breaking news
K. RajGopal reddy
-
ఎంపీ, మాజీ ఎంపీల మధ్య మాటల యుద్ధం
సికింద్రాబాద్: నాయకులు మధ్య పోరుకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. ఆ పార్టీలోని ఎంపీ, మాజీ ఎంపీల మధ్య ఆదివారం తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. అందుకు సికింద్రాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్షా కార్యక్రమం వేదిక అయింది. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని 10 జిల్లాల నుంచి పార్టీ నాయకులు హాజరయ్యారు. కాగా కార్యక్రమంలో నాయకులకు సభ్యత్వ నమోదు పుస్తకాలు అందజేస్తున్నారు. ఆ క్రమంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డికి పుస్తకాలు అందజేస్తుండగా... కె.రాజగోపాల్ జోక్యం చేసుకుని... రెబల్గా తన కుమార్తెను పోటీ చేయించిన పాల్వాయికి ఆ పుస్తకాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. దాంతో పాల్వాయి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ విషయం నీకు ఎందుకు అంటూ పాల్వాయి... రాజగోపాల్రెడ్డిపై ఫైరయ్యారు. దీంతో ఇద్దరు మధ్య చాలా సేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. పలువురు నాయకులు జోక్యం చేసుకుని సర్థి చెప్పినా వారు వినలేదు. సమావేశం అనంతరం కూడా ఇదే అంశంపై వారిరువురు తీవ్ర స్థాయిలో వాదులాడుకున్నారు. ఇటీవల తెలంగాణకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి నల్గొండ జిల్లా మునుగొడు అసెంబ్లీ టిక్కెట్ ఆశించారు. అయితే ఎన్నికల పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని వామపక్ష పార్టీకి కేటాయించారు. దీంతో స్రవంతి ఆ స్థానం నుంచి రెబల్గా బరిలోకి దిగి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కె.రాజగోపాల్ భువనగిరి నుంచి మరోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచి... ఓటమి పాలైయ్యారు. ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి మునుగొడు అసెంబ్లీ స్థానం వస్తుంది. తన ఓటమికి గల కారణాల్లో పాల్వాయి కుమార్తె కూడా ఓ కారణమని రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారని సమాచారం. -
'అధిష్టానం వల్లే కిరణ్ సీఎం అయ్యారు'
స్పీకర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టిందని... ఆ పార్టీనే కాదనుకుంటే కిరణ్ కలలో కూడా సీఎం అవ్వలేరని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులను సంప్రదించకుండా కేంద్రమంత్రుల బృందానికి (జీవోఎం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో పలు అభ్యంతరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధాని మన్మోహన్ సింగ్, జీవోఎం సభ్యుల అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తాము సంపూర్ణ తెలంగాణను కోరుకుంటున్నట్లు రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.