breaking news
Lucky Grahak
-
రూ.1,590కు కోటి గెల్చుకున్న లక్కీ గాళ్
నాగపూర్:కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజన అవార్డులను ప్రదానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అందించారు. ఏప్రిల్ 14న రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మోదీ నాగపూర్లో ఈ బహుమతులకు విజేతలకు అందజేసారు. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ యోజన్ కింద లాతూర్కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థినిని అదృష్ట లక్ష్మి వరించింది. మొబైల్ ఈఎంఐ పేమెంట్ను ఆన్లైన్లో చెల్లించి కోటి రూపాయలు దక్కించుకుంది. రూపే యాప్ ద్వారా రూ.1,590 డిజిటల్ లావాదేవీలు జరిపినందుకు శ్రద్ధ మోహన్ (20) కోటి రూపాయలను సొంతం చేసుకుంది. రెండవ బహుమతిగా రూ. 50లక్షల నగదు బహుమతి గుజరాత్కు చెందిన హార్దిక్ కుమార్ (29)ని వరించింది. ప్రైమరీ స్కూలు టీచర్ అయిన ఇతను రుపే కార్డు ద్వారా రూ.1110 ఆన్ లైన్ లావాదేవీ నిర్వహించారు. డిజి ధన్ వ్యాపార యోజన కింద మొదటి బహుమతిగా రూ. 50లక్షలను తమిళనాడులోని తాంబరానికి చెందిన జీఆర్టీ జ్యువెల్లరీ వ్యాపారి ఆనంద్ అనంత పద్మనాభన్ గెలుచుకున్నారు. రూ.300 పేమెంట్ను ఆన్లైన్ ద్వారా స్వీకరించారు. ఈ కేటగిరీలో రెండవ బహుమతి రూ. 25లక్షలను మహారాష్ట్రలోని బ్యూటీ పార్లర్ యజమాని రాగిణి రాజేంద్ర ఉత్తేకర్ అందుకున్నారు. తన బ్యూటీ సేవలకు గాను ఈమె రూ.510 స్వీకరించారు. కాగా డిజిటల్ లావాదేవీలను ఊతమిచ్చే దిశగా నీతి ఆయోగ్ గత ఏడాది డిశెంబర్ లో లక్కీ గ్రాహక్ యోజన, డిజిధన్ వ్యాపార యోజన పేరుతో ఈ క్యాష్ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారిక సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా16లక్షలమందికి రూ. 258కోట్ల ప్రైజ్మనీ అందించారు. వీరిలో కస్టమర్లు, వ్యాపారులు ఉన్నారు. -
‘ఆన్లైన్’కి 226 కోట్ల బహుమతులు
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్కీ గ్రాహక్ యోజన, డిజీ ధన్ వ్యాపార్ యోజన పథకాల ద్వారా 14 లక్షల మంది వినియోగదారులకు రూ.226 కోట్ల బహుమతులను అందించినట్లు నీతిఆయోగ్ తెలిపింది. బహుమతులు అందుకున్నవారిలో 70వేల మంది వ్యాపారులున్నారని పేర్కొంది. గతేడాది డిసెంబర్ 25న ప్రారంభమైన ఈ రెండు పథకాలు ఏప్రిల్ 14 వరకూ కొనసాగనున్నాయి. ఆన్ లైన్ నగదు లావాదేవీలు ప్రోత్సహించడానికి నీతి ఆయోగ్ 100 నగరాల్లో వందకుపైగా డీజీధన్ మేళాలు నిర్వహించింది. ప్రతిరోజు 5 వేల మంది వినియోగదారులను లాటరీ ద్వారా ప్రోత్సహకాలకు ఎంపిక చేస్తున్నారు.