breaking news
Krishna delta modernization
-
అభివృద్ధి ఫలాలు అందకూడదని టీడీపీ కుట్రలు: పార్థసారథి
సాక్షి, కృష్ణా: ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకోవడమే టీడీపీ లక్ష్యమని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందకూడదని టీడీపీ కుట్రలు చేస్తోందని దుయ్యబట్టారు. కృష్ణా డెల్టాలో కెనాల్ ఆధునీకరణ పనులపై టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. యనమలకుదురు-కంకిపాడు కెనాల్ ద్వారా 2 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. కెనాల్ అభివృద్ధి పనులపై టీడీపీ నేత బోడె ప్రసాద్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో ఒక్క గంపెడు మట్టి కూడా తీయలేదని,టీడీపీ నేతలు కాలువ పనులపై దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నీరు, చెట్టు పేరుతో కాంట్రాక్టులు పిలిచి అవినీతికి ఆస్కారం ఉన్న పనులే చేశారని మండిపడ్డారు. నీరు, చెట్టు కింద కాలువ పనులు చేయలేకపోయారని, సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మే నెలలోనే రాష్ట్రంలో ఆపరేషన్ మెయింటెనెన్స్ చేయాల్సిన ప్రాంతాలను గుర్తించి కమిటీ వేశారని గుర్తుచేశారు. జూన్లో వర్షాలు ప్రారంభమవడం వల్ల అప్పుడు పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. తర్వాత నుండి చిన్న కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదని, అందుకే ఎక్కువ మిషనరీ ఉన్న ఒకే కాంట్రాక్టర్కు పనులు అప్పగించామని పేర్కొన్నారు. కాంట్రాక్టర్ శ్రీనివాస్ నా బినామీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిడ్డారు. ఇదే కాంట్రాక్టర్ గతంలో దేవినేని ఉమా మంత్రిగా ఉన్నప్పుడు పనులు చేశారని అన్నారు. -
డెల్టా ఆధునీకరణపై నిపుణుల కమిటీ!
* 14న గుంటూరులో ఉన్నతస్థాయి సమీక్ష * 37 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు రాక * రద్దుకానున్న పనులు.. మరికొన్నింటికి టెండర్లు సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణాడెల్టా ఆధునీకరణ పనులపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించే యోచనలో ఉంది. ఆరేళ్ల నుంచి పనులు ఆలస్యంగా జరగడానికి గల కారణాలను తెలుసుకుని ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ చేపట్టిన జలయజ్ఞంపై చర్యలు తీసుకుంటే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో డెల్టాల వారీగా సమీక్షలకు కొత్త ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా, ఈనెల 14న గుంటూరులోని జిల్లాపరిషత్ సమావేశ హాలులో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. భారీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరగే ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు హాజరుకానున్నారు. ఆరేళ్ల కిందట నిర్మాణ సంస్థలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం పనులు జరిగి ఉంటే 20 టీఎంసీల నీరు మిగులు ఉండేది. కొన్ని పనులు ఆలస్యం కావడానికి ప్రభుత్వం, మరికొన్నింటికి నిర్మాణ సంస్థలు కారణంగా తెలుస్తోంది. ఇంజనీర్లు సక్రమంగా అంచనాలు వేయకపోవడంతో పేరు ప్రఖ్యాతులు, సమర్థత కలిగిన నిర్మాణ సంస్థలు కూడా కొన్ని పనులను ప్రారంభించలేదు. ఏడాది పొడవునా నీరు ప్రవహించే కాలువలకు మరమ్మతులు చేయాలని, నల్లరేగడి కలిగిన కాలువలకు సిమెంట్ లైనింగ్ చేయాలని కొందరు ఇంజనీర్లు హడావుడిగా అంచనాలు తయారు చేశారు. ఈ కాలువలకు సిమెంట్ లైనింగ్ చేస్తే బీటలు వారే అవకాశాలు ఎక్కువ. ఈ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు అనుగుణంగా అంచనాలు తయారుచేయాలి. అప్పట్లో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో కొందరు ఇంజనీర్లు సక్రమంగా అంచనాలు తయారు చేయలేకపోయారు. దీంతో నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించలేదు. భూసేకరణ, డిజైన్ల అనుమతిలో జాప్యం వల్ల కూడా నిర్మాణ సంస్థలు పనులు చేయలేకపోయాయి. దీనికి తాము బాధ్యులం కాబోమని ఆ సంస్థలు చెబుతున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని పనులు ప్రారంభించలేదు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నా ఆ సంస్థల అధిపతులు ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందినవారు కావడంతో అధికారులు మిన్నకుండి పోయారు. ఈ కారణాలతో కృష్ణాడెల్టాలోని 13.35 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రభుత్వం రూ. 4,573 కోట్లను ఆధునీకరణ పనులకు కేటాయిస్తే రూ. 1,178 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికే నిర్మాణ సంస్థల పనితీరు, పనులు జరగకపోవడానికి గల కారణాలపై ఒక అవగాహన వచ్చిన ఇరిగేషన్ ఇంజనీర్లు కొన్నింటిని రద్దు చేసేందుకు నివేదికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేకంటే పనుల పరిశీలన, నివేదిక ఇవ్వడానికి ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పదవీ విరమణ చేసిన చీఫ్ ఇంజనీర్లు, కృష్ణాడెల్టా చీఫ్ ఇంజనీర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు ప్రభుత్వానికి ఇచ్చే నివేదికను ఆధారంగా చేసుకుని అవసరంలేని పనులను రద్దు చేసే అవకాశం ఉంది. పనులు చేయని నిర్మాణ సంస్థల ఒప్పందాన్ని రద్దు చేసి, చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రద్దు కానున్న పనుల్లో రైతులకు అవసరమైనవి ఉంటే వాటికి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.