jharkhand-elections
-
సీఎం గెలుపు.. మాజీ సీఎం ఓటమి
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మరోసారి విజయం సాధించారు. హేమంత్ తన సమీప బీజేపీ అభ్యర్థి హేమ్ లాల్ ముర్ముపై ఇరవై మూడు వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. భర్ హైత్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన హేమ్ లాల్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచి విజయం సాధించారు. అయితే హేమ్ లాల్ పోటీ చేసిన మరో నియోజకవర్గం దుమ్కాలో ఓటమి పాలైయ్యారు. ఇదిలా ఉండగా మాజీ సీఎం, జై భారత్ సమంత పార్టీ అభ్యర్థి మధు కోడా ఓటమి పాలైయ్యారు. మజ్హాగో నియోజక వర్గం నుంచి పోటీ చేసిన మధు కోడా జేఎంఎం అభ్యర్థి నియాల్ పుర్టిపై ఇరవై వేల ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయితే జగన్నాథ్ పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మధు కోడా భార్య గీతా కోడా ఆధిక్యంగా దిశగా సాగుతున్నారు. -
జార్ఖండ్లో 9 చోట్ల బీజేపీ విజయం
జార్ఖండ్ ఎన్నికల్లో ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిలో బీజేపీ 9 చోట్ల గెలిచి 33 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక జేఎంఎం 7 చోట్ల గెలిచి 10 చోట్ల ఆధిక్యంలో నిలిచింది. కాంగ్రెస్ ఇప్పటివరకు ఒక్క స్థానంలోనూ విజయం రుచిచూడలేదు గానీ, 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. జేవీఎం పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. ఆ పార్టీ కేవలం 6 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇతరులు ఒక స్థానంలో గెలిచి 7 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా కనీసం 41 స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. దాంతో బీజేపీ సొంతంగా అధికారం చేపట్టే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
జార్ఖండ్: ప్రధాన అభ్యర్థులలో ఎవరెక్కడ?
జార్ఖండ్ ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులుగా భావించినవాళ్లలో ఎవరెవరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే... * రాష్ట్ర రాజధాని నగరం రాంచీలో బీజేపీ అభ్యర్థి చంద్రవేశ్వర్ ప్రసాద్ విజయం సాధించారు. * మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి అర్జున్ ముండా ఖరసవాన్ స్థానంలో వెనుకంజలో ఉన్నారు. * మాజీ ముఖ్యమంత్రి మధు కోడా మఝఘానన్ స్థానంలో ఓడిపోయారు. * ప్రస్తుత ముఖ్యమంత్రి, జేఎంఎం అభ్యర్థి హేమంత్ సోరెన్ డుమ్కా స్థానంలో వెనుకంజలో ఉన్నారు. * ఏజేఎస్యూ అబ్యర్థి సుధేష్ కుమార్ మహతో సిల్లి స్థానం నుంచి ఓడిపోయారు. * ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న బీజేపీ అభ్యర్థి రఘువర్ దాస్ జంషెడ్పూర్ తూర్పు స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. * కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్ర ప్రసాద్ సింగ్.. బెర్మో స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. * బాగోదర్ నియోజకవర్గంలో సీపీఐ ఎంఎల్ అభ్యర్థి వినోద్ కుమార్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. * మాజీ ముఖ్యమంత్రి, జేవీఎం అభ్యర్థి బాబూలాల్ మరాండీ ధన్వార్ స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. * జేఎంఎం అభ్యర్థి శశాంక్ శేఖర్.. సరత్ స్థానంలో వెనుకంజలో ఉన్నారు. -
మధుకోడా ఓడిపోయారు!!
జార్ఖండ్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి మధుకోడాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మఝ్గనాన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి బర్కువార్ గగ్రాయ్ చేతిలో ఆయన ఓడిపోయారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మధుకోడా మీద తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయి.. చావుదెబ్బ తిన్నట్లయింది. -
సీఎం పీఠం దక్కేదెవరికి?
జార్ఖండ్లో బీజేపీ అధికారం దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. దాంతో అక్కడ ముఖ్యమంత్రి స్థానం ఎవరికి దక్కుతుందోనన్న అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పటికే 38 స్థానాల్లో ఆ పార్టీ ఆధిక్యం కనబరుస్తోంది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలున్న జార్ఖండ్లో అధికారం చేపట్టాలంటే కనీసం 41 స్థానాలు సాధించాలి. అది సాధారణ మెజారిటీ అవుతుంది. అయితే, జేవీఎం లాంటి పార్టీలు ఇప్పటికే పరోక్షంగా బీజేపీకి అండగా ఉన్నాయి. ఆ పార్టీ 8 చోట్ల ఆధిక్యంలో ఉంది. దాంతో అక్కడ కమలనాథులు అధికారం చేపట్టడం దాదాపు ఖాయమైనట్లేనంటున్నారు. దాంతో అక్కడ ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనని అంచనాలు మొదలయ్యాయి. బీహార్లోని ఉత్తర ప్రాంతాల నుంచి 2000 సంవత్సరంలో జార్ఖండ్ ఏర్పడింది. దానికి మొదటి నుంచి గిరిజన ముఖ్యమంత్రులే అధికారంలో ఉన్నారు. తొలి సీఎం బాబూలాల్ మరాండీ, ఆ తర్వాత వరుసగా అర్జున్ ముండా, శిబు సోరెన్, మధుకోడా, ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్... ఇలా అందరూ గిరిజనులే. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ.. ఈసారి గిరిజనేతరుడిని ముఖ్యమంత్రిగా చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్రమంత్రిగా పనిచేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్, మరో నాయకుడు రఘువర్ దాస్, రాజస్థానీ నేత ఆర్కే మారు, మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా.. ఈ నలుగురిలో ఎవరో ఒకరిని సీఎం చేయొచ్చని అంటున్నారు. వీళ్లలో అర్జున్ ముండా మాత్రం గిరిజనుడు. ధర్మేంద్ర ప్రధాన్ కేంద్రంలో మోదీకి అత్యంత విశ్వాసపాత్రులైన మంత్రుల్లో ఒకరు. ఈ నలుగురిలో ఒకరికి సీఎం పదవి కట్టబెట్టొచ్చని తెలుస్తోంది.