు అంటున్నారు. ఆస్పత్రిలో పారిశుధ్యం పడకేసింది. జ్వరాలతో ఆసుపత్రి కిటకిట వాతావరణంలో మార్పులతో మూడు మండలాల్లో ప్రజలు జ్వరం, విరోచనాలు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరుతున్నారు. దీంతో బెడ్లన్నీ నిండిపోయాయి. మహదేవపూర్లోని కుదురుపల్లి, కాళేశ్వరం, బ్రాహ్మణపల్లి, మహదేవపూర్, కుదరుపల్లి, మద్దులపల్లి, బెగులూర్, సూరారం నుంచి వచ్చి ఆస్పత్రిలో చేరుతున్నారు. పెద్దంపేట, లెంకలగడ్డ, సూరారం, అంబట్పల్లి, పలిమెల, పంకెన, సర్వాయిపేట గ్రామాల్లో జ్వరపీడితులు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే బెగులూర్, పంకెన, మద్దులపల్లి, కిష్టరావుపేట, అంబట్పల్లి, సూరారంలో 19మంది విషజ్వరాలతో మత్యువాతపడ్డారు. ప్రసవాలు వస్తే రెఫర్.. ఈ ఆస్పత్రిలో ప్రభుత్వం ఆశించినంత ప్రసవాలు జరగడం లేదు. గర్భిణులు ప్రసవాల కోసం ఇక్కడికి వస్తే వైద్యులు, సిబ్బంది తమతో కాదంటూ వరంగల్, గోదావరిఖనికి రెఫర్ చేస్తున్నారు. గత నెలలో పెద్దంపేటకు చెందిన ఓ గర్భిణి నొప్పులతో ఇబ్బంది పడుతుంటే ఇక్కడి వైద్యులు వరంగల్కు పంపించారు. ఆమె మార్గంమధ్యలోని కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవించింది. దీనిపై జిల్లా అధికారి ఇక్కడి వైద్యసిబ్బందిని మందలించినట్లు తెలిసింది. ఎన్బీసీయూ నిరుపయోగం ఈ ఆస్పత్రిలో నవజాత శిశువు సంరక్షణ యూనిట్(ఎన్బీసీయూ)లో అన్నీ రకాల వసతులు, పరికరాలు అందుబాటులో ఉన్నాయి. గైనకాలజిస్టు, మత్తు డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు కొరతతో అది నిరుపయోగంగా మారింది. ఏసీ గదులు, స్పెషల్వార్డులు, పిల్లలకు వెంటిలేటర్ పరికరాలు కొన్నేళ్లుగా వినియోగంలేవు. డాక్టర్లు లేక బాలింతలు, గర్భిణులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. జనరేటర్ ఉన్నా లేనట్లే..! జనరేటర్ అందుబాటులో ఉండి కూడా లేనట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. మూడు మండలాల నుంచి కుటుంబనియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చి రోజు మొత్తం అవస్థలు పడుతున్నారు. కరెంట్ సరఫరా లేని రోజుల్లో జనరేటర్ లేక అర్ధరాత్రి వరకు ఆపరేషన్లు చేస్తున్నారు. ఆ జనరేటర్పై ఎంతో ఖర్చును ప్రభుత్వానికి చూపిస్తూ వేలాది రూపాయలు స్వాహా చేస్తున్నట్లు సమాచారం. నీటి సమస్య, శానిటేషన్ ఆస్పత్రి ఉన్న ఒక్క మోటర్తో నీరు సరిపోక రోగులు అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రిలో ఎక్కడ చూసినా పారిశుధ్య లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరుగుదొడ్ల వద్ద దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు సంచరిస్తున్నాయి. శానిటేషన్ సిబ్బంది కొరత ఆస్పత్రి శానిటేషన్ సిబ్బంది కొరత ఉంది. కాంట్రాక్టు సిబ్బందితోనే నడిపిస్తున్నారు. ఎంఎన్వో పోస్టులు నాలుగు కాగా.. ఇద్దరు ఉన్నారు. ఎఫ్ఎంవో 1, స్వీపర్ 1, తోటమాలి 1 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి. రెగ్యులర్ ఏఎన్ఎంలు రాత్రిపూట డ్యూటీలో ఉన్న కాంట్రాక్టు ఏఎన్ఎంలకు వచ్చే అలవెన్సులు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గర్భిణులకు రక్త పరీక్ష కిట్లు లేవు గర్భిణులకు రక్త,మూత్ర పరీక్షలు నిర్వహించే కిట్లు అందుబాటులో లేవు. బ్లడ్ పర్సెంటేజీ, హెచ్ఐవీ, హెచ్బీఎస్ఏసీ, టైఫాయిడ్, మలేరియా కిట్లు లేక ఇబ్బందులకు గురువుతున్నారు. దీంతో ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించడంలేదు. ప్లేట్లేట్ మిషన్కు లెక్క లేదు ఆస్పత్రిలో ప్లేట్లేట్ మిషన్కు సంబంధించిన కెమికల్స్ నెలకు 10 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. రూ.4వేలతో కొనుగోలు చేసి రోగుల దగ్గరి నుంచి రూ.30 తీసుకుంటారు. రోగుల కణాల పరీక్షలకు సంబంధించిన రిజిష్టర్ నిర్వహించడంలేదనే ఆరోపణలున్నాయి. ఓపీ నిర్వహణదీ అదే తీరు. కెమికల్ నెలలో రెండు సార్లు ఖాళీ అవుతుండడంతో రోగులు రూ.200 ఖర్చుతో ప్రయివేటుగా పరీక్షలు చేయించుకుంటున్నారు. జిల్లా అధికారులు ఈ మారుమూల ఆస్పత్రిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే తప్ప ఆస్పత్రికి పట్టిన జ్వరం వదిలేలా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. డాక్టర్లు అందుబాటులో ఉన్నారు –వాసుదేవారెడ్డి, ఇన్చార్జి మెడికల్ ఆఫీసర్, మహదేవపూర్ ఇద్దరు డాక్టర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నారు. ప్రసవాలు స్థానికంగా జరుగుతున్నాయి. ప్లేట్లేట్ పరీక్షలకు ఎక్కువ డబ్బులు తీసుకోవడంలేదు. డాక్టర్ల పోస్టులను భర్తీ చేస్తాం. ఎన్బీసీయూలో అన్నీ రకాల పరికరాలు ఉన్నాయి. పిల్లల డాక్టర్ పోస్టు ఖాళీగా ఉంది. -
‘తూర్పు’న జ్వరాల పంజా
మంచంపట్టిన మహదేవపూర్ బెగులూర్ వారంలో ముగ్గురు జ్వరంతో మృతి ఆదివారం పంకెనలో ఇద్దరు నెలరోజుల్లో ఎనిమిది మంది ప్రాణాలు హరి పట్టించుకోని వైద్యాధికారులు కాళేశ్వరం : తూర్పు పల్లెలు విషజ్వరాల కోరల్లో చిక్కాయి. వాతావరణంలో వచ్చిన మార్పులతో ఒక్కసారిగా వ్యాధులు ప్రబలాయి. దీంతో పలు గ్రామాల్లో జ్వరం, విరోచనాలు, రక్తకణాలు తగ్గి ప్రజలు పిట్టల్లా రాలుతున్నారు. టైఫాయిడ్, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు చుట్టుముడుతున్నాయి. కేవలం ఒక మహదేవపూర్ మండలంలో 20 రోజుల్లో ఎనిమిది మంది మృతిచెందారు. అయినా ప్రభుత్వవైద్య సిబ్బంది మొద్దు నిద్ర వీడడం లేదు. 20 రోజుల్లో... ఎనిమిది మంది మృతి –మహదేవపూర్ మండలం అంబట్పల్లిలో ఇద్దరు అయిలి సమ్మయ్య, గుజ్జుల సమ్మయ్య విషజ్వరంతో మృతి చెందారు. – బెగులూర్కు చెందిన కూలీ తుంగ సమ్మయ్య(45) వారంరోజులుగా విషజ్వరం బారిన పడి ప్రాణాలు వదిలాడు. – బెగులూర్ గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తెరుక రేణుక(19)రక్త కణాలు తగ్గి ఆసుపత్రిలో మృతి చెందింది. రేణుక వారం రోజులుగా విషజ్వరంతో బాధపడుతూ వరంగల్ ప్రయివేట్ ఆసుపత్రిలో చేరింది. రక్తకణాలు తగ్గి మృతి చెందింది. – బెగులూర్ గ్రామానికి చెందిన కారు రాజన్న(28) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ రక్తకణాలు తగ్గి వరంగల్కు తరలిస్తుండగా మరణించాడు. –మద్దులపల్లి గ్రామానికి చెందిన సకినారపు నారాయణ(50)వాంతులు, విరోచనాలు, జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాతపడ్డాడు. –సూరారం గ్రామానికి చెందిన పెద్ది స్వామి(35) విషజ్వరంతో మృతి చెందాడు. –పంకెనకు చెందిన పత్రి చందమ్మ(60), టి.సమ్మయ్య(50) వారం రోజులుగా జ్వరాలతో ఆదివారం మరణించారు. విజృంభిస్తున్న విషజ్వరాలు మహదేవపూర్ మండలంలోని బెగులూర్, పంకెన, మద్దులపల్లి తదితర గ్రామాల్లో జ్వరాలతో పదుల సంఖ్యలో గ్రామస్తులు మంచం పట్టారు. ఆయా గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. రోడ్లన్నీ చిన్నపాటి వర్షాలకే చిత్తడిగా మారుతున్నాయి. దీంతో దోమలు, క్రిమికీటకాలు విజృంభిస్తున్నాయి. టైఫాయిడ్, మలేరియా,డయేరియా లాంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. కనీసం పంచాయతీ అధికారులు బ్లీచింగ్ చల్లడం లేదని విమర్శలున్నాయి. ప్రైవేటు వైద్యానికి పరుగులు అంబట్పల్లి పీహెచ్సీలో ఇన్చార్జి వైద్యులు స్థానికంగా ఉండడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి మందులు పంపిణీ చేయడంలేదు. మూడు మండలాలకు పెద్దదిక్కైన మహదేవపూర్ సామాజిక ఆసుపత్రిలో ఇద్దరు వైద్యులు ఉంటే .. వారు షిఫ్టులుగా విడిపోయి వారానికి ఒకరు వస్తున్నారు. దీంతో రోగులు ప్రవేటు ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రభుత్వ వైద్యాధికారులు స్పందించి జ్వరాలతో బాధపడుతున్న గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. బెగులూర్ వైద్యశిబిరం మండలంలో నెల రోజులు వ్యవధిలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. దీంతో బెగులూర్లో ఏకంగా ముగ్గురు మృతి చెందడంతో జిల్లా వైద్యాధికారి రాజేశం గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటుచేశారు. రోగులను పరీక్షించి రక్తనమూనాలు తీసుకుని మందులు పంపిణీ చేశారు.