breaking news
Lashkar-e Taiba terrorists
-
షాకింగ్ : లష్కరే లిస్ట్లో కోహ్లి, మోదీ, కోవింద్..
సాక్షి, న్యూఢిల్లీ : పాకిస్తాన్కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తోయిబా హిట్లిస్ట్లో భారత క్రికెట్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా పలు దిగ్గజ నేతలున్నారు. ఆల్ ఇండియా లష్కరే తోయిబాగా పేరుమార్చుకున్న ఉగ్రసంస్థ లష్కరే తోయిబా తమ టార్గెట్ జాబితాలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను చేర్చినట్టు సమాచారం. జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం భారత్కు ప్రత్యేకంగా ఈ ఉగ్రసంస్థను నెలకొల్పిన లష్కరే ప్రముఖలను టార్గెట్ చేయడం ద్వారా ఉగ్రవాదులను సైన్యం హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నట్టు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు భారత్లోబంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పర్యటిస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇరు జట్లు నవంబర్ 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీ20 మ్యాచ్లో తలపడనున్నాయి. ఉగ్రవాదుల హిట్లిస్ట్తో కూడిన లేఖను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అందుకుంది. ఈ లేఖను ఆల్ ఇండియా లష్కరే తోయిబా హైపవర్కమిటీ, కోజికోడ్ నుంచి పంపినట్టు వెల్లడైంది. లష్కరే పంపిన హిట్లిస్ట్లో బీజేపీ దిగ్గజ నేత ఎల్కే అద్వానీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, గోవా గవర్నర్ సత్య పాల్ మాలిక్ పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఎన్ఐఏ వర్గాలు ఈ లేఖను బీసీసీఐకి పంపడంతో ఢిల్లీ పోలీసులు టీం ఇండియా సభ్యులకు భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా బెదిరింపు లేఖ నకిలీదని ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నా పాక్ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న క్రమంలో రిస్క్కు తావివ్వకుండా భద్రతను ముమ్మరం చేయాలని అధికారులు భావిస్తున్నారు. 2008 ముంబై దాడులు సహా పలు ఉగ్రదాడులకు లష్కరే తోయిబా పాల్పడిన విషయం తెలిసిందే. -
అమర్నాథ్ దాడి: ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్
శ్రీనగర్: గత నెలలో జమ్ముకాశ్మీర్లో అమర్నాథ్ యాత్రికులపై దాడులకు తెగబడ్డ ఉగ్రవాదులకు సాయం చేసిన ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులు ఆదివారం వెల్లడించారు. తమ విచారణలో ముగ్గురు నిందితులు పూర్తిగా సహకరిస్తున్నారని, త్వరలోనే కాల్పులకు పాల్పడ్డ లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. బిలాల్ అహ్మద్ రేషి, ఐజాజ్ వాగే, జహూర్ అహ్మద్ అనే ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులు లష్కర్ గ్రూపునకు చెందిన నలుగురు టెర్రిరిస్టులకు ఖుద్వానీ, శ్రీగుఫ్ఫారాలో ఆశ్రయం కల్పించారు. వీరి వద్ద ఆశ్రయం పొందిన ఆ ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్ర ముగించుకుని వెళ్తున్న యాత్రికుల బస్సుపై అనంతనాగ్ జిల్లాలో జూలై 10న విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. అదే రోజు ఆరుగురు భక్తులు మృతిచెందగా, చికిత్స పొందతూ మరో ఇద్దరు యాత్రికులు చనిపోయారు. ఈ దాడి కేసులో ఇప్పటికే ఇద్దరు లష్కర్ ఉగ్రవాదులను గతవారం పోలీసులు మట్టుపెట్టారు. హతమైన ఇద్దరిలో టాప్ కమాండర్ అబు దుజానా ఉన్నాడు. నేడు పోలీసులు అరెస్ట్ చేసిన బిలాల్ అహ్మద్ అన్న అదిల్ లష్కర్ ఉగ్రవాది కాగా, ఈ ఏడాది భద్రతా సిబ్బంది కాల్పుల్లో హతమయ్యాడు.