breaking news
jayalalithaa will
-
జయలలిత వీలునామా కోసమే హత్యలు?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత.. వరుసపెట్టి గృహదహనాలు, హత్యలు, దోపిడీలు జరుగుతున్నాయి. తాజాగా కొడనాడులోని ఆమె ఎస్టేట్లో ఓం బహదూర్ అనే వాచ్మన్ను చంపి, అక్కడ కీలకమైన కొన్ని పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఇద్దరు ఒకేసమయంలో ఒకరు తమిళనాడులోని సేలంలోను, మరొకరు కేరళలోను ప్రమాదాలకు గురయ్యారు. సేలంలో జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, కేరళలో వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పుకొన్నాడు గానీ, అతడి భార్య, కూతురు చనిపోయారు. ఇదంతా ఎందుకు జరుగుతోందని పోలీసులు ఆరా తీస్తే.. జయలలిత రాసిన వీలునామా కోసమేనని తేలింది. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు భారీగా ఆస్తులు ఉన్న విషయం తెలిసిందే. అయితే అవి ఎవరికి చెందుతాయనే విషయం ఆమె జీవించి ఉన్నంత కాలం ఎవరికీ తెలియలేదు. బహుశా ఆమె వీలునామా రాసి ఉంటారని, అది కొడనాడు ఎస్టేట్లోనే ఉండొచ్చన్న అనుమానంతోనే దానిమీద దాడిచేసి వాచ్మన్ను హతమార్చారని అనుకుంటున్నారు. గత నెల 23వ తేదీ అర్ధరాత్రి సమయంలో కొడనాడు ఎస్టేట్ వద్దకు మూడు వాహనాల్లో 11 మంది దుండగులు వచ్చారు. అక్కడున్న ఇద్దరు వాచ్మన్ల మీద దాడి చేశారు. వారిలో ఓం బహదూర్ థాపా అక్కడికక్కడే మరణించగా కృష్ణ బహదూర్ థాపా మాత్రం గాయాలతో బయటపడ్డాడు. జయలలిత, శశికళ ఉపయోగిస్తారని భావించిన మూడు గదుల్లో కిటికీ అద్దాలు పగలగొట్టి, లోపలకు వెళ్లి అక్కడున్న 'విలువైన' వస్తువులను తీసుకెళ్లారు. పోలీసుల లెక్కల ప్రకారం కేవలం ఐదు వాచీలు, ఒక క్రిస్టల్ షోపీస్ మాత్రమే పోయాయని అంటున్నారు. కానీ వాస్తవానికి అంతకంటే ఎన్నో రెట్ల విలువైన వీలునామా, ఇతర పత్రాలు పోయాయాని భావిస్తున్నారు. ఈ కేసులో రెండో ప్రధాన నిందితుడైన సాయన్.. కేరళలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి భార్య, కుమార్తె మరణించారు. దాంతో ఇప్పుడు అతడిని ప్రశ్నించే పరిస్థితి లేదని పోలీసులు చెబుతున్నారు. జయలలిత గదిలో ఉన్న ఒక సూట్కేసులోనే వీలునామా ఉండొచ్చని ఆమె వద్ద చాలాకాలంగా పనిచేసిన వాళ్లు చెబుతున్నారు. అయితే ఆ సూట్ కేసు విషయం కేవలం జయలలిత, శశికళ, మరికొందరికి మాత్రమే తెలుసని.. అలాంటప్పుడు ఈ దాడులు ఎవరి ప్రోద్బలంతో జరుగుతున్నాయని కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ కేసులో పలువురు పెద్దమనుషుల పేర్లు కూడా వినిపిస్తుండటం, వేరే రాష్ట్రాలకు కూడా సంబంధం ఉండటంతో ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేవు. -
జయ వీలునామా రాశారా? ఆస్తి ఏం కానుంది?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగతంగా వీలునామా రాశారంటూ అనేక ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయమై ఓ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా స్పష్టత వచ్చింది. జయలలిత ఎలాంటి వీలునామా రాసినట్టు అధికారికంగా నమోదు కాలేదని తాజాగా ఆర్టీఐ దరఖాస్తుకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఇటీవల జయలలిత వీలునామా గురించి సమాచారం తెలుపాలంటూ సమాచార కార్యకర్త ఎస్ భాస్కరన్ తమిళనాడు వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ (సీటీడీఆర్)కు ఆర్టీఐ దరఖాస్తు చేశారు. అధికారికంగా వీలునామాల నమోదును సీటీడీఆర్ చేపడుతుంది. ఈ నేపథ్యంలో సీటీడీఆర్ స్పందిస్తూ జయలలిత వీలునామా గురించి ఎలాంటి పత్రాలుగానీ, సమాచారంగానీ తమ వద్ద లేదని తెలియజేసింది. గత ఏడాది డిసెంబర్ 5న జయలలిత మరణించినప్పటి నుంచి ఆమె చట్టబద్ధ వారసుడు ఎవరు? పోయెస్ గార్డెన్లోని వేదనిలయం సహా ఆమె ఆస్తులు ఎవరి పరం అవుతాయనే చర్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జయలలిత పేరిట సుమారు. రూ. 113.72 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తన వారసుడి గురించి, తన ఆస్తులు ఎవరికి చెందాలనే దాని గురించి జయలలిత వీలునామా రాసినట్టు గతంలో కథనాలు వచ్చాయి. అయితే, జయలలిత వీలునామా రాసినట్టు తమకు తెలియదని ఆమె వ్యక్తిగత లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించిన అన్నాడీఎంకే న్యాయవాదులు గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం కూడా ఇలాంటి సమాచారమే ఇవ్వడంతో ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయనే మిస్టరీ కొనసాగుతూనే ఉంది.