breaking news
kerala solar scam
-
విచారణ కమిటీ ముందుకు వెళ్లనున్న సీఎం
దాదాపు 7 కోట్ల రూపాయల సోలార్ స్కాంపై విచారణ జరుపుతున్న జస్టిస్ జి.శివరాజన్ ఏకసభ్య కమిటీ ముందు విచారణకు కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ హాజరు కానున్నారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న చాందీ.. ఇప్పటికే కమిషన్కు లిఖిత వాంగ్మూలం ఇచ్చారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కమిటీ ఎదుట హాజరవుతానని చెప్పారు. చాందీ ప్రకటనను రికార్డు చేసేందుకు కమిటీ తిరువనంతపురం రానుంది. 2013 జూన్ నెలలో సోలార్ స్కాం వెలుగుచూసిన తర్వాత.. దానిపై విచారణ కోసం కేరళప్రభుత్వం 2013 అక్టోబర్ నెలలో జస్టిస్ శివరాజన్ కమిటీని నియమించింది. సోలార్ ప్యానళ్లు ఇప్పిస్తామంటూ డబ్బు తీసుకుని చాలామంది పెట్టుబడిదారులను ఓ జంట మోసం చేసింది. ఆ జంటతో సీఎం కార్యాలయంలోని ఉన్నతాధికారులకు సంబంధాలు ఉండటంతో, వాళ్లను వెంటనే ఆ పదవుల నుంచి తప్పించారు. ఈ కేసులో సరితా నాయర్, ఆమె సహజీవన భాగస్వామి బిజు రాధాకృష్ణన్ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం సరితా నాయర్ బెయిల్ మీద బయటకు రాగా, రాధాకృష్ణన్ ఇంకా కస్టడీలోనే ఉన్నారు. ఆయన తన మొదటి భార్యను హత్య చేసిన విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది. దీనిపై సభలోను, బయట కూడా భారీ స్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో ఈ ఘటనపై చాందీ జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణ ఎదుర్కొనేందుకైనా సిద్ధమేనని చాందీ అంటున్నారు. -
ఓ మహిళతో సీఎం.. ఆ వీడియో ఉంది!
► కేరళ సోలార్ స్కాం ప్రధాన నిందితుడి ఆరోపణ ► విచారణ కమిషన్ ముందు రాధాకృష్ణన్ వెల్లడి ► సీఎం ఊమెన్ చాందీ సహా ఆరుగురు నేతలపై ఆరోపణలు కొచ్చి కేరళ సోలార్ ప్యానల్ స్కాం సరికొత్త మలుపులు తిరుగుతోంది. ఏకంగా ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ సహా ఆరుగురు ప్రముఖ నేతలంతా ఓ మహిళతో కలిసి ఉండగా కెమెరాకు పట్టుబడ్డారని ఈ స్కాంలో ప్రధాన నిందితుడు బిజు రాధాకృష్ణన్ ఆరోపించారు. సరితా నాయర్ అనే ఆ మహిళతో వాళ్లు విడివిడిగా ఉన్నప్పటి వీడియోలన్నీ తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, సరితా నాయర్ మాత్రం రాధాకృష్ణన్ ఆరోపణలను ఖండించారు. దమ్ముంటే వీడియోలు చూపించాలని డిమాండ్ చేశారు. సరితా నాయర్ ఆ నాయకులెవ్వరికీ తెలియకుండా ఈ వీడియోలు తీసిందని, అవి బ్లాక్ మెయిల్ కోసమో, లేదా ఆత్మరక్షణ కోసం తీసిందో తనకు తెలియదని సోలార్ స్కాంను విచారిస్తున్న జస్టిస్ శివరాజన్ కమిషన్ వద్ద రాధాకృష్ణన్ చెప్పారు. ఆమె అరెస్టు కావడానికి రెండు వారాల ముందు ఆ వీడియోలు తనకు ఇచ్చిందని, వాటిలో ఐదింటిని తాను సీఎం ఊమెన్ చాందీకి చూపించానని, ఆరోది మాత్రం స్వయంగా ఆయనే ఉండబట్టి చూపించలేదని అన్నారు. కమిషన్ అవసరం అనుకుంటే వాటిని అందిస్తానని చెప్పారు. అయితే సీఎం, ఇతర నాయకులెవ్వరూ ఇంతవరకు దీన్ని ఖండించలేదు కూడా. చాందీ లంచం తీసుకున్నారని రాధాకృష్ణన్ గతంలో ఆరపించారు. తాను స్వయంగా రూ. 5.5 కోట్లు ఇచ్చానని, రాష్ట్రంలో రెండు పెద్ద సోలార్ ప్రాజెక్టులు పెట్టడానికి ఈ మొత్తం ఇచ్చానని అన్నారు. నిందితుడికి సహకరించారన్న ఆరోపణలతో చాందీ కార్యాలయంలో వ్యక్తిగత సహాయకులను అరెస్టు చేయడంతో సోలార్ స్కాం కాస్తా బాగా పెద్దదైంది. రాధాకృష్ణన్ తాజా ఆరోపణల నేపథ్యంలో సీఎం చాందీ రాజీనామా చేయాలని విపక్ష నేత వీఎస్ అచ్యుతానందన్ డిమాండ్ చేశారు.