breaking news
lot
-
ఆ సత్తా భారత్ సొంతం
కేవడియా(గుజరాత్): ప్రపంచ నాలుగో పారిశ్రామిక విప్లవాన్ని భారత్ ముందుండి నడిపించగలదని, ఆ సామర్థ్యం భారత్ సొంతమని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్లోని కేవడియాలో జరుగుతున్న ఇండస్ట్రీ 4.0 అనే సదస్సునుద్దేశిస్తూ ప్రధాని మోదీ వర్చువల్గా ఒక సందేశం పంపారు. అందులోని సారాంశం ఆయన మాటల్లోనే.. ‘ అధునాతన సాంకేతికత ఆలంబనగా నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలవ్వాలి. సృజనాత్మక ఆలోచనలతోనే ఇది సాధ్యం. వేర్వేరు కారణాల వల్ల గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్ భాగస్వామి కాలేకపోయింది. ఇండస్ట్రీ 4.0కు సారథ్యం వహించే సుధృఢ లక్షణాలు దేశానికి ఉన్నాయి. యువజనాభా, డిమాండ్, స్వేచ్ఛాయుత వాణిజ్యానికి బాటలుపరిచే కేంద్ర ప్రభుత్వం సమష్టిగా దీన్ని సుసాధ్యంచేయగలవు. ప్రపంచ వస్తు గొలుసు వ్యవస్థలో భారత్ కీలక భూమిక పోషించేలా చేయగల సమర్థత దేశీయ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలకు ఉంది. ఇందుకోసం సంస్కరణలు తెస్తూ, రాయితీల తోడ్పాటు అందిస్తూ అధునాతన సాంకేతికతను సంతరించుకున్న ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషిచేస్తున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘3డీ ప్రింటింగ్, మెషీన్ లెర్నింగ్, డేటా అనలైటిక్స్, ఎల్ఓటీ వంటి రంగాల్లో పారిశ్రామికాభివృద్ధితో ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ వృద్ధిచెందుతోంది’ అని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే కార్యక్రమంలో అన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుజరాత్ కోసం 75 , కర్ణాటక కోసం 100 ఈవీ బస్సులను ప్రారంభించారు. పుణెలోని ఇండస్ట్రీ 4.0(సీ4ఐ4) ల్యాబ్నూ మొదలుపెట్టారు. స్మార్ట్ మాన్యుఫ్యాక్చరింగ్పై భారీ పరిశ్రమల శాఖ ప్రత్యేక దృష్టిపెట్టింది. పర్యావరణహిత అభివృద్ధిని భారత్ చాటిచెప్పింది పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే ఆర్థికాభివృద్ధిని భారత్ సాధిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అక్టోబర్ రెండో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు భారత్ ‘వైల్డ్లైఫ్ వీక్’ను పాటిస్తోంది. ఈ మేరకు దేశ ప్రజలకు మోదీ హిందీలో గురువారం ఇచ్చిన సందేశాన్ని కేంద్ర పర్యావరణశాఖ శుక్రవారం ట్వీట్ చేసింది. ఆ సందేశంలో మోదీ ఏం చెప్పారంటే.. ‘పరిశ్రమలతోనే ఆర్థికాభివృద్ధి సాధ్యం. అయితే, పరిశ్రమలతో పర్యావరణానికి ముప్పు పొంచి ఉంటుంది. కానీ, పర్యావరణానికి ప్రమాదం వాటిల్లకుండానే ఆర్థికాభివృద్ధి దిశగా పయనించడమెలాగో ప్రపంచానికి భారత్ సాధించి చూపింది. సరైన విధానపర నిర్ణయాలు, అమలుతోనే ఇది సాకారమైంది. తోటి జీవాల పట్ల, జీవావరణం, జీవ వైవిధ్యం మీద మనిషి మరింత దృష్టిసారించాలి. భారత్ గడిచిన ఎనిమిదేళ్లలో కొత్తగా 259 స్థలాలను అభయారణ్యాలుగా గుర్తించి సంరక్షణ బాధ్యతలు తీసుకుంది. పులుల సంఖ్యను రెట్టింపు చేసుకుంటూ లక్ష్యాన్ని నిర్దేశిత సమయంకంటే ముందే చేరుకున్నాం. ఆసియా సింహాలు, గజరాజుల సంఖ్యా పెరుగుతోంది’ అని అన్నారు. -
‘లాట్’ 127వ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్: స్మార్ట్ఫోన్ మొబైల్స్ రిటైల్ విక్రయ సంస్థ లాట్ తన 127వ స్టోర్ను విజయవాడలో ప్రారంభించింది. ఏలూరురోడ్డులోని సూర్యారావుపేటలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ను ప్రముఖ నటి పూజా హెగ్డే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఐదో వార్షికోత్సవం సందర్భంగా మొబైల్స్ కొనుగోళ్లపై కస్టమర్లు రూ.5 కోట్ల విలువైన బహుమతులను లక్కీ డ్రాలో గెలుపొందే అవకాశం ఉందని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, నూతన స్టోర్ ప్రారంభించిన సందర్భంగా ఎంపిక చేసిన మోడల్ మొబైల్స్పై ఉచిత బహుమతులను కూడా అందిస్తున్నట్టు పేర్కొంది. -
గ్రీవెన్స్లో విన్నపాల వెల్లువ
గుంటూరు ఈస్ట్: జిల్లా పోలీసు కార్యాలయంలోని అర్బన్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు.అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి మొత్తం 42 ఫిర్యాదులు స్వీకరించారు. నల్లచెరువు 22 వ లైనుకు చెందిన దాకోజు బాలత్రిపుర సుందరి తన ఫిర్యాదులో జూన్ నెలలో తన కుమార్తె నాగలక్ష్మీ ,ఆమె ఇద్దరు పిల్లలను అల్లుడు పేర్లి రమేష్ దారుణంగా హత్య చేసాడని పేర్కొంది. ఈ కేసులో రమేష్పై మాత్రమే పోలీసులు కేసు పెట్టారని హత్యకు సహకరించిన వారిని వదిలి వేసారని ఆరోపించింది. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన పోలుబోయిన శివమ్మ తన ఫిర్యాదులో ఆస్తి తగాదా నేపథ్యంలో తన బాబాయి ఎడ్ల సాంబయ్య ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 3వ తేదీ తన వదినను బంధించి, తనపై దాడి చేసి నోట్లో పురుగుల మందు పోసారని పేర్కొంది. చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయడం లేదని న్యాయం చేయాలని కోరింది. శ్రీనివాసరావుపేట 5వ లైనుకు చెందిన పోతల కన్యకాపరమేశ్వరి తన ఫిర్యాదులో పార్వతీపురానికి చెందిన పుల్లారావు వద్ద 50 వేలు వడ్డీకి తీసుకుని ప్రామిసరీ నోట్లు ,220 గజాల స్థలాన్ని హమీగా ఇచ్చామని పేర్కొంది. డబ్బులు చెల్లించినప్పుడు బ్యాంకులో ఉన్న కాగితాలు మరుసటి రోజు తెచ్చి ఇస్తానని చెప్పి వెళ్లి ఇప్పుడు ఇవ్వడం లేదని, అడిగితే బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.