breaking news
k.kesavarao
-
కేసీఆర్ దేవదూత: కేకే
న్యూఢిల్లీ: ప్రత్యేక రాష్ట్రం సాధించిన కేసీఆర్ను తాను దేవదూతగా భావిస్తానని టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు అన్నారు. ఆనాడు దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ ఏవిధంగా అయితే సత్యాగ్రహం చేశారో అదే విధంగా తెలంగాణ కోసం కేసీఆర్ కూడా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన దీక్షా దివస్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన కృషిని కొనియాడారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు డి.శ్రీనివాస్, కవిత, జితేందర్రెడ్డి, బూర నర్సయ్య, కెప్టెన్ లక్ష్మీకాంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. -
వనరులు గుర్తించండి..
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వనరులను గుర్తించాలని టీఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. గురువారం ఆదిలాబాద్కు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ విశ్రాంతి భవనంలో మంత్రి జోగు రామన్న, కలెక్టర్ జగన్మోహన్తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న వనరులను గుర్తించి పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల నిరుద్యోగ సమస్య తీరుతుందని అన్నారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడడానికి గల కారణాలపై అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఎయిర్పోర్టుకు సంబంధించిన వివరాలు కలెక్టర్ ద్వారా తెలుసుకున్నారు. నేరడిగొండ మండలం కుంటాల జలపాతంపై విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే జిల్లాకు సరిపోయే విద్యుత్తోపాటు ఇతర జిల్లాలకు కూడా సరఫరా చేయవచ్చని అన్నారు. హైడల్ పవర్ ప్రాజెక్టు వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదని తెలిపారు. ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ సబంధించి కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారని, అర్హులైన వారికి న్యాయం చేయాలని అన్నారు. యాపల్గూడలో ఏర్పాటు చేయనున్న సిమెంట్ ఫ్యాక్టరీ వివరాలను మంత్రి రామన్న వివరించారు. అంతకుముందు కలెక్టర్ జగన్మోహన్, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి స్వాగతం పలికారు. -
సీమాంధ్రకు కేకే,తెలంగాణకు కేవీపీ
రాజ్యసభ సభ్యుల లాటరీలో విడ్డూరం సాక్షి, న్యూఢిల్లీ: లాటరీ ద్వారా రాజ్యసభ సభ్యులను శుక్రవారం ఇరురాష్ట్రాలకు కేటాయించారు. ఇక్కడే విచిత్రం జరిగింది. సీమాంధ్రకు చెందిన సభ్యులు కేవీపీ రామచంద్రరావు, సి.ఎం.రమేశ్లు తెలంగాణకు వెళ్లారు. తెలంగాణకు చెందిన కె.కేశవరావు(కేకే), ఎం.ఎ.ఖాన్, దేవేందర్గౌడ్, రేణుకాచౌదరి సీమాంధ్ర ఖాతాలోకి వచ్చారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి 18మంది రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన ప్రకారం ఈ సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 7ః11 నిష్పత్తిలో కేటాయించాలి. ఈ చట్టం మొదటి షెడ్యూల్లోని 13వ సెక్షన్ ప్రకారం సభ్యుల ను పదవీకాలం ముగిసే సమయం ప్రాతిపదికన మూడుగా విభజించి, ఆయా బృందాల్లోని సభ్యులను ఇరు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో లాటరీ ద్వారా సభ్యులను కేటాయించారు. 2016లో పదవీవిరమణ పొందే వారిలో.. ముందుగా 2016 జూన్ 21న పదవీ కాలం ముగిసే ఆరుగురు సభ్యుల్లో ఇద్దరిని తెలంగాణకు కేటాయిం చాల్సి ఉంది. డ్రా ద్వారా గుండు సుధారాణి, వి.హనుమంతరావును తెలంగాణకు కేటాయించారు. జేడీ శీలం, జైరాం రమేశ్, వై.ఎస్.చౌదరి ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిథ్యం వహిస్తారు. వీరితో పాటు ఎన్.జనార్దన్రెడ్డి (ఈయన మరణించడంతో ప్రస్తుతం సీటు ఖాళీగా ఉంది) ప్రాతినిథ్యం వహించిన సీటు ఆంధ్రప్రదేశ్కే ఉంటుంది. ఈ సీటుకు త్వరలో ఎన్నిక జరగనుంది. 2018లో పదవీ కాలం ముగిసే సభ్యులు.. 2018 ఏప్రిల్ 2న పదవీ కాలం ముగిసే సభ్యుల్లో ముగ్గురిని తెలంగాణ కేటాయించాల్సి ఉంది. వీరిలో లాటరీ ద్వారా రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్దన్రెడ్డి, సి.ఎం. రమేశ్లను తెలంగాణకు కేటాయించారు. మిగిలిన వారిలో చిరంజీవి, రేణుకాచౌదరి, దేవేందర్గౌడ్లను సీమాంధ్రకు కేటాయించినట్టుగా పరిగణించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణకు చెందిన దేవేందర్గౌడ్, రేణుకాచౌదరి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సి ఉంటుంది. సీమాంధ్రకు చెందిన సి.ఎం.రమేశ్ తెలంగాణకు వచ్చారు. ఈ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించనున్న దేవేందర్గౌడ్, రేణుకాచౌదరిల పదవీకాలం ముగిశాక.. వారి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్న సి.ఎం.రమేశ్ పదవీకాలం ముగి శాక తెలంగాణ వారిని సభ్యుడిగా ఎన్నుకొంటారు. 2020లో..:2020 ఏప్రిల్ 2న పదవీకాలం ముగిసే సభ్యుల నుంచి ఇద్దరిని తెలంగాణకు కేటాయించాల్సి ఉంది. ఇందులో లాటరీ ద్వారా కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్రావులను తెలంగాణకు కేటాయిం చారు. మిగిలిన సభ్యులైన టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ. ఖాన్, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిలను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినట్టుగా పరిగణించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు చెందిన కేవీపీ తెలంగాణకు రాగా, తెలంగాణకు చెందిన కె.కేశవరావు, ఎం.ఎ.ఖాన్ ఆంధ్రప్రదేశ్కు ప్రాతినిథ్యం వహించాల్సి వస్తోంది. ఇక్కడ కూడా సభ్యుల పదవీ కాలం ముగిశాక సొంత రాష్ట్రాల నుంచి సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కేంద్రం పరిష్కారం! సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుల లాటరీ చిక్కులకు పరిష్కారం లభించేలా ఉంది! సభ్యుల పరస్పర అంగీకారంతో ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులను ఖర్చు చేసుకునే వెసులుబాటును కల్పించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీనికితోడు ఎంపీగా వారికి సంక్రమించే అన్ని అధికారాలు, ప్రోటోకాల్ను కూడా సొంత రాష్ట్రానికి వినియోగించుకునే విషయంలో సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రం త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించింది. అయితే లాటరీ ద్వారా తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలను ఆంధ్రప్రదేశ్కు కేటాయించగా, సీమాంధ్రకు చెందిన ఇద్దరు ఎంపీలను మాత్రమే తెలంగాణకు కేటాయించడంతో పరస్పర అంగీకారం ఎలా సాధ్యమనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ నలుగురి మధ్య అంగీకారం కుది రినా మరో ఇద్దరు తెలంగాణ ఎంపీల పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. సాంకేతికంగా పొరుగు రాష్ట్రానికి కేటాయించినప్పటికీ ఎంపీ లాడ్స్ నిధులను తెలంగాణలోనే ఖర్చు చేసుకునేందుకు, ఇతరత్రా అధికారాలను వినియోగించుకునేందుకు అనుమతినిస్తూ కేంద్రం అంగీకరించినట్లు సమాచారం. -
'తెలంగాణ రాష్ట్రాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ఆపేశక్తి ఎవరికీ లేదని టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె.కేశవరావు మండిపడ్డారు. సీమాంధ్రులు రెచ్చగొట్టినా..తెలంగాణ వాదులు శాంతియుతంగానే నిరసన తెలపాలన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రతరమైన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖరారైందని, ఇక ప్రత్యేక రాష్ట్రాన్ని ఆపేశక్తి ఎవరికీ లేదని ఆయన తెలిపారు. కాగా, సీమాంధ్రలో పరిస్థితులు అంతకంతకూ చేయి దాట పోతుండటంతో యూపీఏ సర్కారు గందరగోళ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న పక్షంలో సీమాంధ్రలో ఉద్యమం కాంగ్రెస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఏపీ ఎన్జీవోలు, ఓయూ జేఏసీ నేతలు పోటాపోటీ నిరసనలకు సిద్ధమవుతువుతుండటంతో కాంగ్రెస్ పెద్దలు అయోమయ స్థితిలో ఉన్నారు. సెప్టెంబర్ ఏడో తేదీన ఎల్బీ స్టేడియంలో భారీగా సమైక్యాంధ్ర సభ నిర్వహించాలని ఏపీ ఎన్జీవోల సంఘం నాయకులు నిర్ణయించారు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. అయితే.. అదే రోజున అదే ఎల్బీ స్టేడియం వేదిగా మరో భారీ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి జేఏసీ సిద్ధమవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యమని పెద్దలు చెబుతున్నా ఉద్యమ సెగ మాత్రం వారికి నిద్ర లేకుండా చేస్తుంది.