breaking news
Ketan Kumar
-
షాక్కు గురయ్యాం
అచ్యుత్కుమార్ తల్లిదండ్రులు తల్లాడ శ్రీనివాస్-శ్రీదేవి భానుపురి : విద్యార్థులు నదిలో కొట్టుకుపోయిన వార్త వినగానే ఒక్కసారిగా షాక్కు గురయ్యామని బియాస్నది ప్రమాదంనుంచి బయటపడిన సూర్యాపేటకు చెందిన అచ్యుత్కుమార్ తల్లిదండ్రులు తల్లాడ శ్రీనివాస్-శ్రీదేవిలు తెలిపారు. ‘సాక్షి’తో వెల్లడించిన విషయాలు వారి మాటల్లోనే.. వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ మూడో సంవత్సరం చదువుతున్న మా కుమారుడు అచ్యుత్కుమార్ విహారయాత్రకు వెళ్తాననగానే పంపించాం. ఆదివారం రాత్రి 7గంటల సమయంలో అచ్యుత్కుమార్ ఫోన్ చేసి కులుమనాలి వద్ద నదిలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వరద పెరిగిందని.. దానిలో తనతో పాటు విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులు కొంతమంది కొట్టుకుపోయారని తెలిపారు. నదిలో స్నానం చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగిందని, దానిని గమనించి మా కుమారుడు నీటిలో నుండి ఒడ్డుకు వెళ్లాడని తెలిపారు. ఆ సమయంలో తన స్నేహితులను నది నుండి బయటకు రావాలని కోరగా నీవు వెళ్లు మేం వస్తాం అని మిగతా వారన్నారని.. అంతలోనే నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో నీటిలో ఉన్న వారంతా కొట్టుకుపోయినట్లు తెలిపారు. వారిని రక్షించేందుకు కొంతమంది ఒడ్డున వారు ప్రయత్నించగా వారుకూడా నదిలో కొట్టుకుపోయారని తెలిపారు. స్నేహితులు కళ్ల ముందు నీటిలో కొట్టుకుపోతున్న సంఘటనను చూసిన మా కుమారుడు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడని చెప్పారు. అదే సమయంలో తన సెల్ఫోన్లో చార్జింగ్ తక్కువగా ఉందని అంతా చీకటిగా ఉందని తనకు భయమేస్తుందని కుమారుడు తెలపడంతో మాకు వణుకు పుట్టిందని తెలిపారు. మరుసటి రోజు కొంతదూరం వెళ్లి సెల్ఫోన్ చార్జింగ్ పెట్టిన అనంతరం తిరిగి తమకు ఫోన్ చేశాడని అప్పటి వరకు భయాందోళన మధ్య రాత్రి మొత్తం నిద్రలేకుండా గడిపామని చెప్పారు. -
ఆ రెండు నిమిషాలు..
ఆలస్యంగా వెళ్లాం.. ప్రాణాలతో బయటపడ్డాం : కేతన్కుమార్ నకి రేకల్ : ‘బియాస్ నది వద్దకు మేం రెండు బస్సుల్లో బయలుదేరాం. మాకంటే ముందు ఒక బస్సు వెళ్లింది. వారికంటే రెండు నిమిషాలు ఆలస్యంగా మా బస్సు వెళ్లింది. దీంతో మేం ప్రాణాలతో బయటపడ్డాం. మాకంటే ముందు బస్సు దిగి నదిలో ఫొటోలు దిగుతున్న మా స్నేహితులు వరద తాకిడికి కళ్లముందే ఆర్తనాదాలు చేస్తూ కొట్టుకుపోయారు. మా బస్సు ఆలస్యంగా వెళ్లకుంటే మేం కూడా వారితో పాటే నదిలో దిగేవాళ్లం. కళ్లముందే స్నేహితులు కొట్టుకుపోయిన ఘటన నన్ను ఎంతో కలిచి వేసింది. తెల్లవార్లూ కన్నీటితోనే ఉన్నాను. రాత్రి 7.30 గంటల తర్వాత నా తలిదండ్రులకు ఫోన్ద్వారా సమాచారం అందించా. ఆగ్రా, ఢిల్లీ, సిమ్లా ప్రాంతాలను చూశాం. ఇంకా కులూ మనాలి చూడాల్సి ఉంది. ఈ నెల 3న వెళ్లిన మేము 14వ తేదీన తిరిగి హైదరాబాద్కు చేరుకోవాల్సి ఉంది. కులు మనాలి దారిలోనే నదిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన రాత్రి ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 9.45గంటల ప్రాంతంలో పోలీసులు చేరుకున్నారు. చీకటిగా ఉన్నందున వారుకూడా ఏమీ చేయలేక తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టారు’. మా కుమారుడు ప్రాణాలతో బయటపడడం అదృష్టం హిమాచల్ప్రదేశ్లోని బియాస్నది ప్రమాదం నుంచి తమ కుమారుడు కేతన్కుమార్ ప్రాణాలతో బయటపడడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని అతని తల్లిదండ్రులు గజ్జల అశోక్కుమార్, అనితలు తెలిపారు. మాకు ఇద్దరుకుమారులు, పెద్ద కుమారుడు కేతన్కుమార్ హైద్రాబాద్లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. పరీక్షలు ముగించుకున్న కేతన్కుమార్ స్నేహితులతో విహారయాత్రకు వెళ్లాడు. తమ కుమారుడు రాత్రి ఫోన్చేసి నా స్నేహితులంతా నదిలో కొట్టుకుపోయారని ఏడ్చుకుంటూ తెలపడంతో తాము ఒక్కసారిగా భయానికి గురయ్యామని చెప్పారు. గంట వరకు తాము కోలుకోలేదని.. రెండవ సారి ఫోన్ చేసి నాకేమీ కాలేదు.. మీరు టెన్షన్ పడవద్దని తెలపడంతో ఊపిరిపీల్చుకున్నామన్నారు. అయినా ఇంకా భయంగానే ఉందని చెప్పారు.