breaking news
Lotus flowers
-
11 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసిన తామరపూలు
సదుం: నీటికుంటలో పడి బాలిక మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా సదుం మండలంలో చోటుచేసుకుంది. కేవీపల్లె మండలం గర్నిమిట్టకు చెందిన గంగాదేవి, రెడ్డెప్ప కుమార్తె మల్లీశ్వరి (11) మండలంలో తుమ్మగుంటపల్లెలోని అమ్మమ్మ కృష్ణమ్మ వద్ద ఉంటోంది. శుక్రవారం ఉదయం కట్టెల కోసం స్నేహితులతో కలిసి వెళ్లి ఆ బాలిక గ్రామ సమీపంలోని గునానికుంటలో ఉన్న తామర పూలను చూసి ముచ్చటపడింది. వాటిని కోసేందుకు కుంటలోకి దిగింది. పూలవద్దకు వెళ్తూ కుంట లోతుగా ఉండడంతో మునిగిపోయింది. స్నేహితులు ఇది చూసి గ్రామంలోకి పరుగులు తీసి సమాచారం ఇచ్చారు. గ్రామస్తులు కుంట వద్దకు చేరుకుని గాలించారు. అప్పటి మల్లీశ్వరి మృతి చెందింది. మృతదేహాన్ని వెలికితీశారు. -
Photo Story: కుండపోత వాన, పర్యాటకుల సందడి, ఆరుద్ర ఆగమనం
వర్షాల కోసం భీంసన్ దేవుడికి పూజలు బేల(ఆదిలాబాద్): మండలకేంద్రంలోని ఆదివాసీ పర్దాన్లు వర్షాలు సమృద్ధిగా పడాలని ఆదివారం భీంసన్ దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులతో కలిసి శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక ఇందిరా నగర్కాలనీలో భీంసన్ దేవుడికి ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యం సమర్పించారు. కుండపోత వర్షం వేములవాడ : వేములవాడలో ఆదివారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలుల కారణంగా సెస్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. పలు గ్రామాల్లో పత్తి చెళ్లలో వర్షపు నీరు నిలిచింది. ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు–కందికట్కూర్ గ్రామాల మధ్య ఉన్న సుద్ద ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు నిలిచిపోయాయి. కుంటాల జలపాతం వద్ద పర్యాటకుల సందడి వరుసగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. లాక్డౌన్ కారణంగా పర్యాటకులను అనుమతించకపోవడంతో ఇన్ని రోజులు నిర్మానుష్యంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కరోనా ఆంక్షలు ఎత్తివేయడం, ఆదివారం కలిసి రావడంతో హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు తరలివచ్చారు. జలపాతం వద్ద స్నానాలు చేస్తూ.. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ ఆరుద్ర.. ఆగమనం ఏడాది మొత్తంలో ఆరుద్రకార్తెలో మాత్రమే ఆరుద్ర పురుగులు దర్శనమిస్తాయి. ఆరుద్ర కార్తెకు రైతులకు అవినాభావ సంబంధం ఉంది. ఈ పురుగుల ఆగమనాన్ని అన్నదాతలు శుభసూచకంగా భావిస్తారు. ఆదివారం నెన్నెల శివారులోని చేన్లలో ఆరుద్ర పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడి, పంటలు బాగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. – నెన్నెల విరబూసిన ‘బ్రహ్మ కమలం’ రెబ్బెన(ఆసిఫాబాద్): అత్యంత అరుదుగా కనిపించే బ్రహ్మకమలం రెబ్బెన మండలంలోని గోలేటి టౌన్షిప్లో దర్శనమిచ్చింది. బెల్లంపల్లి ఏరియాలోని ఏరియా వర్క్షాప్ డీజీఎంగా పనిచేస్తున్న శివరామిరెడ్డి నివాసంలో ఈ బహ్మకమలం వికసించింది. కొద్ది గంటలు మాత్రమే పూర్తిగా వికసించే ఈ పుష్పం ఆపై ముడుచుకుంటుంది. శివరామిరెడ్డి సతీమణి సృజన మాట్లాడుతూ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బ్రహ్మకమలం వికసిస్తుందని తెలిపారు. అలాంటి అరుదైన పుష్పం పూయటం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. -
నీలి కలువలనూ సాగు చేయొచ్చు!
- నీలి కలువ గింజలు, దుంపల్లో ఔషధ గుణాలు - మధుమేహం, ఊబకాయం నివారించే గుణాలున్నట్టు ఐఐసీటీ పరిశోధనలో వెల్లడి - నీలి కలువల సాగుపై శ్రీలంక రైతుల దృష్టి అందిపుచ్చుకుంటే మన రైతుకు ఆదాయం చెరువుల్లో కనిపించే కలువ పూలు, రైతుల ఆదాయానికి నెలవులు కానున్నాయి. ఈ పూలను అనాదిగా దేవతార్చనలో వాడుతున్నాం. అక్కడక్కడా కలువ దుంపలను ఆహారంగా వాడే అలవాటు లేకపోలేదు. అయితే, మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులను నివారించే ఔషధ గుణాలు నీలి కలువ (నింఫియా నౌచలి) గింజలు, దుంపల్లో పుష్కలంగా ఉన్నాయని భారతీయ రసాయనిక సాంకేతికతా సంస్థ (ఐఐసీటీ) శాస్త్రవేత్తల పరిశోధనలో ఇటీవల తేలింది. ఇప్పటికే శ్రీలకంలో వరి మాగాణుల్లో వీటిని సాగు చేస్తున్నారట. ఈ నేపథ్యంలో దీని సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలు దృష్టి సారిస్తే మన రైతులకూ మరో ఆదాయ వనరు లభించినట్టే.. మధుమేహం, ఊబకాయం ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన పరిస్థితుల్లో నీలి కలువ ఆహారోత్పత్తులకు భవిష్యత్తులో మంచి గిరాకీ రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. వీటి దుంపలు, విత్తనాలు కరువు కాలంలో ప్రజలు ఆహారంగా వినియోగించే వారట. నీలికలువ పూవులను పూజాదికాలలో వాడుతుంటారు. ఆకులను టిఫిన్ సెంటర్లలో వాడుతున్నారు. అయితే నీలికలువ దుంపలు, విత్తనాలలో ఔషధ గుణాలు ఉన్నాయని తేలడంతో భవిష్యత్తులో వీటికి మంచి గిరాకీ ఉండే అవకాశం ఉంది. ప్రమాదకర జబ్బుల నివారణకు మంచి ఆహారం... తెల్లగా పాలిష్ చేసిన బియ్యం, గోధుమ పిండి, ఒకటికి రెండుసార్లు శుద్ధి చేసిన వంట నూనెల వినియోగం పెరిగింది. దీనివల్ల పోషకాలు, మాంసకృత్తులు కోల్పోతున్నాం. మన ఆహారంలో ఉత్త పిండి పదార్థం మాత్రమే మిగులుతోంది. దీనివల్ల ఆహారం త్వరగా జీర్ణమై వెనువెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయి పెరుగుతోంది. ఫలితంగా మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధులు విజృంభిస్తున్నాయి. అయితే, నీలికలువ పూలు, దుంపల ఉత్పత్తులను ఆహారంగా తీసుకుంటే ఈ సమస్యను సులభంగా అధిగమించవచ్చని ప్రధాన శాస్త్రవేత్త డా. అశోక్ కె. తివారి నేతృత్వంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) శాస్త్రవేత్తల బృందం ఇటీవల కనుగొంది. నీలికలువ మొక్కలను తూ. గో. జిల్లా కాకినాడ సమీపంలోని చేబ్రోలు గ్రామ చెరువు నుంచి సేక రించారు. గ్రామస్తులు ఈ మొక్కలను పశువులకు మేతగా వాడుతున్నారు. నీలి కలువ మొక్కల దుంపలు, విత్తనాలను గతంలో కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆహారంగా తీసుకునేవారని తెలుసుకున్న ఐఐసీటీ శాస్త్రవేత్తలు పరిశోధించగా.. పలు ఔషధగుణాలున్నాయని తేలింది. పిండి పదార్థాలను, కొవ్వులను విడగొట్టే ఎంజైమ్లపై ఇవి ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా వ్యాధికారకాలైన ఫ్రీరాడికల్స్ను శరీరం నుంచి తొలగిస్తున్నట్లు తేలినట్లు డా. అశోక్ కె. తివారీ తెలిపారు. విత్తనాలను పొడిగా చేసి పాలలో కలిపి తీసుకోవచ్చు. లేదా పిండిగా చేసుకొని చపాతీలు, పూరీలు వండుకోవచ్చు. నీలి కలువ దుంపలను బంగాళా దుంపలా కూరలా చేసుకొని తినొచ్చు. తద్వారా రక్తంలోకి గ్లూకోజ్ విడుదల నిదానంగా జరుగుతుంది. దీనివల్ల మధుమేహం, ఊబకాయం, మానసిక ఒత్తిడి, జీర్ణకోశ సంబంధ సమస్యలను సమర్థవంతంగా నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీలి కలువల సాగు ఇలా.. నీలికలువలను చెరువులు, కుంటలు, కందకాలు, ఫామ్ పాండ్లలో, కుండీల్లో సాగు చేయవచ్చు. పూలు పూసేందుకు మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. వీటి సాగులో ఎలాంటి సేంద్రియ రసాయన ఎరువులు వాడనవసరం లేదు. శ్రీలంక వాసులు నీలి కలువ దుంపలను తింటారు. వరి పొలాల్లో సాగు చేసి ఎకరాకు టన్ను దిగుబడి సాధిస్తున్నట్లు సమాచారం. అక్కడి రైతులు అనుసరిస్తున్న సాగు పద్ధతి ఇదీ.. తొలకరిలో వేసవిలో విత్తుకోవచ్చు. ముందుగా విత్తనాలు, లేదా దుంపలను ఎంపిక చేసుకోవాలి. వీటిని నీడన ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. పాదుల మధ్య మూడు అడుగులు ఎడం ఉండేలా దుంపలను లేదా విత్తనాలను పైపైన నాటుకోవాలి. సాళ్ల మధ్య రెండు, మూడు అడుగుల ఎడం ఉండేలా నాటుకోవాలి. మూడు నుంచి నాలుగు వారాలకు మొలక వస్తుంది. లేదా మెత్తగా జల్లించిన బంకమన్నులో విత్తనాలను ఉంచి అంగుళం లోతు నీరు గల పాత్రలో ఉంచాలి. పాత్రను తగినంత ఎండ తగిలే చోట ఉంచాలి. వేరే చోట నాటుకోవటానికి కుండల్లో పెంచే మొక్కలు అనుకూలం. మూడు, నాలుగు ఆకులు వచ్చాక.. ఆ మొక్కలను పొలంలో నాటుకోవచ్చు. నీరు నింపిన పెద్ద పాత్రలోకి లేదా చెరువుల్లోకి మార్చుకోవచ్చు. నాటుకునే దుంపకు కొత్తగా వచ్చిన చిగురు ఒక్కటయినా ఉండేలా చూసి, కత్తిరించి నాటుకోవచ్చు. - సాగుబడి డెస్క్ నీలి కలువ సాగు పద్ధతిపై కృషి జరగాలి నీలి కలువలో పలు రకాల ఔషధ గుణాలున్నట్టు మా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం వంటి వ్యాధుల నివారణకు నీలి కలువ ఆహారోత్పత్తులు బాగా పనిచేస్తాయి. భవిష్యత్తులో వీటికి మార్కెట్లో గిరాకీ వస్తుంది. నీలి కలువ సాగు పద్ధతులపై స్థానికంగా మరింత కృషి జరిగితే రైతులకు మంచి ఆదాయ వనరు లభిస్తుంది. - డాక్టర్ అశోక్ కె. తివారి, ప్రధాన శాస్త్రవేత్త, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ