breaking news
KC Canal basin
-
జంట పథకాలతో రైతన్నకు పంట
కరువు కష్టాలనుంచి గట్టెక్కించేందుకు జగన్ సర్కార్ సమాయత్తమైంది. అవకాశమున్నంత మేర జిల్లాలో సాగునీటి వనరుల ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజోలి వద్ద కొత్తగా రిజర్వాయర్ నిర్మాణంతోపాటు తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణకు కుందూనదినుంచి ఎత్తిపోతల పథకం ఏర్పాటుకు సర్వం సిద్ధం చేస్తోంది. రెండు పథకాలకు డిసెంబర్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టర్ సి.హరికిరణ్ ఇరిగేషన్ అధికారులతో కలిసి శుక్రవారం రాజోలి రిజర్వాయర్ నిర్మాణంతోపాటు కుందూ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ఇవ్వని హామీలను సైతం నెరవేర్చేందుకు ప్రభుత్వం పూనుకోవడాన్ని జిల్లా రైతాంగం స్వాగతిస్తోంది. సాక్షి, కడప : వరుస కరువులతో అల్లాడిపోతున్న రైతాంగానికి ఇది తీపి కబురు. సాగునీటి వనరులపై వైఎస్ జగన్ ప్రభుత్వం మరో అడుగు వేయనుంది. కేసీ ఆయకట్టును స్థిరీకరించేందుకు పథకం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం కుందూనదిపై కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం రాజోలి సమీపంలో రిజర్వాయర్ నిర్మించాలని నిర్ణయించింది. 2.95 టీఎంసీల సామర్ద్యంతో నిర్మించే ఈ ప్రాజెక్టుకు రూ. 830.47 కోట్లు వెచ్చించనుంది. డిసెంబరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. కేసీ కెనాల్ కింద అధికారికంగా 83,489 ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా జలాలపై ఆధారపడిన ఈ ఆయకట్టుకు అడపా దడపా మాత్రమే నీరు చేరుతోంది. ఎగువన భారీ వర్షాలు కురిసి శ్రీశైలం ప్రాజెక్టు నిండితే తప్ప కేసీ ఆయకట్టుకు నీరు వదిలే పరిస్థితి లేదు. దీంతో కుందూనదిపై రాజోలు రిజర్వాయర్ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా నిర్మించాలని చాలాకాలంగా కేసీ ఆయకట్టు రైతాంగం కోరుతోంది. గత ప్రభుత్వం అన్నదాతల గోడు పట్టించుకోలేదు. కానీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఈ ప్రాంత రైతాంగం శ్రేయేస్సును దృష్టిలో ఉంచుకుని రాజోలి రిజర్వాయర్ నిర్మాణానికి తలపెట్టింది. ప్రాజెక్టు నిర్మించి 2.95 టీఎంసీల నీటిని నిల్వ ఉంచితే కేసీ ఆయకట్టు స్థిరీ కరించినట్లు అవుతుంది. దీంతోపాటుగా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు తాగునీరు కూడా ప్రాజెక్టు ద్వారా అందించనున్నారు. కలెక్టర్ హరి కిరణ్, స్పెషల్ కలెక్టర్ సతీష్చంద్ర, తెలుగుగంగ కడప ఎస్ఈ శారద, నంద్యాల ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ మాధవరావు, డీఈ రమణ తదితరులు శుక్రవారం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. భూ సేకరణతోపాటు టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. త్వరలోనే ప్రాజెక్టు నిర్మాణానికి సం బంధించి అన్ని కార్యక్రమాలను అధికారులు పూర్తి చేయనున్నారు. రాజోలి రిజర్వాయర్ నిర్మాణంతో కేసీ ఆయకట్టుకు మరింత ఉపయోగం చేకూరనుండడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. కుందూ నుండి ఎత్తిపోతల మరోవైపు 1.58 లక్షల ఎకరాల తెలుగుగంగ ప్రాజెక్టు ఆయకట్టును స్థిరీకరించేందుకు కుందూఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దువ్వూరు మండలం జొన్నవరం క్రాసింగ్ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా ఐదు టీఎంసీల నీటిని కుందూ నదినుంచి తెలుగుగంగ మెయిన్ కెనాల్ ద్వారా బ్రహ్మంసాగర్ రిజర్వాయర్కు తరలించనున్నారు. తొలి అంచెగా ఎనిమిది మోర్టార్లు ఏర్పాటు చేసి ఆరు కిలోమీటర్ల పొడవుతో నాలుగు వరుసల పైపులైన్లు వేసి దువ్వూరు ట్యాంకుకు నీటిని తరలిస్తారు. తర్వాత అక్కడి నుంచి మరో ఎనిమిది మోర్టార్లతో రెండు కిలోమీటర్ల మేర పైపులైన్ వేసి తెలుగుగంగ ప్రధాన కాలువలోకి కుందూ నీటిని తరలిస్తారు. బ్రహ్మంసాగర్కు ఐదు టీఎంసీల నీటిని తరలించడం వల్ల బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో ఆయకట్టుకు సాగునీరు అందించడంతోపాటు బద్వేలు, మైదుకూరు పట్టణాలకు తాగునీరు అందించే అవకాశం ఉంటుంది. ఈ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిసెంబరులోనే శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.హరి కిరణ్ అటు రాజోలి రిజర్వాయర్ నిర్మాణ ప్రాంతంతోపాటు దువ్వూరు వద్ద కుందు ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని సైతం పరిశీలించారు. కుందూ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ సేకరణతోపాటు టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాజోలి రిజర్వాయర్ నిర్మాణంతో 83,489 ఎకరాల కేసీ ఆయకట్టుతోపాటు కుందూ ఎత్తిపోతల పథకంతో 1,58,000 ఎకరాలు తెలుగుగంగ ఆయకట్టుకు సైతం నీరు చేరనుంది. పై రెండు పథకాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 1270.47 కోట్లు ఖర్చు చేయనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఈ ప్రాంత రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది -
వినాయకుడికే విఘ్నాలు..!
సాక్షి, కర్నూలు : ఏ కార్యక్రమమైనా నిరంతరాయంగా సాగాలంటే వినాయకునికి పూజలు చేస్తారు. తలచుకున్న కార్యక్రమం నిర్విఘ్నంగా విజయవంతం కావాలని ఆయనను వేడుకుంటారు. విఘ్నేషుని పూజతో ప్రారంభించిన కార్యక్రమం ఏ ఆటంకం లేకుండా సాగుతుందని విశ్వసిస్తారు. విఘ్నాలు తొలగించే వినాయకుడికే పాపం విఘ్నం వచ్చి అడ్డుపడింది. వర్షాలు సకాలంలో కురవకపోవడం.. సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు పెరగకపోవడం కారణంగా కేసీ కెనాల్కు నీటి విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో రానున్న వినాయక నిమజ్జనానికి విఘ్నం ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. వారం రోజులపాటు పూజలందుకున్న తర్వాత నిమజ్జనానికి తరలే వినాయకుడికి అన్ని విఘ్నాలు ఏర్పడే దుష్ట పరిస్థితి ఏర్పడటంపై భక్తులలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి. 2002లో మాదిరిగానే ఇప్పుడూ ప్రత్నామ్నాయ ఏర్పాట్లపై జలవనరుల శాఖ అధికారులు దృష్టి సారించడం సంక్లిష్ట పరిస్థితికి అద్దం పడుతోంది. వినాయక చవితి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించటంలో కర్నూలుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోని జంటనగరాలలో జరిగే ఉత్సవాలకు దీటుగా కర్నూలులో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కర్నూలు మొదటిస్థానంలో నిలుస్తోంది. గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రతీయేటా వినాయకఘాట్ వద్ద కేసీ కెనాల్లో నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కమిటీ నిర్ణయించిన మేరకు కాలనీల్లో ప్రతిష్టించిన విగ్రహాలకు వారం రోజులపాటు పూజలు అందజేసి వాటిని కేసీ కెనాల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆనవాయితీకి ఈసారి ఆటంకాలు ఎదురవబోతున్నాయి. సుంకేసులకు తగ్గిన ఇన్ఫ్లో... కర్నూలు నగరానికి 19 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నదిపై సుంకేసుల రిజర్వాయరును నిర్మించారు. ఎగువ ప్రాంతమైన తుంగభద్ర డ్యాం నుంచి విడుదలయ్యే నీటిని ఈ రిజర్వాయరు ద్వారానే కేసీ కెనాల్ ఆయకట్టు భూములకు విడుదల చేస్తున్నారు. ఇందులో నుంచే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల పరిధిలోని వందలాది గ్రామాల ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. మరో నెలరోజుల్లో వర్షాలు సమృద్ధిగా పడి.. కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం నీటి మట్టం పూర్తిస్థాయికి చేరుకుని, ఎగువ భాగం నుంచి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ఉంటేనే ఈ ఏడాది సుంకేసుల ద్వారా కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయడం సాధ్యపడుతుంది. లేకుంటే పరిస్థితులు భిన్నంగా ఉంటే మాత్రం కాలువకు నీటి విడుదల ప్రశ్నార్థకమే అవుతుంది. ఇప్పటికీ ఎగువ భాగం నుంచి ఇన్ఫ్లో తగ్గిపోవడంతో 1.02 టీఎంసీల సామర్థ్యం ఉన్న సుంకేసులలో ప్రస్తుతం 0.90 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. సెప్టెంబరు రెండోవారానికి ఈ నీళ్లు అయిపోయి రిజర్వాయరు అడుగంటే పరిస్థితి ఉంది. ఇదే జరిగితే తాగునీటి కష్టాలు తప్పవు. రోజురోజుకు సుంకేసులలో తగ్గుతున్న నీటి మట్టం ఇటు అధికారులను, అటు భక్తులను కలవరపెడుతోంది. ఈసారి జోహరాపురం హెడ్రెగ్యులేటరీ గేట్ల మూసివేత... ప్రతియేటా నిర్వఘ్నంగా సాగిపోతున్న వినాయక నిమజ్జన కార్యక్రమానికి 15 ఏళ్లలో రెండోసారి ఆటంకం ఎదురుకానుంది. 2002 సంవత్సరంలోనూ వినాయక నిమజ్జన సమయానికి నీటి ఇక్కట్లు తలెత్తాయి. కేసీ కెనాల్కు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసే పరిస్థితి లేకపోవడంతో అప్పుడు వినాయకఘాట్ సమీపంలో ఉన్న బ్రిడ్జి కింద 8 అడుగుల ఎత్తుతో గోడలు కట్టి నిమజ్జనం కోసం కొంత మేర నీటిని నిల్వ చేశారు. అయితే అప్పట్లో వందలాది భారీ విగ్రహాలు పూర్తిగా నిమజ్జనానికి నోచుకోలేకపోయాయి. చాలా విగ్రహాలను భక్తుల మనోభావాలకు భిన్నంగా పగులగొట్టాల్సి వచ్చింది. ఈ విషయంలో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా జలవనరుల శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్నామ్నాయంగా ఈసారి జోహరాపురం వద్ద నుంచి హెడ్రెగ్యులేటరీ గేట్లను దించివేసి వినాయకఘాట్కు అటు ఇటు సుమారు 1.50 కిలోమీటర్ల మేర నీటిని నిల్వ చేయాలని నిర్ణయించారు. 17 నుంచి గణేష్ ఉత్సవాలు -25న నిమజ్జనం కర్నూలు(హాస్పిటల్): ఈ నెల 17 వ తేదీ నుంచి కర్నూలు నగరంలో గణేష్ ఉత్సవాలు ప్రారంభమవుతాయని గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ కార్యదర్శి కిష్టన్న పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక వినాయక్ ఘాట్ లోని వినాయక మందిరంలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు, ఊరేగింపులో ఏదైన సమస్య వస్తే కేంద్ర కమిటీ దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రశాంతమైన వాతవరణంలో ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకొని మట్టి వినాయకులకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు రంగస్వామి, సందడి సుధాకర్, సందడి మహేష్, కాళింగి నరసింహవర్మ, నాగరాజు, ప్రసాద్ పాల్గొన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండానే జరగాలి : ఈ ఏడాది చెరువులు, కుంటలతోపాటు నదుల్లోనూ చుక్క నీరు కనిపించడం లేదు. 2002లోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నిమజ్జన ఉత్సవం కోసం ఆనకట్ట మాదిరిగా గోడకట్టి ఉత్సవాన్ని జరిపించాం. ఈ ఏడాదీ అలాంటి పరిస్థితి నెలకొనదని భావిస్తున్నాం. వరుణదేవుని కరుణతో వర్షాలు సమృద్ధిగా పడి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఒకవేళ ఏదైన అనుకోని విఘ్నం ఏర్పడితే మాత్రం అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. -నరసింహవర్మ, కార్యనిర్వాహక కార్యదర్శి, గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ కేసీ కెనాల్కు నీళ్లు వస్తాయి రెండు నెలలుగా వర్షాభావం ఉంది. తుంగభద్ర డ్యాంలో ఇప్పటికే 75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇప్పటికే ఎల్ఎల్సీ ప్రతి రోజూ 350-400 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. అయితే రానున్న రోజుల్లో సమృద్ధిగా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు వస్తే మాత్రం వారం రోజుల్లో కేసీ కెనాల్కు నీళ్లు వస్తాయనే ఆశాభావం ఉంది. ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే మాత్రం వినాయక నిమజ్జనానికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటాం. -చంద్రశేఖరరావు, ఎస్ఈ, జలవనరుల శాఖ