breaking news
Kalvakuntla Chandra Shekhar
-
ఆస్తులపై చర్చకు సిద్ధమా? : సీఎం కేసీఆర్కు ఈటల సవాల్
నాతోపాటు పలువురు అనేక రోజులు ఘర్షణ పడిన తర్వాతే బీజేపీలో చేరాలనే నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణలో ఏ పార్లమెంటరీ సంప్రదాయాలు,ప్రజాస్వామ్య విలువలు లేకుండా ప్రజలు అసహ్యించుకొనేలా జరుగుతున్న పాలనను తుదిముట్టించడమే మా కర్తవ్యం. తెలంగాణ ఉద్యమకారులను బీజేపీ జెండా కిందకు తీసుకురావడమే మా ఎజెండా. వేల కోట్లు ఖర్చుపెట్టినా, దౌర్జన్యాలు చేసినా, ప్రలోభాలకు గురిచేసినా, అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఏదైనా చేయవచ్చనే అహంకారాన్ని తొక్కిపడేసి ప్రజలు మెచ్చే తెలంగాణను తయారు చేసేందుకు పనిచేస్తాం. సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావుపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. ఎవరి ఆస్తులేమిటో విచారణకు సిద్ధమా అని కేసీఆర్కు సవాల్ విసిరారు. తన ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణకు సిద్ధంగా ఉన్నానని, మీ ఆస్తులపై విచారణకు సిద్ధంగా ఉన్నారా? అని ఈటల ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర స్థాయిలో విచారణ చేపడితే సీఎం ఏది చెబితే అది రాసిచ్చే అధికారులతో న్యాయం జరిగే ఆస్కారం లేదని, రాష్ట్రంలో పక్షపాతంతో కూడుకున్న పరిస్థితులు, దుర్మార్గంగా వ్యవహరించే పద్ధతి ఉందని ఆరోపించారు. అందుకే ఇద్దరి ఆస్తులపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నట్లు ఈటల తెలిపారు. సోమవారం ఢిల్లీలో లాంఛనంగా బీజేపీలో చేరిన అనంతరం ఈటల కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వ్యవహార శైలితోపాటు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా మంత్రుల దుస్థితి, ఉద్యమకారుల అణచివేత, తెలంగాణలో బీజేపీ అనుసరించబోయే పంథా తదితర అంశాల గురించి వివరించారు. ఆరోపణలు నిరూపించాలి... తెలంగాణలో తన పేరిట ఒక్క ఎకరం అసైన్డ్ భూమి ఉందని నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని ఇప్పటికే ప్రకటించినట్లు ఈటల గుర్తుచేశారు. తెలంగాణలో 2005లో కిరాయికి ఇచ్చిన గోడౌన్లను ఇప్పుడు ఖాళీ చేయించారని, ప్రస్తుతం తన భూములన్నింటిపై వివాదం చేశారని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్నా తాను భయపడట్లేదని, తమపై కసి ఉన్నందున చట్టం, యంత్రాంగాన్ని ఉపయోగించి తనపై చేసిన ఆరోపణలను నిరూపించుకోవాలని సీఎంకు ఈటల సవాల్ విసిరారు. ఒకవేళ తనపై చేసిన ఆరోపణలు నిరూపణ కాకపోతే ముక్కు నేలకు రాసేందుకు కేసీఆర్ సిద్ధమా? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తనది తప్పని తెలిస్తే దేనికైనా సిద్ధమన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో ఈటల రాజేందర్. చిత్రంలో తరుణ్ ఛుగ్, బండి సంజయ్ ఆయన ఎవరి మాటా విన్నది లేదు.. ఏడేళ్లలో మంత్రిగా ఉన్నందున ఆ పదవి ఔన్నత్యం కాపాడటం కోసం ప్రయత్నించానని ఈటల తెలిపారు. ఈ ఏడేళ్లలో అనేకసార్లు సీఎంని అడిగానని, ప్రశ్నించానని, కానీ ఆయన ఎవరిమాటా విన్నది లేదని విమర్శించారు. కేసీఆర్ నేతృత్వంలో మంత్రులు ఎవరైనా ప్రశాంతంగా ఉన్నారా? మనసుకు నచ్చినట్లు పని చేయగలుగుతున్నారా అనేది గుండెలపై చేయి వేసుకొని చెప్పాలని ఈటల ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కవోని దీక్షతో పనిచేశామని, ఎన్నో అవమానాలను భరించామని, రాష్ట్ర సాధనలో తమ పాత్ర ఏమిటో ప్రజలందరికీ తెలుసునని ఈటల వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మేధావులతో కమిటీ వేసి గొప్ప రాష్ట్రం చేస్తామన్నారని, కానీ ఏనాడూ మేధావులకు కనీసం అపాయింట్మెంట్ కూడా దొరకలేదని విమర్శించారు. ఆ డబ్బుకు లెక్క చెప్పండి? నాగార్జునసాగర్ ఉపఎన్నికతోపాటు ఇటీవల జరిగిన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీగా డబ్బు ఖర్చు చేసిందని, అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే లెక్కలు చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. గత ఏడేళ్లలో ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారో, అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలన్నారు. కాగా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఈటల సోమవారం రాత్రి అరగంటపాటు భేటీ అయ్యారు. తెలంగాణలో నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో అవినీతి జరుగుతోందని, ఆ చిట్టా బయటపెడతామని బీజేపీ నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని ఈటల ఆయనతో పంచుకున్నట్లు తెలిసింది. -
అక్కడ మోదం.. ఇక్కడ ఖేదం
రాష్ట్ర విభజన అంశంలో సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు భయపడినంతా జరుగబోతోందా? విభజన వల్ల ముందుగా నష్టపోయేది ఉద్యోగులేనంటూ అవి ఆందోళన చెందినట్టే ప్రమాద పరిస్థితులు చుట్టుముడుతున్నాయా? ప్రస్తుత పరిణామాలు ఆ అనుమానాలను బలపరిచేలా ఉన్నాయి. విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఉద్యోగులు భిన్నమైన పరిస్థితిని చవిచూస్తున్నారు. తెలంగాణ ఉద్యోగులకు మోదం.. సీమాంధ్ర ఉద్యోగులకు ఖేదం అనే రీతిలో పరిస్థితులు మారాయని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతోంది. సాక్షి, మచిలీపట్నం : రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నెల రెండో తేదీన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ అక్కడి ఉద్యోగులపై ఎనలేని ప్రేమ చూపారు. ప్రమాణ స్వీకారం రోజునే తెలంగాణలో పనిచేసే ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. జీతభత్యాలు, పదోన్నతులు తదితర అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించడంతో తెలంగాణ ఉద్యోగుల్లో ఆనందం ఉప్పొంగింది. ఇటువంటి పరిస్థితిలో ఈ నెల ఎనిమిదిన అవశేష ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేస్తున్న చంద్రబాబు ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపుతారా అనే అనుమానాలు రేగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్లో ఉందని, దీంతో ఉద్యోగులకు కొత్త రాయితీల మాటెలా ఉన్నా జీతాల చెల్లింపులు సకాలంలో జరుగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధుల లభ్యతను బట్టే చెల్లింపు! జిల్లాలో సుమారు 35 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సుమారు 15 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరికీ ట్రెజరీ (ప్రభుత్వ ఖజానా) నుంచి జీతాలు చెల్లించాల్సి ఉంది. రాష్ట్ర విభజన ప్రక్రియ జూన్ రెండో తేదీతో పూర్తికావడంతో మే నెల జీతాలు సక్రమంగానే వచ్చాయి. ఇప్పుడు లోటు బడ్జెట్తో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ జీతాల చెల్లింపు కష్టమేనని ఉద్యోగులు కలవరపడుతున్నారు. జీతాల బిల్లులు ఈ నెల 20న ట్రెజరీకి చేరే అవకాశం ఉండటంతో ఆ రోజు ఉన్న నిధుల లభ్యతను బట్టి చెల్లింపుపై నిర్ణయం ఉంటుందని పలువురు అధికారులు చెబుతున్నారు. జూన్ జీతాలపై నీలినీడలు కమ్ముకోవడంతో ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగులకు తగిన హామీ ఇవ్వాల్సి ఉంది. బాబు ఏం చేస్తారో? ఈ నెల ఎనిమిదిన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబుపై ఉద్యోగులు గంపెడాశలు పెట్టుకున్నారు. తెలంగాణలో ఉద్యోగులకు కేసీఆర్ వరాలు ఇవ్వడంతో సీమాంధ్ర ఉద్యోగులకు చంద్రబాబు ఎటువంటి వరాలు ఇస్తారోనని ఉద్యోగ సంఘాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.