breaking news
Ken
-
చిన్ని ప్రాణుల చలివేంద్రాలు
సాక్షి, విశాఖపట్నం: వేసవి వచ్చిందంటే చాలు నీటి చుక్క కోసం అల్లాడిపోతాం. కాలు బయటపెడితే.. కాసిన్ని నీళ్లు ఎక్కడ దొరుకుతాయా అని ఆశగా వెదుకుతుంటాం. ఎప్పటికప్పుడు ఉష్ణతాపాన్ని తీర్చుకునేందుకు ఏదో రూపంలో నీటిని శరీరానికి అందిస్తుంటాం. అందుకే వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చాలాచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారు. మరి మూగజీవాల పరిస్థితి ఏమిటి? చుక్క నీటి కోసం మైళ్ల దూరం ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి. పక్షి జాతుల్లో కొన్ని అంతరించిపోవడానికి వేసవీ ఒక కారణమని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేమా? అని కెన్ ఫౌండేషన్ సభ్యులకు కలిగిన ఆలోచన.. నేడు నగరంలో వేలాది పశుపక్ష్యాదుల దాహార్తిని తీరుస్తోంది. 10 ఏళ్లుగా ఎన్నో జీవాలకు వేసవిలో ఊపిరిపోస్తోంది. సాధారణంగా పక్షుల శరీర సాధారణ ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రత దాటితే ఎక్కువ సేపు జీవించలేవు. అందుకే చాలా పక్షులు ఎక్కడ నీరు కనిపిస్తే అందులో మునకేస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకుంటాయి. ప్రస్తుతం నగరంలో వేసవి నేపథ్యంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు సమీపిస్తోంది. ఈ తరుణంలో పక్షుల సంరక్షణకు నడుం బిగించింది నగరానికి చెందిన కెన్ ఫౌండేషన్. సేవే మార్గంగా.. విద్యార్థులు వలంటీర్లుగా.. సంస్థ అధ్యక్షుడు పుల్లేటికుర్తి సంతోష్ ఈ సంస్థ తరఫున వాటర్ బౌల్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. 100 తొట్టెలతో ప్రారంభమై.. పక్షులను వేసవి తాపం నుంచి రక్షించి వాటి దాహార్తి తీర్చే ఉద్దేశంతో 2012లో కెన్ ఫౌండేషన్ నగరంలో వాటర్ బౌల్ పేరుతో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. తొలి ఏడాది ఫౌండేషన్ వలంటీర్లే నగరంలోని పలుచోట్ల 100 నీటి తొట్టెలు ఏర్పాటు చేశారు. ఆ వాటర్ బౌల్స్ వద్దకు పక్షులు, మూగజీవాలు వచ్చి నీటిని తాగుతుండటం చూసి నగర ప్రజలు చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తామూ ఈ వాటర్ బౌల్ ప్రాజెక్ట్లో భాగస్వాములమవుతామని ముందుకువచ్చారు. దీంతో వాటర్ బౌల్ ప్రాజెక్ట్ను విస్తరించారు. పిచ్చుకలు, రామచిలుకలు, పావురాలు, కోయిలలు, కాకులతో పాటు ఉడుతలు, ఆవులు, కుక్కలు కూడా ఈ వాటర్ బౌల్స్ వద్దకు చేరుకుని తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. సంస్థ చైర్పర్సన్ గీతానారాయణ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నీటి తొట్టెల ఖర్చును భరిస్తూ.. అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. 2017 వరకు 750 నీటి తొట్టెలు పంపిణీ చేయగా.. 2021 నాటికి ఆ సంఖ్య 1800 కు చేరింది. ఈ ఏడాది 150 నుంచి 200 వరకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నగరమంతా విస్తరణ నగరంలోని అనేక చోట్ల నుంచి జంతు ప్రేమికులు ఈ వాటర్ బౌల్స్ను తీసుకుని వెళ్తున్నారు. ఇంకా ఎవరైనా పక్షి ప్రేమికులుంటే మరికొన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెందుర్తి, విశాలాక్షినగర్, కొత్తవలస, స్టీల్ప్లాంట్, అనకాపల్లి, డాల్ఫిన్ నోస్... ఇలా శివారు ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు వచ్చి నీటితొట్టెలను తీసుకెళ్తున్నారు. ఈ నీటితొట్టెల్లో నీటిని నింపి మేడ చివర్లో కానీ, పెరడులో గానీ పెడితే పక్షులు అక్కడికి చేరి దాహాన్ని తీర్చుకుని ఉపశమనం పొందుతున్నాయి. ఐదేళ్లుగా సరఫరా చేసిన నీటి తొట్టెల వద్దకు ఎన్నో పక్షులు కాలంతో పనిలేకుండా వస్తుండటం విశేషం. ఉచితంగా అందిస్తాం.. వేసవి వస్తే మనుషుల కోసం అడుగడుగునా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ మూగజీవాల గురించి ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అందుకే మా ఫౌండేషన్ తరఫున వాటర్ బౌల్ ప్రాజెక్ట్ ప్రారంభించాం. ఇవి జంతువులకు, పక్షులకు చలివేంద్రాలు. నగరంలోని అనేక కళాశాలలు, ప్రైవేట్ సంస్థల్లో కూడా వీటిని ఏర్పాటుచేశాం. మూగ జీవాలను ప్రేమించేవారు ఎవ్వరు వచ్చినా.. ఉచితంగా నీటితొట్టెలు అందిస్తాం. ఆసక్తి ఉన్న వారు 98856 74949ను సంప్రదించవచ్చు. – పుల్లేటికుర్తి సంతోష్, కెన్ ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రజల స్పందన అనూహ్యం కెన్ ఫౌండేషన్ తరఫున ముందుగా ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించాం. 100 చోట్ల పెట్టి వాటినే ప్రతి ఏటా కొనసాగించాలని భావించాం. అయితే.. నీటి తొట్టెలు చూసిన వారు ఇళ్ల వద్ద కూడా పెడతామని సంప్రదించారు. దీంతో ఆరేళ్లుగా దీన్ని కొనసాగిస్తున్నాం. – గీతానారాయణ్, చైర్పర్సన్, కెన్ ఫౌండేషన్ -
ఆ ఇంటి లైట్లను మీరు కూడా ఆన్, ఆఫ్ చేయొచ్చు
అలస్కా: మన ఇంటికి అలంకరించిన లైట్లను ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా, ఎక్కడి నుండైనా ఆన్, ఆఫ్ చేసే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నే కొంచెం విచిత్రంగా అనిపించినప్పటికీ.. అమెరికాలోని ఓ ఇంటి అలంకరణ లైట్లను ఎవరైనా ఎక్కడి నుండైనా వెలిగించవచ్చు, ఆర్పేయవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తమ సంతోషాన్ని అందరితో పంచుకోవడం కోసం అలస్కాకు చెందిన ఐటీ నిపుణుడు జాన్ ఉడ్స్ తన ఇంటికి అలంకరణ లైట్లను ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుండైనా, ఎవరైనా ఆన్, ఆఫ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా మరోసారి లైట్లపై పూర్తి కంట్రోల్ ఇంటర్ నెట్ యూజర్లకే ఇచ్చేశాడు. ఈ ఏడాది ఇలాంటి అవకాశం కల్పించడం ఇది ఆరోసారి. ఉడ్స్ ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన వస్తుంది. తమ ఇంట్లో లైట్లను ఆఫ్ చేయడానికి బద్దకించే వారు సైతం గంటల తరబడి ఆన్లైన్లో ఉడ్స్ ఇంటికి అలంకరించిన లైట్లను ఆన్, ఆఫ్ చేస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఈ లింక్ ద్వారా http://christmasinfairbanks.com మీరు కూడా ఓ సారి ప్రయత్నించండి.. -
తండ్రికే పాఠం నేర్పాడు!
స్ఫూర్తి చిన్నపిల్లలకు ఏమీ తెలియదు అనుకుంటాం. కానీ కొన్నిసార్లు వాళ్లు పెద్దవాళ్లకే పాఠాలు నేర్పుతుంటారు. కెన్ కూడా తన తండ్రికి ఓ పాఠం నేర్పాడు. కానీ అది పాఠం కాదు గుణపాఠమంటాడు కెన్ తండ్రి. ఫిలిప్పైన్సకు చెందిన తొమ్మిదేళ్ల కెన్లో ఉన్నట్టుండి ఏదో మార్పు కనిపించింది అతడి తండ్రికి. రోజూ స్కూలు నుంచి వచ్చాక ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్లిపోతున్నాడు కెన్. ఆడుకోవడానికి వెళ్తున్నాడేమో అనుకున్నాడు తండ్రి మొదట. కానీ రోజూ వీపునకు బ్యాగ్ ఒకటి తగిలించుకుని వెళ్లడం చూసి అనుమానమొచ్చింది. రెండు వారాలు చూసిన తరువాత ఓ రోజు కొడుకుని అనుసరించాడు తండ్రి. కెన్ చేస్తున్న పని చూసి అతడు అవాక్కయ్యాడు. తన ఇంటి చుట్టుపక్కల ఉన్న వీధులన్నీ తిరుగు తున్నాడు కెన్. ఎక్కడ వీధికుక్కలు కనిపిస్తే అక్కడ ఆగిపోతున్నాడు. తన బ్యాగ్లోంచి బిస్కట్లు, కేక్ ముక్కలు, తీసి... వెంట తెచ్చిన పేపర్ ప్లేట్లలో వేసి కుక్కలకు పెడుతున్నాడు. ఆ దృశ్యం చూసి విస్తుపోయాడు తండ్రి. వెంటనే వెళ్లి కొడుకుని హత్తుకున్నాడు. ఏమిటిదంతా అని అడిగితే... ‘‘నాకు నువ్వు తిండి పెడతావ్ కదా డాడీ! పాపం వీటికెవరు పెడతారు’’ అన్నాడు కెన్. కొడుకు అన్న ఆ మాటలు తండ్రి మనసును తాకాయి. ఆ రోజు నుంచి ప్రతిరోజూ తన కొడుకుతో పాటు తను కూడా ఆహారం తీసుకుని బయలుదేరడం మొదలుపెట్టాడు. ‘‘మురికిపట్టి వీధుల్లో తిరిగే ఆ కుక్కలను ఎన్నోసార్లు అసహ్యించుకుని తరిమికొట్టాను. కానీ నా కొడుకు వాటిని ప్రేమించాడు. నాకు చాలా సిగ్గుగా ఉంది’’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. వీధికుక్కల కడుపు నింపుతోన్న తన కొడుకు ఫొటోలను కూడా అప్లోడ్ చేశాడు. అవి చూసి చాలామంది కెన్కి ఫ్యాన్స అయిపోయారు. వాళ్లంతా కెన్ చిరునామా తెలుసుకుని విరాళాలు పంపడం మొదలు పెట్టారు. వాటితో కెన్ ‘హ్యాపీ యానిమల్స్ క్లబ్’ను ప్రారంభించాడు. తండ్రితో కలిసి దిక్కులేని మూగజీవులను తెచ్చి పెంచుతున్నాడు. హ్యాట్సాఫ్ కెన్!