మనస్థాపంతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
పాలకొల్లు సెంట్రల్ : పాలకొల్లు రైల్వే పట్టాలపై రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. వడలి గ్రామానికి చెందిన కాసాని శ్రీను (44) 18 ఏళ్ల క్రితం పాలకొల్లు మండలం చింతపర్రు గ్రామానికి చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి రాణిదుర్గ, పుష్పలత అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. అతను అత్తవారి ఇంటి వద్ద ఉంటు పూలపల్లికి చెందిన ఓ రైసుమిల్లులో జట్టు కార్మికునిగా పనిచేస్తున్నాడు. నాలుగేళ్లనుంచి కుటుంబాన్ని పట్టించుకోకుండా మద్యానికి బానిసై తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో మనస్థాపానికి గురైన శ్రీను గురువారం రాత్రి రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రాత్రి 3గంటలకు స్థానికులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు భీమవరం రైల్వే ఎస్ఐ జి.ప్రభాకరరావు తెలిపారు. పంచనామా నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.