breaking news
Karim Lala
-
గంగుబాయి.. నేటికి ఆమె ఫోటో వేశ్యాగృహాల్లో..
గంగుబాయి కథ ఒక సినిమాకు తక్కువ కాదు. అందుకే అది ఇప్పుడు సినిమా అయ్యింది. గుంగుబాయి కతియావాడి ముంబై కామాటిపురాకు మకుటం లేని మహారాణి. కరీం లాలా అనే మాఫియా డాన్కు రాఖీ కట్టడంతో అతని అండ దొరికి కామాటిపురాను ఏలింది. అయితే ఆమె జీవితాంతం వేశ్యలకు సాయం చేయడానికే చూసింది. అందుకే నేటికీ ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ జూలై 30న రిలీజవుతుందని టాక్. ఆలియా భట్ హీరోయిన్గా నటించిన గంగుబాయి బయోపిక్ కూడా అదే డేట్కు రిలీజ్ కానుంది. ఆ కలెక్షన్ల క్లాష్ కంటే గుంగుబాయి చరిత్రే ఎక్కువ ఆసక్తికరం. చరిత్ర నిక్షిప్తం చేసుకున్న కథలు ఎన్నో. మనల్ని ఆశ్చర్యపరిచేవి, సంతోషపెట్టేవి, బాధ పెట్టేవి, గర్వపడేలా చేసేవి, సామాజిక పరిణామాలను తెలియ చేసేవి... ఒకప్పుడు సినిమాలంటే కల్పిత కథలు. నేడు చరిత్ర నుంచి ఏరుతున్న పుటలు. దర్శకుడు సంజయ్ లీలాబన్సాలీ అలాంటి మరొక పుటను వెతికి పట్టుకున్నాడు. దాని పేరు ‘గుంగుబాయి కతియావాడీ’. 1960లలో ముంబై రెడ్లైట్ ఏరియా అయిన కామాటిపురాలో చక్రం తిప్పిన మేడమ్ గంగుబాయి కతియావాడీ. ఇప్పుడు ఆమె బయోపిక్ దాదాపుగా పూర్తి కావచ్చింది. గుంగుబాయిగా ఆలియాభట్ నటించింది. ఇంటి నుంచి పారిపోయి గుంగుబాయి కథ ఆసక్తికరమైనది. ఆమెది గుజరాత్లోని కతియావాడీ. వాళ్లది లాయర్ల కుటుంబం అని చెబుతారు. గంగుబాయి చిన్న వయసులో సినిమాల పిచ్చిలో పడింది. అంతే కాదు వాళ్ల నాన్న దగ్గర క్లర్క్గా పని చేసే కుర్రాడి ప్రేమలో కూడా పడింది. ఇద్దరూ కలిసి ముంబై పారిపోయారు. వాళ్లిద్దరూ కొన్నాళ్లు కాపురం చేశారని అంటారు. కాని ముంబైలాంటి మహా నగరిలో ఆ కుర్రాడు బెంబేలెత్తాడు. గుంగుబాయిని కామాటిపురాలోని ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోయాడు. అక్కడి నుంచే గంగుబాయి జీవితం అనూహ్యమవుతూ వచ్చింది. ప్రతిఘటన... లొంగుబాటు వేశ్యావాటికలో గంగుబాయి వారాల తరబడి ఏడ్చింది. కాని తుదకు వృత్తిని అంగీకరించక తప్పలేదు. అయితే ఆమె రూపం, కొద్దో గొప్పో ఉన్న చదువు ఆమెను హైక్లాస్ క్లయింట్ల దగ్గరకు వెళ్లే వేశ్యను చేయగలిగాయి. వారి రాకపోకలు ఆమె కోసం సాగేవి. కాని సహజంగా నేరగాళ్లు కూడా చాలామంది వచ్చి పోతూ ఉండేవారు. అలా ఆమెకు ముంబై అండర్వరల్డ్ తెలిసింది. ఆ సమయంలోనే నాటి పెద్ద డాన్ అయిన కరీం లాలాకు చెందిన ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారం చేశాడు. ఇది ఆమెను చాలారోజుల పాటు అచేతనం చేసిందని అంటారు. తన మీద దాడి ఆమె సహించలేకపోయింది. అయితే మెల్లగా కోలుకుని తనకు న్యాయం జరగాలని ఆశించి శుక్రవారం నమాజు ముగించుకుని వస్తున్న కరీం లాలాను కలిసింది. తనకు జరిగిన అన్యాయం, తాను అనుభవిస్తున్న వేదన చెప్పుకుంది. కరీం లాలా వెంటనే ఆమెకు ఊరడింపు ఇచ్చాడు. ఆమె రాఖీ కడితే కట్టించుకుని రక్ష ఇచ్చాడు. అంతే కాదు ‘కామాటిపురాలో గుంగుబాయికి ఎటువంటి కష్టం ఎవరు కలిగించినా వారి పని చూస్తా’ అని హెచ్చరించాడు. ఇది గంగుబాయికి పెద్ద వరం అయ్యింది. ఆమె కామాటిపురాలో తానే వేశ్యాగృహాల యజమానిగా ఎదగడం మొదలెట్టింది. మహా ప్రాభవం కామాటిపురాలో గంగుబాయికి అనేక వేశ్యాగృహాలు సొంతమయ్యాయి. ఆమె కట్టే ఖరీదైన చీరలు నాడు విశేషమయ్యాయి. నిజం బంగారు అంచు ఉండే చీరలు, నిజం బంగారు గుండీలు ఉండే జాకెట్లు ఆమె కట్టుకునేది. ఆమెకు ఆరోజుల్లోనే బెంట్లి కారు ఉండేది. అండర్ వరల్డ్ కూడా ఆమె గుప్పిట్లో ఉండేది. అయితే ఆమె బలవంతపు వ్యభిచారాన్ని ప్రోత్సహించలేదు. దీనిని వృత్తిగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్లే ఉండాలని భావించింది. ఎవరైనా ఈ కూపం నుంచి బయటపడాలనుకుంటే వారిని వెళ్లనిచ్చేది. అంతే కాదు వేశ్యల బాగోగులతోబాటు, వారికి పుట్టిన బిడ్డల బాగోగులు కూడా ఆమె చూసేది. అందువల్లే ఆమె విగ్రహం కామాటిపురాలో ఉంది. ఆమె ఫొటోలు నేటికి కామాటిపురాలోని వేశ్యాగృహాల్లో కనిపిస్తాయి. సినిమాలో కథ ఈ సినిమా కథను సంజయ్ లీలా బన్సాలీ పకడ్బందీగా తీస్తున్నాడని వినికిడి. ఆలియా భట్ ఈ క్యారెక్టర్ను చాలెంజింగ్గా తీసుకుని చేస్తోంది. అజయ్ దేవ్గణ్ ‘కరీం లాలా’ పాత్రను పోషిస్తున్నాడు. ఎన్నిసార్లు విన్నా వేశ్యల జీవితంలో విషాదమే ఉంటుంది. దీని గురించి ఎంతో సాహిత్యం వచ్చింది. సినిమాలూ వచ్చాయి. కాని గుంగుబాయి లాంటి వ్యక్తి గురించి వస్తుండటం వల్ల దీని గురించి కుతూహలం ఏర్పడింది. సినిమా విడుదల గురించి వస్తున్న వార్తలను బట్టి జూలై 30న దీనిని విడుదల చేయనున్నారు. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడా అదే రోజు కావచ్చని అంచనా. కనుక రెండు సినిమాలు కలెక్షన్ల పోటీని ఎదుర్కోవాలి. – సాక్షి ఫ్యామిలీ -
ముంభాయ్ మూవీ
ముంబై గ్యాంగ్స్టర్ ఛోటా రాజన్ అరెస్ట్ అయి అప్పుడే ఏడాది గడిచిపోయింది. 2015 అక్టోబర్ 26న ‘ఇంటర్పోల్’ పోలీసులు అతడిని ఇండోనేషియాలోని బాలి దీవిలో అరెస్టు చేసి నవంబర్ 6న ఇండియాకు తరలించారు. ముంబైలో అతడి ప్రాణాలకు ముప్పు ఉండడంతో ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. అప్పటి నుండి అతడు జైల్లోనే ఉంటున్నాడు. మరోవైపు అతని పూర్వ మిత్రుడు ప్రస్తుత ప్రధాన విరోధి దావూద్ ఇబ్రహీమ్ పాకిస్తాన్లో తల దాచుకుంటూ భారత ప్రభుత్వ వేట నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విశేషం ఏమంటే ఈ అండర్వరల్డ్ డాన్ల వెంట చట్టం ఎలా పరిగెత్తిందో బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా అంతే పరిగెత్తింది. వారి జీవితాల ఆధారంగా సినిమాలు తీస్తూనే ఉంది. డాన్లు లేని హిందీ సినిమాలను ఊహించడం కష్టం. మీట నొక్కితే తెరుచుకునే తలుపులు, క్లబ్ డాన్సులూ, హెలికాప్టర్లు ఇలాంటి సినిమాటిక్ డాన్లను నేల మీదకు దించి చూపిన తొలి సినిమా ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) అనే చెప్పాలి. ఆ తర్వాత విధు వినోద్ చోప్రా తీసిన ‘పరిందా’ డాన్ల వాస్తవిక జీవితాన్ని చూపించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ ప్రవేశంతో హిందీలో దాదాపుగా సూటూ బూటూ వేసుకునే డాన్లు అంతమై, నిజమైన డాన్ల కథలు తెర మీదకు వచ్చాయి. తాజాగా సోనాక్షి సిన్హా ‘హసీనా’ పేరున తయారయ్యే సినిమాలో దావూద్ ఇబ్రహీం చెల్లెలుగా నటించనుండగా అర్జున్ రాంపాల్ హీరోగా గ్యాంగ్స్ట్టర్ అరుణ్ గావ్లీ జీవిత కథ ఆధారంగా రూపొందనున్న సినిమా వచ్చే సంవత్సరం విడుదల కానుంది. ఈ నేపధ్యంలో బాలీవుడ్ను ప్రభావితం చేసిన డాన్లూ, వారి వల్ల వచ్చిన సినిమాలూ క్లుప్తంగా... ఛోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ నికల్జే. 1970లలో బ్లాక్ టిక్కెట్లు అమ్ముతూ, అప్పటి ముంబై డాన్ రాజన్ నాయర్ (బడా రాజన్) అనుచరుడిగా చేరి, క్రమంగా గ్యాంగ్స్టర్గా ఎదిగాడు. 1980, 90లలో ముంబైని ఛోటా రాజన్ గడగడలాడించాడు. రాజన్ని చంపిన ప్రత్యర్థి గ్యాంగ్పై పగ తీర్చుకుని ఛోటా రాజన్గా పేరుమోశాడు. కొన్నాళ్లు దావూద్ ఇబ్రహీంతో కలిసి పని చేసిన ఛోటా రాజన్ ముంబై పేలుళ్ల తర్వాత అతడి నుంచి విభేదించి, విడిపోయాడు. చివరకు ఇది ఒకరిని మరొకరు వేటాడే పరిస్థితికి తెచ్చింది. మహేశ్ మంజ్రేకర్ ‘వాస్తవ్’, రామ్ గోపాల్ వర్మ ‘సత్య’ సినిమాలు ఛోటా రాజన్ జీవితం నుంచి తీసుకున్న శకలాల ఆధారంగా తీసినవే. ఆ తర్వాత రామ్గోపాల్ వర్మ ‘కంపెనీ’ సినిమా తీసి దావూద్, ఛోటా రాజన్ల మధ్య ఉన్న వైరాన్ని కొంచెం కల్పిత కథ ఆధారంగా చూపించాడు. ఇందులో దావూద్ను పోలిన పాత్రలో అజయ్ దేవ్గణ్, ఛోటా రాజన్ను పోలిన పాత్రలో వివేక్ ఓబెరాయ్ నటించారు. కరీమ్ లాలా అసలు పేరు అబ్దుల్ కరీమ్ షేర్ఖాన్. ఆఫ్ఘనిస్థాన్లో పుట్టాడు. 1930లలో ఇండియా వచ్చి, తోటి పఠాన్లతో ఒక గ్యాంగ్ను ఏర్పరచుకుని, సెటిల్మెంట్లు మొదలుపెట్టాడు. జూద గృహాలు నడిపాడు. బంగారం, వెండి, ఎలాక్ట్రానిక్ వస్తువులు స్మగ్లింగ్ చేశాడు. డ్రగ్స్ అమ్మాడు. ఇలాంటి ఒక డాన్ని చూడడం బొంబాయికి అదే మొదటిసారి. అప్పటికే ఫీల్డులో ఉన్న హాజీ మస్తాన్, వరదరాజన్ ముదలియార్లతో సమానంగా నగరాన్ని తన చెప్పుచేతల్లోకి తీసుకున్నాడు. 1970లలో ఈ ముగ్గురి ధాటికి ముంబై తల్లడిల్లింది. అందుకే 1974లో వచ్చిన ‘జంజీర్’ సినిమాలో లాలాను పోలిన ‘షేర్ ఖాన్’ పాత్ర మనకు కనిపిస్తుంది. దానిని ధరించిన ప్రాణ్కు చాలా పేరు వచ్చింది. 1985లో లాలా మేనల్లుడు సమద్ఖాన్ని దావూద్ ఇబ్రహీం చంపేయడంతో లాలా ప్రాభవం తగ్గడం ప్రారంభమయింది. 2002లో తొంభై ఏళ్ల వయసులో కరీమ్ లాలా చనిపోయాడు. వరదరాజన్ ముదలియార్ కమలహాసన్ ‘నాయకన్’ సినిమా స్టోరీ ముదలియార్ జీవిత కథే. తమిళనాడు తీరప్రాంతం తూత్తుక్కుడి (ట్యుటికోరన్) నుంచి ముంబై వచ్చిన ముదలి యార్ ఓడరేవు కూలీగా జీవితం ప్రారంభించాడు. కొన్నాళ్లు హాజీ మస్తాన్ సహాయంతో రేవులోని రవాణా సామగ్రిని దొంగిలించేవాడు. ఆ తర్వాత గుడుంబా కాచి అమ్మాడు. ముంబైలోని మాతుంగ, ధారవి, సయాన్-కొలివాడ ప్రాంతాల్లోని తమిళుల నాయకుడిగా ముదలియార్ చాలా గట్టి పాత్ర పోషించాడు. 1980ల మధ్యలో అతడి గ్యాంగ్ కదలికలను ప్రభుత్వం బలంగా నియంత్రించడంతో ముంబై నుంచి చెన్నై వెళ్లిపోయాడు. 1988లో మరణించాడు. మణిరత్నం తీసిన ‘నాయకన్’ సినిమా చూశాక, ముదలియార్ మీద ప్రేమ పెరగడం, ‘కొంచెం ఎక్కువ గొప్పగానే చూపించారు’ అని కామెంట్ చేయడం ఖాయం. అబు సలేమ్ ఇతడి మీద నేరుగా బాలీవుడ్ సినిమా లేకపోయినా ఇతడు బాలీవుడ్ను గడగడలాడించేడమే కాదు బాలీవుడ్ నటి మోనికా బేడీని తన ప్రియురాలిగా చేసుకున్నాడు. ప్రస్తుతం జైల్లో ఉన్న సలేమ్ది ఉత్తర ప్రదేశ్లోని ఔరంగాబాద్. ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్గా పని చేసి ముంబై చేరుకున్నాడు. అంధేరీలో ఒక టెలిఫోన్ బూత్ నడిపి, చిన్నాచితక నేరాల వల్ల పోలీసుల రికార్డుకు ఎక్కాడు. 1980లలో దావూద్ సోదరుడు అనీస్తో పరిచయం అయ్యాక ‘గన్ రన్నర్’గా మారాడు. గన్ రన్నర్ అంటే దేశంలోకి అక్రమంగా తుపాకులను తెప్పించేవాడని అర్థం. 1993 ముంబై పేలుళ్ల నిందితులలో సలేమ్ ఒకడు. సుభాష్ ఘయ్, రాజీవ్ రాయ్ వంటి వారిని డబ్బు కోసం బెదిరించాడు. టి-సీరీస్ యజమాని గుల్షన్ కుమార్ హత్య వెనుక సలేమ్ హస్తం ఉందంటారు. 1988లో దావూద్ గ్యాంగ్ నుంచి విడిపోయి దేశం విడిచిన సలేమ్ 2002లో మోనికా బేడీతో లిస్బన్లో అరెస్ట్ అయ్యాడు. 2005లో అతడిని ఇండియాకు రప్పించారు. హాజీ మస్తాన్ జీవితంలో ఎప్పుడూ బుల్లెట్ పేల్చని మాఫియా లీడర్గా హాజీమస్తాన్ ఒక వెలుగు వెలిగాడు. అసలు పేరు మస్తాన్ హైదర్ మీర్జా. ఊరు తమిళనాడులోని పణైకుళం. ‘దీవార్’లో అమితాబ్ క్యారెక్టర్, ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయ్’లో అజయ్ దేవగణ్ క్యారెక్టర్... ఆ వెలుగును ఇప్పటికీ సన్నగిల్లకుండా ఉంచాయి! 1934లో ఎనిమిదేళ్ల వయసులో తండ్రితో కలిసి ముంబై వచ్చిన మస్తాన్ టీనేజ్ వచ్చాక ఓడ రేవులో కూలీగా చేరాడు. ఖరీదైన వాచీల స్మగ్లింగ్ మొదలు పెట్టి బంగారపు అచ్చులు, ట్రాన్సిస్టర్లు స్మగుల్ చేశాడు. ఆ తర్వాత గుడుంబాలోకి దిగాడు. అలా మస్తాన్ సంపన్నుడయ్యాడు. హిందీలో చాలా సినిమాలకు ఫైనాన్స్ చేసిన మస్తాన్ కొన్ని స్వయంగా నిర్మించాడు కూడా. మధుబాలకు గొప్ప ఫ్యాన్ అయిన హాజీ మస్తాన్ ఆమెను చేసుకోలేక, అచ్చు అలాగే ఉన్న సోనా అనే అమ్మాయిని వివాహం చేసుకుని ఆమెతోనే జీవితం గడిపాడు. 1970లలో అరెస్ట్ అయ్యాక మస్తాన్ క్షీణదశ మొదలైంది. 1994లో చనిపోయాడు. అరుణ్ గావ్లీ అరుణ్ గావ్లీ కుటుంబం మధ్య ముంబైలోని బైకులాలో ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలకు వీళ్ల కుటుంబం పాలు పోస్తుండేది. గావ్లీ నేర కార్యకలాపాలలో దిగాక ఇంటి నుంచి బయటికి వచ్చేశాడు. 1980లలో గ్యాంగ్స్టర్ రామ్ నాయక్ ద్వారా దావూద్ ఇబ్రహీమ్కి నమ్మకస్తుడయ్యాడు. ఆ తర్వాత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టుకుని ఎమ్మెల్యే అయ్యాడు! 2012 నాటి ఒక నేరానికి సంబంధించి గావ్లీ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతని జీవితం ఆధారంగా అర్జున్ రామ్పాల్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. దావూద్ ఇబ్రహీం మోస్ట్ నొటోరియస్! పేరు మోసిన మాఫియా డాన్. దావూద్ తండ్రి ఓ పోలీస్ కానిస్టేబుల్. హాజీ మస్తాన్ తన తండ్రిని ఎంతగా అవమాన పరిచేవాడో కళ్లారా చూస్తూ పెరిగాడు. మస్తాన్పై కసి పెంచుకున్నాడు. పథకం ప్రకారం మస్తాన్ని మించిన డాన్ అయ్యాడు. మొదట పోలీసులతో సత్సంబంధాలు పెట్టుకుని వారి సహాయంతో కరీమ్ లాలా గ్యాంగ్లో ఒక్కొక్కరినీ హతమారుస్తూ వచ్చాడు. అలా హాజీ మస్తాన్ రెక్కలు కత్తిరించాడు. భారీ నేరాలకు పాల్పడ్డాడు. బలవంతపు వసూళ్లు, హవాలా వ్యాపారం చేశాడు. 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల వెనుక పథక రచన దావూదే అంటారు. ఎస్. హుస్సేన్ రాసిన ‘బ్లాక్ ఫ్రైడే’ ఈ పేలుళ్ల మీద వచ్చిన పుస్తకమే. అదే పేరుతో అనురాగ్ కాశ్యప్ సినిమా కూడా తీశారు. దావూద్ 1984లో దుబాయ్ పారిపోయాడు. ప్రస్తుతం అతడు పాకిస్తాన్లో ఉన్నట్లు పోలీసుల దగ్గర సమాచారం ఉంది.