the Lok Sabha elections
-
‘బర్ద్వాన్’కు శారదా స్కాం డబ్బు!
-
‘బర్ద్వాన్’కు శారదా స్కాం డబ్బు!
బీజేపీ చీఫ్ అమిత్ షా వ్యాఖ్య స్కాం దోషులను రక్షించేందుకు మమత ప్రయత్నం కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అవినీతి పాలన అంతమయ్యేందుకు సమయం దగ్గర పడిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి టీఎంసీని కూకటివేళ్లతో పెకిలించేందుకే తానిక్కడికి వచ్చానన్నారు. లోక్సభ ఎన్నికల విజయంతో ప్రారంభమైన మోదీ విజయ ప్రస్థానం.. 2016లో జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో ముగుస్తుందన్నారు. ‘టీఎంసీ లేని పశ్చిమబెంగాల్’ మోదీ తాజా నినాదమని తెలిపారు. కోల్కతాలో ఆదివారం ఒక భారీ సభలో ఆయన పాల్గొన్నారు. శారద చిట్ఫండ్ కుంభకోణం డబ్బును బర్ద్వాన్ పేలుడుకు ఉపయోగించారని ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పేలుడుతో సంబంధం ఉన్న టీఎంసీ నేతలను రక్షించేందుకు పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని షా ఆరోపించారు. అందులో భాగంగానే ఆ పేలుడుపై విచారణ జరుపుతున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు మమత అనేక అడ్డంకులు కల్పిస్తున్నారని షా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. తన సభకు హైకోర్టు అనుమతి ఇవ్వడాన్ని ప్రజా విజయంగా అభివర్ణించారు. మమత ఓట్ల కోసం జాతి వ్యతిరేక శక్తులైన బంగ్లాదేశ్ చొరబాటుదారులకు బెంగాల్లో ఆశ్రయం ఇస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. ‘అమిత్ షానా? ఎవరు?’ అంటూ ఇటీవల మమత చేసిన వ్యంగ్య వ్యాఖ్యపై స్పందిస్తూ.. ‘దీదీ.. మీరు వినగలిగితే వినండి.. చూడగలిగితే చూడండి.. నేనే అమిత్ షాను. బీజేపీలో చిన్న కార్యకర్తను. బెంగాల్లో టీఎంసీ అవినీతి పాలనకు ముగింపు పలికేందుకు ఇక్కడికి వచ్చాను’ అని అన్నారు. నమాజ్ పిలుపుతో ప్రసంగానికి విరామం.. సభా స్థలికి దగ్గర్లోని మసీదు నుంచి నమాజ్ పిలుపు(ఆజా) వినిపించడంతో షా తన ప్రసంగాన్ని మధ్యలో కొన్ని నిమిషాలు ఆపేశారు. ప్రసంగాన్ని కొనసాగించి తనను విమర్శించేందుకు మమతకు అవకాశమివ్వదలచుకోలేదని అన్నారు. -
రగులుతున్న అసంతృప్తి జ్వాలలు
‘మండ్య’లో తారస్థాయికి చల్లార్చడంపై కేపీసీసీ దృష్టి ఎస్ఎం, అంబి వర్గాల మధ్య విభేదాలు రమ్యకు సహకరించని ఆత్మానంద ఎస్ఎంతో సిద్ధు, పరమేశ్వర భేటీ ‘కృష్ణ’ రాయబారం చేయాలంటూ ఒత్తిడి సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగియడంతో అసంతృప్తిని చల్లార్చడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మండ్య జిల్లా నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి పార్టీ అభ్యర్థి రమ్య పుట్టి ముంచేట్లు ఉందని గ్రహించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వరలు ముందుగా ఆ స్థానంపై దృష్టి సారించారు. ప్రస్తుతం సింగపూర్లో చికిత్స పొందుతున్న మండ్య జిల్లాకు చెందిన మంత్రి అంబరీశ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఆత్మానంద వర్గాల మధ్య విభేదాలున్నాయి. ప్రచారం సందర్భంగా రమ్యకు ఆత్మానంద వర్గం నుంచి సహకారం అందడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయి. ఆయనకు కేంద్ర మాజీమంత్రి ఎస్ఎం. కృష్ణ అండదండలున్నాయి. ఎన్నికల సమయంలో ఆత్మానందను చూస్తూ ఊరుకుంటే పార్టీలో క్రమశిక్షణ లోపించడంతో ఎన్నికల్లో నష్టం వాటిల్లడం ఖాయమనే అభిప్రాయం అంబరీశ్ తదితరుల్లో వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. దీనిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఆత్మానందను పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు. దీనికి ఎస్ఎం. కృష్ణ ఆమోద ముద్ర కోసం సీఎంతో పాటు పరమేశ్వర గురువారం ఇక్కడి సదాశివనగరలోని ఆయన నివాసానికి వెళ్లారు. మండ్య విషయమై చర్చించారు. అయితే ఆత్మానందను తొలగించడానికి ఆయన సమ్మతించ లేదని తెలిసింది. నచ్చజెప్పి పార్టీకి పని చేసే విధంగా చూడాలే తప్ప, తొలగిస్తే పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని హెచ్చరించినట్లు తెలిసింది. ‘ఆ బాధ్యతేదో మీరే చేపట్టండి’ అని చెప్పి వారిద్దరూ వెళ్లిపోయినట్లు సమాచారం. ఇదే సందర్భంలో ఒక్కలిగ సామాజిక వర్గం ప్రాబల్యం కలిగిన నియోజక వర్గాల్లో ప్రచారం చేయాలని కూడా కృష్ణను కోరినట్లు తెలిసింది. మండ్య ఉప ఎన్నికలో అందరూ కలసి కట్టుగా పని చేసినందునే కాంగ్రెస్ మంచి మెజారిటీతో గెలవగలిగిందని, ఇప్పుడు కూడా ఆ ఐక్యతను తీసుకు రావాలని వారు ఆయనకు విజ్ఞప్తి చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
కాంగ్రెస్ టికెట్టా.. మాకొద్దు బాబోయ్
15 నియోజకవర్గాల్లో ముందుకు రాని అభ్యర్థులు అధిష్టానం ఆదేశిస్తే ఏం చేయాలంటూ ఆందోళన ‘శివమొగ్గ’పై ప్రత్యేక దృష్టి.. యడ్డిని ఓడించేలా వ్యూహాలు సమర్థ అభ్యర్థి కోసం అన్వేషణ పోటీ చేయబోనని తేల్చిచెప్పిన కాగోడు తిమ్మప్ప కృష్ణ బైరేగౌడను బరిలో దింపే యోచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు :లోక్సభ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్కు ఘోర పరాజయం తప్పదని సర్వేలు ఘోషిస్తుండడంతో.. రాష్ర్టంలోని దాదాపు 15 నియోజక వర్గాల్లో ఆ పార్టీ టికెట్లను తీసుకోడానికి ఎవరూ సాహసించడం లేదు. మొత్తం 28 నియోజక వర్గాలకు గాను ఇప్పటికే 13 నియోజక వర్గాలకు అభ్య ర్థుల ఎంపిక దాదాపుగా పూర్తయింది. మిగిలిన అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. కొన్ని నియోజక వర్గాల్లో మంత్రులను పోటీకి దింపాలని అనుకుంటున్నా.. వారి నుంచి సానుకూల స్పందన కనిపించడం లేదు. కాంగ్రెస్కు ఘోర పరాజయం అయితే ఆమాత్య పదవులు వదులుకుని, ఢిల్లీలో అనామకుల్లా ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోవాలని పలువురు మంత్రులు భావిస్తున్నట్లు తెలిసింది. అయితే అధిష్టానం కరాఖండిగా ఆదేశిస్తే, ఏంచేయాలనే గుబులు కూడా వారిని వెంటాడుతోంది. తమను పోటీకి దింపాలనుకుంటున్న నియోజక వర్గాల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసినా, గెలుపు పూచీ తమదేనంటూ కొత్త పల్లవిని అందుకోవడం ద్వారా మంత్రులు ‘గండం’ నుంచి బయట పడడానికి ప్రయత్నిస్తున్నారు. యడ్డికి సమ ఉజ్జీ ఎవరు? పాలక కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న శివమొగ్గ నియోజక వర్గంలో అభ్యర్థిగా ఎవరిని నిలపాలనే విషయమై తర్జన భర్జన పడుతోంది. బీజేపీ అభ్యర్థిగా యడ్యూరప్ప అక్కడి నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయం. ఆయనను దీటుగా ఎదుర్కొనే అభ్యర్థి కోసం కాంగ్రెస్ అన్వేషణలో పడింది. శాసన సభ స్పీకర్ కాగోడు తిమ్మప్పను బరిలోకి దింపాలనుకుంటున్నా, ఆయన ససేమిరా అంటున్నారు. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన 82 ఏళ్ల కాగోడు తిమ్మప్ప తొలుత స్పీకర్ పదవే వద్దన్నారు. ఈ వయసులో తాను ఆ బాధ్యతలను చేపట్టలేనని, మంత్రి వర్గంలో స్థానం కల్పిస్తే చాలని అప్పటో మొత్తుకున్నప్పటికీ, ముఖ్యమంత్రి ఆయనను అనునయించి స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఇప్పుడు మళ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరినప్పుడు, తన వల్ల కాదని ఆయన తేల్చి చెప్పడంతో పార్టీ ఇబ్బందుల్లో పడింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప తనయుడు కుమార బంగారప్ప సహా ముగ్గురు ఆ స్థానం అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నప్పటికీ, యడ్యూరప్పకు వారెవరూ సరితూగలేరనేది అధిష్టానం అంచనా. వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడను బెంగళూరు (ఉత్తర) నియోజక వర్గం నుంచి బరిలోకి దింపాలని పార్టీ యోచిస్తోంది. ఆయన విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆయన పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడు. పోటీ చేయాల్సిందేనని ఆయన ఆదేశిస్తే ఏం చేయాలని గౌడ ఆలోచనలో పడ్డారు. చిత్రదుర్గలో కూడా మరో మంత్రి హెచ్. ఆంజనేయను పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన కూడా పోటీకి సిద్ధంగా లేరు. -
అభ్యర్థుల ఎంపికపై.. కసరత్తు
సిద్దు, పరమేశ్వర్ నేడు ఢిల్లీకి పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ‘ఎంపిక’పై చర్చ సిట్టింగ్లకు టికెట్ ఖాయం 19 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై పాట్లు ఒక్కో స్థానంలో ముగ్గురు, నలుగురు ఆశావహులు మేడమ్ ఆమోద ముద్రే ఫైనల్ అసమ్మతి చెలరేగే ప్రమాదం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఢిల్లీలో గురువారం పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. ఇందులో పాల్గొనడానికి కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్తో పాటు సీనియర్ నాయకులు మధుసూదన్ మిస్త్రీ, వయలార్ రవిలు మొత్తం 28 నియోజక వర్గాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై విస్తృతంగా చర్చించనున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు స్థానాలను గెలుచుకుంది. కేంద్ర మంత్రులు మల్లిఖార్జున ఖర్గే (గుల్బర్గ), వీరప్ప మొయిలీ (చిక్కబళ్లాపురం), కేహెచ్. మునియప్ప (కోలారు)లతో పాటు చామరాజ నగర ఎంపీ ధ్రువ నారాయణ్, మైసూరు ఎంపీ విశ్వనాథ్, బీదర్ ఎంపీ ధరం సింగ్లు తిరిగి పోటీ చేయడం ఖాయమనిపిస్తోంది. వీరికి తోడు సదానంద గౌడ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడంతో జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందిన ఉడిపి-చిక్కమగళూరు ఎంపీ జయప్రకాశ్ హెగ్డే, ఇటీవల ఉప ఎన్నికల్లో విజయం సాధించిన డీకే. సురేశ్ (బెంగళూరు గ్రామీణ), నటి రమ్య (మండ్య)లకు తిరిగి పార్టీ అభ్యర్థిత్వాలు దక్కనున్నాయి. మిగిలిన 19 నియోజక వర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ ప్రతి నియోజక వర్గానికి ముగ్గురు, నలుగురు అభ్యర్థులను సూచిస్తూ జాబితాను సిద్ధం చేసింది, దీనిపై విస్తృతంగా చర్చించడం ద్వారా తుది జాబితాను సిద్ధం చేయనున్నారు. దానిపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోద ముద్ర పడాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా గడవక పోవడం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల వల్ల గెలుపుపై చాలా మందికి భరోసా ఉండడంతో టికెట్ల కోసం పోటీ ఎక్కువైంది. వీరప్ప మొయిలీతో పాటు రాజస్తాన్ గవర్నర్ మార్గరెట్ ఆళ్వా తమ తనయులకు టికెట్ల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. పరాజయాల పరంపరను మూటగట్టుకుంటూ వచ్చిన కేంద్ర మాజీ మంత్రి జనార్దన పూజారి ఈసారి ఎలాగైనా మంగళూరు టికెట్ను దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉండగా, మొయిలీ ఆయనకు మోకాలొడ్డుతున్నారు.